ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: ఢిల్లీలో జరిగిన క్రిషి కార్యక్రమంలో రైతులతో ప్రధానమంత్రి సంభాషణ
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2025 6:45PM by PIB Hyderabad
ప్రధానమంత్రి: రామ్-రామ్!
రైతు: రామ్-రామ్! నేను హర్యానాలోని హిసార్ జిల్లా నుంచి వచ్చాను. నేను కాబూలీ శనగల సాగుతో వ్యవసాయాన్ని మొదలుపెట్టాను. మొదట్లో కొద్దిగానే...
ప్రధానమంత్రి: ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు?
రైతు: నాలుగేళ్లు అవుతోంది. కాబూలీ శనగల ద్వారా నాకు ఎకరాకు సుమారు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.
ప్రధానమంత్రి: పప్పు ధాన్యాల వంటి కొన్ని పంటలను అంతర పంటలుగా కూడా వేస్తుంటారు కదా?
రైతు: అవునండి.
ప్రధానమంత్రి: దీనికి కొంచెం ఎక్కువ శ్రమ అవసరమే కానీ మీకు అదనపు ఆదాయం వస్తుంది. ఇది చూసి ఇతర రైతులు కూడా తమ భూమి మళ్లీ సారవంతం అవుతుందని భావిస్తూ పప్పు ధాన్యాల సాగు వైపు మొగ్గు చూపుతున్నారా?
రైతు: అవునండి. మేమంతా అలాగే అనుకుంటున్నాం. నేను ఇతర రైతులకు కూడా చెబుతాను.. మనం శనగల వంటి పప్పు ధాన్యాలను సాగు చేస్తే మనకు ఈ పంటతో పాటు వచ్చే పంటకు కూడా మేలు జరుగుతుందని. శనగలు, ఇతర పప్పు ధాన్యాలు నేలలో నత్రజనిని నిల్వ చేస్తాయి. ఇది తర్వాతి పంట దిగుబడికి నేలను సారవంతం చేస్తుంది.
రైతు: నా జీవితంలో ప్రధానమంత్రిని కలవడం ఇదే మొదటిసారి. ఆయన చాలా మంచి వారు. రైతులు, సామాన్య ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు.
రైతు: నేను రైతు ఉత్పత్తిదారుల సంస్థతో (ఎఫ్పీఓ) కూడా అనుబంధం కలిగి ఉన్నాను. నేను వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ని. కానీ నేను పప్పు ధాన్యాలను కూడా సాగు చేస్తాను. మా కుటుంబానికి 16 బిఘాల భూమి ఉంది. అక్కడ నేను శనగలు పండిస్తాను. మా గ్రామంలో 20 మంది మహిళలతో కూడిన గ్రూపులను ఏర్పాటు చేశాం. మేమంతా కలిసి 'శనగ-వెల్లుల్లి పాపడ్' వంటి ఉత్పత్తులను తయారు చేస్తాం. మా... (ఆడియో స్పష్టంగా లేదు)... ఇందులో వెల్లుల్లి ఉంటుంది...
ప్రధానమంత్రి: ఓహో.. అంటే మీరు అక్కడే ఉత్పత్తిని కూడా చేస్తున్నారా?
రైతు: అవునండి.. అవునండి.. అవునండి.
ప్రధానమంత్రి: మీరు మీ ఉత్పత్తికి ఏదైనా బ్రాండ్ పేరు పెట్టారా?
రైతు: అవునండి. మా గ్రామం పేరు దుగారి. అందుకే మేం దానికి 'దుగారి వాలే' అని బ్రాండ్ పేరు పెట్టాం.
ప్రధానమంత్రి: ఓహో.. మంచిది.
రైతు: అవునండి. శనగ-వెల్లుల్లి అప్పడం.. దీనిని 'దుగారి వాలే శనగ-వెల్లుల్లి పాపడ్' అని బ్రాండ్ చేశాం.
ప్రధానమంత్రి: ప్రజలు వీటిని కొంటున్నారా?
రైతు: కొంటున్నారండి. మేం ప్రభుత్వ ఈ-మార్కెట్ప్లేస్ అయిన జీఈఎంలో కూడా నమోదు చేసుకున్నాం. అక్కడి నుంచి సైనికులు వీటిని కొనుగోలు చేస్తారు సర్.
ప్రధానమంత్రి: అంటే ఇది రాజస్థాన్ అంతటా తెలిసిందా?
రైతు: సర్, ఇది భారతదేశమంతా అమ్ముడవుతోంది.
ప్రధానమంత్రి: నిజమా?
రైతు: అవునండి.
ప్రధానమంత్రి: ఇలాంటి ఉత్పత్తులనే తయారు చేసే వారు ఇంకెవరైనా ఉన్నారా?
రైతు: ఉన్నారండి.. మరికొందరు కూడా ఉన్నారు. కానీ ప్రధానంగా మహిళలే వీటిని తయారు చేస్తారు.
ప్రధానమంత్రి: అయితే అందరూ రుచి చూసేందుకు మీరు కొన్ని తీసుకురావాలి!
రైతు: తప్పకుండా సర్.. ఖచ్చితంగా!
రైతు: ప్రధానమంత్రిని ఎలా కలుస్తామో అని మాకు ఒళ్లు గగుర్పొడిచింది. ఆయన వచ్చినప్పుడు ఆ తేజస్సును చూసి మేం మాటల్లేకుండా ఉండిపోయాం. అది వర్ణించలేని క్షణం.
రైతు: నేను 2013-14 నుంచి పప్పు ధాన్యాలను సాగు చేస్తున్నాను. నేను ఒక ఎకరంతో మొదలుపెట్టి శనగల సాగును క్రమంగా 13-14 ఎకరాలకు విస్తరించాను.
ప్రధానమంత్రి: అవును. అంటే మొదట్లో మీరు ఒక ఎకరంలో మాత్రమే శనగలు వేసి మిగిలిన చోట్ల ఇతర పంటలు వేసేవారా?
రైతు: అవును సర్.
ప్రధానమంత్రి: అలా నెమ్మదిగా మీరు సాగు విస్తీర్ణాన్ని పెంచారా?
రైతు: అవును. నేను సుమారు 13-14 ఎకరాలకు విస్తరించాను....
ప్రధానమంత్రి: దీని వల్ల మీ ఆదాయం ఎలా మారింది?
రైతు: నా ఆదాయం పెరిగింది. ఎందుకంటే నేను ఏటా నాణ్యమైన విత్తనాలను ఎంచుకున్నాను. తద్వారా ఉత్పాదకత పెరుగుతూ వచ్చింది.
ప్రధానమంత్రి: శాకాహారులకు పప్పు ధాన్యాలే ప్రధాన ప్రోటీన్ వనరు కదా?
రైతు: అవును సర్.
ప్రధానమంత్రి: కాబట్టి మీరు పప్పు ధాన్యాలు పండిస్తున్నప్పుడు అది కేవలం మీ లాభం కోసమే కాదు. మీరు సమాజానికి కూడా గొప్ప సహకారం అందిస్తున్నారు.
రైతు: నిజమేనండి.
ప్రధానమంత్రి: ఈ రోజుల్లో మన పొలాలు చిన్నవి. భూమి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. దాని వల్ల ఎవరైనా ఏదైనా ప్రయోగం చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఒకసారి ఊహించుకోండి.. ఒక 200 మంది రైతులు కలిసి వస్తే...
రైతు: అవునండి.
ప్రధానమంత్రి: … ఆ 200 మంది కలిసి 400 లేదా 500 బిఘాల భూమిలో సమష్టిగా ఒకటి లేదా రెండు ఎంపిక చేసిన పంటలను పండిస్తూ వాటిని బాగా మార్కెట్ చేయాలని నిర్ణయించుకుంటే అది రైతులకు మరింత లాభదాయకంగా ఉంటుందా?
రైతు: ఖచ్చితంగా సర్. మేం సుమారు 1,200 ఎకరాల్లో కాబూలీ శనగల కోసం రసాయన అవశేషాలు లేని సాగు చేస్తున్నాం. రైతులకు గతంలో కంటే మెరుగైన రాబడి వస్తోంది.
ప్రధానమంత్రి: అంటే ఇప్పుడు రైతులందరూ దీనికి అంగీకరించారు. దీనివల్ల మీ శ్రమ కూడా తగ్గి ఉంటుంది కదా?
రైతు: అవునండి.. ఎందుకంటే మేం అటువంటి వ్యవస్థను నిర్మించాం.
రైతు: నేను బీడ్ జిల్లా నుంచి వచ్చాను.
ప్రధానమంత్రి: ఎక్కడి నుంచి? బీడ్ జిల్లా నుంచా? అక్కడ సాధారణంగా నీటి ఎద్దడి ఉంటుంది కదా?
రైతు: అందుకే సర్ 'ధాన్-ధాన్య' పథకాన్ని ప్రారంభించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రధానమంత్రి: ధన్యవాదాలు. మనం అన్ని చోట్లా చిరుధాన్యాలను ఎలాగైతే ప్రోత్సహిస్తున్నామో… సజ్జలు, జొన్నలు, ఇతర మన సంప్రదాయ ధాన్యాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. నీటి కొరత ఉన్న భూముల్లో కూడా రైతులు మంచి ఆదాయాన్ని పొందొచ్చు.
రైతు: అవునండి.. చిరుధాన్యాల వల్ల అది సాధ్యమవుతోంది.
ప్రధానమంత్రి: మీరు కూడా చిరుధాన్యాలను సాగు చేస్తారా?
రైతు: అవునండి. సాగు చేస్తాను.
ప్రధానమంత్రి: మీరు ఏ రకాలను పండిస్తారు?
రైతు: సజ్జలు, జొన్నలు, వేయించిన శనగలు కూడా.
ప్రధానమంత్రి: అంటే ప్రజలు ఇంకా వీటిని తింటున్నారా?
రైతు: అవునండి.. అందరూ తింటున్నారు.
ప్రధానమంత్రి: అది మంచి విషయం.
రైతు: దానితో పాటు మేం వినియోగదారులకు సరుకు సరఫరా చేస్తున్నప్పుడు కొంతమంది ముంబయిలో ఉన్నారు.
రైతు: ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రిని కలిసినట్లు అనిపించలేదు.. మా కుటుంబంలో ఒకరిని కలిసినట్లు అనిపించింది.
రైతు: మా ప్రాంతంలో నేను కంది సాగు చేస్తాను. యువత దీనిపై ఆసక్తి చూపాలని నేను కోరుకుంటున్నాను. ఇది రైతులకు మేలు చేయడమే కాకుండా మంచి వ్యాపార అవకాశాన్ని కూడా అందిస్తుంది.
రైతు: నేను ఒక స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. నేను 2023లో ఆ సంఘంలో చేరి నా ఐదు బిఘాల భూమిలో పెసర సాగు చేయడం ప్రారంభించాను. సర్, మీ 'పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి' పథకం మాకు నిజంగా ఒక వరం. మాకు ఏటా అందుతున్న రూ. 6,000 ఎంతో సహాయపడుతున్నాయి.. విత్తనాలు కొనడానికి, భూమిని దున్నడానికి, ఇతర వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇది మాకు నిజంగా పెద్ద సహాయం.
ప్రధానమంత్రి: రసాయన ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా?
రైతు: అవునండి. మహిళలు...
ప్రధానమంత్రి: ఎందుకంటే మనం గుర్తుంచుకోవాలి. భూమి మనకు తల్లి వంటిది. మనం ఆమెకు ఇలాంటి రసాయనాలను తినిపిస్తూ ఉంటే ఆమె ఎంతకాలం జీవిస్తుంది?
రైతు: అది నిజం సర్.
ప్రధానమంత్రి: దీని గురించి రైతులు చర్చిస్తారా?
రైతు: అవునండి.. చర్చిస్తారు.
ప్రధానమంత్రి: తమ పిల్లల కోసం సారవంతమైన భూమిని వదిలి వెళ్లాలి కానీ బంజరు భూమిని కాదు అని గ్రహించిన తర్వాత వారు స్వయంచాలకంగా భూమికి హాని చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో రైతులు సహాయపడగలరు. ఉదాహరణకు ఒక వ్యక్తికి నాలుగు బిఘాల భూమి ఉందనుకోండి...
రైతు: అవునండి.
ప్రధానమంత్రి: ...అతనిని పూర్తిగా ప్రకృతి వ్యవసాయానికి మారమని మీరు చెబితే అతను భయపడతాడు.
రైతు: అవునండి. అతను సాహసించడు.
ప్రధానమంత్రి: ‘నేను ఆకలితో చచ్చిపోతాను’ అని అతను ఆలోచిస్తాడు. కాబట్టి దానికి బదులుగా ఇలా చెప్పండి. మమ్మల్ని గుడ్డిగా నమ్మకండి. మీ భూమిని నాలుగు భాగాలుగా విభజించండి. ఒక బిఘాలో మా పద్ధతిని ప్రయత్నించండి. మిగిలిన మూడింటిలో మీ పాత పద్ధతినే కొనసాగించండి.
రైతు: నిజమే.
ప్రధానమంత్రి: రెండేళ్లపాటు మాతో కలిసి పనిచేయండి. అతను విజయాన్ని చూసిన తర్వాత ఒక బిఘా నుంచి ఒకటిన్నర బిఘాకు ఆపై రెండు బిఘాలకు.. ఇలా విస్తరిస్తాడు. ఇలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకేసారి నాలుగు బిఘాలను మార్చమని మనం అడిగితే అతను మారడు.. జీవనోపాధి కోల్పోతానేమోనని భయపడతాడు.
రైతు: నేను శనగలు, పప్పు ధాన్యాలు, గోరు చిక్కుడు పండిస్తున్నాను. నా దగ్గర కేవలం రెండు ఎకరాల భూమి ఉన్నప్పటికీ నేను చిన్న తరహా వ్యవసాయాన్ని క్రమంగా నిర్వహిస్తున్నాను.
ప్రధానమంత్రి: చూశారా రెండు ఎకరాలు ఉన్న రైతు కూడా అద్భుతాలు చేయగలడు.
రైతు: అవునండి, కొంచెం కొంచెంగా...
ప్రధానమంత్రి: భూమి చిన్నది కావచ్చు.. కానీ రైతు మనస్సు చాలా గొప్పది.. ధైర్యం, నిశ్చయంతో నిండి ఉంటుంది.
రైతు: అవును సర్.
ప్రధానమంత్రి: మీ పొలాల చుట్టూ కంచె వేయాలని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా పక్కన ఉన్న రైతు కూడా కంచె వేస్తారు. ఆ రెండింటి మధ్యలో కొంత భూమి వృథా అవుతుంది. కానీ దానికి బదులుగా ఇరువైపులా సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తే.. మీ ఫలకాలు ఒక వైపునకు అతనిది మరోవైపునకు వంగి ఉండేలా చూసుకుంటే మీరిద్దరూ విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు.. వాడుకోవచ్చు. ఇందులో మిగిలిన విద్యుత్తును అమ్మొచ్చు కూడా.
రైతు: అద్భుతమైన ఆలోచన సర్. ఇది సాధ్యమే…
ప్రధానమంత్రి: అవును మనం ఆ దిశగానే సాగాలి. దీని కోసం ప్రభుత్వం ఇప్పుడు నిధులు కూడా సమకూరుస్తోంది.
రైతు: ప్రజలు దీనిని చేపడుతున్నారు సర్.. మంచి ప్రయోజనాలు పొందుతున్నారు.
ప్రధానమంత్రి: మరొక విషయం.. వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా మనం రీఛార్జ్ బావులను కూడా ప్రోత్సహించాలి. దీనివల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుంది.. అందరికీ మేలు జరుగుతుంది.
రైతు: అవునండి.. ఖచ్చితంగా.
ప్రధానమంత్రి: మీ అందరితో మాట్లాడటం చాలా బాగుంది. మీరు కొత్త పద్ధతులతో ప్రయోగాలు చేస్తున్న ధైర్యవంతులైన కష్టపడే రైతులు.. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. చాలా మంది కేవలం ‘మా నాన్న ఇది చేశారు మా మామయ్య ఇది చేశారు కాబట్టి నేను కూడా అదే చేస్తాను అని అంటారు. కానీ యువతను ఆ ఆలోచనకు అతీతంగా వెళ్లేలా మనం ప్రోత్సహించాలి.
రైతు: పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు. మాకు 50 శాతం సబ్సిడీ లభించింది. గతంలో నా దగ్గర కొన్ని ఆవులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు నా దగ్గర 250కి పైగా గిర్ ఆవులు ఉన్నాయి. 2010లో నేను ఒక హోటల్లో రూమ్ బాయ్గా పనిచేశాను. ఈ రోజు కోట్లాది రూపాయల విలువైన గోశాల నాకు ఉంది. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన మద్దతును అందించింది.
ప్రధానమంత్రి: మీరు రూమ్ బాయ్ స్థాయి నుంచి ఈ స్థితికి ఎలా చేరుకున్నారు?
రైతు: ఇదంతా ప్రభుత్వ పథకాల వల్లే జరిగింది సర్.
ప్రధానమంత్రి: ఇన్ని ఆవులు ఉన్నాయి కదా! మీరు వాటన్నింటినీ మీ దగ్గరే ఉంచుకుంటారా లేదా ఇతరులకు ఇస్తారా?
రైతు: నేను 63 ఆవులను వాటి దూడలతో సహా సేంద్రియ సాగు చేస్తూ పేదరికంలో ఉన్న ఒక ఆదివాసీ మహిళకు బహుమతిగా ఇచ్చాను.
ప్రధానమంత్రి: మంచిది. నేను కాశీకి ఎంపీని. నేను అక్కడ కూడా ఇలాంటి ప్రయోగమే చేశాను. సుమారు 100 కుటుంబాలకు గిర్ ఆవులను పంపిణీ చేశాను. అయితే మొదటి దూడను నాకు తిరిగి ఇవ్వాలనే నిబంధన పెట్టాను. ఆ తర్వాత దానిని మరో కుటుంబానికి ఇచ్చాను.
రైతు: 2020లో ప్రపంచ లాక్డౌన్ సమయంలో నేను పరిశోధన చేసి ఆ తర్వాత హరిద్వార్లోని శాఖను సందర్శించాను. అక్కడ నేను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి తెలుసుకున్నాను. అది నా జీవితాన్ని మార్చేసింది. ఈ పథకం ద్వారా లభించిన రాయితీలు, సహాయం వల్ల నాకు మంచి మద్దతు లభించింది.
ప్రధానమంత్రి: మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు?
రైతు: ఉత్తరాఖండ్లోని చిన్న గ్రామాల నుంచి సుమారు 25 మంది యువకులు మాతో కలిసి పనిచేస్తున్నారు సర్. వారు ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుంటారు.
ప్రధానమంత్రి: చాలా అద్భుతం.
రైతు: కొందరు వేరే ప్రాంతాలకు వెళ్లి స్వతంత్రంగా వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.
రైతు: నేను అలంకారిక చేపల పెంపకంపై కూడా దృష్టి పెట్టాను.
ప్రధానమంత్రి: ఆ.. ఆక్వాకల్చర్.
రైతు: నేను ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా దీనిని ప్రారంభించాను సర్.
ప్రధానమంత్రి: అవునా మీరు ఎలా చేశారు? ఎక్కడ శిక్షణ పొందారు?
రైతు: సర్, నేను పీహెచ్డీ చేశాను. నా సబ్జెక్ట్ కూడా ఇదే. ఉద్యోగం కోసం వెతికేవాడిగా కాకుండా ఉద్యోగం ఇచ్చేవాడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను ఈ సంస్థను ప్రారంభించాను.
ప్రధానమంత్రి: ఆక్వాకల్చర్కు ప్రపంచవ్యాప్తంగా అపారమైన అవకాశాలు ఉన్నాయి.
రైతు: నిజమే సర్.
ప్రధానమంత్రి: ఈ రంగంలో భారత్కు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిపై దృష్టి పెడితే భారీ మార్కెట్ అవకాశాలు లభిస్తాయి.
రైతు: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే రైతులకు ఎంతో ఆశను కల్పిస్తోంది.
రైతు: ‘గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అన్న మీ దార్శనికత నన్ను ఎంతగానో ప్రేరేపించింది. శరాయికేలలో నేను 125 పేద గిరిజన కుటుంబాలను దత్తత తీసుకొని అక్కడ సమగ్ర వ్యవసాయాన్ని ప్రారంభించాను.
ప్రధానమంత్రి: మీ చదువు మీకు దీనికి సిద్ధం చేసిందా లేక అక్కడికక్కడే శిక్షణ పొందారా?
రైతు: సర్, మీరే నాకు ఆదర్శం.
ప్రధానమంత్రి: ఓ.. నిజమా?
రైతు: ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ కల్పకులుగా మారాలని మీరు దేశానికి పిలుపునిచ్చారు. టాటా స్టీల్ ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను విక్రయిస్తుంది. నా ఉత్పత్తులను కూడా టాటా స్టీల్ విక్రయిస్తోంది.
ప్రధానమంత్రి: అద్భుతం.
రైతు: సర్ మీరు నాకు మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత. మీ చిన్న చిన్న సలహాలు, చర్చలు నా జీవితాన్ని నిరంతరం మారుస్తున్నాయి.
రైతు: నేను 'సఖి' సంస్థతో అనుబంధం కలిగి ఉన్నాను. మా ప్రయాణం 20 మంది మహిళలతో మొదలైంది. ఇప్పుడు 90,000 మంది మహిళలు పనిచేస్తున్నారు.
ప్రధానమంత్రి: 90,000 !
రైతు: అవును సర్. ఈ మహిళలు పాలు విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. మేం ఇప్పటివరకు 14,000 మందికి పైగా 'లఖ్పతి దీదీలను' తయారు చేశాం.
ప్రధానమంత్రి: ఇది అద్భుతం!
రైతు: నాకు ఇక్కడ చేపల పెంపకం కూడా ఉంది.
ప్రధానమంత్రి: అవును.
రైతు: మీ పీఎంఎంఎస్వై పథకం వల్ల మేం ఐస్ ప్లానింగ్, సరైన ఆక్వాకల్చర్ నిర్వహణను అమలు చేయగలిగాం.
ప్రధానమంత్రి: మీతో ఎంతమంది పనిచేస్తున్నారు?
రైతు: సుమారు 100 మంది.
ప్రధానమంత్రి: ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారు ఇంకెవరైనా ఉన్నారా?
రైతు: ఉన్నారు సర్. ఇటీవల అండమాన్ నుంచి మరో బృందం వచ్చింది. అంతకుముందు మేం వారిని సరిగ్గా చేరుకోలేకపోయాం కానీ పీఎంఎంఎస్వై పథకం వల్ల ఇప్పుడు పడవలు పనిచేస్తున్నాయి.. ఐస్ సరఫరా అందుబాటులో ఉంది. చేపలను ఉంచడానికి స్థలం కూడా ఉంది.
ప్రధానమంత్రి: ఓ.. అద్భుతం.
రైతు: నేను కాశ్మీర్ నుంచి వచ్చాను. ఒక కార్యక్రమం ద్వారా మీ పీఎంఎంఎస్వై పథకం గురించి తెలుసుకున్నాను.. పని ప్రారంభించాను. చేపల పెంపకాన్ని మొదలుపెట్టాను. నాకు ఇప్పుడు 14 మంది ఉద్యోగులు ఉన్నారు.
ప్రధానమంత్రి: అర్థమైంది.
రైతు: అవును. 14 మంది ఉద్యోగులు. నేను ఏటా సుమారు రూ. 15 లక్షల లాభాన్ని సంపాదిస్తున్నాను. మార్కెట్ బాగుంది. ఇతరులు కూడా లబ్ధి పొందుతున్నారు.
ప్రధానమంత్రి: ఇప్పుడు మీరు రైలు ద్వారా సరకును పంపొచ్చు కాబట్టి మీ ఉత్పత్తులు మార్కెట్లకు వేగంగా చేరుతాయి.
రైతు: మీ మద్దతుతో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. మరే ఇతర ప్రధానమంత్రి హయాంలో ఇది సాధ్యమవుతుందని నేను అనుకోను.
ప్రధానమంత్రి: జమ్మూ కాశ్మీర్లో చాలా సమర్థులైన యువత ఉన్నారు.
రైతు: అవును ఇదంతా మీ ప్రభుత్వం వల్లే సాధ్యమైంది లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.
రైతు: వారితో కలవడం, ఆక్వాకల్చర్ గురించి చర్చించడం ఒక సహజ చికిత్సలా అనిపించింది.
రైతు: నమస్కారం.
ప్రధానమంత్రి: నమస్కారం.
రైతు: సర్, నేను నిజానికి 2014లో అమెరికా నుంచి తిరిగి వచ్చాను.
ప్రధానమంత్రి: అమెరికా వదిలేసి వచ్చారా?
రైతు: అవును.. నా సొంత ప్రజలకు ఉపాధి కల్పించాలని అమెరికా వదిలేసి వచ్చాను. నేను 10 ఎకరాల చిన్న పొలంతో మొదలుపెట్టాను. ఇప్పుడు నేను 300 ఎకరాలకు పైగా సాగును చూసుకుంటున్నాను. అంతేకాకుండా 10,000 ఎకరాలకు పైగా విత్తనాలను ఉత్పత్తి చేసే హేచరీలను నిర్వహిస్తున్నాను. నేను ఎఫ్ఐడీఎఫ్ నుంచి సుమారు 7 శాతం వడ్డీకి రుణ ప్రయోజనం పొందాను. దీనివల్ల భారీ విస్తరణ సాధ్యమైంది. ప్రస్తుతం నాకు సుమారు 200 మంది ఉద్యోగులు ఉన్నారు సర్.
ప్రధానమంత్రి: వావ్! చాలా గొప్ప విషయం!
రైతు: నరేంద్ర మోదీ గారు మా వైపు నడుచుకుంటూ రావటం నా జీవితంలో అదొక మరపురాని క్షణం. అది నిజంగా అద్భుతమైన సందర్భం.
ప్రధానమంత్రి: నమస్తే సోదరా.
రైతు: నేను గుజరాత్లోని అమ్రేలి జిల్లాకు చెందిన ధారి నుంచి వచ్చాను. నా పేరు భావన గొండవియా. మా ఎఫ్పీఓలో 1,700 మంది రైతులు ఉన్నారు. మేం వరుసగా నాలుగు సంవత్సరాలుగా 20 శాతం డివిడెండ్ చెల్లిస్తున్నాం.
ప్రధానమంత్రి: 1,700 మంది రైతులు?
రైతు: అవును సర్.
ప్రధానమంత్రి: మొత్తం ఎంత భూమి సాగులో ఉంది?
రైతు: మేం 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా 20 శాతం డివిడెండ్ ఇస్తున్నాం. ఇది రూ. 200 కోట్లకు పైగా ఉంటుంది.
ప్రధానమంత్రి: వారు వేర్వేరు పంటలు పండిస్తారా లేదా నిర్ణీత ప్రణాళికను అనుసరిస్తారా?
రైతు: మేం కనీస మద్దతు ధర కింద కూడా పని చేస్తాం. మా ఎఫ్పీఓకు నిధులు లేనప్పుడు ప్రభుత్వం ఎటువంటి హామీ లేకుండా రూ. 2 కోట్లు అందించడం మా అతిపెద్ద విజయం. అది ఒక ముఖ్యమైన మైలురాయి.
రైతు: నమస్కారం ప్రధానమంత్రి గారు. నా పేరు సునీల్ కుమార్.. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి వచ్చాను. మేం ప్రధానంగా 'ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్' (ఐపీఎం) పద్ధతిని ఉపయోగించి సేంద్రియ పద్ధతిలో జీలకర్రను సాగు చేస్తాం.
ప్రధానమంత్రి: అర్థమైంది.
రైతు: మా ఎఫ్పీఓలో 1,035 మంది రైతులు ఉన్నారు. వారు జీలకర్ర, ఇసబ్గోల్ పండిస్తున్నారు.
ప్రధానమంత్రి: జీలకర్ర మార్కెట్ ఎక్కడ ఉంది?
రైతు: మేం గుజరాత్లోని వివిధ ఎగుమతిదారులకు సరఫరా చేస్తాం. వారు దానిని ముందుకు తీసుకెళ్తారు.
ప్రధానమంత్రి: ఎవరైనా ఇసబ్గోల్ ఐస్క్రీమ్ తయారు చేయడానికి ప్రయత్నించారా?
రైతు: లేదు సర్.
ప్రధానమంత్రి: మార్కెట్ అవకాశాలను ఒక్కసారి ఊహించుకోండి!
రైతు: అవును సర్. విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ప్రధానమంత్రి గారి చిన్న ఆలోచన మమ్మల్ని ఉత్తేజపరిచింది. ఐస్క్రీమ్ గురించి మేం ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు దాని గురించి పరిశీలిస్తాం.
రైతు: నేను మీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసికి సమీపంలో ఉన్న మీర్జాపూర్ నుంచి ధర్మేంద్ర కుమార్ మౌర్యను. మేం చిరుధాన్యాలపై పని చేస్తున్నాము.
ప్రధానమంత్రి: చిరుధాన్యాలా?
రైతు: అవను సర్.
ప్రధానమంత్రి: మీరు వాటిని ప్యాక్ చేసి బ్రాండ్ పేరుతో అమ్ముతున్నారా?
రైతు: అవును సర్. మేం ఒక ఎంవోయూ కింద రక్షణ, ఎన్డీఆర్ఎఫ్కి సరఫరా చేస్తున్నాం.
రైతు: నా పేరు ఫయాజ్ అహ్మద్, కాశ్మీర్ నుంచి వచ్చాను. మేం సేపులను ఉత్పత్తి చేస్తాం.
ప్రధానమంత్రి: సేపులా!
రైతు: అవును.
ప్రధానమంత్రి: సేపుల కోసం రవాణా సౌకర్యం పొందారా?
రైతు: అవును వాహనాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి: 60,000 టన్నుల పండ్లు, కూరగాయలు, పూలు రైలు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నాయి.
రైతు: అవును. అవి ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు చేరుకున్నాయి.
ప్రధానమంత్రి: అది చాలా అద్భుతమైన విజయం.
రైతు: కానీ...
ప్రధానమంత్రి: ట్రక్కులు చాలా సమయం తీసుకుంటాయి.
రైతు: మాది మధ్యప్రదేశ్లోని జబల్పూర్. నా పేరు రోషిక్ సుక్లం. మేం ఏరోపోనిక్స్ పద్ధతిలో బంగాళాదుంప విత్తనాలను ఉత్పత్తి చేస్తాం.
ప్రధానమంత్రి: కచ్చితంగా.
రైతు: అవునండి. మేం నిలువు, అడ్డు సాగు పద్ధతులను ఉపయోగిస్తాం. ఇవి బంగాళాదుంప విత్తనాలు. ఇవి బంగారం కాకపోయినా బంగారం అంత విలువైనవి. ఎందుకంటే రైతులు సాగు చేయడం కోసం మేం వీటిని అభివృద్ధి చేస్తాం.
ప్రధానమంత్రి: అంటే మీరు అత్యున్నత స్థాయి అభివృద్ధిని చేస్తున్నారు...
రైతు: బంగాళాదుంపలు.
రైతు: వేలాడే బంగాళాదుంపలు సర్.
ప్రధానమంత్రి: ఇది జైనులకు బాగా సరిపోతుంది. భూమి అడుగున పెరిగితే వారు తినరు. భూమి పైన పెరిగితే తింటారు.
రైతు: మేం నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు ఆయనకు చిన్న దుంపలు చూపించాం. ఆయనకు అడ్డు వ్యవసాయం, ఏరోపోనిక్స్ గురించి తెలుసు. ఆయన వెంటనే వీటిని ‘జైన్ బంగాళాదుంపలు’ అని గుర్తించారు. ఆయన ఈ బంగాళాదుంపలను 'జైన్ పొటాటోస్' అని పిలిచారు.
రైతు: సర్.. నమస్కారం. నా పేరు మొహమ్మద్ అస్లాం. మాది రాజస్థాన్లోని బరాన్ జిల్లా. మేం వెల్లుల్లితో కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తాం.
ప్రధానమంత్రి: మీరు ఎక్కడి నుంచి?
రైతు: రాజస్థాన్లోని బరాన్ జిల్లా సర్.
ప్రధానమంత్రి: బరాన్, రాజస్థాన్.
రైతు: అవునండి. మేం వెల్లుల్లికి విలువ జోడిస్తాం. పొడి, పేస్టు. ఎగుమతి లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం.
ప్రధానమంత్రి: శనగపిండి, వెల్లుల్లితో అప్పడాలు తయారు చేసే ఒక యువకుడిని నేను కలిశాను.
రైతు: సర్, 'మన్ కీ బాత్' ద్వారా మీతో ఈ విషయం పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది.
ప్రధానమంత్రి: చాలా బాగుంది! ధన్యవాదాలు సోదరా.
***
(రిలీజ్ ఐడి: 2254539)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam