|
భారత ఎన్నికల సంఘం
సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు 2026: ఈసీఐఎన్ఈటీ వేదిక ద్వారా అభ్యర్థి విద్యార్హతలు, నేర చరిత్ర వివరాలపై స్పష్టత
నాడు పోస్టు చేయడమైనది:
04 APR 2026 1:53PM by PIB Hyderabad
-
అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ శాసనసభలకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ను.. గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపురలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసింది.
-
అస్సాం, కేరళ శాసనసభలు, యూటీ అయిన పుదుచ్చేరితో పాటు మరో 4 రాష్ట్రాల్లో ఏప్రిల్ 9, 2026న జరగనున్న ఉప ఎన్నికల బరిలో మొత్తం 1,955 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
-
పశ్చిమబెంగాల్ (ఫేజ్- I, II), తమిళనాడు శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్ (ఫేజ్-I)లో అభ్యర్థుల దరఖాస్తుల ఉపసంహరణకు ఏప్రిల్ 9వ తేదీ, పశ్చిమబెంగాల్ (ఫేజ్-II)లో ఏప్రిల్ 13వ తేదీ చివరి గడువు.
-
అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వంటి వివరాలను తెలుసుకునేందుకు పౌరులు ఈసీఐనెట్లోని "మీ అభ్యర్థిని తెలుసుకోండి (కేవైసీ)” మాడ్యూల్ను ఉపయోగించుకోవచ్చు.
-
వినియోగదారులు ఈసీఐనెట్లోని "కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్" ట్యాబ్ కిందనున్న కేవైసీ (మీ అభ్యర్థిని తెలుసుకోండి) మాడ్యూల్ను యాక్సెస్ చేయవచ్చు. అభ్యర్థులు సమర్పించిన పూర్తి అఫిడవిట్ (ఫామ్ 26)ను కూడా ఈసీఐనెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
-
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల సేవల వేదిక ఈసీఐనెట్, భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన 40కి పైగా యాప్లు, పోర్టళ్లను అనుసంధానించడం ద్వారా అన్ని ఎన్నికల సేవలను ఒకేచోట అత్యంత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
-
ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో పేరు వెతకటం, దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకోవటం, ఎన్నికల అధికారులతో సంప్రదింపులు, బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవటం, ఈ-ఎపిక్ డౌన్లోడ్, పోలింగ్ సరళి, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలను సురక్షితమైన వేదిక ద్వారా ఈసీఐనెట్ ఓటర్లకు అందిస్తుంది.
-
ఇది తాజా సమాచారాన్ని పొందటానికి, ఫిర్యాదుల పరిష్కారానికి ఒకేచోట అన్ని సదుపాయాలు లభించే వేదికను అందిస్తుంది. ఇందులో ఎన్నికల ఉల్లంఘనలను నివేదించటానికి సీవిజిల్, దివ్యాంగులకు సులభంగా ఎన్నికల సేవలు అందేలా చూసేందుకు సక్షమ్ వంటి సాధనాలూ ఉన్నాయి.
****
(రిలీజ్ ఐడి: 2248948)
|