ప్రధాన మంత్రి కార్యాలయం
మణిపూర్లోని ఇంఫాల్లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2025 6:26PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
గౌరవ మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ భల్లా గారూ, రాష్ట్ర పరిపాలన యంత్రాంగంలోని ఇతర అధికారులూ, మణిపూర్ సోదరీ సోదరులారా... అందరికీ నమస్కారం.
మణిపూర్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈ రోజు జరిగాయి. ఈ ప్రాజెక్టులు మీ జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక్కడి మౌలిక సదుపాయాలను అవి బలోపేతం చేస్తాయి. ఈ నేల బిడ్డలైన మణిపూర్ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
మిత్రులారా,
ఈ రోజు ప్రారంభించిన పనుల్లో రెండు ప్రాజెక్టులు చాలా ప్రత్యేకం. అవి రూ. 3,600 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ‘మణిపూర్ పట్టణ రహదారుల ప్రాజెక్టు’, రూ. 500 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన మణిపూర్ ఇన్ఫోటెక్ అభివృద్ధి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులు ఇంఫాల్లో రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, మణిపూర్ ఉజ్వల భవితకు కొత్త శక్తినిస్తాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా మణిపూర్ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.
మిత్రులారా,
స్వాతంత్ర్యానంతరం దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని ముఖ్య నగరాలు అభివృద్ధి చెందాయి. అక్కడ ప్రజల కలలు నెరవేరి యువతకు కొత్త అవకాశాలు అందాయి. ఇప్పుడు తూర్పు, ఈశాన్య ప్రాంతాలదే ఈ 21వ శతాబ్దం. అందుకే భారత ప్రభుత్వం మణిపూర్ అభివృద్ధికి నిరంతరం ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఫలితంగా మణిపూర్ వృద్ధి రేటు స్థిరంగా పెరుగుతోంది. 2014కు ముందు మణిపూర్ వృద్ధి రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండేది. కనీసం ఒక శాతం కూడా ఉండేది కాదు. కానీ నేడు మణిపూర్ మునుపటి కన్నా ఎన్నో రెట్లు వేగంగా పురోగమిస్తోంది. మణిపూర్లో మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఓ కొత్త శకం మొదలైంది. మణిపూర్లో జాతీయ రహదారులు సహా రోడ్ల నిర్మాణం అనేక రెట్లు వేగం పుంజుకోవడం సంతోషాన్నిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలను రోడ్లతో అనుసంధానించే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఎన్నో అవకాశాలు నిండిన నగరం ఇంఫాల్. మన యువత కలలను నెరవేర్చి, దేశాభివృద్ధిని వేగవంతం చేసే వికసిత భారత నగరాల్లో ఇంఫాల్ ఒకటిగా నేను భావిస్తున్నాను. ఇదే దృక్కోణంతో స్మార్ట్ సిటీ మిషన్ కింద అనేక ప్రాజెక్టులను ఇక్కడ పూర్తిచేశాం. వందల కోట్ల రూపాయల విలువైన అనేక ఇతర ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఇంఫాల్లో అయినా, మణిపూర్లోని ఇతర ప్రాంతాల్లో అయినా.. అంకుర సంస్థలకూ, సాంకేతికత ఆధారిత పరిశ్రమలకూ కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలి ఈ అవకాశాలను బలోపేతం చేస్తుంది. ఇందులో మొదటి భవనం ఇప్పటికే పూర్తయింది. మణిపూర్లో కొత్త సచివాలయ భవనం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ భవనం కూడా సిద్ధమైంది. ‘‘పౌరుడు దేవుడితో సమానం’’ అన్న నాగరిక దేవో భవ స్ఫూర్తిని ఇది మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
మణిపూర్ నుంచి మన ప్రజలు చాలామంది కలకత్తా, ఢిల్లీ నగరాలకు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అక్కడ వారికి అందుబాటు వ్యయంతో వసతి సదుపాయాన్ని కల్పించడం కోసం రెండు నగరాల్లో మణిపూర్ భవనాలను నిర్మించాం. ఈ భవనాలు ముఖ్యంగా మణిపూర్ ఆడబిడ్డలకు ఎంతగానో సహాయపడతాయి. అక్కడ పిల్లలు సురక్షితంగా ఉంటే, ఇక్కడ తల్లిదండ్రుల ఆందోళన కూడా తగ్గుతుంది.
మిత్రులారా,
మా ప్రభుత్వం పూర్తి సున్నితత్వంతో వ్యవహరిస్తూ మీ జీవితాల్లో కష్టాలను తగ్గించడానికి కృషి చేస్తోంది. మణిపూర్లోని అనేక ప్రాంతాలు వరదల వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని నాకు తెలుసు. ఈ సవాలును పరిష్కరించడం కోసం కూడా అనేక ప్రాజెక్టులపై ప్రభుత్వం పనిచేస్తోంది.
మిత్రులారా,
ఆర్థిక వ్యవస్థలో మన తల్లులు, అక్కాచెల్లెళ్లూ ముందుండి నడిపించే రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. ఇమా కీథెల్ సంప్రదాయం దీనికి గొప్ప నిదర్శనం. మహిళా శక్తిని భారత్ అభివృద్ధికీ, ఆత్మనిర్భర్ భారత్కూ కీలక చోదక శక్తిగా నేను భావిస్తాను. మనమిక్కడే మణిపూర్లో ఈ స్ఫూర్తిని చూస్తున్నాం. ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మహిళల కోసం ప్రత్యేక మార్కెట్లైన ఇమా మార్కెట్ల నిర్మాణాన్ని ప్రారంభించాం. ఈ రోజు నాలుగు ఇమా మార్కెట్లను కూడా ప్రారంభించడం సంతోషాన్నిచ్చే విషయం. ఈ మార్కెట్లు మణిపూర్ అక్కాచెల్లెళ్లకు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి.
మిత్రులారా,
ప్రతి పౌరుడికీ జీవన సౌలభ్యాన్ని అందించడం మా లక్ష్యం. మణిపూర్కు వస్తువులను తీసుకురావడంలో అత్యంత కష్టతరమైన రోజులను మనం చూశాం. నిత్యావసర వస్తువులు సామాన్య కుటుంబాలకు అందనంత దూరంలో ఉండేవి. కొన్నేళ్లుగా మా ప్రభుత్వం మణిపూర్ను ఆ కష్టాల నుంచి విముక్తి చేసింది. మీకు మరో శుభవార్త.. మీ పొదుపును పెంచి, మీ జీవనాన్ని మరింత సులభతరం చేయాలని మా ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. అందుకే ఇప్పుడు జీఎస్టీని గణనీయంగా తగ్గించాం. దీనివల్ల మణిపూర్ ప్రజలకు రెట్టింపు ప్రయోజనం చేకూరుతుంది. సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్, దుస్తులు, పాదరక్షల వంటి నిత్యావసర వస్తువులన్నీ చవకగా మారుతాయి. సిమెంటు, ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. హోటళ్లు, ఆహారంపై జీఎస్టీని కూడా ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. దీంతో అతిథిగృహాల యజమానులు, టాక్సీ డ్రైవర్లు, దాబాల యజమానులకు లబ్ధి చేకూరడమే కాకుండా.. ఇక్కడ పర్యాటక రంగ వికాసానికీ అది తోడ్పడుతుంది.
మిత్రులారా,
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప వారసత్వం మణిపూర్కు ఉంది. ఎంతో లోతుగా పాతుకుపోయిన బలమైన సాంస్కృతిక మూలాలు మణిపూర్ సొంతం. భరతమాత కిరీటంలో కలికితురాయి మణిపూర్. అందుకే నిరంతర అభివృద్ధితో మణిపూర్ ప్రతిష్ఠను మనం మరింత ఇనుమడింపజేయాలి. మణిపూర్లో హింస ఏ రూపంలో జరిగినా అది అత్యంత దురదృష్టకరం. అది మన పూర్వీకుల ప్రతిష్ఠకు కళంకం మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు చేసే అన్యాయం కూడా. అందుకే మనమంతా కలిసి మణిపూర్ను శాంతి, అభివృద్ధి పథంలో ముందుకు నడపాలి. భారత స్వాతంత్య్ర పోరాటంలో, దేశ రక్షణలో మణిపూర్ సేవల నుంచి మనం స్ఫూర్తిని పొందాలి. ఈ మణిపూర్ గడ్డపైనే భారత జాతీయ సైన్యం తొలిసారిగా భారత పతాకాన్ని ఎగురవేసింది. భారత స్వాతంత్య్రానికి ద్వారంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మణిపూర్ను అభివర్ణించారు. అసంఖ్యాక వీరుల త్యాగాలకు ఈ నేల సాక్షిగా నిలిచింది. అలాంటి మణిపూర్ యోధులందరి స్ఫూర్తితో మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అండమాన్, నికోబార్ దీవులని హారియట్ శిఖరాన్ని మణిపూర్ శిఖరంగా పేరు మార్చింది. మణిపూర్ స్వాతంత్య్ర సమరయోధులకు 140 కోట్ల భారతీయుల తరఫున అర్పించిన నివాళి ఇది.
మిత్రులారా,
నేటికీ మణిపూర్ ముద్దుబిడ్డలెందరో దేశంలోని వివిధ చోట్ల భారతావనిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సేనల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసింది. మన సైనికుల ధైర్యసాహసాలకు పాకిస్థాన్ సైన్యం కకావికలమైపోయింది. భారత్ సాధించిన ఈ విజయంలో మణిపూర్ వీరపుత్రులు, వీరవనితల సాహసమూ ఉంది. అద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించి అమరుడైన వీరుడు దీపక్ చింగాఖమ్కు నేడు నివాళి అర్పిస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ వేళ ఆయన చేసిన అత్యున్నత త్యాగాన్ని దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది.
మిత్రులారా,
2014లో నేనిక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను. అది నాకిప్పటికీ గుర్తుంది. మణిపురి సంస్కృతి లేకుండా భారతీయ సంస్కృతి అసంపూర్ణమనీ, మణిపూర్ క్రీడాకారులు లేకుండా భారతీయ క్రీడారంగమూ అసంపూర్ణమే అనీ నేనన్నాను. మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడేందుకు సర్వస్వాన్నీ అంకితం చేసే యువత మణిపూర్ సొంతం. హింస అనే చీకట్లలో ఈ అస్తిత్వాన్ని అణచివేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తావివ్వొద్దు.
మిత్రులారా,
క్రీడారంగంలో ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతున్న నేటి తరుణంలో.. మణిపూర్ యువతపై బాధ్యత మరింత పెరిగింది. అందుకే దేశంలో మొదటి ‘జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం’ కోసం భారత ప్రభుత్వం మణిపూర్ను ఎంచుకుంది. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకాల ద్వారా.. మణిపూర్కు చెందిన ఎందరో క్రీడాకారులను నేడు ప్రోత్సహిస్తున్నాం. మణిపూర్ యువత కోసం ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. పోలో క్రీడను ప్రోత్సహించడం కోసం ప్రపంచంలోనే ఎత్తయిన పోలో విగ్రహంతో ‘మార్జింగ్ పోలో కాంప్లెక్స్’ను ఇక్కడ నెలకొల్పాం. ఈ గడ్డపై జన్మించిన ఒలింపియన్ల గౌరవార్థం ‘ఒలింపియన్ పార్కు’ను కూడా ఏర్పాటు చేశాం. కొన్ని రోజుల కిందటే ప్రభుత్వం జాతీయ క్రీడా విధానాన్ని (ఖేలో భారత్ నీతి) ప్రకటించింది. మున్ముందు మణిపూర్ యువతకు దీంతో అపారమైన ప్రయోజనం చేకూరుతుంది.
మిత్రులారా,
మణిపూర్లో శాంతినీ స్థిరత్వాన్నీ నెలకొల్పేందుకు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చిన ప్రజల కోసం సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. నిర్వాసితులైన వారి కోసం 7,000 కొత్త గృహాలను మంజూరు చేసింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ కోసం దాదాపు రూ. 3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించింది. నిరాశ్రయులైన వారికి సాయమందించేందుకు ఇందులో రూ. 500కోట్లకు పైగా కేటాయించింది. హింసతో ప్రభావితమైనవారు వీలైనంత త్వరగా సాధారణ జీవితాన్ని ప్రారంభించేలా చూడడమే మాకు అత్యంత ప్రధానమైన అంశం. మణిపూర్ పోలీసుల కోసం కొత్తగా నిర్మించిన ప్రధాన కార్యాలయం కూడా ఈ విషయంలో మీకెంతగానో సహాయపడుతుంది.
మిత్రులారా,
నేపాల్లోని సోదరీ సోదరులతోనూ ఈ మణిపూర్ పుణ్యభూమి నుంచి నేను మాట్లాడదలిచాను. హిమాలయాల ఒడిలో ఒదిగి ఉన్న నేపాల్.. భారత్కు మిత్రదేశం, సత్సంబంధాలున్న దేశం. ఉమ్మడి చరిత్ర, విశ్వాసాలతో ముడిపడి ఉన్న మనం.. సమష్టిగా ముందుకు సాగుతున్నాం. నేడు 140 కోట్ల భారతీయుల తరఫున.. నేపాల్ మధ్యంతర ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీల గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆమె నేతృత్వంలో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం దిశగా నేపాల్ అడుగులు వేస్తుందన్న విశ్వాసం నాకుంది. నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టడం మహిళా సాధికారతకు అత్యుత్తమ ఉదాహరణ. అస్థిరత నెలకొన్నప్పటికీ.. ప్రజాస్వామ్య విలువలకే పెద్దపీట వేసిన నేపాల్లోని ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
నేపాల్లో ఇటీవలి పరిణామాల్లో ఎవరూ పెద్దగా దృష్టి సారించని మరో అద్భుతమైన అంశాన్ని గమనించాను. రెండు మూడు రోజులుగా నేపాల్ యువత అత్యంత పవిత్రత, అంకితభావంతో వీధులను శుభ్రం చేస్తూ, రంగులు వేస్తూ కష్టపడి పనిచేస్తోంది. నేను కూడా సామాజిక మాధ్యమాల్లో వారి చిత్రాలను చూశాను. వారి సానుకూల దృక్పథం, కార్యాచరణ కేవలం స్ఫూర్తినివ్వడమే కాదు.. నేపాల్లో సరికొత్త ఉషోదయానికి స్పష్టమైన సంకేతాలు. నేపాల్ ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఈ 21వ శతాబ్దంలో ఏకైక లక్ష్యంతో మన దేశం పురోగమిస్తోంది. అదే ‘వికసిత భారత్’. మణిపూర్ అభివృద్ధి కూడా ఈ లక్ష్య సాధనకు అత్యావశ్యకం. అపరిమితమైన సామర్థ్యం నిండి ఉన్న రాష్ట్రం మన మణిపూర్. అభివృద్ధి మార్గం నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు తప్పుకోవద్దు. ఇదే మన కర్తవ్యం. మణిపూర్లో సామర్థ్యానికి కొదువ లేదు. మనం చేయాల్సిందేమిటంటే.. చర్చలను బలోపేతం చేయడం. కొండ ప్రాంతాలూ, లోయ ప్రాంతాల మధ్య సామరస్యమనే బలమైన వారధిని నిర్మించాలి. దేశ పురోగతికి బలమైన కేంద్రంగా మణిపూర్ నిలుస్తుందన్న దృఢమైన నమ్మకం నాకుంది. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు.
ఇప్పుడు నాతో కలిసి నినదించండి:
భారత్ మాతా కీ జై.
భారత్ మాతా కీ జై.
భారత్ మాతా కీ జై.
ధన్యవాదాలు.
***
(రిలీజ్ ఐడి: 2254877)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam