పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాలపై తాజా సమాచారం
గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లకు అనుగుణంగా సాధారణంగానే కొనసాగుతున్న పంపిణీ.. నిన్న డెలివరీ అయిన 53.5 లక్షలకు పైగా సిలిండర్లు
MYPNGD.in ద్వారా ఎల్పీజీ కనెక్షన్ను వదులుకున్న 39,000 మందికి పైగా పీఎన్జీ వినియోగదారులు
2026 ఏప్రిల్లో (17.04.26 వరకు) రోజుకు సగటున 305 మెట్రిక్ టన్నులకు చేరుకున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఆటో ఎల్పీజీ అమ్మకాలు.. 2026 ఫిబ్రవరిలో 177 మెట్రిక్ టన్నులుగా మాత్రమే ఉన్న ఈ సంఖ్య
31 మంది భారతీయ నావికులతో నిన్న హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన భారతీయ జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్ 'దేశ్ గరిమ'.. 2026 ఏప్రిల్ 22న ముంబయికి చేరుకోనున్న ఈ నౌక
హోర్ముజ్ జలసంధిలో భారతీయ జెండా కలిగిన నౌకలకు సంబంధించిన కాల్పుల ఘటనపై ఇరాన్ రాయబారిని పిలిపించి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసిన భారత్
గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి కొనసాగుతున్న విమాన సర్వీసులు.. ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ నుంచి భారత్కు వచ్చిన సుమారు 10.97 లక్షల మంది ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
19 APR 2026 5:35PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమన్వయంతో కూడిన ప్రతిస్పందన చర్యల ద్వారా కీలక రంగాలలో సంసిద్ధత, కార్యకలాపాల నిరంతరాయతను నిర్ధారించడంలో కేంద్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందించే మద్దతు విషయమై తీసుకుంటున్న చర్యల తాజా సమాచారం ఈ విధంగా ఉంది:
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
-
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.
-
వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.
-
ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.
-
పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
-
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్పీజీ, గృహావసరాల పీఎన్జీ, రవాణా సీఎన్జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
-
వాణిజ్య ఎల్పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.
-
ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.
-
ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.
-
చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అదనపు బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
-
గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
అమలు, పర్యవేక్షణ చర్యలు
-
ఎల్పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. 18.04.2026 నాడు దేశవ్యాప్తంగా 2400 కంటే ఎక్కువ దాడులు నిర్వహించారు.
-
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. అవి నిన్నటివరకు 264 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు జరిమానాలు విధించటంతో పాటు 67 మంది డీలర్లను సస్పెండ్ చేశాయి.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాల ఎల్పీజీ
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
-
గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.
-
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
-
నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్లైన్ ఎల్పీజీ బుకింగ్లు సుమారు 98 శాతానికి పెరిగాయి.
-
సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 93 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్కు డీఏసీ వస్తుంది.
-
గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది.
-
18.04.26న 53.5 లక్షలకు పైగా గృహావసరాల ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
-
మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
-
కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కిలోల ఎఫ్టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఈ 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.
-
2026 ఏప్రిల్ 3 వరకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్యూ ఓఎంసీ) 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లపై సుమారు 6700 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 96,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి. నిన్న సుమారు 230 శిబిరాల ద్వారా 5233 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
-
ఇటీవల 2026 ఏప్రిల్ 18న రబాలేలో (థానే) ఉన్న ఎంఐడీసీలో బీపీసీఎల్ నిర్వహించిన 5 కేజీల ఎఫ్టీఎల్ అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో 300కు పైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
-
2026 మార్చి 23 నుంచి 18.33 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
-
వాణిజ్య ఎల్పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
-
18.04.2026న 9,192 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీని (4.83 లక్షలకు పైగా 19 కేజీల సిలిండర్లకు సమానం) విక్రయించారు.
-
2026 మార్చి 14 నుంచి మొత్తం 1,67,775 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ (88.3 లక్షలకు పైగా 19 కేజీల ఎల్పీజీ సిలిండర్లకు సమానం) విక్రయమైంది. ఇందులో 9600 మెట్రిక్ టన్నులకు పైగా ఆటో ఎల్పీజీ కూడా ఉంది.
-
2026 ఏప్రిల్ నెలలో (17.04.26 వరకు) పీఎస్యూ ఓఎంసీల ద్వారా రోజువారీ సగటు ఆటో ఎల్పీజీ విక్రయాలు సుమారు 305 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. 2026 ఫిబ్రవరి నాటి రోజువారీ సగటు 177 మెట్రిక్ టన్నులుగా ఉంది.
-
ఆటో ఎల్పీజీ విక్రయాలు ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ (పీఎస్యూ) చమురు సంస్థలకు మారిన ధోరణి కనిపిస్తోంది. పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి పీఎస్యూ సంస్థల ఆటో ఎల్పీజీ విక్రయాలు 72 శాతం పెరిగాయి. ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ భారీ వృద్ధి కనిపించింది.
సహజవాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
వినియోగదారులకు డీ-పీఎన్జీ, సీఎన్జీని 100 శాతం సరఫరా చేసేందుకు ప్రాధాన్యతనిచ్చారు.
ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ కేటాయింపులను ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.
సీజీడీ వ్యవస్థల ద్వారా అందే సరఫరాలతో సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతానికి పెంచారు.
వాణిజ్య ఎల్పీజీ లభ్యతలోని ఇబ్బందుల పరిష్కారానికి హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు, వాటి పరిధిలోని జీఏల్లో పీఎన్జీ కనెక్షన్లకు ప్రాధాన్యతనివ్వాలని సీజీడీ సంస్థలకు సూచించారు.
గృహ, వాణిజ్య అవసరాలకు పీఎన్జీ కనెక్షన్లను తీసుకునే వారికి ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
సీజీడీ వ్యవస్థల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
దీర్ఘకాల ప్రాతిపదికన ఎల్పీజీ, పీఎన్జీకి మారే ప్రక్రియలో సహకరించే రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ కోటాలో అదనంగా 10 శాతం కేటాయింపులు చేస్తామని 18.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, యూటీలకు అదనపు వాణిజ్య ఎల్పీజీని కేటాయించారు.
కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించటానికి 'తగ్గించిన కాలపరిమితితో సీజీడీ మౌలిక సదుపాయాలకు వేగవంతమైన ఆమోద వ్యవస్థ'ను 3 నెలల ప్రత్యేక గడువుతో అమల్లోకి తీసుకువచ్చింది.
భారత ప్రభుత్వ 24.03.2026 నాటి గెజిట్, నిత్యావసర వస్తువుల చట్టం-1955 ద్వారా సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల కల్పన, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ) ఉత్తర్వు-2026ను జారీ చేసింది. దేశవ్యాప్తంగా పైప్లైన్లను వేయటానికి, విస్తరించటానికి క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన వ్యవస్థను ఈ ఉత్తర్వు అందిస్తుంది. అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్జీ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేస్తుంది. ప్రతీ ప్రాంతానికి అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. స్వచ్ఛ ఇంధన పరివర్తనకు మద్దతిస్తుంది. తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయటంతో పాటు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. పీఎన్జీ విస్తరణ వేగాన్ని కొనసాగించటానికి, జాతీయ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడగించారు.
స్వచ్ఛమైన, సురక్షితమైన, స్వావలంబన ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించటానికి, రాష్ట్రాల్లో సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను భారత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. సీబీజీ అభివృద్ధికి రాష్ట్రాలు సొంత పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలు-ఆధారిత వ్యవస్థను రూపొందించటానికి ఈ నమూనా విధానం ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక వ్యవస్థగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎంచుకున్న రాష్ట్రాలకు, వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యతనిస్తారు.
ఎంఓఈఎఫ్సీసీ, 07.04.2026 నాటి ఉత్తర్వు ద్వారా సీజీడీ వ్యవస్థ మౌలిక సదుపాయాల స్థాపన, నిర్వహణకు 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేయాలని ఎస్పీసీబీ, పీసీసీలకు అవసరమైన ఆదేశాలను జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.
సీపీసీబీ ఆదేశాల ప్రకారం.. కొన్ని చమురు, గ్యాస్ రవాణా పైప్లైన్లు "గ్రీన్" కేటగిరీ ద్వారా వర్గీకరించారు.
"ఆటోమొబైల్ సర్వీసింగ్, రిపేరింగ్, పెయింటింగ్ అవసరం లేని ఇంధన విక్రయ కేంద్రాలు"ను ఎంఓఈఎఫ్సీసీ ఇప్పటికే "వైట్" కేటగిరీగా వర్గీకరించింది. సంబంధిత చట్టాల ప్రకారం స్థాపన, నిర్వహణకు పొందాల్సిన అనుమతి నుంచి వీటికి మినహాయింపు ఇచ్చింది.
మార్చి 2026 నుంచి ఇప్పటివరకు 4.85 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. కొత్త కనెక్షన్ల కోసం 5.43 లక్షలకు పైగా వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
18.04.2026 నాటికి 39,000 మందికి పైగా పీఎన్జీ వినియోగదారులు ఎంవైపీఎన్జీడీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు వివరాలు, శుద్ధి కార్యకలాపాలు
అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయి.
దేశీయ అవసరాలకు అనుగుణంగా రిఫైనరీల నుంచి గృహవసర ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
దేశీయ మార్కెట్లో పెట్రో కెమికల్ ముడి సరకు లభ్యత పరిశీలనకు అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గాన్ని (జేడబ్ల్యూజీ) ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ 01.04.2026 నాటి ఉత్తర్వు ద్వారా సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ) నిర్ధారించిన కీలక రంగాల కోసం ఆయిల్ రిఫైనరీలు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్లు కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్లను అందుబాటులో ఉంచేందుకు అనుమతించింది.
ఔషధ విభాగం, కెమికల్స్, పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నుంచి అందిన అభ్యర్థనల మేరకు ఔషధ, రసాయన రంగ సంస్థలకు ఎల్పీజీ పూల్ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల సరఫరాకు వీలు కల్పించారు.
ఏప్రిల్ 9, 2026 నుంచి సుమారు 3,700 మెట్రిక్ టన్నుల ప్రొపిలీన్ విక్రయం జరిగింది.
రిటైల్ ఇంధన లభ్యత, ధరలకు సంబంధించిన చర్యలు
దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయ కేంద్రాలు సాధారణంగా పనిచేస్తున్నాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ, వినియోగదారులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసేందుకు భారత ప్రభుత్వ 11.04.2026 గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.55.50కి, ఏటీఎఫ్పై లీటరుకు రూ.42కి పెంచింది.
సాధారణ రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పీఎస్యూ ఓఎంసీల రిటైల్ షాపుల వద్ద ధరల పెంపు లేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, యూటీలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించారు.
18 రాష్ట్రాలు, యూటీల్లో ఎస్కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా.. తమకు అవసరం లేదని హిమాచల్ప్రదేశ్, లద్దాఖ్ తెలిపాయి.
సముద్ర భద్రత, షిప్పింగ్ కార్యకలాపాలు
నావికుల సంక్షేమం, సముద్రయాన కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్రయాన భాగస్వాములతో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాలు:
భారత ముడి చమురు ట్యాంకర్ దేశ్ గరిమ ఏప్రిల్ 18, 2026న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నౌకలో 31 మంది భారత నావికులున్నారు. ఇది ఏప్రిల్ 22, 2026న ముంబైకి చేరుతుందని అంచనా.
గత 24 గంటల్లో హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న సమయంలో వీఎల్సీసీ సమ్నార్ హెరాద్, బల్క్ క్యారియర్ జగ్ అర్నవ్ భారత నౌకల్లో కాల్పులు జరిగినట్లు నివేదిక అందింది. దీంతో అవి పర్షియన్ గల్ఫ్కు తిరిగి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి.
నిన్న విదేశాంగ కార్యదర్శితో సమావేశం కోసం న్యూఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబారిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలిపించింది. హర్మూజ్ జలసంధిలో నిన్న ఉదయం రెండు భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలు, నావికుల భద్రతకు భారత్ ప్రాధాన్యతనిస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి తెలిపారు.
వాణిజ్య నౌకలపై జరిగిన ఈ కాల్పుల ఘటనపై ఆందోళనను తెలియజేస్తూ.. ఇరాన్లోని అధికారులకు భారతదేశ అభిప్రాయాలను తెలియజేయాలని, జలసంధి గుండా భారతదేశానికి వచ్చే నౌకలకు సరైన సౌకర్యాలు కల్పించాలని రాయబారిని విదేశాంగ కార్యదర్శి కోరారు.
భారత నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ అప్డేట్: ఈ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 6,893 ఫోన్ కాల్స్, 14,470కి పైగా ఈ-మెయిళ్లను పరిష్కరించింది. గత 24 గంటల్లో 66 ఫోన్ కాల్స్, 204 ఈ-మెయిల్స్ వచ్చాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఇప్పటివరకు 2,538 మందికి పైగా భారత నావికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో 51 మంది వచ్చారు.
భారతదేశవ్యాప్తంగా ఓడరేవుల్లో కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా రద్దీ ఉన్నట్లు సమాచారం అందలేదు.
ఆ ప్రాంతంలోని భారతీయుల భద్రత
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతాల్లోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రత, రక్షణ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో వెల్లడించిన వివరాలు:
సమాచార మార్పిడి, ప్రయత్నాలను సమన్వయం చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
భారత రాయబార కార్యాలయాలు.,పోస్టులు ఇరవై నాలుగు గంటలూ హెల్ప్లైన్లను నిర్వహిస్తూ, భారత పౌరులకు సహాయం అందిస్తున్నాయి. అవి స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన, ప్రయాణ పరిస్థితులు, దౌత్యపరమైన సేవలు, భారత పౌరులకు మద్దతుగా చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యల తాజా సమాచారంతో క్రమం తప్పకుండా ప్రకటనలను జారీ చేస్తున్నారు.
ఈ ప్రాంతంలోని వివిధ సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన బృందాలు, భారతీయ కంపెనీలు, ఇతర భాగస్వాములతో భారత రాయబార కార్యాలయాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి.
పశ్చిమాసియా ప్రాంత నౌకల్లోని భారతీయ సిబ్బందికి స్థానిక అధికారులు, ఏజెన్సీలతో సమన్వయం చేయటం, దౌత్యపరమైన సహాయం అందించటం, భారతదేశానికి తిరిగి రావాలనే అభ్యర్థనలకు సహాయం చేయడంతో సహా అన్ని రకాల సేవలను రాయబార కార్యాలయాలు అందిస్తున్నాయి.
గగనతలం అందుబాటులో ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి, ఈ ప్రాంతం నుంచి భారతదేశానికి సుమారు 10,97,000 మంది ప్రయాణికులు వచ్చారు.
యూఏఈలోని విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని యూఏఈ, భారత్ మధ్య పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని వాణిజ్య విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రోజు యూఏఈ, భారత్ మధ్య సుమారు 110 విమానాలు నడుస్తాయని అంచనా.
సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారతదేశంలోని పలు నగరాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా అందుబాటులో ఉండటంతో ఖతార్ ఎయిర్వేస్ ఈ రోజు భారతదేశానికి సుమారు 10 నుంచి 11 విమానాలను నడపాలని భావిస్తోంది.
కువైట్ గగనతలం ఇప్పటికీ అందుబాటులో లేదు. కువైట్కు చెందిన జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్, సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారతదేశానికి షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
బహ్రెయిన్ గగనతలం అందుబాటులో ఉంది. బహ్రెయిన్కు చెందిన గల్ఫ్ ఎయిర్ సంస్థ భారతదేశానికి పరిమితంగా విమానాలను నడిపేందుకు ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతోంది.
ఇరాక్ గగనతలం అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి పరిమితంగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ సర్వీసుల ద్వారా భారత్ చేరుకోవచ్చు.
సరకు రవాణా, చార్టర్డ్ విమానాల కోసం ఇరాన్ గగనతలం పాక్షికంగా అందుబాటులో ఉంది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 1,046 మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులతో సహా 2,378 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ మీదుగా భారతదేశానికి పంపే ఏర్పాట్లు చేసింది.
ఇజ్రాయెల్ గగనతలం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు పరిమితంగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసుల ద్వారా భారత్కు చేరుకోవచ్చు. జోర్డాన్, ఈజిప్ట్ మీదుగా భారత పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2253622)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam