సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రమాదకర ప్రాంతాల్లో కొత్త కమ్యూనిటీ రేడియో కేంద్రాల ఏర్పాటు కోసం ప్రధాన కార్యదర్శులు, విపత్తు నిర్వహణ శాఖలకు సూచన
వరదలు, భూకంపాలు, పిడుగుల వల్ల దెబ్బతిన్న కేంద్రాలకు అందుబాటులో రూ.11.50 లక్షల అత్యవసర సహాయ నిధి
प्रविष्टि तिथि:
07 AUG 2026 3:31PM by PIB Hyderabad
దేశంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ల (సీఆర్ఎస్) ఏర్పాటుకు సంబంధించిన పాలసీ మార్గదర్శకాల ప్రకారం, ఆయా స్టేషన్ల పరిధిలో నివసించే స్థానిక ప్రజల అవసరాలకు సేవ చేయడమే కమ్యూనిటీ రేడియో ప్రసారాల ప్రాథమిక లక్ష్యం.
ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, ప్రజా ప్రయోజనాలు లేదా వాటికి సమానమైన క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, అవసరమైన ఏవైనా ప్రత్యేక సందేశాలను ప్రసారం చేయాల్సిందిగా కమ్యూనిటీ రేడియో స్టేషన్లను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇటువంటి ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత సదరు రేడియో అనుమతి కలిగి ఉన్న సంస్థలపై ఉంటుంది.
ఈ విధాన మార్గదర్శకాలు కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు మరో కీలకమైన సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. స్థానిక పరిపాలనా యంత్రాంగం అందించే పౌర సౌకర్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య హెచ్చరికలు, ఇతర ముఖ్యమైన సమాచారానికి సంబంధించిన ప్రజా ప్రకటనలను ప్రసారం చేయడానికి వీటికి అనుమతి ఉంది.
కృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర సమయాల్లో స్థానిక భాషల్లోనే, సకాలంలో, నమ్మకమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు (సీఆర్ఎస్లు) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.
స్థానిక ప్రజల సమాచార అవసరాలను తీర్చడంలో, ముఖ్యంగా వరదలు వచ్చే ప్రాంతాలు, తీరప్రాంతాలు. ఇతర విపత్తు ముప్పు ఉన్న ప్రాంతాలలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని నిరూపితమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు, అలాగే రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల పరిపాలనా కార్యదర్శులకు కీలక లేఖలు రాసింది. విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లడానికి ఈ సమర్థవంతమైన మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలని అందులో కోరింది. విపత్తు ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ కొత్త కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
దేశంలో కమ్యూనిటీ రేడియో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మద్దతు అందిస్తోంది. ఇందులో భాగంగా భారత్లో కమ్యూనిటీ రేడియో ఉద్యమానికి మద్దతు అనే కేంద్ర రంగ పథకాన్ని 2026-27 నుంచి 2030-31 కాలానికి గానూ కొనసాగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ. 50 కోట్లను కేటాయించారు. కొత్తగా ఏర్పాటయ్యే, ప్రస్తుతం నడుస్తున్న కమ్యూనిటీ రేడియో స్టేషన్లను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం. రేడియో స్టేషన్ల స్థాపనకు, నిర్వహణకు అవసరమైన పరికరాల కొనుగోలు లేదా పాత పరికరాల మార్పిడి కోసం ఈ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. విపత్తులు లేదా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా రేడియో ప్రసారాలు నిరంతరాయంగా సాగేలా చూడటం కోసం యూపీఎస్, జనరేటర్ సెట్లు, సౌర విద్యుత్ వ్యవస్థలు వంటి బ్యాకప్ విద్యుత పరికరాల కొనుగోలుకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తారు.
వరదలు, పిడుగుపాట్లు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రస్తుతం నడుస్తున్న కమ్యూనిటీ రేడియో స్టేషన్లు దెబ్బతింటే, వాటిని తక్షణమే పునరుద్ధరించడానికి రూ. 11.50 లక్షల అత్యవసర సహాయనిధిని కూడా ఈ పథకం అందిస్తుంది. దీనివల్ల విపత్తుల సమయంలో రేడియో స్టేషన్లు త్వరగా కోలుకుని, తిరిగి ప్రజలకు సేవలు అందించే అవకాశం కలుగుతుంది.
ఈ వివరాలను రాజ్యసభలో నేడు శ్రీ కనద్ పుర్కాయస్థ, శ్రీ మనన్ కుమార్ మిశ్రా, శ్రీమతి సీమా ద్వివేది, శ్రీ శంభు శరణ్ పటేల్, శ్రీమతి సాధనా సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2296153)
आगंतुक पटल : 5