పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
· ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం మధ్య దేశవ్యాప్తంగా అంతరాయం లేకుండా కొనసాగుతోన్న పాల సేకరణ, శుద్ధి, సరఫరా
· పాల సరఫరా గొలుసులు, పాలు- ఇంధనం- ప్యాకేజింగ్ సామగ్రి లభ్యతను రోజువారీగా పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్ర సమాఖ్యలు, పాల సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఒక ప్రత్యేక పోర్టల్
· గృహ వినియోగదారులకు ప్రాధాన్యత క్రమంలో అందుతోన్న ఎల్పీజీ సరఫరా.. ఎల్పీజీ పంపిణీ కేంద్రాలలో నిల్వల కొరత ఉన్నట్లు అందని నివేదికలు
· 2026 మార్చి నుంచి 5.01 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు ప్రారంభమైన గ్యాస్ సరఫరా... కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న 5.68 లక్షల మందికి పైగా వినియోగదారులు
· ఆకస్మిక తనిఖీలను కొనసాగిస్తున్న పీఎస్యూ ఓఎంసీలు… నిన్నటి వరకు 274 ఎల్పీజీ పంపిణీ కేంద్రాలలో తనిఖీలు చేపట్టి 67 పంపిణీ కేంద్రాలను సస్పెండ్ చేసిన అధికారులు
· 2026 ఫిబ్రవరి 28 నుంచి హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా వచ్చిన 9 ఎల్పీజీ నౌకలు, 1 ముడి చమురు నౌక
· బాగ్దాద్లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో, ఇరాక్లో చిక్కుకున్న 12 మంది భారతీయ నావికులు నిన్న ముంబయి రాక
నాడు పోస్టు చేయడమైనది:
21 APR 2026 6:09PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించింది. పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతున్న సహాయం, కీలక రంగాల్లో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తాజా సమాచారాన్ని అందించారు. మత్స్య, పశుసంవర్ధక- పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం కూడా తాజా వివరాలను పంచుకుంది.
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ రంగానికి సంబంధించి తాజా వివరాలు:
పశుసంవర్ధక- పాడిపరిశ్రమ శాఖ (డీఏహెచ్డీ) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. పాడిపరిశ్రమ విలువ గొలుసు సజావుగా సాగేలా చూసేందుకు పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్జీ), ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వరుసగా ముందస్తు చర్యలు చేపట్టింది.
ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం మధ్య కూడా దేశవ్యాప్తంగా పాల సేకరణ, శుద్ధి, సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్లో సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగలేదు. సంక్షోభ కాలమంతటా పాడి రైతులకు చెల్లింపులు నిరంతరాయంగా కొనసాగాయి.
ఈ శాఖ తీసుకున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి:
· మారుతున్న పరిస్థితులను అంచనా వేయడానికి కార్యదర్శి (ఏహెచ్డీ) అధ్యక్షతన సంబంధిత భాగస్వాములతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇంధన లభ్యత
· ఇంధన (గ్యాస్) సరఫరాల విషయానికి వస్తే 8.4.2026 నాటి ఎంఓపీఎన్జీ ఉత్తర్వు ద్వారా పాడి పరిశ్రమకు సంబంధించిన ఆహార శుద్ధి కేంద్రాలతో సహా కీలక పరిశ్రమలకు 2026 మార్చికి ముందున్న బల్క్ గృహేతర ఎల్పీజీ సరఫరాలో 70 శాతం అందేలా చూస్తున్నారు. దీనివల్ల పాడి పరిశ్రమ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నివారించారు. తదనంతరం ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, కార్యకలాపాల పరంగా సాధ్యమయ్యే చోటల్లా అన్ని పాడి పరిశ్రమ కేంద్రాలు ఎల్పీజీ నుండి పీఎన్జీకి మారాలని సూచించారు.
ప్యాకేజింగ్ సామగ్రి
· పెట్రోకెమికల్స్పై ఎంఓపీఎన్జీ ఏర్పాటు చేసిన జాయింట్ వర్కింగ్ గ్రూప్లో (జేడబ్ల్యూజీ) పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం సభ్యునిగా ఉంది. పాడి పరిశ్రమకు అవసరమైన ప్యాకేజింగ్ సామగ్రికి సంబంధించిన సమస్యలను ఆ గ్రూప్ పరిష్కరించింది. పాడి పరిశ్రమలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే కీలకమైన పదార్థం ఎల్డీపీఈని 0.23 టీఎంటీ మేర ఎంఓపీఎన్జీ కేటాయించింది. అంతేకాకుండా పాల ప్యాకేజింగ్లో ఉపయోగించే ప్లాస్టిక్ కప్పుల తయారీకి అత్యవసరమైన పాలీప్రొఫైలిన్, పాలీస్టైరిన్ల సరఫరాను నిరంతరాయంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.
· దేశవ్యాప్తంగా ప్యాకేజింగ్ సామగ్రి సరఫరా సజావుగా సాగేలా చూడటానికి ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సామగ్రి సరఫరాదారులతో ఈ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
· పాడి పరిశ్రమపై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావాన్ని పర్యవేక్షించేందుకు, పాల పరిస్థితిని సమీక్షించేందుకు దేశంలోని రాష్ట్ర పాల సమాఖ్యలు లేదా పాల సంఘాలతో 20.4.2026న ఒక సమావేశం నిర్వహించారు. పాడి పరిశ్రమకు ఇంధన (గ్యాస్), ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సామగ్రి సరఫరాకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు.
· పాడి పరిశ్రమ సరఫరా వ్యవస్థను, పాలు, ఇంధనం, ప్యాకేజింగ్ సామగ్రి లభ్యతను రోజువారీ పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్ర సమాఖ్యల, పాల సంఘాలను సభ్యులుగా చేర్చుతూ 30.3.2026న ఒక ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు.
ఎగుమతులు
· ఎగుమతి చేసిన సరుకులను భారతీయ ఓడరేవులకు తిరిగి తీసుకురావడాన్ని సులభతరం చేయడానికి 25.03.2026 నుంచి అమలులోకి వచ్చేలా ఒక సరళీకృత జంతు క్వారంటైన్ క్లియరెన్స్ విధానాన్ని నోటిఫై చేశారు.
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హోర్ముజ్ జలసంధికి సంబంధించి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ ఎటువంటి అంతరాయం లేకుండా లభించేలా చూసేందుకు పెట్రోలియం - సహజ వాయువు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.
· వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.
· ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.
· పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
· ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్పీజీ, గృహావసరాల పీఎన్జీ, రవాణా సీఎన్జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
· వాణిజ్య ఎల్పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.
· ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
· ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్జీ కనెక్షన్ల పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావసరాల చట్టం- 1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.
· 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
o ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
o సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
o జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
o సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o పీఎన్జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o ఎల్పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
· అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
· ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పత్రికా ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 2200లకు పైగా సోదాలు నిర్వహించారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను బలోపేతం చేస్తూ, నిరంతర తనిఖీలనూ కొనసాగిస్తున్నాయి. 274 మంది ఎల్పీజీ పంపిణీదారులకు జరిమానాలు విధించగా, నిన్నటి వరకు 67 మంది ఎల్పీజీ పంపిణీదారుల లైసెన్స్లను సస్పెండ్ చేశాయి.
ఎల్పీజీ సరఫరా
గృహాలకు ఎల్పీజీ సరఫరా స్థితి:
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరా ప్రభావితమవుతూనే ఉంది.
గృహాలకు ఎల్పీజీ సరఫరా కోసం ప్రాధాన్యత కొనసాగుతోంది.
ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో సరఫరా నిలిచిపోయినట్లు ఎటువంటి నివేదికలు లేవు.
నిన్న పరిశ్రమ ప్రాతిపదికన ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 98 శాతానికి పెరిగాయి.
సరఫరా పక్కదారి పట్టకుండా అరికట్టడానికి, డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలు సుమారు 92 శాతానికి పెరిగాయి. వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు డీఏసీ అందుతోంది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
10 శాతం సంస్కరణ-అనుసంధాన కేటాయింపు సహా, మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును సంక్షోభానికి ముందు స్థాయిల్లో సుమారు 70 శాతానికి పెంచారు.
21.03.2026 తేదీ నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి, 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ఆధారంగా ప్రతి రాష్ట్రంలో వలస కార్మికులకు పంపిణీ చేయడానికి అందుబాటులో ఉన్న 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం 06.04.2026 తేదీ నాటి లేఖ ద్వారా తెలియజేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహాయంతో తమ రాష్ట్రంలోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయడానికి ఈ 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి.
2026 ఏప్రిల్ 3 నుంచి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల కోసం 7400కు పైగా అవగాహన శిబిరాలను నిర్వహించాయి. వీటిలో 1,07,000లకు పైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి. నిన్న నిర్వహించిన 410కు పైగా శిబిరాల ద్వారా 5891 – 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
ఈ నెల 20న మహారాష్ట్రలోని తారాపూర్లో ఐవోసీఎల్ నిర్వహించిన 5 కేజీల ఎఫ్టీఎల్ అవగాహన శిబిరాలకు మంచి స్పందన లభించింది. ఆ రోజున సుమారు 550 – 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
2026 మార్చి 23 నుంచి, 19.28 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్పీజీ పంపిణీ కోసం ప్రణాళిక రూపొందించడానికి... ఐవోసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ రాష్ట్ర అధికారులు, పరిశ్రమకు చెందిన సంస్థలతో సమన్వయం కొనసాగిస్తోంది.
ఏప్రిల్-26 నెలలో (20.04.26 వరకు), మొత్తం 1,23,680 మెట్రిక్ టన్నుల (65 లక్షలకు పైగా 19 కేజీల ఎల్పీజీ సిలిండర్లకు సమానమైన) వాణిజ్య ఎల్పీజీని విక్రయించారు.
20.04.2026న, 8822 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ (4.64 లక్షలకు పైగా - 19 కేజీల సిలిండర్లకు సమానం) విక్రయించారు.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
డీ-పీఎన్జీ, సీఎన్జీ-రవాణాకు 100 శాతం సరఫరాలతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఎరువుల కర్మాగారాలకు కేటాయించే మొత్తం గ్యాస్ను, వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.
అదనంగా, సీజీడీ నెట్వర్క్ల ద్వారా జరిగే సరఫరాలతో పాటు ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరా 80 శాతం వరకు పెరిగింది.
వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి, సీజీడీ సంస్థలు తమ అన్ని జిఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాయి.
ఐజీఎల్, ఎమ్జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
సీజీడీ నెట్వర్క్ల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.
పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 తేదీ నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేయడం కోసం 'తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధానం'ను 3 నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తోంది.
నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్లైన్లు వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తాయి. అనుమతులను, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించడంతో పాటు ఇది నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునివ్వడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేస్తూ భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
డీ-పిఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.
పరిశుభ్రమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర సీబీజీ విధానం కోసం ఒక నమూనా ముసాయిదాను భారత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం... సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధానంగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపుల కోసం తదుపరి విడతలో ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఎమ్వోఈఎఫ్సీసీ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా... సీజీడీ నెట్వర్క్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ కోసం 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్పీసీబీ/పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.
మార్చి 2026 నుంచి, 5.01 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్ జరిగింది. కొత్త కనెక్షన్ల కోసం 5.68 లక్షలకు పైగా వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
19.04.2026 వరకు, సుమారు 39,400 మంది పీఎన్జీ వినియోగదారులు MYPNGD.in వెబ్సైట్ ద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలూ తగినంతగా ఉన్నాయి.
దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
దేశీయ మార్కెట్కు పెట్రోకెమికల్ ఫీడ్స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గం (జేడబ్ల్యూజీ)ను ఏర్పాటు చేశారు. పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు సహా ఆయిల్ రిఫైనరీ కంపెనీలు... సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ధారించిన విధంగా కీలక రంగాలకు సీ3, సీ4 స్ట్రీమ్ల నిర్దిష్ట కనీస పరిమాణాలను అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం 01.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా అనుమతించింది.
ఫార్మాస్యూటికల్స్ విభాగం, రసాయనాలు-పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమల ప్రోత్సాహం-అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నుంచి అందిన అభ్యర్థనల ఆధారంగా ఫార్మా, రసాయన రంగ కంపెనీలకు ఎల్పీజీ పూల్ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల కేటాయింపు జరుగుతోంది.
ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు 4400 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపిలీన్ను విక్రయించారు.
రిటైల్ ఇంధనం లభ్యత, ధరలు
దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయ కేంద్రాలు (పెట్రోల్ బంకులు) యథావిధిగా పనిచేస్తున్నాయి.
· పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది.
· దేశీయ మార్కెట్లో ఉత్పత్తుల లభ్యతను పెంచడానికి భారత ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.55.50కి, ఏటీఎఫ్ పై రూ.42కి పెంచింది.
· పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి ధరల పెంపూ లేదు. · ·
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులతో పాటు అదనంగా 48,000 లీటర్ల కిరోసిన్ అందించారు..
*18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి, కాగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ఎటువంటి అవసరం లేదని తెలిపాయి.
సముద్ర భద్రత, షిప్పింగ్ కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో ప్రస్తుత సముద్ర స్థితిగతులు, అలాగే భారతీయ నౌకలు, సిబ్బందిని రక్షించడానికి తీసుకుంటున్న చర్యల గురించి రేవులు, నౌకాయాన, జల రవాణా మంత్రిత్వ శాఖ వివరించింది.
· భారతదేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి, ఎటువంటి రద్దీ లేదు. ఈ నేపథ్యంలో, సరుకు రవాణా గణనీయంగా మెరుగుపడింది. ముఖ్యమైన పశ్చిమ ఓడరేవుల నుంచి నగరాలకు తిరిగి పంపాల్సిన కంటైనర్లలో దాదాపు 97% క్లియర్ చేశారు.
· సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో దాదాపు 80 శాతంగా ఉన్న సగటు ప్రాంగణ వినియోగం, ప్రస్తుతం 60 శాతానికి తగ్గింది. ఇది ఓడరేవు మౌలిక సదుపాయాలపై ఒత్తిడి తగ్గుతున్నట్లు సూచిస్తోంది.
· 2026 ఫిబ్రవరి 28 నుంచి, హోర్ముజ్ జలసంధి గుండా మొత్తం 9 ఎల్.పి.జి నౌకలు, ఒక ముడి చమురు నౌక సురక్షితంగా ప్రయాణించాయి. ఇది ఈ ప్రాంతంలో సముద్ర రవాణా కదలికలు క్రమంగా స్థిరపడుతున్నట్లు సూచిస్తోంది.
· సముద్రయాన సిబ్బంది సంక్షేమం, అంతరాయం లేకుండా సముద్ర కార్యకలాపాలు సాగేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగానికి చెందిన భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయంతో వ్యవహరిస్తోంది.
· ఈ ప్రాంతంలోని భారతీయ సముద్ర యానికులందరూ క్షేమంగా ఉన్నారు. గత 24 గంటలలో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదవ్వలేదు.
· డిజి షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 6,727 కాల్స్ ను, 13,987 పైగా కమ్యూనికేషన్లను స్వీకరించింది. గత 24 గంటల్లో 147 కాల్స్, 276 ఈమెయిల్స్ అందాయి.
· డిజి షిప్పింగ్ ఇప్పటివరకు 2,447 పైగా భారతీయ సముద్ర యానికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి సహకరించింది, వీరిలో గత 24 గంటల్లో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30మంది కూడా ఉన్నారు.
· భారతదేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎక్కడా రద్దీ ఉన్నట్లు సమాచారం లేదు.
· నావికుల సంక్షేమాన్ని, సముద్ర కార్యకలాపాల కొనసాగింపు కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ రాయబార కార్యాలయాలు సముద్ర వాణిజ్య భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ, పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితిని ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిశితంగా నిరంతరం పర్యవేక్షిస్తోంది.
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా గల నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు.
నౌకాయాన డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ తాజా సమాచారం: ఈ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి 7,086 ఫోన్ కాల్స్, 14,975 పైగా ఈ మెయిల్స్ స్వీకరించింది. గత 24 గంటల్లో 168 కాల్స్, 370 ఈ మెయిల్స్ అందాయి.
స్వదేశానికి తరలింపు - తాజా సమాచారం
నౌకాయాన డైరెక్టరేట్ జనరల్ ద్వారా, మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 2,590 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడాన్ని సులభతరం చేసింది. ఇందులో గత 24 గంటల్లో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 27 మంది ఉన్నారు.
భారత పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో మారుతున్న పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. అక్కడి భారతీయ సమాజం భద్రత, క్షేమం కోసం కింద పేర్కొన్న ప్రత్యేక చర్యలు చేపట్టింది.
*ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు, గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి.
*జాతీయ భద్రతా సలహాదారు 2026 ఏప్రిల్ 19న సౌదీ అరేబియాలో పర్యటించారు.
*అంతకుముందు, విదేశీ వ్యవహారాల మంత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ఖతార్ లో పర్యటించారు.
*వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కూడా గల్ఫ్ ప్రాంతంలోని తన సహచర మంత్రులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు.
*విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి భారతీయ దౌత్య కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పనిచేస్తున్నాయి.
*సమాచార మార్పిడి, ప్రయత్నాలను మెరుగ్గా సమన్వయం చేసుకోవడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
*భారతీయ దౌత్య కార్యాలయాలు అహర్నిశలు పనిచేసే హెల్ప్ లైన్లను నిర్వహిస్తూ, భారతీయ పౌరులకు సహాయం అందిస్తున్నాయి. అలాగే స్థానిక ప్రభుత్వాలతో ఇవి సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాయి.
*స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన, ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారతీయులకు మద్దతుగా చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యల గురించి సమాచారంతో కూడిన తాజా సూచనలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.
*భారతీయ దౌత్య కార్యాలయాలు అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంతో చురుకుగా మమేకమవుతున్నాయి. భారతీయ సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన సమూహాలు,భారతీయ కంపెనీలతో రాయబారులు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
*ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. స్థానిక అధికారులు, ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ సహాయాన్ని అందించడం, స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారి అభ్యర్థనలకు సహాయం చేయడం వంటి అన్ని రకాల సాయాన్ని భారతీయ దౌత్య కార్యాలయాలు అందిస్తున్నాయి.
*గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి ఆ ప్రాంతానికి విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి సుమారు 11,61,000 మంది ప్రయాణీకులు ఆ ప్రాంతం నుంచి భారతదేశానికి ప్రయాణించారు.
*యూఏఈలోకార్యకలాపాలు, భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని విమానయాన సంస్థలు యూఏఈ, భారతదేశం మధ్య పరిమిత స్థాయిలో వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. ఈ రోజు యూఏఈ - భారత్ మధ్య సుమారు 110 విమానాలు నడుస్తాయని అంచనా.
*సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారతదేశం లోని వివిధ ప్రాంతాలకు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి.
*ఖతార్ గగనతలాన్ని పాక్షికంగా తెరవడంతో ఖతార్ ఎయిర్వేస్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది.
*కువైట్ గగనతలం మూసివేతతో జజీరా ఎయిర్ వేస్, కువైట్ ఎయిర్వేస్ సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారతదేశానికి షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
*బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. బహ్రెయిన్ గల్ఫ్ ఎయిర్ ఈ రోజు నుంచి బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
*ఇరాక్ గగనతలం తెరిచి ఉంది, అయితే ఆ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమితంగా విమాన కార్యకలాపాలు సాగుతున్నాయి, వీటిని భారతదేశానికి ప్రయాణించేందుకు ఉపయోగించుకోవచ్చు.
*ఇరాన్ గగనతలం సరుకు రవాణా ప్రత్యేక (చార్టర్డ్) విమానాల కోసం పాక్షికంగా తెరిచి ఉంది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులను ఆర్మేనియా, అజర్బైజాన్ మీదుగా భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
*ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. వీటిని భారతదేశానికి తదుపరి ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఇజ్రాయెల్ నుంచి భారతీయ పౌరులు జోర్డాన్,ఈజిప్ట్ మీదుగా భారతదేశానికి ప్రయాణించేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఇరాక్ నుంచి భారతీయ నావికుల తిరుగు ప్రయాణం - తాజా సమాచారం
ఇరాక్ గగనతలం తిరిగి తెరుచుకోవడంతో, అక్కడ చిక్కుకుపోయిన 12 మంది భారతీయ నావికులు నిన్న ముంబైకి చేరుకున్నారు. బాగ్దాద్లోని భారతీయ దౌత్య కార్యాలయం వారికి అన్ని విధాలా సహాయం అందించి, వారు సురక్షితంగా భారతదేశానికి తిరిగి రావడానికి తోడ్పడింది.
***
(రిలీజ్ ఐడి: 2254337)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7