పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో కీలక రంగాల తాజా సమాచారం
· దేశంలోని అన్ని పెట్రోల్ పంపులలో తగినంత పెట్రోల్.. డీజిల్ నిల్వలు
· వదంతులు నమ్మవద్దని ప్రజలకు ప్రభుత్వ సూచన
· యూరియా ప్లాంట్ల గత 6 నెలల సగటు వినియోగంలో 70–75 శాతం వరకూ స్థిరంగా సరఫరా.. ‘ఎల్ఎన్జీ.. ఆర్ఎల్ఎన్జీ’ల అదనపు కొనుగోళ్లతో కొనసాగింపు
· గృహ.. వాణిజ్య.. హాస్టల్.. మెస్.. క్యాంటీన్ విభాగాలకు ఈ నెలలో 2.9 లక్షలకు పైగా కనెక్షన్ల దాకా గ్యాస్ సరఫరా
· సుమారు 94,000 టన్నుల తాజా సరకుతో సురక్షితంగా భారత్ తీరం సమీపించిన రెండు ‘ఎల్పీజీ' నౌకలు
· దేశవ్యాప్తంగా రేవుల్లో ఎటువంటి రద్దీ లేకుండా సాధారణ స్థితిలో కొనసాగుతున్న కార్యకలాపాలు
· గల్ఫ్.. పశ్చిమాసియా ప్రాంతాల్లో పరిస్థితులపై ప్రభుత్వ నిశిత పర్యవేక్షణ.. ప్రవాస భారతీయుల భద్రత-సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం
· వీసా.. దౌత్య.. రవాణాల పరంగా మద్దతుతో నావికులు.. విద్యార్థులు సహా భారత పౌరులకు దౌత్య కార్యాలయాల చేయూత
నాడు పోస్టు చేయడమైనది:
29 MAR 2026 3:10PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో అనూహ్యంగా మారిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో కీలక రంగాల్లో స్థిరత్వానికి భరోసా ఇస్తూ కేంద్ర ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణతో సన్నద్ధత సహా ప్రతిస్పందనాత్మక చర్యలు చేపడుతోంది. నిరంతరాయ ఇంధన సరఫరా, సముద్ర కార్యకలాపాల నిశిత పరిశీలన, పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లోని భారత పౌరులకు అవసరమైన సహాయంపైనా దృష్టి కేంద్రీకరించింది. ఆయా రంగాల్లో ఈ నెల 29 వరకూ తీసుకున్న చర్యలపై తాజా సమాచారం కిందివిధంగా ఉంది:
విద్యుత్ సరఫరా.. ఇంధన లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత దృష్ట్యా దేశవ్యాప్తంగా ‘ఎల్పీజీ’ సహా పెట్రోలియం ఉత్పత్తుల నిరంతరాయ సరఫరా దిశగా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది:
ముడిచమురు.. శుద్ధి కర్మాగారాలు
· దేశంలో ముడిచమురు నిల్వలు తగినంతగా ఉండటంతోపాటు చమురుశుద్ధి కర్మాగారాలన్నీ అదనపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తదనుగుణంగా దేశమంతటా పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంతగా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది.
· జాతీయ వినియోగానికి కొరత లేకుండా శుద్ధి కర్మాగారాలలో దేశీయంగానే ‘ఎల్పీజి’ ఉత్పత్తిని పెంచింది.
చిల్లర విక్రయ కేంద్రాలు
· దేశవ్యాప్తంగా అన్ని చిల్లర విక్రయ కేంద్రాలు సాధారణ స్థితిలోనే పనిచేస్తున్నాయి.
· పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు ₹10 వంతున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.
· అలాగే, దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల లభ్యతకు భరోసా ఇస్తూ డీజిల్పై లీటరుకు ₹21.50, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు ₹29.50 వంతున ప్రభుత్వం ఎగుమతి సుంకం విధించింది.
· దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన లభ్యతపై భయాందోళనతో కొనుగోళ్లు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో వదంతుల ఫలితంగా కొన్ని చిల్లర విక్రయ కేంద్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో విపరీతమైన రద్దీతోపాటు అసాధారణ.. అధిక అమ్మకాలు సాగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, దేశంలోని అన్ని పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా లభ్యమవుతున్నాయిన ప్రభుత్వం స్పష్టం చేసింది.
· ఈ నేపథ్యంలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం మరోసారి ప్రజలకు సూచించింది.
సహజ వాయువు
· ‘డీ-పీఎన్జీ’, ‘సీఎన్జీ’ రవాణాలో 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యం.
· గ్రిడ్ అనుసంధానిత పారిశ్రామిక-వాణిజ్య వినియోగదారులకు వారి సగటు వినియోగంలో 80 శాతం సరఫరా అవుతోంది.
· వాణిజ్య ‘ఎల్పీజీ’ లభ్యతపై ఆందోళన పరిష్కారం దిశగా ‘పీఎన్జీ’ కనెక్షన్లు ఇవ్వడంలో తమ పరిధిలోని అన్ని భౌగోళిక ప్రాంతాల్లోగల రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్’ (సీజీడీ) సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.
· యూరియా కర్మాగారాలకు గత 6 నెలల సగటు వినియోగంలో సుమారు 70-75 శాతం మేర ప్రస్తుతం సరఫరా స్థిరంగా ఉంది. దీంతోపాటు సరఫరా, పైప్లైన్ హైడ్రాలిక్స్ ప్రక్రియల నిర్వహణ కోసం అదనంగా ‘ఎల్ఎన్జీ’, ‘రీగ్యాసిఫైడ్ ఎల్ఎన్జీ’ (ఆర్ఎల్ఎన్జీ) కూడా అందుతుంది.
· ఎరువుల కర్మాగారాలు సహా పారిశ్రామిక వినియోగదారులందరూ తమ అదనపు అవసరాన్ని తక్షణ ప్రాతిపదికన తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. తద్వారా గ్యాస్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా దాన్ని సమకూరుస్తారని తెలిపింది.
· ఈ నేపథ్యంలో గృహ, వాణిజ్య ‘పీఎన్జీ’ కనెక్షన్లు తీసుకునే వారికి ‘ఐజీఎల్’, ‘ఎంజీఎల్’, ‘జీఎఐఎల్’ గ్యాస్, ‘బీపీసీఎల్’ వంటి ‘సీజీడీ’ కంపెనీలు ప్రోత్సాహకాలిచ్చాయి.
· ‘సీజీడీ’ నెట్వర్క్ విస్తరణ దిశగా దరఖాస్తుల ఆమోదం ప్రక్రియను వేగిరపరచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతోపాటు తన మంత్రిత్వ శాఖలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
· ‘ఎల్పీజీ’ దీర్ఘకాలికంగా ‘పీఎన్జీ’ వినియోగానికి మళ్లడంలో రాష్ట్రాలు తోడ్పాటునిస్తే అదనంగా 10 శాతం మేర వాణిజ్య ‘ఎల్పీజీ’ కేటాయింపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి ఆదేశం ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెసులుబాటు కల్పించింది. అలాగే, ‘సీజీడీ’ నెట్వర్క్ విస్తరణను ప్రోత్సహించే సంస్కరణల దిశగా చర్యలు చేపట్టిన వివిధ రాష్ట్రాల నుంచి ‘పీఎన్జీ’ మంత్రిత్వశాఖ దరఖాస్తులు స్వీకరించింది. దీనికి అనుగుణంగా కొన్ని రాష్ట్రాలకు అదనపు కేటాయింపులుపై సిఫారసు చేసింది.
· మరోవైపు సమీపంలో పైప్లైన్ మౌలిక సదుపాయాలు ఉన్నచోట ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, సామాజిక వంటశాలలు, అంగన్వాడీ వంటశాలలు తదితరాలను 5 రోజుల్లోగా ‘పీఎన్జీ’తో అనుసంధానించేలా ‘సీజీడీ’ సంస్థలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ‘పీఎన్జీఆర్బీ' 23.03.2026 నాటి ఉత్తర్వు ద్వారా ఆదేశించింది.
· అలాగే, “తగ్గించిన కాలవ్యవధితో ‘సీజీడీ’ మౌలిక సదుపాయాల కల్పన దిశగా సత్వర ఆమోద చట్రాన్ని” 3 నెలల పాటు ఒక ప్రత్యేక ప్రక్రియగా చేపట్టినట్లు రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.2026 నాటి ఉత్తర్వులో తెలిపింది. దీని ప్రకారం ‘సీజీడీ’ మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత దరఖాస్తులను ప్రాధాన్యం ప్రాతిపదికన పరిశీలిస్తారు.
· నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు తదితర సౌకర్యాల కల్పన, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ) ఉత్తర్వు-2026ను కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం, 24.03.2026 నాటి గెజిట్ ప్రకటన ద్వారా జారీచేసింది. తద్వారా దేశవ్యాప్తంగా పైప్లైన్ల నిర్మాణం, విస్తరణకు ఓ క్రమబద్ధ, వ్యవధి నిర్దేశిత చట్రం అమలవుతుంది. ఆయా పనులకు ఆమోదం-అనుమతులు సహా భూ సేకరణలో జాప్యాల నివారణ సహా నివాస ప్రాంతాలతోపాటు సహజ వాయువు మౌలిక సదుపాయాల సత్వర నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. దీనివల్ల ‘పీఎన్జీ' నెట్వర్క్ విస్తరణ వేగిరం కావడమేగాక చివరి అంచె సంధానం మెరుగుపడి, కాలుష్య రహిత ఇంధన వినియోగం వైపు మళ్లే వెసులుబాటు కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇంధన భద్రత బలోపేతమై భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో సాగుతుందని ఆశాభావంతో ఉంది.
· రక్షణ మంత్రిత్వశాఖ 27.03.2026న జారీచేసిన ఒక ఉత్తర్వులో- అన్ని నివాస ప్రాంతాలు, రక్షణ యూనిట్ లైన్లలో ‘పీఎన్జీ’ మౌలిక సదుపాయాల కల్పనను వేగిరపరచే దిశగా 2026 జూన్ 30 దాకా అమలయ్యే స్వల్పకాలిక విధాన సవరణను ప్రకటించింది.
· ఈ నెలలో గృహ, వాణిజ్య, హాస్టల్, మెస్, క్యాంటీన్ తదితరాలు సహా 2.9 లక్షలకు పైగా కనెక్షన్లకు గ్యాస్ సరఫరా కొనసాగుతోంది.
ఎల్పీజీ
గృహాలకు వంటగ్యాస్ సరఫరా:
· ‘ఎల్పీజీ’ పంపిణీ కేంద్రాల నుంచి సరఫరా నిలిచిపోయినట్లు ఎలాంటి సమాచారం లేదు.
· పరిశ్రమల ప్రాతిపదికన ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిన్న 94 శాతానికి పెరిగింది.
· పంపిణీదారుల స్థాయిలో వంటగ్యాస్ దారి మళ్లింపు నివారణ నేపథ్యంలో సరఫరా నిర్ధారణ సంకేత (డీఏసీ) ఆధారిత గ్యాస్ సరఫరా 53 శాతం (2026 ఫిబ్రవరి) నుంచి నిన్న 84 శాతానికి పెరిగింది.
· తదనుగుణంగా నిన్న 55 లక్షలకు పైగా ఎల్పీజీ సిలిండర్లు సరఫరా అయ్యాయి.
· గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణ స్థితిలో స్థిరంగా ఉంది.
వాణిజ్య వంటగ్యాస్ సరఫరా:
· వాణిజ్య వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాక్షిక (20 శాతం) వాణిజ్య ‘ఎల్పీజీ’ సరఫరాను పునరుద్ధరించింది. అలాగే, ‘పీఎన్జీ’ విస్తరణ కోసం వ్యాపార సౌలభ్య సంస్కరణల ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య వంటగ్యాస్ కేటాయిస్తామని 18.03.2026 నాటి ఆదేశాల ద్వారా ప్రకటించింది.
· దీంతోపాటు 21.03.2026 నాటి ఆదేశాల ద్వారా రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య ‘ఎల్పీజీ’ కేటాయింపును అనుమతించింది. దీంతో మొత్తం కేటాయింపు (‘పీఎన్జీ’ విస్తరణ కోసం వాణిజ్య సౌలభ్య సంస్కరణల ఆధారంగా 10 శాతం సహా) 50 శాతానికి చేరుతుంది. ఈ 20 శాతం అదనపు కేటాయింపును రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార తయారీ, పాడి పరిశ్రమ సహా రాష్ట్ర ప్రభుత్వ లేదా స్థానిక సంస్థలు నిర్వహించే రాయితీ క్యాంటీన్లు, విక్రయ కేంద్రాలు, సామాజిక వంటశాలలు, వలస కార్మికులకు 5 కిలోల ‘ఎఫ్టీఎల్’ వంటి వాటి సరఫరాకు ప్రాధాన్యం ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
· కేంద్ర ప్రభుత్వం 27.03.2026న జారీచేసిన ఆదేశాల ప్రకారం- వాణిజ్య వంటగ్యాస్ కోసం అదనంగా 20 శాతం కేటాయించాలని (దీనివల్ల సంస్కరణల ఆధారిత 10 శాతంతో కలిపి మొత్తం వాణిజ్య కేటాయింపు సంక్షోభానికి ముందు స్థాయిలోని 70 శాతానికి చేరుతుంది) నిర్ణయించింది. ఈ అదనపు 20 శాతాన్ని ఉక్కు, ఆటోమొబైల్, వస్త్ర, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్స్ పరిశ్రమలకు ప్రాధాన్యం ప్రాతిపదికన సరఫరా చేస్తుంది. ఇందులో తయారీ పరిశ్రమలకు లేదా సహజ వాయువుకు ప్రత్యామ్నాయం లేని ప్రత్యేక తాప ప్రయోజనాల నిమిత్తం ‘ఎల్జీజీ’ అవసరమయ్యే పరిశ్రమలకు ప్రాధాన్యం ఉంటుంది.
· దేశవ్యాప్తంగా నిన్న 5 కిలోల సిలిండర్లు సుమారు 64,000 అమ్ముడయ్యాయి.
· కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గృహేతర ‘ఎల్పీజీ’ కేటాయింపు దిశగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తర్వులు జారీ చేశాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తంమీద 2026 మార్చి 14 నుంచి వాణిజ్య సంస్థల ద్వారా 39368 టన్నుల గ్యాస్ను తరలించారు.
కిరోసిన్
· అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధారణ కేటాయింపులతోపాటు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్ను కేటాయించాం.
· కిరోసిన్ పంపిణీ చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరాం.
· ఇప్పటికే 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లడఖ్ తమ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర
· అత్యవర వస్తువుల చట్టం 1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు 2000 ప్రకారం అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేసే వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పెట్రోలు, డీజిలు, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్ర,కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెల్లడించింది.
· అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శులను ఈ కింది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
· రాష్ట్ర,జిల్లా స్థాయిలో ప్రతిరోజూ పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయాలి.
· ప్రత్యేకమైన కంట్రోలు రూములు,హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలి.
· సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని తప్పనిసరిగా పర్యవేక్షించి, వాటిని తిప్పికొట్టాలి.
· జిల్లా యంత్రాంగాల ద్వారా రోజువారీ నిఘాను ముమ్మరం చేయాలి. చమురు మార్కెటింగ్ సంస్థల సమన్వయంతో దాడులు, తనిఖీలను కొనసాగించాలి.
· తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
· రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
· రోడ్వే, రోడ్ అవుట్ అనుమతులు, 24x7 పని అనుమతులు మొదలైనవాటిని వేగవంతం చేయడంతో సహా సీజీడీ విస్తరణను వేగవంతం చేయాలి.
· పీఎన్జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలి.
· పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖతో సమన్వయం కోసం సీనియర్ నోడల్ అధికారలను నామినేట్ చేయాలి.
· సరైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, వదంతులను అరికట్టడానికి ప్రతిరోజూ విలేకరుల సమావేశాలు నిర్వహించాలని, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎప్పటికప్పుడూ సమాచారం అందించాలని భారత ప్రభుత్వం 27 మార్చి 2026 తేదీ నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను మరోసారి కోరింది. ప్రస్తుతం 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిరోజూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
అమలు చర్యలు
· ఎల్పీజీ అక్రమ నిల్వలు, సరఫరాను అరికట్టడానికి అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాడులు కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు సుమారు 2900 దాడులు నిర్వహించగా.. దాదాపు 1000 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· సరఫరా సజావుగా సాగేలా చూడటానికి, అక్రమ నిల్వలు/రవాణా కేసులను తనిఖీ చేయడానికి ప్రభుత్వ రంగ చమురు సంస్థల అధికారులు నిన్న దేశవ్యాప్తంగా 1200కుపైగా పెట్రోల్ బంకులు, ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
· నిబంధనలు ఉల్లంఘించిన ఎల్పీజీ పంపిణీ కేంద్రాలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇప్పటివరకు సుమారు 480 షోకాజు నోటీసులు జారీ చేశాయి.
ఇతర ప్రభుత్వ చర్యలు
· యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాతోపాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలకు కూడా అధిక ప్రాధాన్యతనిస్తోంది.
· సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు.. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం, ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను క్రమబద్ధీకరించడం వంటివి ఉన్నాయి.
· ఎల్పీజీ డిమాండుపై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను అందుబాటులోకి తెచ్చారు.
· చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అధిక మొత్తంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
· గృహ, వాణిజ్య వినియోగదారులందరికీ కొత్త పీఎన్జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
· పెట్రోలు, డీజిలు, ఎల్పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భయాందోళనలతో పెట్రోలు, డీజిలు కొనుగోలు చేయవద్దని సూచించింది. అలాగే ఎల్పీజీ బుకింగ్లు కూడా ఆందోళనతో చేయవద్దని తెలిపారు.
· పౌరులు వదంతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సరైన సమాచారం కోసం అధికారిక సంస్థలను మాత్రమే నమ్మాలని సూచించారు.
· ఎల్పీజీ వినియోగదారులకు విజ్ఞప్తి:
· గ్యాస్ బుకింగ్ల కోసం డిజిటల్ విధానాలను ఉపయోగించండి.
· నేరుగా ఎల్పీజీ పంపిణీదారులను సంప్రదించడం మానుకోండి.
· పౌరులు పీఎన్జీ, ఇండక్షన్, ఎలక్ట్రిక్ స్టవ్లు వంటి ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను ఉపయోగించాలని విజ్ఞప్తి.
· ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులందరూ తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి అవసరమైన ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
· యుద్ధ ప్రభావ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న భారతీయ నౌకలు, సముద్ర నావికుల రక్షణ, భద్రతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం..
· ఆ ప్రాంతంలోని భారతీయ సముద్ర యానికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు.
· సుమారు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకుతో వస్తున్న రెండు నౌకలు బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎం.. ఆ ప్రాంతాన్ని సురక్షితంగా దాటి భారత్ వైపు ప్రయాణిస్తున్నాయి. బీడబ్ల్యూ టీవైఆర్ నౌక 31 మార్చి 2026 నాటికి ముంబయికి చేరుకునే అవకాశం ఉంది. బీడబ్ల్యూ ఈఎల్ఎం నౌక 01 ఏప్రిల్ 2026 నాటికి న్యూమంగళూరుకు చేరుకుంటుందని అంచనా.
· పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 18 భారత జెండా ఉన్న నౌకల్లో 485 మంది భారతీయ నావికులు ఉన్నారు. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ సంస్థలు, భారతీయ రాయబార కార్యాలయాలతో షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం 24x7 గంటల పాటు పని చేస్తోంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4,523 కాల్స్.. 8,985 ఈమెయిళ్లను పరిష్కరించింది. గత 24 గంటల్లోనే 92 కాల్స్, 120 ఈమెయిళ్లు అందాయి.
· ఇప్పటి వరకు 942 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో డీజీ షిప్పింగ్ సహాయపడింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన నలుగురు కూడా ఉన్నారు.
· దేశవ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సముద్రయాన బోర్డులు తమ పరిధిలోని కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ధ్రువీకరించాయి.
· నావికుల సంక్షేమాన్ని, నిరంతర నౌకాయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోంది.
యుద్ధ ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
· యుద్ధ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలు, పోస్టులు అక్కడి భారతీయ పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని.. పౌరుల భద్రత, క్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయం అందిస్తూ, ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ సమాచారం ప్రకారం:
· గల్ఫ్, పశ్చిమ ఆసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. భారతీయ పౌరుల రక్షణ, భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.
· భారతీయ పౌరులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూం నిరంతరం పని చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమన్వయం కొనసాగిస్తోంది.
· ఆ ప్రాంతంలోని రాయబార కార్యాలయాలు, ప్రత్యేక కేంద్రాలూ 24 గంటలూ పనిచేస్తూ, కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇవి భారతీయ సమాజ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు, స్థానిక అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాయి.
· సముద్ర నావికులు, విద్యార్థులు, అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, స్వల్పకాలిక సందర్శకులకు వీసా, కాన్సులర్, రవాణాపరమైన మద్దతుతో సహా అన్ని రకాల సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి.
· ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 5,24,000 మంది ప్రయాణికులు భారత్కు తిరిగి వచ్చారు. విమాన కార్యకలాపాలు నియంత్రిత పద్దతిలో కొనసాగుతున్నాయి.
· యూఏఈ: వివిధ విమానాశ్రయాల నుంచి భారత్కు నేడు సుమారు 80 విమానాలు నడుస్తాయని అంచనా.
· సౌదీ అరేబియా, ఒమన్: భారత్కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్: గగనతలం పాక్షికంగా తెరవడంతో నేడు సుమారు 8 నుంచి 10 నాన్-షెడ్యూల్డ్ విమానాలు నడిచే అవకాశం ఉంది.
· కువైట్, బహ్రెయిన్: ఈ దేశాల గగనతలాలు ఇంకా మూసివేసే ఉన్నాయి. కువైట్కు చెందిన జజీరా ఎయిర్వేస్, బహ్రెయిన్కు చెందిన గల్ఫ్ ఎయిర్ సంస్థలు సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
· ఇరాన్: ఆర్మేనియా, అజర్బైజాన్ మీదుగా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
· ఇజ్రాయెల్: ఈజిప్టు, జోర్డాన్ మీదుగా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
· ఇరాక్: జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
· కువైట్, బహ్రెయిన్ దేశాల నుంచి ఉన్న ఆంక్షల దృష్ట్యా, భారతీయ పౌరులు సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
· 27 మార్చి 2026న అబుదాబిలో మరణించిన ఒక భారత పౌరుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. మృతుని కుటుంబంతో మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ కష్టకాలంలో వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
· ఒమన్లోని సలాలాలో జరిగిన దాడిలో గాయపడిన భారత పౌరుడు ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నాడు. అక్కడి భారత రాయబార కార్యాలయం అతనికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ, స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2246676)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6