‘ఎన్హెచ్-752డీ’లోని 80.45 కిలోమీటర్ల పొడవైన బద్నావర్-పెట్లవాడ్-తాండ్ల-తిమర్వాణి విభాగాన్ని 4 వరుసల కారిడార్గా అభివృద్ధి చేసేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయాన్ని రూ. 3,839.42 కోట్లుగా నిర్ణయించారు.
ఆమోదం పొందిన ఈ కారిడార్ ఉజ్జయిని నగరాన్ని ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ రహదారిలోని (డీఎంఈ) తిమర్వాణి ఇంటర్ఛేంజ్తో అనుసంధానిస్తుంది.
ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదిత నాలుగు వరుసల ప్రాజెక్టు కారిడార్ను చేపడుతున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం సుమారు ఒక గంట వరకు తగ్గుతుందన్న అంచనా ఉంది. ఇప్పటికే 70.40 కిలోమీటర్ల పొడవున్న ఉజ్జయిని–బద్నావర్ సెక్షన్ను రెండు వరుసల నుంచి నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న బద్నావర్–తిమర్వాణి రహదారి కేవలం 5.5 మీటర్ల వెడల్పుతో తక్కువ వేగ పరిమితి (గంటకు 20-50 కి.మీ) కలిగిన సాధారణ మార్గంగా ఉంది. ఈ విభాగాన్ని అప్గ్రేడ్ చేయటం ద్వారా ఉజ్జయిని నుంచి ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ రహదారిలోని (డీఎంఈ) తిమర్వాణి ఇంటర్ఛేంజ్ వరకు గంటకు 80-100 కి.మీ వేగంతో ప్రయాణించేలా నేరుగా 4 వరుసల అనుసంధానం లభిస్తుంది.
గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఉజ్జయినికి వచ్చే వాహనాలకు తిమర్వాణి–తాండ్ల–పెట్లవాడ్–బద్నావర్–ఉజ్జయిని కారిడార్ అత్యంత తక్కువ దూరమున్న మార్గం. తిమర్వాణి–బద్నావర్ విభాగాన్ని అప్గ్రేడ్ చేయడం వల్ల అంతర్రాష్ట్ర అనుసంధానం బలోపేతం అవుతుంది. ఇది వాహనాల రాకపోకలను మరింత సమర్థవంతంగా చేయడమే కాకుండా 2028 ఏప్రిల్లో జరగబోయే 'సింహస్థ కుంభమేళా' సమయంలో పెరిగే విపరీతమైన ట్రాఫిక్ రద్దీని మెరుగ్గా నిర్వహించేందుకు కూడా ఎంతగానో దోహదపడుతుంది.
బద్నావర్-పెట్లవాడ్-తాండ్ల-తిమర్వాణి విభాగం.. ధార్, ఝాబువా జిల్లాలలోని గిరిజన ప్రాంతాల గుండా వెళ్తుంది. ధార్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు నీతి ఆయోగ్ చేపట్టిన 'ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం' పరిధిలోకి వస్తాయి. ఈ రహదారి అభివృద్ధి వల్ల ఉజ్జయిని-బద్నావర్-తిమర్వాణి కారిడార్ నుంచి ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ రహదారికి నేరుగా వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. ఈ మెరుగైన అనుసంధానం రవాణా ఖర్చులను తగ్గిస్తుంది.. ముడి పదార్థాలు, తయారీ వస్తువుల వేగవంతమైన రవాణాకు సహకరిస్తుంది. ఇండోర్, పీతాంపూర్, ఉజ్జయిని, దేవాస్లలో ఉన్న పారిశ్రామిక కేంద్రాలు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులకు (ఎంఎంఎల్పీ) చేరుకోవటాన్ని సులభతరం చేస్తుంది.
ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ మెరుగైన భద్రత, అంతరాయం లేని వాహనాల రాకపోకల కోసం రూపొందించిన హై-స్పీడ్ అనుసంధానతను అందిస్తుంది. ఇది ప్రయాణ సమయం, ట్రాఫిక్ రద్దీ, వాహన నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. తద్వారా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్, ఝాబువా జిల్లాల సమగ్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
ఈ ప్రాజెక్టు ముఖ్య విశేషాలు:
|
వరుస సంఖ్య
|
విషయం
|
వివరాలు
|
|
1
|
పొడవు
|
80.45 కి.మీ (గ్రీన్ఫీల్డ్ + బ్రౌన్ఫీల్డ్) కారిడార్
|
|
2
|
రోడ్డు రకం
|
సౌకర్యవంతమైన ఉపరితలం (పేవ్మెంట్)
|
|
3
|
ప్రతిపాదిత వరుసలు
|
4- వరుసలు
|
|
4
|
ప్రధాన వంతెనలు
|
6
|
|
5
|
చిన్న వంతెనలు
|
34
|
|
6
|
ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)
|
1
|
|
7
|
వీయూపీ/ఎల్వీయూపీ/ఎస్వీయూపీ
|
9 సంఖ్యలు / 29 సంఖ్యలు / 04 సంఖ్యలు.
|
|
8
|
నిర్మాణ కాలం
|
24 నెలలు
|
|
9
|
రాయితీ కాలం (కన్సెషన్ పీరియడ్)
|
17 సంవత్సరాలు (2 సంవత్సరాల నిర్మాణ కాలం + 15 సంవత్సరాల నిర్వహణ)
|
***