రక్షణ మంత్రిత్వ శాఖ
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం:
జాతీయ పోలీసు అమరవీరుల స్మారకం వద్ద రక్షణ మంత్రి పుష్పాంజలి
అమరులైన పోలీసు, పారామిలటరీ సిబ్బందికి, దేశానికి వారు చేసిన సేవలకు ఘన నివాళి
प्रविष्टि तिथि:
21 OCT 2025 12:02PM by PIB Hyderabad
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2025, అక్టోబర్ 21న జాతీయ పోలీసు అమరవీరుల స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పుష్పాంజలి ఘటించారు. 1959లో ఇదే రోజున లదాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద భారీగా ఆయుధాలు ధరించిన చైనీస్ బలగాలు చేసిన మెరుపు దాడిలో 10 మంది పోలీసు వీరులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణాలర్పించిన యోధులకు రక్షణ మంత్రి ఘన నివాళులు అర్పిస్తూ, దేశానికి సేవలందిస్తున్న పోలీసులు, పారామిలటరీ బలగాలకు కృతజ్ఞతలు తెలిపారు. సాయుధ, పోలీసు బలగాలు జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. ఒకరు దేశాన్ని, దాని ప్రాదేశిక సమగ్రతను పరిరక్షిస్తుంటే, మరొకరు సమాజాన్ని, సామాజిక సమగ్రతను కాపాడతున్నారన్నారు. ‘‘సైన్యం, పోలీలు వేర్వేరు వేదికల్లో పనిచేస్తున్నప్పటకీ.. వారి లక్ష్యం ఒక్కటే - అదే దేశాన్ని రక్షించడం. మనం 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించే దిశగా ముందడుగు వేస్తున్న ఈ సమయంలో దేశం బాహ్య, అంతర్గత భద్రతను సమతూకం చేయడం గతంలో కంటే చాలా ముఖ్యం’’ అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ల గురించి శ్రీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో అస్థిరత ఉన్నప్పటికీ సమాజంలో కొత్త తరహా నేరాలు, ఉగ్రవాదం, సైద్ధాంతిక యుద్ధాలు పుట్టుకొస్తున్నాయన్నారు. నేరాలు మరింత వ్యవస్థీకృతంగా, కంటికి కనిపించని రూపంలో, సంక్లిష్టంగా మారుతున్నాయని, సమాజంలో అలజడిని సృష్టించడం, విశ్వాసాన్ని దెబ్బ తీయడం, దేశ స్థిరత్వానికి సవాలు విసరడమే వాటి లక్ష్యమని తెలియజేశారు.
సమాజంలో నమ్మకాన్ని కొనసాగించే నైతిక బాధ్యతను నిర్వర్తిస్తూనే.. నేరాలను నియంత్రించే అధికారిక బాధ్యతలను పోలీసులు చేపడుతున్నారని రక్షణ మంత్రి ప్రశంసించారు. ‘‘ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం.. నిరంతరం అప్రమత్తంగా ఉండే సాయుధ బలగాలు, పోలీసులపై వారికున్న నమ్మకమే. ఈ విశ్వాసమే మన దేశ స్థిరత్వానికి పునాది’’ అని ఆయన అన్నారు.
దీర్ఘ కాలంగా దేశ అంతర్గత భద్రతలో ప్రధాన సవాలుగా నిలిచిన నక్సలిజం గురించి చర్చిస్తూ.. పోలీసు, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, స్థానిక అధికారుల సమష్టి, వ్యవస్థీకృత చర్యలు సమస్య తీవ్రత పెరగకుండా చూశాయని, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చేశాయని శ్రీ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సమస్య పూర్తిగా సమసిపోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది అనేక మంది నక్సలైట్లను అంతం చేశాం. ఒకప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టినవారు ఇప్పుడు లొంగిపోయి అభివృద్ధిని కోరుకుంటూ తీవ్రవాదాన్ని వదలిపెడుతున్నారని చెప్పారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు నక్సలైట్ కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు విద్యా కేంద్రాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ప్రగతికి కారిడార్లుగా మారుతున్నాయి. మన పోలీసు, భద్రతా దళాలు ఈ విజయంలో తమదైన పాత్రను పోషించాయి’’ అని అన్నారు.
జాతీయ భద్రతను అందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతను, దీని సాధించడంలో పోలీసు బలగాలు చేస్తున్న కృషిని పునరుద్ఘాటించారు. ‘‘దీర్ఘకాలంగా.. పోలీసులు అందిస్తున్న సహకారాన్ని మనం.. అంటే దేశం పూర్తిగా గుర్తించలేదు. మన పోలీసు బలగాల త్యాగాలను గౌరవించడానికి పీఎం మోదీ సారథ్యంలోని ప్రభుత్వం.. 2018లో జాతీయ పోలీసు స్మారకాన్ని నిర్మించింది. దీనికి అదనంగా.. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇప్పుడు పోలీసుల వద్ద పర్యవేక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, ఫోరెన్సిక్ ప్రయోగశాలలు, డిజిటల్ పోలీసింగ్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. పోలీసు బలగాలను ఆధునికీకరించడానికి సరిపడినన్ని వనరులను కూడా రాష్ట్రాలకు అందిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. వనరులను పూర్తిగా ఉపయోగించుకోవాలని పిలుపునిస్తూ.. భద్రతా వ్యవస్థల సమన్వయం, ఏకీకరణ ద్వారానే లక్ష్యాన్ని సాధించగలమని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
సమాజం, పోలీసులు ఒకరిపై ఒకరు సమాన స్థాయిలో ఆధారపడి ఉన్నారంటూనే, భద్రతా వ్యవస్థ మరింత విస్తృతంగా, అప్రమత్తంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్యా సమతుల బంధం అవసరమని స్పష్టం చేశారు. ‘‘పౌరులు భాగస్వాములుగా పనిచేసి, చట్టాన్ని గౌరవించినప్పుడు మాత్రమే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయగలదు. పరస్పర అవగాహన, బాధ్యత అనే మూలాలపై ఆధారపడి సమాజం, పోలీసుల మధ్య అనుబంధం ఏర్పడినప్పడు రెండూ వృద్ధి చెందుతాయి’’ అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ తపన్ డేకా, బీఎస్ఎఫ్ డీజీ శ్రీ దల్జీత్ సింగ్ చౌధరి, సీఏపీఎఫ్లకు చెందిన ఇతర ఉన్నతాధికారులు, పదవీ విరమణ చేసిన డీజీలు, పోలీసు వర్గాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(रिलीज़ आईडी: 2181401)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam