మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘భారత్లో ఏఐ పరిధి విస్తరణ’ అంశంపై సదస్సు
భారత్ను అంతర్జాతీయ వైజ్ఞానిక శక్తిగా నిలిపే చోదక శక్తి ఏఐ.. 2047 నాటికి వికసిత భారత్ సాకారంలో ఏఐ కీలకం: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 2:34PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో భాగంగా.. ‘విద్యా మంత్రిత్వ శాఖ – భారత్లో ఏఐ పరిధుల విస్తరణ’ శీర్షికన న్యూఢిల్లీలోని భారత్ మండపంలో విద్యా మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక సదస్సును నిర్వహించింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ సదస్సులో పాల్గొన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ జయంత్ చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పాఠశాల విద్య, అక్షరాస్యత కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి, ఐఐటీ మద్రాసు కార్యదర్శి ప్రొఫెసర్ వి. కామకోటి, విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యలో ఏఐని వినియోగించే ప్రముఖ అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ.. దేశంలో కృత్రిమ మేధ వికాసాన్ని ప్రదర్శించడానికి, దాన్ని మరింత వేగవంతం చేసే దిశగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన విప్లవాత్మక కార్యక్రమంగా ఈ సదస్సును అభివర్ణించారు.

భారత్ సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పురోగతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. భారత్ అసాధారణ వేగంతో కృత్రిమ మేధను అందిపుచ్చుకుంటున్న తీరును చూసి ప్రపంచం మనవైపు ఆశగా చూస్తోందని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వైజ్ఞానిక శక్తిగా భారత్ను నిలపడంలో ఏఐ విప్లవాత్మక పాత్ర పోషిస్తుందనీ, 2047 నాటికి వికసిత భారత్ను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
యువ ఆవిష్కర్తలది ఇందులో కీలక పాత్రగా ఉంటుందని చెబుతూ.. భారతీయ యువత మునుపటి తరాల కన్నా భిన్నమైన రీతిలో ఆలోచిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ‘‘విద్యలో ఏఐ, ఏఐపై విద్య అన్నవి పరస్పరం బలంగా అనుసంధానమై ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు. విద్యార్థులు, యువ నిపుణులు ఏఐని వినియోగించుకుని అవగాహన పెంచుకోవాలనీ, దాన్ని అందిపుచ్చుకోవాలనీ, సాధికారత సాధించాలనీ.. విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టాలనీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏఐ రంగంలో భారత్ను అగ్రగామి శక్తిగా నిలపడంలో ఈ కృషి దోహదపడుతుందన్నారు.
ఇండియా ఇంపాక్ట్ సదస్సులో జరిగిన చర్చలు విలువైన సమాచారాన్ని అందించాయని శ్రీ జయంత్ చౌదరి పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో.. విద్యాసంస్థలు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు విద్యా వ్యవస్థలో ఏఐ నిర్మాణాత్మక ఏకీకరణపై చర్చించారని ఆయన తెలిపారు. వికసిత బారత్@ 2047 లక్ష్యానికి అనుగుణంగా, అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచే దిశగా- ప్రాథమిక విద్య నుంచి నైపుణ్యాభివృద్ధి, పరిశోధన వరకు.. ప్రతి దశలోనూ ఏఐ అనుసంధానంపై చర్చలు సాగాయని వివరించారు.

విద్యా మంత్రిత్వ శాఖ, స్కిల్ ఇండియా వేదికలను కూడా తాను సందర్శించానన్నారు. ఆచరణీయ, భారీ స్థాయికి విస్తరించదగిన, ‘భారతే ప్రథమం’ లక్ష్యంగా ఉన్న ఏఐ మార్గాలను వాటిలో ప్రదర్శించారని తెలిపారు. ప్రభుత్వ విధానపరమైన దార్శనికతను.. ఇవి ప్రభావవంతమైన క్షేత్రస్థాయి ఆచరణగా మారుస్తున్నాయని వ్యాఖ్యానించారు.
జాతీయ డిజిటల్ వేదికలు, విధానపరమైన ఏర్పాట్లు, సంస్థాగత సంస్కరణలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, అధునాతన పరిశోధన - ఆవిష్కరణ వ్యవస్థల్లో విస్తృతంగా సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా.. గత దశాబ్ద కాలంగా కృత్రిమ మేధ ఆధారిత విద్యకు విద్యా మంత్రిత్వ శాఖ బలంగా పునాదులు వేసింది.
గతేడాది బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా.. ఐఐటీ- మద్రాసులో ‘విద్య కోసం కృత్రిమ మేధ’పై ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యలో ఏఐ ఏకీకరణ కోసం ప్రణాళికను రూపొందించే క్రమంలో.. విద్యాసంస్థలు, పరిశ్రమలు, పౌర సమాజం, ప్రభుత్వ సంస్థలతో విద్యా మంత్రిత్వ శాఖ విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపింది. ఇటీవల విద్యారంగంలోని కృత్రిమ మేధ అంకుర సంస్థల వ్యవస్థాపకులతో మంత్రి చర్చించారు. అలాగే, కీలక భాగస్వాములను ఒకచోట చేర్చి.. ఏఐ చోదకంగా బాధ్యతాయుత పరివర్తనను ముందుకు తీసుకెళ్లడంపై.. మంత్రి అధ్యక్షతన ‘భారత్ బోధన్ ఏఐ కాన్క్లేవ్- 2026’ పేరిట రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా జరిగిన ఈ సదస్సు.. భారత్ తన విధానపరమైన దార్శనికతను భారీ స్థాయి అమలు దిశగా మలుస్తున్న తీరును చాటింది. ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు, పాఠ్యప్రణాళికను ఏకీకృతం చేయడం, పరిశ్రమలు - అంకుర సంస్థల మధ్య బలమైన భాగస్వామ్యం ద్వారా ఈ మార్పును సాధిస్తున్నట్టు ఈ సదస్సు వివరించింది.
విద్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రసిద్ధ పెట్టుబడిదారులు ఈ ప్యానెల్లో ఉన్నారు:
డాక్టర్ శ్రీధర్ వెంబు, జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, సీఈవో
డాక్టర్ విభు మిట్టల్, ఇన్ఫ్లెక్షన్లో సాంకేతిక నిపుణుడు, ఆవిష్కర్త
శ్రీ రాజన్ ఆనందన్, పీక్ ఎక్స్వీ పార్ట్నర్స్ ఎండీ
ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్, ఐఐటీ-కాన్పూర్ డైరెక్టర్
ప్రొఫెసర్ వి. కామకోటి, ఐఐటీ- మద్రాస్ డైరెక్టర్
ప్రొఫెసర్ సునీతా సరవాగీ, ఐఐటీ- బాంబే
ఐఐటీ - జమ్మూ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ ఎస్. గౌర్ ఈ సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించారు. పాలనాపరమైన విధివిధానాలు, జాతీయ విద్యా వేదికలు, దేశీయ ఏఐ ఆవిష్కరణలు, అత్యాధునిక ఏఐ మోడళ్ల బాధ్యతాయుతమైన వినియోగం... ఇవన్నీ కలిసి దేశంలో విద్యా రంగంలో ఎలాంటి ఫలితాలనిస్తున్నాయనే అంశంపై ఈ చర్చ సాగింది. కేవలం చిన్నపాటి ప్రయోగాలే కాకుండా.. వ్యవస్థాగతమైన మార్పుల ప్రాధాన్యాన్ని ఈ సదస్సు ప్రధానంగా పేర్కొన్నది. విధానాలు, సంస్థలు, సాంకేతికత కలిసి దేశవ్యాప్తంగా స్థిరమైన ప్రభావాన్ని చూపుతున్న తీరును ఈ సదస్సు వేదికగా ప్రదర్శించారు.
విద్యలో ఏఐ అనే భారతదేశ జాతీయ ప్రణాళిక రూపకల్పనకు మేధో మథనం, అలాగే పరిశ్రమ - విద్యాసంస్థలు - ప్రభుత్వం మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.
విద్యలో ఏఐ పరిధి విస్తరణ #IndiaAIImpactSummit2026#NEP2020 #PeoplePlanetProgress https://t.co/4GNRa3AcQG
— ధర్మేంద్ర ప్రధాన్ (@dpradhanbjp) ఫిబ్రవరి17, 2026
దేశంలో ఏఐ వికాసాన్ని చాటేందుకు, దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు దార్శనికతతో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో భాగంగా.. @EduMinIndia నిర్వహించిన ‘భారత్లో ఏఐ పరిధి విస్తరణ’ అనే సదస్సులో ప్రసంగించాను.
శరవేగంగా మారుతున్న ప్రపంచం భారత్ వైపు చూస్తోంది... pic.twitter.com/yxFXkvGgPH
— ధర్మేంద్ర ప్రధాన్ (@dpradhanbjp) February 17, 2026
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ‘భారత్లో ఏఐ పరిధి విస్తరణ’ అంశంపై @EduMinIndia నిర్వహించిన సదస్సులో ప్రసంగించాను. దేశంలో ఏఐ వికాసాన్ని చాటేందుకు, దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు దార్శనికతతో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమమిది.
శరవేగంగా మారుతున్న ప్రపంచం భారత్ వైపు చూస్తోంది... pic.twitter.com/yxFXkvGgPH
— ధర్మేంద్ర ప్రధాన్ (@dpradhanbjp) February 17, 2026
***
(రిలీజ్ ఐడి: 2229337)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3