ప్రస్తుత నియంత్రణ చట్రం ప్రకారం ప్రైవేటు శాటిలైట్ టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే అన్ని ప్రకటనలు, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ల (నియంత్రణ) చట్టం 1995, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం నిర్దేశించిన ప్రకటనల నియమావళికి కట్టుబడి ఉండాలి. ప్రకటనల నైతిక నియామావళి (కోడ్) ఇతర విషయాలతోపాటు ఈ కింది విధంగా నిర్దేశిస్తుంది.
నిబంధన 7(5): ఏ ప్రకటనలోనూ ఉత్పత్తి లేదా అందులో ఉపయోగించే పదార్థానికి సంబంధించి నిరూపించడానికి వీలు కాని ఏదైనా ప్రత్యేకమైన, అద్భుతమైన, అతీంద్రియ గుణం, లక్షణం ఉన్నట్లు ప్రజలు భావించేలా చేసే ప్రస్తావనలు ఉండకూడదు.
నిబంధన 7(7): పిల్లల భద్రతకు ముప్పు కలిగించేవి, వారిలో అనారోగ్యకరమైన అలవాట్లపై ఆసక్తిని పెంచేవి, లేదా వారిని అడుక్కుంటున్నట్లుగా, అగౌరవంగా, అసభ్యకరంగా చూపించే ఎటువంటి ప్రకటనలనైనా ప్రసారం చేయకూడదు.
నిబంధన 7(9): ముంబయిలోని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు రూపొందించే ప్రకటనల స్వీయ నియంత్రణ నియామావళిని ఉల్లంఘించే ఏ ప్రకటననూ అనుమతించకూడదు.
టెలివిజన్ ఛానళ్లు ప్రసారం చేసే కంటెంట్కు సంబంధించి పౌరుల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన మూడు అంచెల యంత్రాంగాన్ని కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ల (సవరణ) నిబంధనలు 2021 అందిస్తుంది. ఈ మూడు స్థాయిల ఫిర్యాదుల పరిష్కార నిర్మాణం ఈ కింది విధంగా ఉంది.
· మొదటి స్థాయి.. టీవీ యాజమాన్యాల స్వీయ నియంత్రణ
· రెండో స్థాయి.. టీవీ సంస్థలకు చెందిన స్వీయ నియంత్రణ వ్యవస్థల ద్వారా నియంత్రణ
· మూడో స్థాయి... కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ యంత్రాంగం
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (సవరణ) నియమాలు 2021లోని నిబంధన 16 ప్రకారం ఏదైనా టీవీ ఛానల్లో ప్రసారమయ్యే కంటెంట్ ప్రకటనల నియామావళికి విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే బాధితులు నేరుగా సంబంధిత టీవీ సంస్థకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ ఆ ఫిర్యాదు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిబంధనలకు సంబంధించినదైతే కౌన్సిల్కు ఫిర్యాదును పంపాలి. ఏఎస్సీఐ తన సొంత నిబంధనల ప్రకారం ఆ ఫిర్యాదును విచారించి, అందిన 60 రోజుల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని సంబంధిత టీవీ యాజమాన్యానికి, ఫిర్యాదుదారుడికి వెంటనే తెలియజేయాల్సి ఉంటుంది.
టెలివిజన్ ప్రసారాలు ప్రకటనల నియామావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అంతర విభాగ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రకటనల నియామావళిని ఉల్లంఘించినట్లు రుజువైన ప్రైవేటు టీవీ ఛానళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఛానళ్లకు సూచనలు జారీ చేయడం, హెచ్చరికలు పంపడం, క్షమాపణలు కోరుతూ స్క్రోలింగ్ ప్రదర్శించమనడంతోపాటు పలు సందర్భాల్లో ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలు ఉంటాయి. దీనితో పాటు టెలివిజన్ సంస్థలు ప్రకటనల నియామావళిని తప్పనిసరిగా పాటించేలా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు తగిన సూచనలను జారీ చేస్తుంది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు 7 మే 2024న జారీ చేసిన ఆదేశాలను అమలు చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీవీ, రేడియో ప్రకటనల కోసం బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్లో ప్రింట్, ఇంటర్నెట్ ప్రకటనల కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేదికలో స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయడం తప్పనిసరి చేస్తూ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఆహార, ఆరోగ్య రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, సేవల ప్రకటనలు ఇచ్చే ప్రకటనకర్తలు, సంస్థలు ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ వంటి వివిధ మీడియా వేదికల్లో ప్రకటనల కోసం వార్షిక ఎస్డీసీని అప్లోడ్ చేయాలని మే 3, 2024న జారీ చేసిన సలహా పత్రంలో ప్రభుత్వం పేర్కొంది.
డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు, ఓటీటీ వేదికలు, ఆన్లైన్ ప్రకటనల విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ వేదికలు లేదా వాటికి సంబంధించిన మభ్యపెట్టే ఉత్పత్తులు, సేవల ప్రకటనలను ప్రసారం చేయవద్దని 13 జూన్ 2022, 3 అక్టోబర్ 2022, 6 ఏప్రిల్2023 తేదీల్లో జారీ చేసిన సూచనల ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలను మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టే లక్ష్యంతో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అధికార సంస్థ 2022 జూన్ 9న ‘‘తప్పుదోవ పట్టించే ప్రకటనల నివారణ మార్గదర్శకాలు 2022’’ జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మార్గదర్శకాల ఉల్లంఘనలకు సంబంధించి లేదా తప్పుడు ప్రకటనలపై వచ్చే ఫిర్యాదులను వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద పరిష్కరిస్తారు.
ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నేడు లోక్సభలో శ్రీ సురేష్ కుమార్ షెట్కర్, శ్రీ విజయకుమార్ అలియాస్ విజయ్ వసంత్లకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.