సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతదేశ కథా సంప్రదాయాలను, వేవ్స్ దార్శనికతను ప్రదర్శించనున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శకటం
ఓంకారం నుంచి అల్గోరిథం వరకు: వికసిస్తున్న భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించనున్న శకటం
प्रविष्टि तिथि:
22 JAN 2026 6:40PM by PIB Hyderabad
ఈ నెల 26 వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో “భారత గాథ: శ్రుతి, కృతి, దృష్టి ఇతివృత్తంతో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రదర్శించే శకటం ప్రాచీన మౌఖిక సంప్రదాయాల నుంచి ప్రపంచ స్థాయి కంటెంట్, మీడియా శక్తిగా ఎదిగిన భారతదేశ నాగరికతా ప్రయాణాన్ని కథన రూపంలో శక్తిమంతంగా ఆవిష్కరిస్తుంది. ఈ శకటం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, సాంస్కృతిక వారసత్వాన్ని సాంకేతిక నవోన్నతులతో సమన్వయంగా మేళవించిన అద్భుత దృశ్య రూపాన్ని అందిస్తుంది.
శ్రుతి అనేది భారతదేశ సమృద్ధమైన మౌఖిక సంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ భాగంలో, రావి చెట్టు నీడన గురుశిష్యులకు జ్ఞానాన్ని బోధిస్తున్న దృశ్యం ద్వారా శ్రుతి ఆవిష్కృతమవుతుంది. అదే సమయంలో, ఓంకారానికి సంబంధించిన బ్రహ్మాండ ధ్వని ప్రతిధ్వనిని, జ్ఞాన ఉద్భవాన్ని సూచించే ధ్వని తరంగాల రూపకాలు ఈ చిత్రణకు తోడ్పడుతూ, భారతీయ జ్ఞాన పరంపర మూలాలను ప్రతిఫలింపజేస్తాయి.
కృతి అనేది భారతీయ లిఖిత రూప వ్యక్తీకరణ పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ భాగంలో భగవాన్ గణేశుడు మహాభారతాన్ని లిఖిస్తున్న దృశ్యం ద్వారా లిఖిత రూప కళలోని ప్రాముఖ్యతను చూపిస్తారు. ఇంకా ప్రాచీన పత్రికలు, సంగీ తం, నాట్యం, నృత్యం వంటి ప్రదర్శన కళలు, ప్రారంభంలోని కమ్యూనికేషన్ సంప్రదాయాల ద్వారా భారతీయ జ్ఞాన సంపత్తి సాంస్కృతిక వారసత్వం ఎలా రూపుదిద్దుకున్నదో వివరిస్తారు.
‘దృష్టి' విభాగం ముద్రణ (ప్రింట్), సినిమా, టెలివిజన్, డిజిటల్ వేదికల ద్వారా భారత మీడియా రంగం పరిణామాన్ని కళ్లకు కడుతుంది. పాతకాలపు కెమెరాలు, ఫిల్మ్ రీల్స్, ఉపగ్రహాలు, వార్తాపత్రికలు, బాక్సాఫీస్ చిహ్నాలు వంటి దృశ్యరూపాల ద్వారా భారత సాంస్కృతిక మూలాలను తీర్చిదిద్దిన తరతరాల చలనచిత్ర నిర్మాతలు, కళాకారులకు గౌరవవందనం సమర్పిస్తారు. ఈ శకటం కృత్రిమ మేధ, ఏవీజీసీ - ఎక్స్ ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ ఎక్స్టెండెడ్ రియాలిటీ), వర్చువల్ ప్రొడక్షన్ సాంకేతికతల ద్వారా భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉన్న కథా సంప్రదాయాలను కూడా ప్రముఖంగా తెలియచేస్తుంది. ప్రేక్షకులు కథలో పూర్తిగా లీనమైపోయేలా చేసే సరికొత్త విధానంలోకి మారుతున్న ధోరణిని కూడా చూపిస్తుంది.
వివిధ రూపాల ప్రదర్శనకారులు తమ ప్రదర్శనలతో ఈ శకటానికి జీవం పోశారు. 2025లో జరిగిన 'వేవ్స్' సదస్సు చేకూర్చిన బలంతో గ్లోబల్ కంటెంట్ పరంగా భారత్ ను ప్రపంచ కేంద్రంగా నిలపాలనే తీర్చిదిద్దాలనే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లక్ష్యానికి అనుగుణంగా ఈ శకట ఇతివృత్తం రూపుదిద్దుకుంది. భారీ అంతర్జాతీయ భాగస్వామ్యం, గణనీయమైన వ్యాపార ఒప్పందాలతో జరిగిన వేవ్స్ సదస్సు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ (ఆరెంజ్ ఎకానమీ) ఆవిర్భావానికి ఒక సంకేతంగా నిలిచింది.
ఈ శకటం భారత పురాతన విజ్ఞానాన్ని, డిజిటల్ భవిష్యత్తును ఏకం చేస్తూ, అటు సాంస్కృతిక కాలక్రమానికి, ఇటు భవిష్యత్ దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2217482)
आगंतुक पटल : 4