హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ పోలీసుల 79వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా
మాదకద్రవ్యాల సిండికేట్లు, నకిలీ కరెన్సీ ముఠాలు, సంక్లిష్టమైన సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు ఏవైనా.. శాంతి భద్రతలను కాపాడటంలో విజయవంతగా పనిచేసిన ఢిల్లీ పోలీసులు
దేశ అంతర్గత భద్రతా చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిన
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని (2014-2026) 12 ఏళ్లు
మూడు కొత్త న్యాయ సంహితలు పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత
దేశవ్యాప్తంగా గణనీయంగా పెరగనున్న నేర నిరూపణ శాతం
ప్రస్తుతం నిర్మూలన దశలో దేశ అంతర్గత భద్రతకు ప్రధాన సవాలుగా ఉన్న నక్సలిజం..
మార్చి 31 లోపు నక్సలిజం నుంచి దేశానికి పూర్తి విముక్తి
ఒక్క చొరబాటుదారుడు కూడా సరిహద్దు దాటలేనంత బలమైన భద్రతా వ్యవస్థ
ఉగ్రవాదం, నేరాలను ఎదుర్కోవడంలో సమర్థవంతమైన సాధనంగా
ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం సమీకృత ప్రధాన కార్యాలయం
రూ. 368 కోట్ల వ్యయంతో ఏర్పాటు
రూ. 857 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక సమగ్ర కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సెంటర్ (సీ4I) ఏర్పాటుతో మరింత ఆధునికంగా, శక్తిమంతంగా ఢిల్లీ పోలీసులు
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 3:31PM by PIB Hyderabad
నేడు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ పోలీసుల 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ శ్రీ సతీష్ గోల్చాతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఢిల్లీ పోలీసు వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు శాంతి, సేవ, న్యాయం పట్ల తన నిబద్ధతను నెరవేర్చడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని హోంమంత్రి శ్రీ అమిత్ షా కొనియాడారు. ఢిల్లీ కేవలం దేశ రాజధాని మాత్రమే కాదని, దేశ ప్రజాస్వామ్యానికి, అస్తిత్వానికి గుండెచప్పుడు లాంటిదని ఆయన పేర్కొన్నారు. జాతీయ రాజధానిగా ఢిల్లీ భద్రత ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం అత్యంత కీలకమని చెప్పారు. ఢిల్లీలో అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసాలు ఇక్కడే ఉండటం వల్ల ఢిల్లీ పోలీసుల బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఎల్లప్పుడూ ముందంజలో నిలిచి తమ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వర్తిస్తున్నారని అమిత్ షా అభినందించారు.
ఢిల్లీ పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేడు ప్రత్యేక విభాగం సమగ్ర ప్రధాన కార్యాలయానికి వర్చువల్ గా శంకుస్థాపన చేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. సుమారు రూ. 368 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ కార్యాలయం.. మాదకద్రవ్యాల నియంత్రణ, ఉగ్రవాద నిర్మూలనలో దేశంలోనే అత్యాధునిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక ఇండోర్ ఫైరింగ్ రేంజ్, వార్ రూమ్, సైబర్ ల్యాబ్, శిక్షణ హాలు, ఇతర ఆధునిక సౌకర్యాలు ఉంటాయని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పోలీసు బలగాల స్పెషల్ సెల్ విభాగాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఢిల్లీ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల సిండికేట్లు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు, క్లిష్టమైన సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, పలు ప్రధాన ఉగ్రవాద సంఘటనల దర్యాప్తులో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అత్యంత విజయవంతమైన, కీలకపాత్ర పోషించిందని ఆయన అన్నారు.
ఢిల్లీ పోలీసులకు చెందిన 10 కొత్త ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపనలు చేయడంతోపాటు రూ. 857 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘సేఫ్ సిటీ ప్రాజెక్టు’ తొలి దశను ప్రారంభించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆధునిక సమీకృత కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సెంటర్ (సీ4I)ను ఢిల్లీ ప్రజలకు అంకితం చేశారు. ఢిల్లీని 10,000 కెమెరాలతో అనుసంధానించే కార్యక్రమంలో భాగంగా తొలి దశలో 2,100 కెమేరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, వీటితో పాటు ప్రస్తుతం ఉన్న 15,000 కంటే ఎక్కువ కెమేరాలను ఈ వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ భద్రతను సేఫ్ సిటీ ప్రాజెక్టు గణనీయంగా మెరుగుపరుస్తుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
గత 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అనేక కీలక మైలురాళ్లను అధిగమించిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో న్యాయం గురించి చర్చ జరిగినప్పుడల్లా మూడు కొత్త న్యాయ సంహితల గురించి ఖచ్చితంగా ప్రస్తావన ఉంటుందని అన్నారు. 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు అమలు చేసిన చట్టాలను రద్దు చేసి, న్యాయం కేంద్రంగా సాగే చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి తెలిపారు. ఈ చట్టాలు పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత రాబోయే రెండు సంవత్సరాలు దేశంలో ఎక్కడ కేసు నమోదైనా.. గరిష్టంగా మూడు సంవత్సరాల్లో సుప్రీంకోర్టు వరకు తుది తీర్పు వెలువడేలా వ్యవస్థ మారుతుందని చెప్పారు. న్యాయ సంహితలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాల కోసం ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్ లకు చట్టబద్ధత కల్పించినట్లు తెలిపారు. సమగ్ర నేర న్యాయ వ్యవస్థ ద్వారా పోలీసు, న్యాయవ్యవస్థ, ఫోరెన్సిక్ సైన్స్, విచారణ, జైళ్ల శాఖలను అనుసంధానించి వారి సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. చిన్న చిన్న నేరాలకు శిక్షగా తొలిసారి సామాజిక సేవను చట్టబద్దంగా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే నేరాల్లో ఫోరెన్సిక్ బృందాల పరిశీలనను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. దేశ చట్టాల్లో తొలిసారిగా ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చి, దేశం విడిచి పారిపోయిన నేరస్తులకు ‘ట్రయల్ ఇన్ అబ్సెంన్షియా’ (గైర్హాజరు విచారణ) విధానం ప్రవేశపెట్టడంతోపాటు నేరస్థులకు సంబంధించి విదేశాల్లో ఉన్న ఆస్తులను కూడా జప్తు చేసే నిబంధనలను కూడా రూపొందించినట్లు వెల్లడించారు. కొత్త చట్టాల్లో ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్కు మరింత ప్రాముఖ్యతనిచ్చినట్లు తెలిపారు. పత్రాల నిర్వచనాన్ని విస్తరించి.. ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులకు చట్టబద్దమైన గుర్తింపు కల్పించామని వివరించారు.
కొత్త న్యాయ సంహితలు పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత మన దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుతుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ కొత్త చట్టాలు న్యాయ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించడమే కాకుండా నేరస్తులకు శిక్షల శాతాన్ని పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. అస్సాం, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో శిక్షల శాతంలో ఇప్పటికే గణనీయమైన పెరుగుదల నమోదైందని ఆయన ప్రస్తావించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి 2026 వరకు గడిచిన ఈ 12 ఏళ్లు దేశ అంతర్గత భద్రతా చరిత్రలోఎప్పటికీ స్వర్ణ యుగంగా నిలిచిపోతాయని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. 2014 కంటే ముందు జమ్మూ కాశ్మీర్, నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు దశాబ్దాలుగా దేశ అంతర్గత భద్రతకు సవాలుగా నిలిచాయని చెప్పారు. 11 రాష్ట్రాలకు విస్తరించిన నక్సలిజం దేశ భద్రతకు పెద్ద ముప్పుగా ఉండేదని, ప్రస్తుతం దానిని పూర్తిగా నిర్మూలించే దశకు చేరుకున్నామని చెప్పారు. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని తీవ్రవాదం నుంచి పూర్తిగా విముక్తి చేయడంలో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 10,000 కంటే ఎక్కువ మంది యువకులు ఆయుధాలను వదిలిపెట్టి జన జీవన స్రవంతిలో కలిసిపోయారని.. 12కుపైగా శాంతి ఒప్పందాల ద్వారా ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో గణనీయమైన కృషి చేశామని చెప్పారు.
రాబోయే కాలంలో కొత్త భద్రతా వ్యవస్థను నెలకొల్పేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని శ్రీ అమిత్ షా తెలిపారు. దేశంలోని ప్రతి భూ సరిహద్దు వద్ద భద్రతా వ్యవస్థను ఆధునీకరించడం, చొరబాటుదారులు లేని దేశంగా మార్చడం, మూడు కొత్త న్యాయ సంహితలను పూర్తిస్థాయిలో అమలు చేయడంపైనే హోం మంత్రిత్వ శాఖ పూర్తి దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు.
***
(రిలీజ్ ఐడి: 2228852)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6