ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 9:19PM by PIB Hyderabad
గౌరవ అధ్యక్షా,
రాష్ట్రపతి గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేయదలచుకున్నాను.
గౌరవ అధ్యక్షా,
ఈ ధన్యవాద తీర్మానానికి మద్దతుగా నా భావాలను ఈ సభ ముందు ఉంచడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
గౌరవ అధ్యక్షా,
అభివృద్ధి చెందిన భారత్ దిశగా ప్రయాణంలో గత ఏడాది వేగవంతమైన పురోగతి, వృద్ధిని నమోదు చేసింది. జీవితంలోని ప్రతి రంగం, సమాజంలోని ప్రతి విభాగం ఒక పరివర్తనాత్మక దశను చూశాయి. దేశం సరైన దిశలో అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. గౌరవ రాష్ట్రపతి గారు అత్యంత సున్నితత్వం, స్పష్టతతో ఈ విషయాలను మన ముందు ఉంచారు.
గౌరవ అధ్యక్షా,
నాదొక చిన్న విన్నపం. గౌరవ ఖర్గే గారి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూర్చొని నినాదాలు చేసే అవకాశం ఇస్తే బాగుంటుంది. ఆయన వెనుక చాలా మంది యువసభ్యులు ఉన్నారు. దయచేసి ఖర్గే గారిని తన సీటులోనే కూర్చుని నినాదాలు చేయడానికి అనుమతించండి.
గౌరవ అధ్యక్షా,
రాష్ట్రపతి గారు తన ప్రసంగంలో మధ్యతరగతి- దిగువ మధ్యతరగతి ప్రజలు, పేదలు, గ్రామాలు, రైతులు, మహిళలు, శాస్త్ర విజ్ఞానం, వ్యవసాయ రంగాల గురించి సవివరంగా మాట్లాడారు. దేశ ప్రగతి ఆమె మాటల్లో పార్లమెంట్ అంతటా ప్రతిధ్వనించాయి. యువత భారతదేశ శక్తిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఆమె వివరించారు. సమాజంలోని ప్రతి విభాగం సామర్థ్యాలను ఆమె ప్రధానంగా చెప్పారు. అన్నింటికంటే గొప్పగా భారత ఉజ్వల భవిష్యత్తుపై ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇది మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.
గౌరవ అధ్యక్షా,
21వ శతాబ్దపు మొదటి పావు భాగం ముగిసింది. గత శతాబ్దపు రెండో పావు భాగం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎలాగైతే నిర్ణయాత్మకమైనదో ఈ రెండో పావు భాగం కూడా అంతే శక్తివంతమైందన్న స్పష్టతతో నేను ఉన్నాను. ఇది భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి వేగంగా ముందుకు నడిపిస్తుంది.
కాబట్టి గౌరవ అధ్యక్షా,
మనం ఒక కీలకమైన ఘట్టానికి చేరుకున్నామని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మనం ఆగకూడదు వెనుదిరిగి చూడకూడదు. మనం ముందుకు చూడాలి. మరింత వేగంగా కదలాలి. మన లక్ష్యాలను సాధించిన తర్వాతే విశ్రమించాలి. ఈ దిశగానే మనం అడుగులు వేస్తున్నాం.
గౌరవ అధ్యక్షా,
ఒకేసారి అనేక అనుకూల పరిస్థితుల ఆశీర్వాదం ప్రస్తుతం భారతదేశానికి ఉంది. ఇది నిజంగా అరుదైన, అదృష్టకరమైన కలయిక. అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచంలోని ధనిక దేశాలన్నీ వృద్ధాప్యం వైపు వెళ్తుంటే మన దేశం మాత్రం కొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తోంది. అంతేకాకుండా మరింత యువ శక్తితో విరాజిల్లుతోంది. భారత్ యువత ఉన్న దేశం. ఇది మనకు ఉన్న గొప్ప సానుకూలత.
గౌరవ అధ్యక్షా,
మరోవైపు భారత్ పట్ల పెరుగుతున్న ప్రపంచ ఆకర్షణను, భారతీయ ప్రతిభకు లభిస్తున్న గుర్తింపును నేను చూస్తున్నాను. యువకులు, ప్రతిష్ఠాత్మక లక్ష్యాలు కలవారు, పట్టుదల గలవారు, సమర్థులతో కూడిన ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ప్రతిభావంతుల సమూహం నేడు మన దగ్గర ఉంది. ఇది మనకు లభించిన మరొక వరం.. ఒక నిజమైన బలం.
గౌరవ అధ్యక్షా,
నేడు భారతదేశం ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను చూపే ఒక ఆశాకిరణంలా నిలుస్తోంది. మరో అనుకూలమైన పరిస్థితి ఏమిటంటే.. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత వృద్ధి రేటు అత్యధికంగా ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం. ఈ విశిష్టమైన కలయిక మన ఆర్థిక వ్యవస్థకు ఉన్న బలాన్ని చాటిచెబుతోంది.
గౌరవ అధ్యక్షా,
ఈ దేశ ప్రజలు మాకు సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు భారత్ 'ఫ్రాజైల్ ఫైవ్' జాబితాలో ఉండేది. స్వాతంత్ర్య సమయంలో మనం ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేవాళ్లం. కానీ గత నాయకత్వంలో మనం 11వ స్థానానికి పడిపోయాం. నేడు మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాం.
గౌరవ అధ్యక్షా,
విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం లేదా క్రీడలు ఇలా ఏ రంగాన్ని చూసినా నేడు భారతదేశం ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యంతో నిలబడింది. కోవిడ్ తర్వాత ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతోంది. ప్రపంచం ఒక కొత్త ప్రపంచ క్రమం దిశగా పయనిస్తోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక రకమైన ప్రపంచ క్రమం ఏర్పడింది. ఇప్పుడు అంతే వేగంగా ఒక కొత్త వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఈ పరిణామాలను నిష్పాక్షికంగా విశ్లేషిస్తే.. ప్రపంచం ఇప్పుడు స్పష్టంగా భారత్ వైపు మొగ్గు చూపుతుండటం మనందరికీ గర్వకారణం. ఒక నమ్మకమైన భాగస్వామిగా, మిత్రుడిగా భారత్ నేడు అనేక దేశాలకు అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశంగా మారింది. ప్రపంచ శ్రేయస్సు కోసం మన వంతు శక్తితో తోడ్పాటునందిస్తూ ఇతర దేశాలతో భుజం భుజం కలిపి నిలబడుతున్నాం.
గౌరవ అధ్యక్షా,
నేడు ప్రపంచమంతా 'గ్లోబల్ సౌత్' గురించి మాట్లాడుతోంది. అంతర్జాతీయ వేదికలపై ఈ దేశాల గొంతుకగా భారత్ మారింది. అనేక దేశాలతో మనం భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటున్నాం. ఇటీవల మనం కీలకమైన దేశాలతో తొమ్మిది ప్రధాన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ఇందులో భాగంగా 27 దేశాలతో కూడిన ఐరోపా సమాఖ్యతో 'అన్ని ఒప్పందాలకు తలమానికం' అయిన చారిత్రాత్మక ఒప్పందాన్ని కూడా చేసుకున్నాం. ఒకప్పుడు ఏ దేశం కూడా మనతో వ్యాపారం చేయడానికి సిద్ధంగా లేని స్థితిలో ఈ దేశాన్ని ఎందుకు వదిలేశారో.. ‘అలసిపోయి మధ్యలోనే వేదికను వీడి వెళ్లిన వారు’ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బహుశా వారు ప్రయత్నించారు కావచ్చు.. ప్రపంచ దేశాల చుట్టూ తిరిగారు కావచ్చు. కానీ అప్పట్లో ఎవరూ వారి వైపు చూడలేదు. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేడు దేశాలు భారత్తో ఒప్పందాలు చేసుకుంటున్నాయంటే అది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. భారత్ బలం, అంతర్జాతీయ స్థాయిని చూసే అవి ముందుకు వస్తున్నాయి.
గౌరవ అధ్యక్షా,
ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అభివృద్ధి చెందిన దేశాలు ఒక అభివృద్ధి చెందుతున్న దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు అది ప్రపంచ ఆర్థిక రంగానికి ఒక శక్తిమంతమైన సందేశాన్ని పంపుతుంది. ఇది నాకు కొత్తేమీ కాదు. నేను గుజరాత్లో సేవ చేసే అవకాశం పొందినప్పుడు 'వైబ్రెంట్ గుజరాత్' సదస్సును నిర్వహించాను. అప్పట్లో ఒక భారతీయ రాష్ట్రం జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాన్ని తన భాగస్వామిగా పొందినందుకు నేను గర్వపడ్డాను. ఒక రాష్ట్రం అప్పట్లోనే ఆ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. నేడు నా దేశం జాతీయ స్థాయిలో దీనిని నిరూపిస్తోంది. మన వద్ద ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పుడు, మన పౌరులు ఉత్సాహంగా ఉన్నప్పుడు, తయారీ రంగానికి సంబంధించిన బలమైన వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం మీతో ఒప్పందాల కోసం ముందుకు వస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగిపోయిన వారు దేశాన్ని ఇటువంటి అంశాల్లో బలోపేతం చేయడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే నేను ఒక మాట స్పష్టంగా చెబుతున్నాను. నా మాటలపై మీకు నమ్మకం లేకపోతే ఈ దేశ ప్రజలు ఒక్కసారి ఎర్రకోట నుంచి కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన ప్రసంగాలను విశ్లేషించాలని కోరుతున్నాను. వారి వద్ద ఎటువంటి దార్శనికత, ఆలోచనలు లేదా సంకల్ప బలం లేవని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల దేశం ఎంతో నష్టపోయింది.
గౌరవ అధ్యక్షా,
నాకు సేవ చేసే అవకాశం కల్పించిన ఈ దేశ ప్రజలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేడు మా శక్తిలో ఎక్కువ భాగం వారు చేసిన తప్పులను సరిదిద్దడానికే ఖర్చవుతోంది. ప్రపంచం దృష్టిలో ఆనాడు భారత్కు ఉన్న పేరును మార్చడానికి ఎంతో కృషి చేయాల్సి వస్తోంది. వారు దేశాన్ని శిథిలావస్థలో వదిలిపెట్టారు. దానిని సరిచేయడానికి మేం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాం. నేడు మీరు చూడొచ్చు.. దేశం విధానాల ద్వారా నడుస్తోంది తప్ప అప్పటికప్పుడు తీసుకునే తప్పుడు నిర్ణయాల ద్వారా కాదు. ఇదే ప్రపంచవ్యాప్తంగా నమ్మకాన్ని పెంచింది. మేం 'సంస్కరణ, ప్రదర్శన, పరివర్తన' అనే మంత్రంతో ముందుకు సాగాం. నేడు దేశం 'సంస్కరణల ఎక్స్ప్రెస్'పై పయనిస్తోంది. మేం నిర్మాణాత్మక సంస్కరణలు, విధానపరమైన సంస్కరణలను అమలు చేశాం. భారత్ ఉత్పత్తి చేసే ప్రతి వస్తువుకు విలువను జోడించేలా మన తయారీ రంగాన్ని, పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయడానికి పనిచేశాం. నేడు భారత్ ప్రపంచంతో పోటీ పడటానికి పూర్తి సిద్ధంగా ఉందని నేను విశ్వాసంతో చెప్పగలను. నేను గ్లోబల్ సీఈఓల ఫోరమ్లకు హాజరైనప్పుడు ప్రపంచం మన పారిశ్రామికవేత్తలను తమతో సమానంగా చూడటాన్ని గమనిస్తున్నాను. ఇటీవల అన్ని పార్టీల ప్రతినిధులు విదేశాలకు వెళ్లినప్పుడు భారతదేశానికి సమాన గౌరవం లభిస్తోందని గౌరవ సభ్యులు నాతో గర్వంగా చెప్పారు. ఇది ఒక గొప్ప విజయం.
గౌరవ అధ్యక్షా,
మన దేశంలోని విస్తారమైన ఎంఎస్ఎంఈ నెట్వర్క్ మన ఆర్థిక వ్యవస్థకు ఒక దీర్ఘకాలిక బలం. మేం ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. నేడు మన ఎంఎస్ఎంఈల పట్ల ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోంది. మనం విమానం మొత్తాన్ని తయారు చేయకపోవచ్చు కానీ విమానాల్లో వాడే అనేక విడిభాగాలను భారత్లోని చిన్న చిన్న ఎంఎస్ఎంఈలే తయారు చేస్తున్నాయి.
గౌరవ అధ్యక్షా,
ఈ కృషి ద్వారా వస్తోన్న ఫలితాలు అందరికీ కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని అగ్ర దేశాలు భారత్తో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఐరోపా సమాఖ్యతో కుదిరిన వాణిజ్య ఒప్పందం కావచ్చు లేదా ఇటీవల అమెరికాతో కుదిరిన ఒప్పందం కావచ్చు.. ప్రపంచమంతా ఈ ఒప్పందాలను బహిరంగంగా ప్రశంసిస్తోంది. అమెరికా ఒప్పందం గురించి దీని గురించి మన సహచరులు పీయూష్ గారు ఈ సభలో సవివరంగా తెలియజేశారు. ఈయూ ఒప్పందంపై సంతకాలు జరిగినప్పుడు ప్రపంచ స్థిరత్వం పెరుగుతుందన్న నమ్మకం కలిగింది. అమెరికాతో ఒప్పందం తర్వాత ప్రపంచం కేవలం స్థిరత్వాన్ని మాత్రమే కాకుండా ఒక కొత్త వేగాన్ని కూడా పొందింది. ఇది ప్రపంచానికి ఒక సానుకూల సంకేతం.
గౌరవ అధ్యక్షా,
దీనివల్ల అత్యధికంగా లబ్ధి పొందేది మన దేశ యువత. నేను యువత అని అన్నప్పుడు అది మధ్యతరగతి, నగరాలు లేదా గ్రామాల నుంచి వచ్చిన యువతీయువకులందరినీ ఉద్దేశించి చెబుతున్నాను. మనం వారిని విడివిడిగా చూడకూడదు. భారత యువత శక్తిని చూసి మనం గర్వపడాలి. నేడు ప్రపంచ మార్కెట్ వారి కోసం తలుపులు తెరిచి ఉంది.. అనంతమైన అవకాశాలను అందిస్తోంది. నేను వారికి చెబుతున్నాను. మిత్రులారా, ముందుకు రండి! నేను మీకు భుజం భుజం కలిపి నిలబడతాను. ధైర్యంగా ముందుకు సాగండి! దేశం మీకు అండగా ఉంది.. ప్రపంచం మిమ్మల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది.
గౌరవ అధ్యక్షా,
ప్రపంచవ్యాప్తంగా మన యువ నిపుణుల కోసం గిరాకీ పెరుగుతోంది. చివరికి సంరకక్షులకు కూడా డిమాండ్ ఉంది. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు మాకు ఇటువంటి ప్రతిభావంతులు కావాలని అడుగుతున్నారు. కొంతమంది అయితే అర్హత కలిగిన నిపుణులను వెతకడానికి ఇక్కడే ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయ నిపుణులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి.
గౌరవ అధ్యక్షా,
పార్లమెంట్లోని ఈ ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ జరుగుతున్న చర్చల స్థాయిని గమనిస్తుంటే ఇది ఇంకా ఉన్నతంగా ఉండాల్సిందని నాకు అనిపిస్తోంది. ముఖ్యంగా ఇన్ని ఏళ్లపాటు పాలించిన వారి నుంచి చర్చా ప్రమాణాలు ఇంకా మెరుగ్గా ఉండాలి. కానీ వారు ఈ అవకాశాన్ని వృథా చేశారు. దేశం వారిని ఎలా నమ్ముతుంది?
గౌరవ అధ్యక్షా,
నిన్న నేను ఒక గౌరవ సభ్యుడి ప్రసంగం విన్నాను. ఆయన తనను తాను గర్వంగా 'రాజు' అని పిలుచుకుంటారు. అటువంటి వ్యక్తి ఆర్థిక అసమానతల గురించి మాట్లాడుతున్నారు. తనను తాను రాజు అని పిలుచుకునే వ్యక్తి అసమానతల మీద మాట్లాడటం గురించి ఆలోచించండి. మనం ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుందా అనిపిస్తోంది.
గౌరవ అధ్యక్షా,
టీఎంసీ సహచరులు ఇక్కడ చాలా సేపు మాట్లాడారు. కానీ వారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వారిది కనికరం లేని ప్రభుత్వం. పతనానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయినప్పటికీ వారు ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెబుతున్నారు. అటువంటి ప్రభుత్వ పాలనలో ప్రజల భవిష్యత్తు చీకటిలోకి వెళ్తోంది. కానీ వారికి ఇది పట్టదు. కేవలం అధికార దాహమే వారి ఏకైక ఆశయం. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు కూడా అక్రమ వలసదారులను బహిష్కరిస్తాయి. కానీ మన దేశంలో చొరబాటుదారులను రక్షించడానికి న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. తమ హక్కులను, జీవనోపాధిని, గిరిజనుల భూములను లాక్కుంటూ తమ బిడ్డల ప్రాణాలకు ముప్పుగా మారిన చొరబాటుదారులను సమర్థించే వారిని భారత యువత ఎలా క్షమిస్తుంది? మహిళలపై అకృత్యాలు జరుగుతున్నా వారు ఉదాసీనంగానే ఉంటున్నారు. అధికార రాజకీయాలు తప్ప వారు ఏమీ చేయరు. ఇటువంటి తీవ్రమైన అంశాలపై వారు కళ్లు మూసుకుని కూర్చుంటారు. మరొక గౌరవ సభ్యుడు చాలా సేపు మాట్లాడారు. నిజానికి ఆయన ప్రభుత్వం మొత్తం మద్యంలో మునిగిపోయింది. వారి గాజు భవనాలు ప్రతి ఇంట్లోనూ ద్వేషానికి చిహ్నాలుగా మారాయి. బహుశా అందుకే వారు 'నలుపు' అనే పదాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారేమో. అందరికీ ఒక గతం ఉంటుంది.. 'నలుపు'తో వారికి ఉన్న పాత అనుబంధం ఏమిటో ఎవరికి తెలుసు!
గౌరవ అధ్యక్షా,
అటువంటి సహచరులందరికీ నేను ఈరోజు ఒకటే చెబుతున్నాను. మీరు ఇంకెంత కాలం ప్రపంచాన్ని మోసం చేస్తారు? అద్దంలో చూసుకున్నప్పుడు మీ నిజాన్ని ఎక్కడ దాచుకుంటారు? కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, వామపక్షం.. వీరంతా దశాబ్దాల తరబడి కేంద్రంలో అధికారంలో భాగస్వాములుగా ఉన్నారు. రాష్ట్రాల్లో కూడా పాలించే అవకాశాలు పొందారు. కానీ నేడు వారి గుర్తింపు ఏమిటి? ఇప్పుడు ఒప్పందాల గురించి చర్చ జరుగుతుంటే మనం గర్వంగా మాట్లాడుకుంటున్నాం. కానీ వారి కాలంలో ఒప్పందాల గురించి చర్చ వస్తే అందరికీ 'బోఫోర్స్' ఒప్పందమే గుర్తొచ్చేది. అవే వారి ఒప్పందాలు. వారు కేవలం తమ జేబులు నింపుకున్నారు తప్ప ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్నది వారికి ఎన్నడూ ప్రాధాన్యత కాలేదు.
గౌరవ అధ్యక్షా,
చర్చలో ఈ అంశాలు వచ్చాయి కాబట్టి నేను కొన్ని ఉదాహరణలు ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రంగం గురించి మాట్లాడుకుందాం. 2014 కంటే ముందు అది 'ఫోన్ బ్యాంకింగ్' యుగం. అప్పట్లో నాయకులు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చేసేవారు. కానీ పేద ప్రజలను మాత్రం బ్యాంకుల వద్ద చులకనగా చూసేవారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు అసలు బ్యాంకు గుమ్మం కూడా తొక్కలేదు. కాంగ్రెస్ నాయకుల ఫోన్ కాల్స్పై బిలియన్ల కొద్దీ నిధులు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకున్న వారు దానిని తమ సొంత ఆస్తిలా భావించేవారు. కాంగ్రెస్, యూపీఏ పాలనలో ఆడిన ఆట ఇది. నేడు ఈ 'ఇండియా' కూటమిలోని రాష్ట్రాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలే స్థితికి చేరుకున్నాయి. నేను మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఒక దేశాధినేతతో మాట్లాడాను. మనం బ్యాంకింగ్లో ముందుకు సాగాలని నేను చెబితే ఆయన.. 'సర్ మీరు కొత్తగా వచ్చారు.. మీరు పురోగతి గురించి ఆలోచించే ముందు మీ బ్యాంకింగ్ వ్యవస్థను ఒక్కసారి అధ్యయనం చేయండి. దానిని మేం ఎలా నమ్మగలం?' అని బదులిచ్చారు. ఆ నాయకుడికి అసలు వాస్తవం తెలుసు. కానీ ఇక్కడ ఉన్నవారికి అది పట్టలేదు. ఎన్పీఏలు కొండల్లా పేరుకుపోయాయి. ఎక్కడ చూసినా ఎన్పీఏల పరిస్థితి ఏంటి? మనం ఎలా బతుకుతాం? అనే చర్చలే జరిగేవి.
గౌరవ అధ్యక్షా,
ఆ సమస్య చాలా పెద్దది. కానీ మేం విజ్ఞతతో వ్యవహరించాం. బ్యాంకింగ్ వ్యవస్థలోని భాగస్వాములను విశ్వాసంలోకి తీసుకున్నాం. సంస్కరణలు అవసరమని గుర్తించి ధైర్యంతో వాటిని అమలు చేశాం. మేం పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాం. అనేక బ్యాంకింగ్ సంస్కరణలను ప్రవేశపెట్టాం. బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను బలమైన బ్యాంకులతో విలీనం చేశాం. తనను తాను చాలా మేధావిగా భావించే ఒక వ్యక్తి.. 'ఒకవేళ మోదీ ప్రభుత్వం బ్యాంకులను సంస్కరించగలిగితే అది భారత్ సాధించిన గొప్ప సంస్కరణలలో ఒకటి అవుతుంది' అని ఒకప్పుడు రాశారు. నేను పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ పనిని పూర్తి చేశాను.
గౌరవ అధ్యక్షా,
ఈ ప్రయత్నాల ఫలితంగా మన బ్యాంకుల్లో వేళ్లూనుకున్న వ్యాధి పూర్తిగా తొలగిపోయింది. బ్యాంకుల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి ఇప్పుడు అవి పరుగులు తీస్తున్నాయి. బ్యాంకుల పరిస్థితి మెరుగుపడటంతో లావాదేవీలు పెరిగాయి.. సామాన్య ప్రజలకు రుణాలు అందడం ప్రారంభమైంది. ఒకప్పుడు బ్యాంకుల తలుపులు మూసుకుపోయిన పేదవారికి కూడా ఇప్పుడు రుణాలు అందుతున్నాయి. నేడు 'ముద్ర యోజన' దేశ యువత తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తోంది. ఇది స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది. స్వయం ఉపాధి అనేది కేవలం ప్రసంగాలతో రాదు. దీనికి మద్దతు, మార్గదర్శకత్వం, సహాయం అవసరం. ముద్ర యోజన ద్వారా మేం ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 30 లక్షల కోట్లకు పైగా రుణాలను నేరుగా యువత చేతుల్లో పెట్టాం. వారు తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు లబ్ధిదారులుగా ఉండటం గర్వకారణం. స్వయం సహాయక సంఘాల మహిళలు, గొప్ప కలలు ఉన్న గ్రామీణ మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి ఈ పథకం బలాన్ని ఇచ్చింది. మేం ఈ సంఘాల పరిధిని విస్తరించి 10 కోట్ల మంది మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించాం. మన ఎంఎస్ఎంఈ రంగానికి కూడా పుష్కలంగా రుణాలు అందాయి. 2014 కంటే ముందు కొండల్లా ఉన్న ఎన్పీఏలను నేడు 1 శాతం కంటే తక్కువకు తగ్గించామని నేను ఈ గౌరవప్రదమైన సభలో పూర్తి బాధ్యతతో ప్రకటిస్తున్నాను. బ్యాంకింగ్ ఆరోగ్యానికి ఇది ఒక అద్భుతమైన విజయం. అంతేకాకుండా మన బ్యాంకులు ఇప్పుడు చారిత్రాత్మక లాభాలను నమోదు చేస్తున్నాయి. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ పనిని మేము పూర్తి చేశాం.
గౌరవ అధ్యక్షా,
నేను మరొక ఉదాహరణ ఇస్తాను. మన పీఎస్యూలు విఫలమవడానికో, కుప్పకూలడానికో లేదా మూతపడడానికో పుట్టినవనే బలమైన అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. కానీ మేం వాస్తవాలతో ఈ ఆలోచనా విధానాన్ని మార్చగలిగాం. కొందరు వ్యక్తులు ఈ సంస్థల గురించి అసత్యాలను ప్రచారం చేశారు. 'అర్బన్ నక్సల్స్' మాదిరిగా వ్యవహరిస్తూ గేట్ల వద్ద కార్మికులను రెచ్చగొట్టారు.. వారిని తప్పుదోవ పట్టించారు. ఎల్ఐసీ, భారతీయ స్టేట్ బ్యాంక్, హెచ్ఏఎల్ వంటి సంస్థలను అత్యంత దారుణంగా కించపరిచారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఆ సంస్థలను సరిగ్గా నిర్వహించలేకపోయారు.. సంస్కరించలేకపోయారు.
గౌరవ అధ్యక్షా,
మేం ఇక్కడ కూడా ధైర్యాన్ని ప్రదర్శించాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో నిరంతర సంస్కరణల సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాం. నేడు ఎల్ఐసీ తన చరిత్రలోనే అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని మూతపడే స్థితికి నెట్టేసిన సంస్థలు ఇప్పుడు చారిత్రాత్మక లాభాలను గడిస్తున్నాయి. అవి 'మేక్ ఇన్ ఇండియా'కు వెన్నుముకగా నిలుస్తూ ఈ కలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్థలు రికార్డు స్థాయిలో ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. మన ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ సత్తా చాటుతున్నాయి. అనేక దేశాల అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములవుతూ స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ ఆర్డర్లను సాధిస్తున్నాయి. భారత్ ఒక కీలకమైన మైలురాయికి చేరుకుందని, రాబోయే 25 ఏళ్లు దేశ రూపురేఖలను మార్చేలా ఉంటాయని ఇది సంకేతం ఇస్తోంది.
గౌరవ అధ్యక్షా,
కాంగ్రెస్ తన ద్రోహపూరిత రాజకీయాల్లో ఈ దేశ రైతులను కూడా వదిలిపెట్టలేదు. మన దేశంలో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న చిన్న రైతులు 10 కోట్ల మంది ఉన్నారు. వారిని గతంలో ఎప్పుడూ పట్టించుకోలేదు. కొందరు పెద్ద రైతులతో కలిసి ఉంటూ వ్యవస్థ నడుస్తుందని భావించడం వారి రాజకీయ శైలి. అందుకే చిన్న రైతుల ప్రాముఖ్యతను వారు గుర్తించలేదు.
గౌరవ అధ్యక్షా,
మేం చిన్న రైతుల బాధను అర్థం చేసుకున్నాం. మాకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసు. అందుకే మేం 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని ప్రవేశపెట్టాం. చాలా తక్కువ కాలంలోనే రూ. 4 లక్షల కోట్లను నేరుగా చిన్న రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశాం. గౌరవ అధ్యక్షా.. రూ. 4 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇది మన చిన్న రైతులకు కొత్త బలాన్ని, కొత్త కలలను, కొత్త సామర్థ్యాలను ఇచ్చింది. మన రైతులు దేశ ఆశయాలకు అనుగుణంగా ఫలితాలను అందిస్తారనే నమ్మకం నాకుంది.
గౌరవ అధ్యక్షా,
పథకాల అమలు గురించి కొందరు సహచరులు చాలా మాట్లాడారు. బహుశా వారు ఇలా మాట్లాడాలని ముందే సిద్ధమై వచ్చినట్లున్నారు. వారి కూటమి బంధం ఇక్కడ కనిపిస్తోంది కానీ మరెక్కడా కనిపించడం లేదు.
గౌరవ అధ్యక్షా,
అమలు గురించి వారు గొప్పగా చెబుతున్నారు. నేనొక ఉదంతాన్ని పంచుకుంటాను.. ఎవరినీ విమర్శించడానికి కాదు వాస్తవాలను చెప్పడానికి మాత్రమే. వాస్తవాలు కొందరికి ఇబ్బంది కలిగించొచ్చు. కానీ నిజం ఎప్పుడూ నిజమే. గతంలో మన దేశానికి చెందిన ఒక నాయకురాలు హిమాచల్ ప్రదేశ్ను సందర్శించారు. తిరిగి వచ్చాక ఆమె స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఇది రికార్డుల్లో కూడా ఉంది. ఆమె ఏమన్నారంటే.. 'పర్వత ప్రాంతాల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించడానికి ప్రణాళిక సంఘం నిరాకరించడంతో నేను చాలా కాలం పోరాటం చేయాల్సి వచ్చింది. నేను హిమాచల్ వెళ్లి వచ్చాక ప్రణాళిక సంఘంతో మా కార్యకర్తలకు జీపులు కాదు బరువులు మోయడానికి కంచర గాడిదలు కావాలని చెప్పాను. అప్పుడు ఆమెకు వచ్చిన సమాధానం ఏంటంటే.. 'మేం కేవలం జీపులకే నిధులు ఇస్తాం ఎందుకంటే కంచర గాడిదల కోసం మా వద్ద ఎటువంటి పాలసీ లేదు.' అదే ప్రసంగంలో ఆమె.. 'అక్కడ అప్పట్లో రోడ్లు కూడా లేవు' అని చెప్పారు. రోడ్లే లేని చోట జీపులు ఎందుకు? రోడ్లు లేని చోట జీపును ఎవరు నడుపుతారు? అయినప్పటికీ ప్రణాళిక సంఘం మాత్రం 'ఇస్తే జీపులు ఇస్తాం లేదంటే ఏమీ ఇవ్వం' అని మొండికేసింది.
గౌరవ అధ్యక్షా,
ఈ మాటలు అన్నది మరెవరో కాదు.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో ఉన్న పని సంస్కృతి ఇది. ఇటువంటి తప్పుడు పద్ధతులు జరుగుతున్నాయని ఇందిరా గారికి తెలిసినప్పటికీ ఆమె వాటిని సరిదిద్దడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆమె విమర్శించిన ఆ ప్రణాళిక సంఘాన్ని స్వయంగా ఆమె తండ్రి గారే ఏర్పాటు చేశారు. అది ఏర్పడినప్పటి నుంచి ఆమె ఈ ప్రసంగం చేసే సమయానికి రెండు దశాబ్దాలు గడిచినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. 2014 వరకు అందరూ అసంతృప్తిగానే ఉన్నారు.. అందరూ తప్పులను చూశారు.. కానీ ఎవరూ సంస్కరణలకు సిద్ధపడలేదు. 2014లో మాకు అవకాశం లభించినప్పుడు మేం ఆ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి 'నీతి ఆయోగ్'ను ఏర్పాటుచేశాం. నేడు నీతి ఆయోగ్ అత్యంత వేగంగా పనిచేస్తోంది. 'ఆకాంక్షిత జిల్లాల' కార్యక్రమమే దీనికి ఒక శక్తిమంతమైన ఉదాహరణ. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక గొప్ప నమూనా అని నేడు అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రశంసిస్తున్నాయి. ఒకప్పుడు వెనుకపడ్డవిగా ముద్రపడి లక్షలాది మంది ప్రజల ప్రాథమిక అవసరాలు నిర్లక్ష్యానికి గురైన జిల్లాలు ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నాయి. గతంలో ఇటువంటి జిల్లాలకు అధికారులను పంపడాన్ని ఒక 'శిక్ష'గా భావించేవారు. దీనివల్ల అక్కడి పరిస్థితులు మరింత దిగజారేవి. అప్పట్లో ఉన్న పని సంస్కృతి అది. మేం దీనిని మార్చాం. మేం అక్కడ సమర్థులైన యువ అధికారులను నియమించాం. వారికి పని చేయడానికి మూడేళ్ల సమయం ఇచ్చాం. ఒకదాని తర్వాత ఒకటిగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. నేడు ఛత్తీస్గఢ్లోని బస్తర్ను చూడండి. ఒకప్పుడు అది ఆకాంక్షిత జిల్లా. నేడు 'బస్తర్ ఒలింపిక్స్' ద్వారా ఆ జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అభివృద్ధి ప్రతి గ్రామానికి చేరుతోంది. కొన్ని గ్రామాలకు మొదటిసారి బస్సు సౌకర్యం రావడంతో ఆ ప్రాంత ప్రజలంతా పండుగలా జరుపుకున్నారు. మేం తీసుకువచ్చిన పరివర్తన ఇది. కానీ దేశాన్ని అటువంటి దుస్థితిలో వదిలేసిన వారు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
గౌరవ అధ్యక్షా!
వాస్తవానికి ఆచరణాత్మకత అంటే ఏమిటో చెప్పడానికి ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమమే తిరుగులేని నిదర్శనం. ఉదాహరణ. ఇలాంటివి వందల సంఖ్యలో ఉన్నప్పటికీ, ఉటంకింపు నిమిత్తం దీన్ని ఉదాహరించాను. ఈ ప్రగతిశీల పరిణామాలకు దన్నుగా ఉన్న ఆచరణాత్మక సామర్థ్యం మా కాంగ్రెస్ మిత్రులకు కానరావడం లేదు. పాతకాలపు ప్రణాళిక సంఘ విధానం... అంటే- “జీప్ - కంచర గాడిద” వారి ఏకైక నమూనా కావడమే ఇందుకు కారణం. అంతకుమించి వారికేమీ తెలియదు! ఆచరణాత్మకత గురించి ఒక్కసారి యోచిద్దాం... నర్మదా నదిపై ఒక ఆనకట్టను నిర్మించాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేను పుట్టక ముందే సంకల్పించారు. అందుకు ప్రణాళిక కూడా సిద్ధమైంది... కానీ, సర్దార్ పటేల్ మరణించారు. అటుపైన శ్రీ నెహ్రూ శంకుస్థాపన చేశారు. దశాబ్దాలు గడిచినా అతీగతీ లేదు. నేను ప్రధానమంత్రిని అయ్యాక దాన్ని ప్రారంభించే గౌరవం నాకు దక్కింది. నా రైతుల ప్రయోజనాలు లక్ష్యంగా సర్దార్ సరోవర్ ఆనకట్ట కోసం ముఖ్యమంత్రి హోదాలో నా ప్రతిష్టను పణంగా పెట్టి, మూడు రోజుల నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగి రాగా, నిర్మాణం ఊపందుకుంది. ఇవాళ ‘బీఎస్ఎఫ్’ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న కచ్లోని ఖావడా సరిహద్దు వరకూ స్వచ్ఛ నర్మదా జలాలు ప్రవహిస్తున్నాయి. ఆచరణాత్మకత అంటే ఇదే... కానీ, కాంగ్రెస్ పార్టీ తద్విరుద్ధంగా రాజకీయ లబ్ధి కోసం ప్రకటనలు చేసి, లాంఛనప్రాయంగా జ్యోతి వెలిగించి, పునాది రాళ్లు వేయడంతో సరిపెట్టింది తప్ప, ఆ తర్వాత చేసింది శూన్యం. ఈ సంస్కృతిని మార్చే లక్ష్యంతోనే నేను ‘ప్రగతి’ పేరిట సరికొత్త సాంకేతిక పర్యవేక్షణ వేదికను సృష్టించాను. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెబుతాను: హిమాచల్ ప్రదేశ్లో ఒక రైల్వే ప్రాజెక్టు చేపడతామని పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. అది బహుశా ‘ఊనా’ ప్రాజెక్టు అనుకుంటాను- కానీ, నేను అధికార బాధ్యతలు స్వీకరించే నాటికి కనీసం దానికి సంబంధించిన రేఖాచిత్రం కూడా గీసిన దాఖలాలు లేవు. అప్పట్లో ఎన్నికలను దృష్టి పెట్టుకుని ఒక ప్రకటతో సరిపెట్టారు. అయితే, ‘ప్రగతి’ వేదిక ద్వారా అలాంటి మరెన్నో ప్రాజెక్టులను నేను సమీక్షించి, పర్యవేక్షిస్తూ వచ్చాను. ప్రతి ప్రాజెక్టు ఎందుకు స్తంభించిందో, అది ఏదైనా శాఖ తప్పిదమో, చట్టపరమైన అడ్డంకులున్నాయో లేక అంచనా వ్యయం ఎందుకు పెరిగిందో... వంటి ఎన్నో అంశాలను మేం నిశితంగా పరిశీలించాం. ఓ ప్రాజెక్టు ₹900 కోట్లతో పూర్తికావాల్సి ఉండగా, దాని వ్యయం ₹90,000 కోట్లకు పెరిగిపోయింది. మేం నెలవారీ సమీక్ష ప్రారంభించాక ఇప్పటివరకూ నేను 50వ విడత ‘ప్రగతి’ సమావేశాన్ని ఇటీవలే పూర్తి చేశాను. రాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో ఇలా ₹85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మార్గం సుగమం చేశాం. అంటే జాతీయ స్థాయిలో ఎంతటి శక్తిసామర్థ్యాలను మేం వెలికితీశామో గమనించండి. రైల్వేలు, రహదారులు, నీటిపారుదల, గ్రామీణ మౌలిక సదుపాయాలు- వగైరాల పనులన్నీ వేగిరపరచాం. మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన జమ్మూ-ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ఇప్పుడు పూర్తయింది. మంచుతో కమ్ముకుపోయిన లోయల గుండా వందే భారత్ రైలు ప్రయాణిస్తున్న వీడియో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడమే కాదు... “ఇది విదేశాల్లోని దృశ్యం కాదు... ఇది సాక్షాత్తూ భారత్” అంటూ ప్రజలు అందులో వ్యాఖ్యానించారు. ఆచరణాత్మకత అంటే ఇదీ!
గౌరవ అధ్యక్షా!
నేనిప్పుడు అస్సాం గురించి ప్రస్తావిస్తున్నాను- ఇందుకు కారణం ఎన్నికలు కానేకాదు... కాంగ్రెస్ వైఫల్యాలే. కాంగ్రెస్ ఆచరణాత్మకత కేవలం ఊహలకే పరిమితం తప్ప అమలువైపు ఎన్నడూ ఉండదు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలను కలిపే బోగిబీల్ వంతెననే ఉదాహరణగా తీసుకోండి. ఈ కీలక ప్రాజెక్టు ఏళ్ల తరబడి స్తంభించింది. మేం ‘ప్రగతి’ ద్వారా దీన్ని సమీక్షించి, పర్యవేక్షించడంతో ఇవాళ అది పూర్తయింది. ఇప్పుడు అస్సాం సహా ఈశాన్య భారతం మొత్తానికీ అపార ప్రయోజనాన్ని చేకూరుస్తోంది.
గౌరవ అధ్యక్షా!
ఆచరణాత్మక విషయానికొస్తే- ఏ ప్రాజెక్టునైనా నిర్దేశిత వ్యవధిలో... అనేకమార్లు గడువుకు ముందుగానే పూర్తి చేశామనడానికి మా వద్ద వాస్తవ ఆధారాలు ఉన్నాయి. సౌర విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి 2030 నాటికి కొన్ని లక్ష్యాలను సాధించగలమని ప్రతినబూనగా, 2025 నాటికే గమ్యం చేరాం. ఇథనాల్ లక్ష్యాన్ని కూడా రెండు మూడేళ్లు ముందుగానే చేరుకున్నాము. మా వాస్తవిక ఆచరణాత్మక సామర్థ్యం బలమైనది మాత్రమేగాక గడువుకు ముందే గమ్యం చేర్చగలదని ఈ ఉదంతాలు నిరూపిస్తున్నాయి.
గౌరవ అధ్యక్షా!
బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాల విధానాలు కాంగ్రెస్ విధానాలకు పూర్తి భిన్నం. మా దృక్పథం.. సమస్యలను పరిష్కరించే మా ధోరణి పూర్తి భిన్నం. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల సమస్యలను పరిష్కరించగలమని మేం విశ్వసిస్తాం... మన ప్రజానీకాన్ని, వారి శక్తిని విశ్వసిస్తాం.. ఇదే ప్రజాస్వామ్యం వాస్తవిక శక్తి. కానీ, కాంగ్రెస్ పార్టీకి ప్రజలే పెద్ద సమస్య. ఇప్పుడు నేనొక ఉదాహరణ చెబుతాను. ఇందిరాగాంధీ ఒకసారి ఇరాన్లో మాట్లాడుతూ- నెహ్రూజీతో ఓ సంభాషణను గుర్తు చేసుకున్నారు. మీకెన్ని సమస్యలు ఎదురయ్యాయి? అని ప్రశ్నిస్తే- “35 ఐదు కోట్లు” అని ఆనాడు ఆయన బదులిచ్చినట్లు ఆమె ఉటంకించారు. ఎందుకంటే- అప్పటికి భారత జనాభా 35 కోట్లు కాగా, ఆయన దృష్టిలో ప్రతి పౌరుడూ ఒక సమస్యే. అటుపైన జనాభా 57 కోట్లకు పెరగడంతో తన సమస్యలు రెట్టింపయ్యాయని ఇందిరాగాంధీ కూడా వ్యాఖ్యానించారు. ఇలా సొంత ప్రజలనే సమస్యగా పరిగణించిన నాయకుల ధోరణికి, మా మనస్తత్వానికిగల ఈ తేడా గురించి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మాకు ప్రతి పౌరుడూ ఒక పరిష్కారం.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఒక భాగస్వామి. మరి వారికో? పౌరులంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమస్య!
గౌరవ అధ్యక్షా!
ఈ మాట నేనెన్నో సార్లు చెప్పాను... అది వాచాలత్వంతో కాదు... దృఢ విశ్వాసంతో అన్న మాట: సమస్యలు ఎంత పెద్దవైనా, మా దగ్గర 140 కోట్ల పరిష్కారాలున్నాయి. మన ప్రజలే మనకు ఎనలేని సంపద. ప్రతి పౌరుడూ ఒక సృష్టికర్త.. ఒక నిర్మాత.. భారత ఉజ్వల భవిష్యత్తుకు సంరక్షకుడు. అలాంటప్పుడు మనం వారిని సమస్యలుగా పరిగణించగలమా? ఈ తరహా ఆలోచన ధోరణిగల వారు తమ కుటుంబాలకు మాత్రమే సేవకులుగా ఉంటారు తప్ప దేశానికి కానేకాదు!
గౌరవ అధ్యక్షా!
భారత ప్రజలను అవమానించడం కాంగ్రెస్ స్వభావంలో.. సంస్కృతిలో అంతర్భాగమై పోయింది. ఇటీవలే వారు మన రాష్ట్రపతిని అవమానించారు. ఎన్నికల తర్వాత వారు వాడిన పదజాలం మనందరికీ సిగ్గుచేటు. పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి, అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన గిరిజన మహిళను అవమానించడమంటే- యావత్ గిరిజన సమాజాన్నీ అవమానించడమే.. మహిళలను అవమానించడమే... చివరకు సాక్షాత్తూ రాజ్యాంగాన్ని కూడా అవమానించడమే.
గౌరవ అధ్యక్షా!
కాంగ్రెస్ ఏమనుకున్నా... ఇది వారి తీవ్ర తప్పిదమే. నాకు అదనపు సమయం కేటాయించినందుకు మీకు, ఈ సభకు ధన్యవాదాలు.
గౌరవ అధ్యక్షా!
లోక్సభలో కొన్ని సంఘటనలు నన్ను తీవ్రంగా బాధించాయి. నిరాశనిస్పృహలు అర్థం చేసుకోదగినవే కానీ, ప్రజాస్వామ్య పవిత్ర ఆలయాన్ని ఇలా అపవిత్రం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆ సమయంలో, అస్సాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడొకరు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. ఆయనపై కాగితాలు చింపి విసిరారు.. బల్లల మీదికెక్కారు.. ఇది ఈశాన్య ప్రాంతాన్ని అవమానించడం కాదా? ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించే దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్ష స్థానంలో ఉండగా, ఆయననూ అవమానించారు. ఈశాన్య ప్రాంతంతోపాటు దళితులను అవమానించడం అన్నది వారిపట్ల కాంగ్రెస్ చిన్నచూపును ప్రస్ఫుటం చేస్తుంది. అస్సాం ప్రజలు ఇక కాంగ్రెస్కు మద్దతివ్వరన్న కారణంతోనే వారిపై ద్వేషం పెంచుకున్నట్లు అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం పనిచేసే తీరు ఇదేనా?
గౌరవ అధ్యక్షా!
భారతరత్న భూపేన్ హజారికా గారిని గుర్తుచేసుకుని నేనెంతో వేదనకు గురయ్యాను. ఆయన గీతాలు, గాత్రం దేశాన్ని ఏకం చేశాయి. అటువంటి మహనీయుడికి భారతరత్న పురస్కార ప్రదానం చేసే గౌరవం మాకు దక్కింది. అయితే, దీన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది... ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా శ్రీ ఖర్గే వ్యవహరించిన తీరు వీడియోల్లో నిక్షిప్తమైంది. ఆయన హావభావాల్లో చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తుంది. హజారికా గారిని “కేవలం ఒక గాయకుడు” అని కొట్టిపారేయడం అస్సాంను, భారత కళాభిమానులను అవమానించడమే. కాంగ్రెస్ ఆయనకు భారతరత్న ప్రకటించడాన్ని వ్యతిరేకించింది.. అస్సాంతోపాటు దేశ ప్రతిష్ఠను వ్యతిరేకించింది. ఈ అవమానాలను అస్సాం ఎన్నటికీ మరువజాలదని నేను కచ్చితంగా చెప్పగలను.
గౌరవ అధ్యక్షా!
నిన్న ఇదే సభలో, కాంగ్రెస్ సభ్యుడు- వారి యువరాజులలో ఒకరు- సాటి ఎంపీని “దేశద్రోహి”గా నిందించారు. వారి అహంకారం పరాకాష్ఠకు చేరిందనడానికి ఇదే నిదర్శనం. ఆ పార్టీ నుంచి చాలా మంది నిష్క్రమించారు.. ఆ పార్టీ చీలిపోగా, నాయకులు ఇతర పార్టీలలో చేరారు. అయినా వారిలో ఎవరినీ దేశద్రోహులుగా ముద్ర వేయలేదు. కానీ నిన్న, ఒక ఎంపీ సిక్కు అయినందుకే ఆయనను దేశద్రోహిగా నిందించారు. ఇది సిక్కులకు, గురువులకు అవమానం. కాంగ్రెస్ ఆమూలాగ్రం సిక్కులపైగల ద్వేషాన్ని ఇది బట్టబయలు చేసింది. ఈ సభలో ఆ మాట అన్న సదరు సభ్యుడు కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించ లేదు. ఇవాళ అతడు లేచి నిలబడి “నిన్నటి సంఘటన పార్లమెంటు గౌరవానికి భంగం కలిగించేదే... ఇందుకు మేం చింతిస్తున్నాం” అని చెప్పగలిగే వీలుంది. కానీ, అలా చేయలేదు... దేశం కోసం రక్తతర్పణం చేసిన ఒక కుటుంబం దాని సభ్యులలో ఒకరు రాజకీయ అభిప్రాయాన్ని మార్చుకున్న కారణంగా ఇలా అవమానించారు. ఆయనను దేశద్రోహిగా ముద్ర వేయడం ఆషామాషీ విషయం కాదు. ఏ పౌరుడినైనా దేశద్రోహి అనడాన్ని దేశం ఎలా సహిస్తుంది... ముఖ్యంగా ఒక సిక్కును? ఇదెంతో దురదృష్టకరం.. అలాంటి ప్రవర్తన కాంగ్రెస్ను మరింతగా ఊబిలోకి దించుతుంది.
గౌరవ అధ్యక్షా!
ఒకవైపు మనం ఈ పరిణామాలను చూస్తున్నాం.. మరోవైపు సదానంద్ మాస్టర్ గారి ఉదాహరణ మన కళ్లముందు కనిపిస్తోంది. రాజకీయ కక్షల ఫలితంగా ఆయన యవ్వన ప్రాయంలోనే రెండు కాళ్లను నరికివేశారు. ఇప్పుడాయన కృత్రిమ కాళ్లతో జీవనం కొనసాగిస్తున్నారు. అయినా, ఆయన మాటల్లో ఆగ్రహం కనిపించదు.. ఆయన ప్రవర్తనలో కఠినత్వం కానరాదు. ఇది మనకు ఎంతో గర్వంగా ఉంటుంది. నిన్న, ఆయన ఈ సభలో తన తొలి ప్రసంగం చేసిన సమయంలో మీ అనుమతితో తన కృత్రిమ కాలును సగౌరవంగా తన పక్కనే ఉంచుకున్నారు. ఆ దృశ్యం దేశాన్ని కలత పెట్టింది... కేవలం సైద్ధాంతిక విభేదాలతో ఒక యువ ఉపాధ్యాయుడి కాళ్లను నరికివేయడంపై ఈ ‘ఇండియా కూటమే’ బాధ్యత వహించాలి. అయినా, ఆయనలో ఎలాంటి కోపం, ద్వేషం కనిపించ లేదు. ఈ సందర్భంగా మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్సులు. ఇంత క్రూరమైన దాడికి గురైనా, దేశ సేవపై తన అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ, ఇవాళ విధాన రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం... ఇలాంటి వారి బలమే రాజకీయాల్లో మన మనుగడకు కారణం. వారి త్యాగం దేశం కోసం జీవించడానికే కాదు... మరణించడానికైనా మనకు స్ఫూర్తినిస్తుంది.
గౌరవ అధ్యక్షా!
కాంగ్రెస్ సహచరులు నాపై ఇటీవల ప్రత్యేక ప్రేమను ప్రదర్శిస్తున్నారు. బాధ్యత లేకపోయినా మేం దేశం కోసం జీవించడం నేర్చుకున్నాం. వికసిత భారత్కు మేం పునాది వేస్తూ, దాన్ని బలోపేతం చేస్తున్నాం. నేను యువత కోసం పటిష్ఠ పునాది వేస్తుంటే, కాంగ్రెస్ వారు మోదీ సమాధి తవ్వడానికి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రేమ సౌధాలు నిర్మిస్తామంటున్న వారు “మోదీ, నీకు సమాధి తవ్వుతాం” అని నినదిస్తున్నారు. సాటి పౌరుడి సమాధి తవ్వాలని కలలుగనే ఆ ప్రేమ సౌధం ఎలాంటిది? ఇలాంటి మాటలు మాట్లాడమని ఏ రాజ్యాంగ సూత్రం వారికి బోధించింది? ఇది రాజ్యాంగానికి, మానవత్వానికి, ప్రజా జీవన గౌరవానికి అవమానం కాదా? అయినా, వారికెలాంటి పశ్చాత్తాపం లేదు. ఇక “ప్రధానమంత్రి రాజ్యసభలో విలపిస్తున్నారు” అని కూడా అన్నారు. ఎలాంటి పెంపకం ఇలాంటి ప్రవర్తనకు దారితీస్తుంది?
గౌరవ అధ్యక్షా!
నాకు సుదీర్ఘ అనుభవం ఉంది... 2002 నుంచి వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, 2004 నుంచి వారు అధికారంలోకి వచ్చినప్పుడు, 2014 నుంచి నేనీ సభలో ప్రవేశించినప్పటి నుంచి... ఇలా 25 ఏళ్లకు పైగా మోదీపై కాంగ్రెస్ దూషణలేని ఒక్క సమావేశాన్ని కూడా నేను చూడలేదు. ఒకసారి ఎవరో నా ఆరోగ్య రహస్యం ఏమిటని అడిగితే- “నిత్యం రెండు కిలోల తిట్లు తింటాను” అని నేను జవాబిచ్చాను.
గౌరవ అధ్యక్షా!
వారు మోదీ సమాధి ఎందుకు తవ్వాలనుకుంటున్నారు? ఇది కేవలం వాక్చాతుర్యంతో కూడిని నినాదం కాబోదు. ఇది వారిలోని ద్వేషాన్ని ప్రతిబింబిస్తుంది. మేము ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్లనే వారు మోదీ సమాధి తవ్వాలని భావిస్తున్నారు. ఒకప్పుడు బాంబు పేలుళ్లతో, తుపాకీల నీడలో భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమనే ఈశాన్య భారతంతో శాంతికి, ప్రగతికి బాటలు వేయడమే వారు మోదీ సమాధి తవ్వాలని భావించడానికి కారణం. పాక్ ఉగ్రవాదులను వారి భూభాగం మీదనే మట్టి కరిపించినందుకు వారు మోదీ సమాధి తవ్వుతామని చెబుతున్నారు. మేం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు వారు మోదీ సమాధి తవ్వుతామని ప్రకటిస్తున్నారు. దేశాన్ని మావోయిస్టు ఉగ్రవాద విముక్తం చేయడానికి మేం సాహసోపేత చర్యలు తీసుకున్నందుకే వారు మోదీ సమాధి తవ్వాలని భావిస్తున్నారు. నెహ్రూ సంతకం చేసిన అన్యాయమైన సింధు జల ఒప్పందం స్తంభింపజేసినందుకే వారు మోదీ సమాధి తవ్వాలనుకుంటున్నారు.
గౌరవ అధ్యక్షా!
కాంగ్రెస్ సమస్య భిన్నమైనది... మోదీ ఈ స్థాయికి చేరుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిలో నిరాశ పెరుగుతోంది... ఎందుకంటే- మోదీ రావడమే కాదు... ఆయన అన్నిటినీ భరించాడు కాబట్టే, వారు “మోదీ, నీకు సమాధి కడతాం” అనే ఏకైక నినాదం ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షా!
ప్రధానమంత్రి కుర్చీ తమ కుటుంబ వారసత్వమని అని వారు విశ్వసిస్తున్నారు. అక్కడ మరెవరూ కూర్చోలేరు... వారిలోని ఈ ద్వేషం, వారి ప్రేమ సౌధంలో మండుతున్న నిప్పు మోదీ సమాధిని తవ్వాలని వారిచేత నినాదాలు చేయిస్తున్నాయి.
గౌరవ అధ్యక్షా!
కాంగ్రెస్ రాజవంశానికి దశాబ్దాలుగా అవకాశం లభించింది... తద్వారా దేశం తన భవిష్యత్తును పణంగా పెట్టింది. వారు “గరీబీ హఠావో” (పేదరిక నిర్మూలన) నినాదం చేశారు కానీ, ప్రజలను అలా తప్పుదోవ పట్టించారు. కాంగ్రెస్లో ప్రతి ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడటమే తప్ప ఆచరణ శూన్యం. వారివి శుష్క నినాదాలు... కానీ, పేదల సాధికారత దిశగా మోదీ తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. నా దేశంలోని పేదలకు వందనం... వారు మా విధానాలను, ఉద్దేశాలను విశ్వసించారు. అలాగే, తమనుతాము బలోపేతం చేసుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. కాబట్టే, 25 కోట్ల కుటుంబాలవారు పేదరిక విముక్తులై స్వీయ సముద్ధరణను సాధించారు. అందుకే వారందరికీ నా వందనం... ఒకప్పుడు నిరాశలో మునిగిన వారంతా ఆశాకిరణం వైపు పయనిస్తూ ఇప్పుడు మనదో పదం కలిపి కదం తొక్కుతున్నారు.
గౌరవ అధ్యక్షా!
దేశంలో 2014కు మానవ రహిత రైల్వే క్రాసింగ్ల వద్ద వందలాదిగా జనం మరణించారు. రైళ్లు స్కూలు బస్సులను ఢీకొట్టగా ఎందరో బాలలు ప్రాణాలు కోల్పోయారు. అయినా, ఆ క్రాసింగ్లను అలాగే వదిలేశారు... కాంగ్రెస్ దీన్ని కూడా సరిదిద్దలేక పోయింది. మేం వాటన్నిటినీ తొలగించాం... ప్రాణాలను కాపాడాం.. అందుకే మరి.. వారు మోదీకి సమాధి తవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు.
గౌరవ అధ్యక్షా!
దేశంలో 2014కు 18,000 గ్రామాలు అంధకారంలో మునిగి ఉండేవి. అక్కడి ప్రజలకు వైర్లు, బల్బులంటే ఏమిటో తెలియవు. ఆ తర్వాత ప్రజలు మామీద విశ్వాసం ప్రకటించడంతో ఆ 18,000 గ్రామాలకు మేం వెలుగునిచ్చాం. ఈ కారణంగానూ వారు మోదీ సమాధి తవ్వాలని చూస్తున్నారు.
గౌరవ అధ్యక్షా!
ఒకప్పుడు “సైనికులకు మందుగుండు సామగ్రి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, మంచులో నడిచే బూట్లు కూడా లేవు” అని వార్తా పత్రికల ప్రధాన శీర్షికలు ఘోషించేవి. కానీ, మన సైనికుల కోసం మేం ఖజానాను తెరిచాం.. వారికి అవసరమైనవన్నీ సమకూర్చాలని నిర్ణయించాం. కాంగ్రెస్ వారు మోదీ సమాధిని తవ్వాలని భావించడానికి ఇదీ ఒక కారణమే!
గౌరవ అధ్యక్షా!
ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అంతకుముందు ఒకనాడు ఈ సభలో మెదడువాపు వ్యాధితో మరణిస్తున్న బాలల అంశాన్ని ప్రస్తావిస్తూ కంటనీరు పెట్టారు. కానీ, ఈ వ్యాధి నుంచి దేశాన్ని విముక్తం కాంగ్రెస్ ఎన్నడూ తలపోసింది లేదు.
గౌరవ అధ్యక్షా!
ట్రకోమా అనే కంటి వ్యాధి చాలా మందిని అంధులుగా మార్చింది. శాస్త్రవిజ్ఞాన పురోగమనంతో ఈ వ్యాధి నివారణ సాధ్యమైందిగానీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదు. అయితే, దేశాన్ని మేం మెదడువాపు వ్యాధి నుంచి విముక్తం చేయడంతోపాటు ట్రకోమా నుంచి నయనాలకు రక్షణనిచ్చాం. ఇన్ని విజయాలు, ఈ అవగాహన, సమాజం కోసమే జీవన్మరణాలనే మా సంకల్పం- ఇవన్నీ వారికెంతో ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే వారు ప్రజాస్వామ్యం, ప్రేమ గురించి మాట్లాడుతూ- “మోదీ.. నీకు సమాధి తవ్వుతాం” అంటూ నినదిస్తారు. నాయకుల ప్రజా జీవనం తీరు ఇదేనా?
గౌరవ అధ్యక్షా!
కాంగ్రెస్ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో నడుస్తుంది... నా ప్రభుత్వం నడిచేదీ 140 కోట్ల భారతీయులనే రిమోట్ కంట్రోల్ ద్వారానే... వారి కలలు, ఆకాంక్షలు, సంకల్పమే మమ్మల్ని నడిపిస్తున్నాయి. అధికారమంటే మాకు ఆనందానికి మార్గం కాదు.. సేవకు అదొక మాధ్యమం మాత్రమే. ముద్రా యోజన ద్వారా కోట్లాది యువత స్వయం ఉపాధి మద్దతు పొందారు. కాంగ్రెస్ అంకుర సంస్కృతిని ఎన్నడూ ప్రోత్సహించ లేదు. అసలు వారికి తెలిసింది కొన్ని వందల అంకుర సంస్థల గురించి మాత్రమే. కనీసం తమ సొంత కుటుంబ అంకురాన్ని కూడా వారు ఆదుకోలేకపోయారు. కానీ, ఇవాళ మా ప్రభుత్వ హయాంలో 2,00,000కుపైగా అంకుర సంస్థలు దేశంలో గుర్తింపు పొందాయి. ఈ వరుస విజయాలు ప్రజల హృదయాలను గెలుచుకుంటుంటే, కాంగ్రెస్ మాత్రం “మోదీ, నీ సమాధి తవ్వుతాం” అని నినదిస్తుంది. దేశంలో ఒకనాడు బీఎస్ఎన్ఎల్ సంస్థ ఒక హస్యోక్తిగా, కార్టూన్లకు పరిమితమైనదిగా ఉన్న రోజులను ఓసారి గుర్తుతెచ్చుకోండి. ఈ రోజున మేం స్వదేశీ 4జి శ్టాక్ను రూపొందించాం. ప్రపంచంలోని ఏ దేశంతో పోల్చినా అత్యంత వేగంగా 5జి సాంకేతికతను తెచ్చాం. కొత్త సాంకేతికతలు, సరికొత్త ఆలోచనలతో కమ్యూనికేషన్ సదుపాయాలను మేం అభివృద్ధి చేశాం. కాబట్టే, వారిలో గూడు కట్టుకున్న బాధ “మోదీ, నీ సమాధి తవ్వుతాం” అంటూ ప్రతిధ్వనిస్తూంటుంది!
గౌరవ అధ్యక్షా!
పేదలకు సేవ చేయగలగడం నాకు దక్కిన అదృష్టం... దేశవ్యాప్తంగా 4 కోట్ల పేద కుటుంబాలకు శాశ్వత గృహవసతి కల్పించడం నా జీవితంలో ఎంతో శాంతినిచ్చింది. దేవుడు నన్ను ఆశీర్వదించి విద్యుత్తు, నీరు, గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు- వంటివన్నీ ప్రజలకు అందించాల్సిందిగా ప్రేరణ ఇచ్చినట్లు నేను భావిస్తున్నాను. గ్రామీణ మహిళలు సగర్వంగా “అవును.. నేను లక్షాధికారి సోదరినయ్యాను” అని ఇవాళ తొలిసారిగా అంటున్నారు. మరికొందరు, “ఈ ఏడాదిలోగా నేను కూడా అవుతాను” అంటూ ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే లక్షాధికారులుగా మారినవారు ఇక “ఇక్కడితో ఆగం.. కోటీశ్వరులం కావాలని ఇప్పుడు ఆలోచిస్తున్నాం” అంటున్నారు. ఆలోచనా విధానంలో ఈ మార్పు, ఆత్మవిశ్వాసం పెరుగుదల- వంటి లక్షలాది పౌరుల ఆశీర్వాదాలతోపాటు తల్లులు, అక్కచెల్లెళ్ల అండదండలు రక్షణ కవచంలా ఉన్నాయి. కాబట్టి, ఎవరెన్ని నినాదాలు చేసినా, ఎంత పలవరించినా సదరు వ్యక్తికి ఏ సమాధినీ తవ్వలేరు. ఎవరినైతే ఎవరూ పట్టించుకోలేదో... మోదీ ఎవరినైతే గౌరవిస్తాడో, తల్లులకు-అక్కచెల్లెళ్లకు నేనెంత భక్తిశ్రద్ధలతో సేవ చేశానో అదే వారి ఆశీర్వాదాలన్నిటికీ కారణం. నా ప్రత్యర్థులను కలవరపెడుతున్నది వారి శుభాశీస్సులే.. అందుకే, వారు సమాధి తవ్వడం గురించి మాట్లాడుతున్నారు.
గౌరవ అధ్యక్షా!
కొందరికి దొంగతనం వంశపారంపర్య వృత్తి... అందుకే, వారు గుజరాతీ వ్యక్తి అయిన మహాత్మా గాంధీ ఇంటిపేరును కూడా దొంగిలించారు. కానీ, దేశ ప్రజలు తెలివైనవారు గనుక ఆ మోసానికి గట్టిగా బుద్ధి చెప్పడం ఎలాగో వారికితెలుసు.
గౌరవ అధ్యక్షా!
వికసిత భారత్ స్వప్నంతో మేం మా ప్రయాణం ప్రారంభించాం. ఆ కల నేడు ప్రజాశక్తితో మమేకమై జాతీయ సంకల్పంగా మారింది. ఇవాళ ఎక్కడికెళ్లినా “2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశం కావాలి” అంటున్నారు. అయినప్పటికీ, ఈ సభలోని కొందరు సహచరులు ఎంతో నిరాశావాదంతో, వాస్తవానికి ఎంతో దూరంగా ఉంటూ మారుతున్న ప్రపంచంపై ఇంతటి అజ్ఞానం ప్రదర్శించడం చూసి నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. “మోదీ 2047 గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజును ఎవరు చూడొచ్చారు?” అని ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం నాడు పోరాడిన యువతరం, ఉరికొయ్యను కౌగలించుకున్న వీరులు, బుల్లెట్లు-లాఠీ దెబ్బలు, అండమాన్లోని సెల్యులార్ జైలులో భయానక పరిస్థితులను అనుభవించిన త్యాగధనులు “మా జీవితకాలంలో స్వాతంత్ర్యం రాదేమో... మేమెందుకు పోరాడాలి?” అని ఆలోచించారా? ఒకవేళ వారు అలా ఆలోచించి ఉంటే, ఈ నాటికైనా దేశ దాశ్య శృంఖలాలు తెగి ఉండేవా? ఇక నేను డిజిటల్ ఇండియా, ఫిన్టెక్, యూపీఐ గురించి మాట్లాడిన సందర్భాల్లో ఈ నిరాశావాదులు నన్ను హేళన చేశారు. “ఒక పేదవాడు మొబైల్ ఫోన్తో నగదు లావాదేవీలు చేయడం సాధ్యమా?” అని ప్రశ్నించారు. కానీ, అదంతా సాధ్యమేనని కేవలం మూడేళ్లలోనే దేశం నిరూపించింది. పార్లమెంటులో దీనిపై వారిలా ప్రసంగించడం నాకింకా గుర్తుంది. ఆ రోజున “మోదీకి గట్టి జవాబిచ్చాం” అని వారు సంబరాలు చేసుకున్నారు. కానీ, మోదీ మౌనంగా ఉండిపోయినా, ఇవాళ మీ చేతిలోని మొబైల్ ఫోన్, యూపీఐ ద్వారా అదే మీకు సమాధానమిచ్చింది.
గౌరవ అధ్యక్షా!
కాంగ్రెస్ హయాంలో “భారత్ తానెక్కాల్సిన బస్సు తప్పిపోయింది” అనే ఒక సాధారణ పదబంధం ప్రజల్లో విశేష ప్రాచుర్యం పొందింది. ఎలాగంటే తీవ్రమైన చర్చల్లో, చలోక్తులలో కూడా అదొక సామెతలా మిగిలిపోయింది. అవకాశాలు చేజారాయి... సమయం మించిపోయింది... భారత్ బస్సందుకోలేక పోయింది.
గౌరవ అధ్యక్షా!
భారత్ ఇవాళ ఏ అవకాశాన్నీ చేజారనివ్వడం లేదు... బస్సు తప్పిపోయే ప్రసక్తే లేదు.
గౌరవ అధ్యక్షా!
వర్తమాన పరిస్థితులను ప్రకాశవంతం చేస్తూ దేశ భవిష్యత్తును ఉజ్వలం చేయడానికి మనం అవిరళ కృషి చేయాల్సిఉంది. వికసిత భారత్ దిశగా పయనానికి, వార్షిక బడ్జెట్లకు దిశానిర్దేశానికి మేం పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తాం. మా లక్ష్యం తదుపరి ఎన్నికలు కాదు- అది 2047 నాటికి వికసిత భారత్ సాకారమే! ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, నా దేశం శాశ్వతం. సుసంపన్న భారత్ను యువత చేతిలో పెట్టడమే మా స్వప్నం. ఈ రోజున ఇళ్లలో పిల్లలను చూసినప్పుడు, నా కృషి ద్వారా వారు సంతృప్తి చెందగలిగేంత బలమైన దేశాన్ని వారి కోసం సృష్టించాలని శపథం పూనుతాను. అందుకే, ఇవాళ మేం 2047 గురించి మాట్లాడుతున్నాం.
గౌరవ అధ్యక్షా!
మేం చేపట్టిన కార్యక్రమాలను చూడండి- అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, మహాసముద్రాల లోతులు, భూమి, ఆకాశం, బాహ్య అంతరిక్షం వంటి ప్రతి అంశంపైనా నిశితంగా దృష్టి సారించాం. నవ సంకల్పం, నవ్యోత్తేజం, కొత్త బాట, సరికొత్త విజయాలు- ఇలా భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. మేమిప్పుడు గ్రీన్ హైడ్రోజన్పై కృషి చేస్తున్నాం.. భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నాం. క్వాంటం కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నాం.. ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ భారత్ ‘ఏఐ’కి గొప్పగా దోహదం చేస్తున్నదని ప్రపంచం విశ్వసిస్తోంది. కీలక ఖనిజాలు, అరుదైన లోహాలు భౌగోళిక రాజకీయ ఆయుధాలుగా మారాయి. ఇక భారత్ దేనికోసమైనా ఇతరుల ముందు చేయిజాచే అవసరం లేకుండా వాటిపై నిశితంగా దృష్టి సారిస్తున్నాం.
గౌరవ అధ్యక్షా!
విదేశీ పెట్టుబడులను ఆకర్షించగల అసంఖ్యాక ప్రాజెక్టులు నేడు మనకున్నాయి. ఎందుకంటే- ప్రతి పెట్టుబడిదారు ఇవాళ భారత గడ్డపై తమ భవిష్యత్తును చూడగలుగుతున్నారు. తమ భవిష్యత్తు భారత యువ ప్రతిభతో భద్రంగా ఉంటుందని నమ్ముతున్నారు. తమ భవిష్యత్తు భారత ఉజ్వల భవిష్యత్తుతో ముడిపడి ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. అందుకే, మనం వికసిత భారత్ గురించి మాట్లాడటాన్ని ప్రపంచం అర్థం చేసుకోగలదు. భారత్ సరైన దిశలోనే పయనించడాన్ని ప్రపంచం గ్రహించిందనే సత్యాన్ని ఇక తెలివిడి కొరవడిన వారు తెలుసుకోవాల్సి ఉంది. ఒకప్పుడు “భారత్ ఎక్కాల్సిన బస్సు తప్పిపోయింది" అనే మాట... ఇప్పుడు భారత్తో సమానంగా ప్రయాణానికి ఆలస్యం అవుతోందన్న ప్రపంచ భయంగా మారింది. అన్ని దేశాలు ఇప్పుడు మన సరసన నడవడానికి పోటీ పడుతున్నాయి.
గౌరవ అధ్యక్షా!
రాబోయేది భారత్తోపాటు మన యువతరం ఉజ్వల భవిష్యత్ అవకాశాలు నిండిన శకం. ఈ అవకాశాలేమిటో నేను స్పష్టంగా వివరించగలను.. ఆ దిశగా మా విధానాలను కూడా రూపొందిస్తున్నాం. ఈ సందర్భంగా నా సహచరులందరికీ ఇదే నా సూచన. అలాగే, ఈ సభలోని గౌరవ సభ్యులు కూడా తమతమ నియోజకవర్గాల్లో ప్రజలకు ఈ సంగతి చెప్పాలని కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందివచ్చినప్పుడు మనం అత్యుత్తమ నాణ్యత ద్వారా వాటిని కొనసాగించగలం. నాణ్యతపై మనమెన్నడూ రాజీపడరాదు. లాభం తక్కువైనా, నాణ్యత అత్యున్నతం కావాలి. మనం ఆవిష్కరణలు చేయాలి... పరిశోధనలు సాగించాలి... అవసరమైతే ముడి పదార్థాలను మార్చాలి- కానీ, ఏదేమైనా భారత్ అత్యుత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలవాలి. అప్పుడు ప్రపంచం ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ భారత్’ గురించి మాత్రమే గానం చేస్తుంది.
గౌరవ అధ్యక్షా!
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రులకూ నా కృతజ్ఞతలు. వారింతకుముందు- గత దశాబ్దంలో ఐదు లేదా ఆరు సార్లు నేను ప్రసంగం ప్రారంభించాక ఆగనని తెలిసి కూడా నన్ను మాట్లాడకుండా ఆపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించవని వారికిప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైంది. ఆ జ్ఞానం ఇప్పుడైనా వారిలో పొటమరిస్తుందని నేను ఆశిస్తున్నాను.
గౌరవ అధ్యక్షా!
రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సహకరించిన సభ్యులందరికీ నా కృతజ్ఞతలు.. ఇక్కడ వెలిబుచ్చిన విలువైన ఆలోచనలు దేశ పురోగమనానికి కచ్చితంగా తోడ్పడతాయి. ఈ స్ఫూర్తిదాయక ప్రసంగంపై గౌరవ రాష్ట్రపతికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే...
****
(రిలీజ్ ఐడి: 2224755)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2