ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో సుస్థిర, బలమైన ఆర్థిక వృద్ధిపై పీఎం ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 12:57PM by PIB Hyderabad

నమస్కారం!

బడ్జెట్ వెబినార్ సిరీస్‌లో భాగంగా గత వారం మొదటి వెబినార్ జరిగింది. అది విజయవంతమైందని నాకు తెలిసింది. బడ్జెట్ నిబంధనల అమలుపై ప్రతి ఒక్కరూ అద్భుతమైన సూచనలు ఇచ్చారు. మీ అందరి క్రీయాశీలక భాగస్వామ్యాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఇవాళ రెండో వెబినార్ జరుగుతుంది. ఇవాళ కూడా విస్తృత శ్రేణి అంశాలపై వేలాది మంది లెక్కలేనన్ని సూచనలు ఇస్తారని, వివిధ రంగాల నిపుణులు కూడా మనతో పాల్గొంటారని నాకు సమాచారం ఉంది. బడ్జెట్ పై ఇంతటి భారీ స్థాయి చర్చ నిర్వహించటం విజయవంతమైన ప్రయోగం. ఈ వెబినార్‌లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. దేశ ఆర్థిక వృద్ధిని నిరంతరం బలోపేతం చేయటమే ఈ వెబినార్ ఇతివృత్తం. పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచానికే ఆశా కిరణంలా భారత్ మారిన తరుణంలో ప్రపంచ సరఫరా వ్యవస్థను పునర్ వ్యవస్థీకరిస్తున్న వేళ, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి వేగవంతమైన ఆర్థిక పురోగతే ప్రధాన ఆధారం. మన లక్ష్యం, మన సంకల్పం స్పష్టంగా ఉన్నాయి. నిర్మాణ సామర్థ్యం, ఉత్పత్తి, అనుసంధానతను పెంచటంతో పాటు ఎగుమతులను కూడా మరింతగా పెంచాల్సిన అవసముంది. ఇవాళ మీరు చేస్తున్న ఈ మేధోమదనం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది.

మిత్రులారా,

తయారీ రంగం, రవాణా వ్యవస్థ, ఎంఎస్ఎంఈలు, కుటీర పరిశ్రమలు, చిన్న, పెద్ద నగరాలు పైకి వేర్వేరుగా కనిపించినప్పటికీ ఒకదానితో ఒకటి కలిసిపోయి మన ఆర్థిక వ్యవస్థకు మూలాధారం వంటివని మీకు తెలుసు. ఉదాహరణకు బలమైన తయారీ రంగం కొత్త అవకాశాలను సృష్టించటం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి. పోటీతత్వంతో ఎంఎస్ఎంఈలు పనిలో సౌలభ్యాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి. మెరుగైన రవాణా వ్యవస్థ ఖర్చులను తగ్గిస్తుంది. ప్రణాళికాబద్ధమైన నగరాలు పెట్టుబడులను, ప్రతిభావంతులను ఆకర్షిస్తాయి. ఈ కీలక అంశాలకు ఈ ఏడాది బడ్జెట్ గొప్ప బలాన్ని చేకూర్చింది.

మిత్రులారా,

ఏదైనా తనంతట తానుగా ఫలితాలను ఇవ్వదు. పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి పనిచేసినప్పుడే క్షేత్రస్థాయిలో మార్పు సాధ్యమవుతుంది. ఈ వెబినార్‌లో మీ చర్చలు కొన్ని కీలక అంశాలకు ప్రాధాన్యతనిస్తాయని ఆశిస్తున్నా. ముఖ్యంగా తయారీ, ఉత్పత్తిని పెంచటం, వ్యయ నిర్మాణాన్ని పోటీతత్వంతో తీర్చిదిద్దటం, పెట్టుబడుల ప్రవాహాన్ని వేగవంతం చేయటం, దేశంలోని ప్రతి చోటుకి అభివృద్ధి చేరాలన్న అంశాలపై మీ సూచనలు కీలకం.

మిత్రులారా,

తయారీ రంగంలో కీలక పారిశ్రామిక సామర్థ్యాలను దేశం బలోపేతం చేసుకుంటుంది. ఈ మార్గంలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. అరుదైన ఖనిజ కారిడార్లు, కంటైనర్ల తయారీ వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించటం ద్వారా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. బడ్జెట్‌లో బయోఫార్మా శక్తి మిషన్‌ను కూడా ప్రకటించాం. బయోలాజిక్స్, తదుపరి తరం చికిత్స విధానాల్లో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చటమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. అత్యాధునిక బయోఫార్మా పరిశోధనలు, తయారీ రంగంలో ప్రపంచ నాయకత్వ దిశగా సాగాలని ఆకాంక్షిస్తున్నాం.

మిత్రులారా,

నేడు ప్రపంచం.. విశ్వసనీయమైన, పటిష్ఠమైన తయారీ భాగస్వాముల కోసం చూస్తుంది. ఈ పాత్రను పోషించే గొప్ప అవకాశం భారత్ కు ఉంది. ఇందుకోసం వాటాదారులంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో పెట్టుబడులు పెట్టాలి. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. పరిశోధనల విషయంలో వెనకడుగు వేసే రోజులు పోయాయి. ఇప్పుడు పరిశోధనా రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మనం నాణ్యతను పెంచాలి. అవకాశాలు వస్తున్న సమయంలో నేను పదే పదే చెప్పేది ఒక్కటే.. మన ఏకైక మంత్రం: నాణ్యత, నాణ్యత, నాణ్యత.

మిత్రులారా,

వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా మనకు ఎన్నో అవకాశాలున్నాయి. ఈ సమయంలో నాణ్యత విషయంలో మనం రాజీ పడకపోవటమే ప్రధాన బాధ్యత. మన శక్తిని, మేధస్సును, కృషిని దేనిపైనైనా కేంద్రీకరించాలంటే, కచ్చితంగా నాణ్యతపైనే. మన ఉత్పత్తుల నాణ్యత ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే కాక, వాటిని మించి ఉండాలి. ఇందుకోసం ఇతర దేశాల అవసరాలు, అంచనాలను మనం నిశితంగా పరిశీలించి, అధ్యయనం చేయాలి. వివిధ దేశాల ప్రజల ఇష్టాయిష్టాలను, వారి సౌకర్యాన్ని అర్థం చేసుకోవటం అత్యంత ఆవశ్యకమైన విషయం. దీనిపై లోతైన పరిశోధనలు జరగాలి. ఎవరైనా భారీ ఓడ నిర్మాణానికి సంబంధించి విడిభాగాన్ని మన నుంచి కోరితే, మనం నాణ్యత లేని భాగాన్ని పంపిస్తే, వాళ్లు దాన్ని ఎలా అంగీకరిస్తారు? మనకి అది చిన్న విడిభాగమే అనిపించవచ్చు. కానీ భారీ తయారీ యూనిట్‌లో దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నేటి పోటీ ప్రపంచంలో నాణ్యత అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, సౌకర్యవంతమైన ఉత్పత్తులను మనం తయారుచేయాలి. అప్పుడే మనం అవకాశాలను అందిపుచ్చుకోగలం. ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి రహదారి మీకోసం వేచి చూస్తుంది. ఈ వెబినార్‌లోని మీ చర్చల్లో ఈ అంశంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తున్నాను.

మిత్రులారా,

ఎంఎస్ఎంఈల వర్గీకరణలో మేం చేపట్టిన సంస్కరణలు విస్తృతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. సంస్థల కార్యకలాపాల పరిధిని విస్తరిస్తే ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతామనే భయం లేదు. ఎంఎస్ఎంఈలకు రుణాలు సులభంగా అందేలా చూడటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచటం, సామర్థ్యం పెంపొందించుకోవటాన్ని ప్రోత్సహించటం వంటి చర్యలు తీసుకున్నాం.

మిత్రులారా,

విజయమే లక్ష్యంగా భారీగా ఎంఎస్ఎంఈలు పోటీలో ఉన్నప్పుడు ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్పాదకతను పెంచుకోవటానికి, నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచుకోవటానికి, డిజిటల్ విధానాలను అవలంబించటానికి, బలమైన సరఫరా వ్యవస్థలతో అనుసంధానమయ్యేందుకు ఎంఎస్ఎంఈలకు ఇదే సరైన సమయం. ఈ దిశగా వెబినార్ లో మీరు ఇచ్చే సూచనలు కీలకమైనవి.

మిత్రులారా,

మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు అభివృద్ధి వ్యూహంలో కీలకమైనవి. ఈ ఏడాది బడ్జెట్ రికార్డు స్థాయిలో పెట్టుబడి వ్యయాన్ని ప్రతిపాదించింది. అధిక సామర్థ్యం గల రవాణా వ్యవస్థల ఏర్పాటు, రైల్వేలు, రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, జలమార్గాల మధ్య మెరుగైన సమన్వయం, పలు సరకు రవాణా కారిడార్ల విస్తరణ, వివిధ రకాల అనుసంధానత వంటివన్నీ వ్యయాన్ని తగ్గించటానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచటానికి అవసరమైన చర్యలు. నూతన జలమార్గాలు, నౌక మరమ్మతు సౌకర్యాలు, ప్రాంతీయ అత్యున్నత నైపుణ్య కేంద్రాలు.. రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఏడు కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లు, వృద్ధికి అనుసంధానకర్తలుగా మారనున్నాయి. పరిశ్రమలు, పెట్టుబడిదారుల వ్యూహాలను ఈ దార్శనికతకు అనుగుణంగా మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ మౌలిక సదుపాయాల అసలు ప్రయోజనాన్ని పొందవచ్చని మీకు తెలుసు. ఆ వ్యూహాలపై మీరు వివరింగా చర్చించాలి. ఈ విషయాలపై మీరు దృష్టి సారిస్తారని నమ్ముతున్నాను.

మిత్రులారా,

భారత అభివృద్ధి ప్రయాణంలో పట్టణీకరణ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నగరాలను ఎంత సమర్థవంతంగా ప్రణాళిక చేసి, నిర్వహిస్తామనే దానిపై భారతదేశ భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉంది. కొత్త వృద్ధి కేంద్రాలుగా రెండో శ్రేణి, మూడో శ్రేణి నగరాలు ఎలా మారాలనే దానిపై ఈ బడ్జెట్ వెబినార్ లో ఇచ్చే సూచనలు ముఖ్యమైనవి.

మిత్రులారా,

ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మార్కెట్లు కేవలం వ్యయాన్నే కాక, సుస్థిరతను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఈ దిశగా కర్బన ఉద్గారాలను ఒడిసిపట్టి, వినియోగించటం, నిల్వ చేసేందుకు చేపట్టిన మిషన్ కీలక ముందడుగు. మీ ప్రధాన వ్యాపార వ్యూహంలో సుస్థిరత అంతర్భాగం కావాలి. పర్యావరణహిత సాంకేతికతలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు, భవిష్యత్ లో నూతన మార్కెట్లలో మెరుగైన అవకాశాలను పొందుతాయి. దీనికి ఈ ఏడాది బడ్జెట్ కొత్త దిశానిర్దేశం చేసింది. పరిశ్రమలు, పెట్టుబడిదారులు, సంస్థలన్నీ కలిసి ఈ దిశగా ముందుకు సాగాలని కోరుతున్నా.

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని ఉమ్మడి బాధ్యతతో సాధించగలం. ఈ బడ్జెట్ వెబినార్ కేవలం చర్చలకు, జ్ఞానాన్ని పంచుకోవటానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఇందులో అందరి భాగస్వామ్యం ఉండటం ఎంతో అవసరం. బడ్జెట్ ఒక వ్యవస్థను రూపొందించింది. దానికి మీరంతా గమనాన్ని అందించాలి. మా ప్రయత్నాల్లో మీరంతా భాగస్వాములు కావాలి. మీ ప్రతీ సూచనా, ప్రతీ అనుభవం క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. మీ సూచనలు దేశ ప్రగతిలో కీలక ఘట్టాలుగా నిలుస్తాయని విశ్వసిస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు.

నమస్కారం!

***


(రిలీజ్ ఐడి: 2235311) సందర్శకుల సూచీ సంఖ్య : : 55
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam , Urdu , Bengali , Manipuri , Odia , English , Marathi