సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
క్షేత్రస్థాయి డిజిటల్ సృష్టికర్తలను ప్రోత్సహించేందుకు ‘జెమ్స్ ఆఫ్ ఇండియా’ ఛాలెంజ్ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
షూట్, అప్లోడ్, షైన్: ఆగస్టు 1 నుంచి మైవేవ్స్ వేదికపై ప్రారంభం కానున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఎంట్రీలు
సృష్టికర్తల సమీకరణ నుంచి జ్యూరీ మూల్యాంకనం వరకు క్షేత్రస్థాయి సవాలు బాధ్యతలు స్వీకరించనున్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు
జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్లో భాగస్వాములుగా యూట్యూబ్, మెటా: తమ సృష్టికర్తల వ్యవస్థలకు పూర్తి మద్దతు
प्रविष्टि तिथि:
21 JUL 2026 1:52PM by PIB Hyderabad
దేశంలో సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడం, అభివృద్ది చెందుతున్న ఆరెంజ్ ఎకానమీని (సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ) ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక, గ్రామీణ డిజిటల్ సృష్టికర్తలను గుర్తించి, వారిని ప్రోత్సహించడానికి ఒక వ్యవస్థీకృత జాతీయ కార్యక్రమమైన ‘జెమ్స్ ఆఫ్ ఇండియా’ ఛాలెంజ్ ప్రయోగాత్మక దశను నేడు ప్రారంభించింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో సాధికార, సమ్మిళిత, దేశ నిర్మాణానికి సాంకేతికతను భారత్ శక్తిమంతమైన సాధనంగా స్వీకరించింది. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆవిష్కరణలకు అపూర్వమైన స్థాయిలో అవకాశాలను కల్పించాయి.
పౌరులు తమ సొంత కంటెంట్ను రూపొందించి, అప్లోడ్ చేయడానికి, పంచుకోవడానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ వేవ్స్ ఓటీటీ కింద మైవేవ్స్ అనే వేదికను ప్రారంభించారు. భారత డిజిటల్ సృష్టికర్తల వ్యవస్థను బలోపేతం చేస్తూ, వినియోగదారు సృష్టించిన కంటెంట్ను ప్రోత్సహించడానికి, దేశ సంస్కృతి, వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఈ వేదిక రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఈ మైవేవ్స్ వేదిక జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్కు ప్రాతిపదికగా మారింది. తమ జిల్లాల ప్రత్యేక కథనాలను వాస్తవిక డిజిటల్ కథనాల ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి డిజిటల్ సృష్టికర్తలను ఈ ఛాలెంజ్ ఆహ్వానిస్తోంది.
దేశంలోని ప్రతి జిల్లాలోనూ ప్రపంచానికి చెప్పాల్సిన ఒక ప్రత్యేక కథ ఉంటుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ పేర్కొన్నారు. ‘‘జెమ్స్ ఆఫ్ ఇండియా మన సృష్టికర్తలకు తమ ప్రాంత కథనాలను వివరించేందుకు సరైన వేదికను అందిస్తుంది. ఇది మన యువత సృజనాత్మకతను వేడుకగా చేసుకోవడంతో పాటు జిల్లాల అసాధారణ వైవిధ్యాన్ని సంబరంగా జరుపుకోవడమే అవుతుంది’’ అని ఆయన తెలిపారు.
దేశంలోని ప్రతి జిల్లా విశిష్ట గుర్తింపును చాటిచెప్పేలా ఈ ఛాలెంజ్ రూపుదిద్దుకుంది. జిల్లాల సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, చరిత్ర, ప్రత్యేక విజయాలను వాస్తవిక డిజిటల్ కథనాల ద్వారా ప్రదర్శించేలా సృష్టికర్తలను ప్రోత్సహిస్తూ.. దేశవ్యాప్తంగా సృష్టికర్తల వ్యవస్థను నిర్మించడం ఈ పోటీ ప్రధాన లక్ష్యం.
పోటీలో ఎలా పాల్గొనాలి: 1 నుంచి 3 నిమిషాల నిడివి గల వీడియోలను వేవ్స్ ఓటీటీ వేదికలోని మైవేవ్స్ విభాగం ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తుల సమర్పణ 2026 ఆగస్టు 1న ప్రారంభమై 2026 ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్రయోగాత్మక దశ పరిధి భాగస్వామ్యాలు: పైలట్ దశను అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఛండీగఢ్, దాద్రా నాగర్ హవేలీ డమాన్ దియూ, గోవా, లడఖ్ ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు. ఈ దశ ప్రసార భారతి, మై భారత్, సంబంధిత రాష్ట్ర, జిల్లా యంత్రాంగాల ఉమ్మడి భాగస్వామ్యంతో కొనసాగుతోంది. సృష్టికర్తలను సమీకరించడానికి, కంటెంట్ అభివృద్ధిని సులభతరం చేయడానికి స్థానిక సాంస్కృతిక, విద్యా సంస్థలు కూడా ఇందులో చురుగ్గా భాగస్వామ్యం కానున్నాయి.
ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దిగ్గజ సంస్థలైన యూట్యూబ్, మెటాలతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు వేదికలు తమ క్రియేటర్ కమ్యూనిటీలను సమీకరించడంతో పాటు తమ వ్యవస్థల ద్వారా ఈ ఛాలెంజ్ విస్తృతిని పెంచడానికి సహకరిస్తాయి.
అవార్డులు, గుర్తింపు: అత్యుత్తమ ప్రతిభను గౌరవించేందుకు ఈ కార్యక్రమం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ప్రతిష్ఠాత్మక అవార్డులను అందజేస్తుంది.
జిల్లా స్థాయి: ప్రతి జిల్లాకు రూ. 50,000 చొప్పున గరిష్టంగా 20 అవార్డులు ఇస్తారు.
రాష్ట్ర స్థాయి: ప్రతి జిల్లా నుంచి ఒక అత్యుత్తమ సృష్టికర్తను ఎంపిక చేసి రూ. 2 లక్షల రాష్ట్ర స్థాయి అవార్డును అందజేస్తారు.
జాతీయ స్థాయి: తదుపరి జాతీయ స్థాయిలో, ఎంపిక చేసిన రాష్ట్ర ఎంట్రీలకు రూ. 5 లక్షల చొప్పున జాతీయ అవార్డులను ప్రదానం చేస్తారు.
పారదర్శకమైన మూల్యాంకనాన్ని నిర్ధారించడానికి సంబంధిత యంత్రాంగాలు జిల్లా, రాష్ట్ర స్థాయి జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేస్తాయి. సాంస్కృతిక, వారసత్వ, పర్యాటక, మీడియా, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులతో ఈ కమిటీలను రూపొందిస్తారు.
భవిష్యత్తులో దేశవ్యాప్త విస్తరణ: ఈ పైలట్ దశ ద్వారా లభించే అనుభవాలు, సేకరించిన సమాచారం ఆధారంగా జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనున్నారు. దేశంలోని ప్రతి జిల్లా విశిష్ట గుర్తింపును, సంస్కృతి,వారసత్వాన్ని చాటిచెప్పే డిజిటల్ సృష్టికర్తల వ్యవస్థను దేశవ్యాప్తంగా నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన అంతిమ లక్ష్యం.
***
(रिलीज़ आईडी: 2287146)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam