పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
· ప్రస్తుతం అంతరాయాలు కొనసాగుతున్నందున వైమానిక రంగం స్థిరత్వాన్ని కాపాడటానికి బహుళ-స్థాయి విధానాన్ని అనుసరిస్తోన్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
· నిర్వహణా సవాళ్లున్నప్పటికీ ఏటీఎఫ్ ధరల విషయంలో సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల స్థిరంగా ఉన్న దేశీయ విమాన ప్రయాణ ధరలు
· నిర్వహణాపరమైన సడలింపులు, సమన్వయ ప్రయత్నాల ద్వారా సుదీర్ఘ మార్గాలు, సిబ్బంది కొరతను సమర్థవంతంగా నిర్వహించే విషయంలో విమానయాన సంస్థలకు లభిస్తోన్న మద్దతు
· సాధారణంగానే కొనసాగుతున్న గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ
· గత నాలుగు రోజుల్లో 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లపై సుమారు 1300 అవగాహన సదస్సులను నిర్వహించిన పీఎస్యూ ఓఎంసీలు
· నిన్న ఒక్కరోజే విక్రయమైన 1.06 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్లు
· వలస కార్మికుల కోసం ఉద్దేశించిన 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల రోజువారీ కోటాను గతంలో ఉన్న 20 శాతం పరిమితి కంటే రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం
· 2026 మార్చి నుంచి సుమారు 3.76 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు ప్రారంభమైన గ్యాస్ సరఫరా… కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న దాదాపు 4.1 లక్షల మంది వినియోగదారులు
· గత 24 గంటల్లో స్వదేశానికి చేరుకున్న 92 మంది భారతీయ నావికులు
· దీనితో ఇప్పటివరకు వచ్చిన మొత్తం 1,691 మందికి పైగా భారతీయ నావికులు
· దేశవ్యాప్తంగా రద్దీ లేకుండా యథావిధిగా కొనసాగుతున్న ఓడరేవుల కార్యకలాపాలు
· ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి భారత్కు చేరుకున్న 7,60,000 మంది ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 5:41PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై నిర్వహిస్తోన్న మీడియా సమావేశాలకు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయా మీడియా కేంద్రంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ ఇందులో పాల్గొన్నారు. ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతున్న సహాయంతో పాటు వివిధ రంగాల్లో స్థిరత్వం ఉండేలా చూసుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై వారు తాజా సమాచారాన్ని తెలియజేశారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా విమానయాన రంగానికి సంబంధించిన సమాచారాన్ని అందించింది.
వైమానిక రంగ సమాచారం
విమాన సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చూడటం, ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేయడం, విమానయాన సంస్థలు- సంబంధిత అధికారులతో సమన్వయాన్ని కొనసాగించడం వంటి అంశాల విషయంలో తీసుకుంటున్న చర్యలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రధానంగా పేర్కొంది. మంత్రిత్వ శాఖ ఈ కింది విషయాలను తెలియజేసింది:
· ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభమైన పశ్చిమాసియా సంఘర్షణ కారణంగా భారతీయ విమానయాన రంగం ప్రస్తుతం తీవ్రమైన నిర్వహణ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రయాణికుల భద్రతతో పాటు సౌకర్యాన్ని నిర్ధారిస్తూనే విమానయాన పరిశ్రమను స్థిరంగా ఉంచేందుకు బహుళ-స్థాయి కార్యాచరణను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అమలు చేసింది.
· పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా మారుతున్న పరిస్థితులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ సహా పలు దేశాలు తమ వైమానిక మార్గాలను మూసివేయడం లేదా తీవ్రమైన ఆంక్షలు విధించడం వల్ల ప్రపంచ విమానయాన నెట్వర్క్లు, అంతర్జాతీయ అనుసంధానతలో ఎన్నడూ లేని విధంగా అంతరాయం ఏర్పడింది.
· ఇంతటి సవాళ్లు, పరిమిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారతీయ విమానయాన సంస్థలు ఈ ప్రాంతం నుంచి సేవలను కొనసాగించడంలో అసాధారణమైన దృఢత్వం ప్రదర్శించటంతో పాటు నిర్వహణ సామర్థ్యాన్ని నిరూపించాయి. ఇది మన విమానయాన రంగానికి ఉన్న పటిష్ఠత, వేగంగా స్పందించే గుణాన్ని తెలియజేస్తోంది.
· వైమానిక మార్గాలపై ఉన్న ఆంక్షల కారణంగా భారతీయ విమానయాన సంస్థలు ఐరోపా, ఉత్తర అమెరికాకు వెళ్లే విమానాలను సుదీర్ఘ మార్గాల్లో నడపాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరిగింది.
· విమానయాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు: విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులో సుమారు 40 శాతం వరకు ఉండే విమానయాన ఇంధన ధరల విషయంలో ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకుంది. దీనివల్ల దేశీయ విమాన ప్రయాణ ధరలు స్థిరంగా ఉన్నాయి.
· అంతేకాకుండా విమానయాన పరిశ్రమకు మద్దతుగా నిలిచేందుకు ఇతర ముఖ్యమైన చర్యల విషయంలో మంత్రిత్వ శాఖ సంబంధిత భాగస్వాములతో కలిసి చురుగ్గా పనిచేస్తోంది.
· నిర్వహణాపరమైన సడలింపులను కూడా పొడిగించారు. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణ మార్గాల వల్ల కలిగే ఒత్తిడిని అధిగమించడానికి పైలట్ల విమాన విధులకు సంబంధించిన సమయ పరిమితులను డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తాత్కాలికంగా సడలించింది. దీనివల్ల సిబ్బంది కొరత ఏర్పడకుండా నివారించడం సాధ్యమైంది.
· ముఖ్యమైన సరఫరా గొలుసులను కాపాడటానికి ఎమిరేట్స్, కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ వంటి విదేశీ విమానయాన సంస్థలకు ప్రయాణికుల విమానాలను పూర్తిగా సరకు రవాణా సేవల కోసం ఉపయోగించుకునేలా ప్రత్యేక అనుమతులు ముంజారు చేశారు. దీనివల్ల ప్రస్తుతం అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ అత్యవసర వస్తువుల రవాణా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతోంది.
· పరిస్థితులు నిరంతరం మారుతున్నప్పటికీ ప్రయాణికుల భద్రత- సౌకర్యాన్ని నిర్ధారించడానికి, సరకు రవాణా అంతరాయం లేకుండా సాగేలా చూడటానికి, మొత్తం విమానయాన రంగం స్థిరంగా ఉండేలా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కాలంలో సమర్థవంతమైన, సమతుల్యమైన, వేగవంతమైన విధానాన్ని అనుసరించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని భాగస్వామ్య పక్షాలతో నిరంతరం, సన్నిహితంగా సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోంది.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి వద్ద చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విషయంలో భయాందోళనతో ముందస్తుగా కొనుగోళ్లు చేయొద్దని.. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించారు.
· ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని.. డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.
· పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించారు.
· ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తీసుకుంటున్న సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహావసరాల ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాకు.. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.
· సరఫరా, డిమాండ్ రెండింటి పరంగా ప్రభుత్వం ఇప్పటికే పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. చమురు శుద్ధి కేంద్రాల నుంచి ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ మధ్య విరామ సమయాన్ని పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఇందులో ఉన్నాయి.
· ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
· చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేయడానికి రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ సంస్థలను ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారుల విషయంలో కొత్త పీఎన్జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావసరాల చట్టం- 1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
o ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
o సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
o జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
o సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o పీఎన్జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o ఎల్పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
· అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
· ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· ఎల్పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా అమలు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4300కి పైగా దాడులు నిర్వహించి 1200కి పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు (పీఎస్యూ ఓఎంసీ) ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా 1700కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన 168 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్లపై జరిమానాలు విధించాయి.. 45 డిస్ట్రిబ్యూటర్షిప్లను సస్పెండ్ చేశాయి.
ఎల్పీజీ సరఫరా స్థితిగతులు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
· పరిశ్రమ అంతటా ఆన్లైన్ ఎల్పీజీ బుకింగ్లు సుమారు 96 శాతానికి పెరిగాయి.
· సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 90 శాతానికి పెంచారు.
· గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
· కేంద్ర ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ప్రకారం దేశంలోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్లతో సహా చమురు శుద్ధి కంపెనీలు కొన్ని కీలక రంగాలకు కనీస పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్లను అందుబాటులో ఉంచేలా అనుమతినిచ్చింది. ఫార్మాస్యూటికల్స్ శాఖ, ఆహార - ప్రజా పంపిణీ శాఖ, రసాయనాలు- పెట్రో కెమికల్స్ శాఖ వంటి విభాగాలకు సీహెచ్టీ (సెంటర్ ఫర్ హై టెక్నాలజీ) నిర్ణయించిన పరిమాణం, చమురు శుద్ధి వనరుల ఆధారంగా ఈ సరఫరా జరుగుతుంది.
· 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపును కలుపుకొని మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలలో సుమారు 70 శాతానికి పెంచారు.
· వలస కార్మికులకు పంపిణీ చేయడానికి ప్రతి రాష్ట్రంలో అందుబాటులో ఉండే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు 06.04.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. 2026 మార్చి 2-3 తేదీలలో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు రోజువారీ పరిమాణం ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితికి ఇది అదనం. ఈ 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. వీటిని ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో చమురు విక్రయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తాయి.
· 2026 మార్చి 23 నుంచి ఇప్పటి వరకు సుమారు 7.8 లక్షల 5-కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· గత 4 రోజుల్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల విషయంలో సుమారు 1300 అవగాహన సదస్సులను నిర్వహించాయి. ఈ సదస్సుల ద్వారా 10,000 కంటే ఎక్కువ 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· 2026 ఫిబ్రవరి నెలలో రోజువారీ సగటు విక్రయాలు 77,000 గా ఉండగా… 06.04.2026న దేశవ్యాప్తంగా 1.06 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· వాణిజ్య ఎల్పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
· 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు సుమారు 86,439 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వాణిజ్య ఎల్పీజీ (ఇది 45.5 లక్షల కంటే ఎక్కువ 19-కేజీల సిలిండర్లకు సమానం) విక్రయమైంది. నిన్న ఒక్కరోజే 6530 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్పీజీ (ఇది 3.4 లక్షల కంటే ఎక్కువ 19-కేజీల సిలిండర్లకు సమానం) విక్రయమైంది.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
· గృహాలకు పీఎన్జీ, సీఎన్జీ రవాణాకు 100 శాతం సరఫరా సహా, ప్రాధాన్య రంగాలకు రక్షిత సరఫరాలు కొనసాగుతున్నాయి.
· 6 ఏప్రిల్ 2026 నుంచి ఎరువుల కర్మాగారాలకు మొత్తం కేటాయింపును వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 90 శాతానికి పెంచిన తరువాత, ప్రస్తుతం పనిచేస్తున్న యూరియా కర్మాగారాలకు గ్యాస్ సరఫరా... వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 80 శాతంగా ఉంది.
· 06.04.2026 నుంచి అమలులోకి వచ్చేలా, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను మరో 10 శాతం వరకు పెంచారు.
· హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలు పీఎన్జీ కనెక్షన్లకు ప్రాధాన్యమిచ్చేలా ప్రోత్సహించాలని సీజీడీ సంస్థలకు సూచించారు.
· ఐజీఎల్, ఎమ్జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్వర్క్ల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
· ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయమందించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును భారత ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
· పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుబంధంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను పొందుతున్నాయి.
· పైప్లైన్లు అందుబాటులో ఉన్నచోట గల పాఠశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్లు, అంగన్వాడీ కిచెన్ల వంటి సంస్థలను ఐదు రోజుల్లోగా పీఎన్జీతో అనుసంధానించాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది.
· దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిశీలించడానికి, సీజీడీ మౌలిక సదుపాయాల కోసం మూడు నెలల పాటు త్వరిత ఆమోద విధానాన్ని రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అనుసరిస్తోంది.
· నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వులు-2026ను భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్లైన్లను వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తాయి. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాల దిశగా పరివర్తనకు మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
· రక్షణ శాఖకు చెందిన నివాస ప్రాంతాల్లో పీఎన్జీ మౌలిక సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయడం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ 30 జూన్ 2026 వరకు ఒక స్వల్పకాలిక విధాన సవరణను జారీ చేసింది.
· పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి జాతీయ పీఎన్జీ డ్రైవ్ 2.0ను పీఎన్జీఆర్బీ 30 జూన్ 2026 వరకు పొడిగించింది.
· పరిశుభ్రమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం ఒక నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం... సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను నిర్మించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళిక. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపులకు తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.
· మార్చి 2026 నుంచి సుమారు 3.76 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాసిఫికేషన్ పూర్తయింది. దాదాపు 4.1 లక్షల అదనపు వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
· MYPNGD.in వెబ్సైట్ ద్వారా 16,500 మందికి పైగా పీఎన్జీ వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు
ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తుండగా... పెట్రోల్, డీజిల్ నిల్వలూ తగినంతగా ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల చర్యలు
· దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాలు యధావిధిగా పనిచేస్తున్నాయి.
· మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసింది. వినియోగదారులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
· దేశీయంగా తగినంత లభ్యతను నిర్ధారించడం కోసం డీజిల్పై లీటరుకు రూ. 21.5, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కోసం లీటరుకు రూ. 29.5 చొప్పున ఎగుమతి సుంకాన్ని విధించారు.
· రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా యథాతథంగా ఉన్నాయి.
· వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం పౌరులకు సూచించింది. పత్రికా సమావేశాల ద్వారా కచ్చితమైన సమాచారాన్ని ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయించారు.
· భారత ప్రభుత్వం 29.03.2026 తేదీ నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా... పీడీఎస్ సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం వంట, దీపాలు వెలిగించే ప్రయోజనం కోసం ఎస్కేవో పంపిణీని సులభతరం చేసింది –
· ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ సంస్థల ఓఎమ్సీ సర్వీస్ స్టేషన్లు (ప్రాధాన్యంగా కంపెనీ యాజమాన్యంలోనివి లేదా కంపెనీ నిర్వహించేవి) 5,000 లీటర్ల వరకు పీడీఎస్ ఎస్కేవోను నిల్వ చేయడానికి అనుమతిస్తున్నారు.
· ఈ పీఎస్యూ ఓఎమ్సీ సర్వీస్ స్టేషన్లను ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలన విభాగం నియమిస్తుంది.
· 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా... హిమాచల్ ప్రదేశ్, లదాఖ్లు దీని అవసరం లేదని తెలిపాయి.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
· పర్షియన్ గల్ఫ్లోని ప్రస్తుత సముద్ర పరిస్థితితో పాటు... భారతీయ నౌకలు, సిబ్బందిని కాపాడటానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. కింది విషయాలు తెలియజేశారు:
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన నమోదు కాలేదు.
· ప్రస్తుతం, 433 మంది భారతీయ నావికులతో కూడిన 16 భారత జెండా నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్ల సమన్వయంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తూనే ఉంది. యాక్టివేషన్ అయినప్పటి నుంచి 5,342 కాల్లు, 11,053 ఈమెయిళ్లను ఇది నిర్వహించింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన 229 కాల్లు, 406 ఈమెయిళ్లు భాగంగా ఉన్నాయి.
· డీజీ షిప్పింగ్ ఇప్పటివరకు 1,691 మంది భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో సహాయపడింది. వీరిలో గత 24 గంటల్లో గల్ఫ్ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, వివిధ ప్రాంతీయ ప్రదేశాల నుంచి 92 మంది భారత్కు సురక్షితంగా తిరిగి వచ్చారు.
· దేశవ్యాప్తంగా నౌకాశ్రయ కార్యకలాపాలు ఎటువంటి రద్దీ లేకుండా సాధారణంగా కొనసాగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల మారిటైమ్ బోర్డులు కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ధ్రువీకరించాయి.
· భారతీయ నావికుల సంక్షేమాన్ని, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ మిషన్లు, సముద్ర రంగ భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
· భారత మిషన్ల ద్వారా అందిస్తున్న సహాయం సహా ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలను బ్రీఫింగ్ సందర్భంగా పంచుకున్నారు. కింది విషయాలు తెలియజేశారు:
· భారతీయ పౌరుల భద్రత, క్షేమం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తోంది.
· సూచనల ప్రచారం కోసం... భారత మిషన్లు, కాన్సులేట్లతో సమన్వయం కోసం... మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సన్నిహిత సమన్వయం కొనసాగుతోంది.
· భారత పౌరులకు సహాయం చేయడానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఈ ప్రాంతంలోని మిషన్లు, పోస్టులతో సమన్వయంతో పనిచేస్తూనే ఉంది.
· మిషన్లు, పోస్టులు 24×7 హెల్ప్లైన్లను నిర్వహిస్తూ... ఈమెయిళ్లు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సందేహాలకు స్పందిస్తున్నాయి. వారు భద్రత, స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన, ప్రయాణ స్థితి, కాన్సులర్ సేవలపై తాజా సమాచారంతో కూడిన సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.
· భారత రాయబారులు వారి సమస్యలను పరిష్కరించడానికి భారతీయ సామాజిక సంఘాలు, వృత్తిపరమైన నిపుణుల బృందాలు, భారతీయ కంపెనీలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నారు. రాయబార కార్యాలయాలు వీసాలను సులభతరం చేస్తున్నాయి. గగనతల ఆంక్షలు ఉన్న చోట, పొరుగు దేశాల గుండా ప్రయాణానికి వీలు కల్పిస్తున్నాయి. అవసరమైన మేరకు లాజిస్టికల్ సహాయాన్నీ అందిస్తున్నాయి.
· గల్ఫ్ దేశాల్లోని భారతీయ విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వారి విద్యా సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, విద్యా బోర్డులు, జాతీయ పరీక్షా సంస్థతో మిషన్లు సమన్వయం కొనసాగిస్తున్నాయి.
· స్థానిక అధికారులతో సమన్వయం, కాన్సులర్ సహాయం, భారత్కు తిరిగి రావడం గురించిన అభ్యర్థనలను సులభతరం చేయడం సహా... ఈ ప్రాంతంలోని భారతీయ నావికులకూ మిషన్లు మద్దతునందిస్తున్నాయి.
· ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 7,60,000 మంది ప్రయాణికులు భారత్కు వచ్చారు.
· యూఏఈలోని విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడపడం కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు సుమారు 90 విమానాలు భారత్కు నడుస్తాయని అంచనా.
· సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. ఈ రోజు ఖతార్ ఎయిర్వేస్ సుమారు 8–10 విమానాలను భారత్కు నడపనుంది.
· కువైట్ గగనతలం మూసి ఉంది. సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ సంస్థలు షెడ్యూల్ చేయని విమానాలను భారత్కు నడుపుతున్నాయి.
· బహ్రెయిన్ గగనతలం మూసి ఉంది. సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ ఎయిర్ షెడ్యూల్ లేని విమానాలను భారత్కు నడుపుతోంది.
· టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం... 935 మంది భారతీయ విద్యార్థులు, 472 మంది భారతీయ మత్స్యకారులు సహా మొత్తం 1,862 మంది భారతీయ పౌరులు ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ల మీదుగా భారత్ తిరిగి వెళ్లేందుకు రవాణాను సులభతరం చేసింది.
· విమాన ప్రయాణ ఆంక్షలు, గగనతల మూసివేత కారణంగా... భారత పౌరుల ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ రవాణా మార్గాల ద్వారా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి:
· ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా.
· ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా.
· కువైట్, బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా.
***
(రిలీజ్ ఐడి: 2249899)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam