ప్రధాన మంత్రి కార్యాలయం
సహకార రంగంలో అనేక కీలక కార్యక్రమాల ప్రారంభంతో పాటు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2024 2:38PM by PIB Hyderabad
హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అర్జున్ ముండా, శ్రీ పీయూష్ గోయల్, జాతీయ సహకార సంఘాల అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సోదరీ సోదరులారా.
‘వికసిత్ భారత్’లో ఒక భాగమైన ‘అమృత్ యాత్ర’ సాధించిన మరో ముఖ్య విజయానికి ‘భారత్ మండపం’ ఈ రోజు సాక్షిగా నిలుస్తోంది. దేశం చెప్పుకొన్న ‘సహకార్ సే సమృద్ధి’ సంకల్పాన్ని నెరవేర్చుకొనే దిశలో మనం ఇవాళ మరింత ముందుకు పయనిస్తున్నాం. వ్యవసాయానికీ, సాగుకూ పునాదిని పటిష్ఠపరచడంలో సహకార రంగం ప్రధాన పాత్రను పోషిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని, మేం సహకార మంత్రిత్వ శాఖ పేరిట ఒక ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. మరి ఈ రోజు, ఈ కార్యక్రమాన్ని ఇదే ఉత్సాహంతో నిర్వహించుకొంటున్నాం. నేడు, మన రైతుల కోసం ప్రపంచంలోనే అత్యంత భారీ నిలవ పథకాన్ని మేం ప్రారంభించాం. అదే గిడ్డంగి సదుపాయాల నిర్మాణ పథకం. ఈ పథకంలో భాగంగా, దేశంలో మూల మూలన వేల కొద్దీ గిడ్డంగులనూ, గోదాములనూ నిర్మిస్తారు. 18 వేల పీఏసీఎస్ల (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల)ను కంప్యూటరీకరించే ప్రధాన ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ దేశంలో వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాలకు ఒక సరికొత్త విస్తృతిని ఇస్తాయి. వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో జోడిస్తాయి. ఈ ముఖ్యమైన కార్యక్రమాలకు, చాలా మందికి ప్రయోజనాలను అందించే కార్యక్రమాలకు గాను మీ అందరికీ నేను మనసారా నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
మన దేశంలో ప్రాచీన కాలం నుంచి సహకార సంఘాలు ఉన్నాయి. మన శాస్త్రాల్లో కూడా చెప్పారు.. ‘అల్పానామ్ అపి వస్తూనామ్, సంహతి: కార్య సాధికా’ అని. ఈ మాటలకు, చిన్న చిన్న వస్తువులనూ, పరిమిత వనరులనూ కలిపివేస్తే వాటితో పెద్ద పెద్ద పనులను పూర్తి చేయవచ్చు అని అర్థం. ప్రాచీన భారతంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, సహకారానికి సంబంధించిన స్వతస్సిద్ధ స్ఫూర్తి ప్రధానమైన ఈ వ్యవస్థ తనదైన పాత్రను పోషిస్తూ వచ్చింది. మన స్వయంసమృద్ధ సమాజానికి సహకార సంఘాల భావనే పునాది. సహకారిత ఒక వ్యవస్థ మాత్రమే కాదు. అది ఒక భావన, ఒక ఉత్సాహం. సహకార సంఘాల స్ఫూర్తి చాలా సందర్భాల్లో సంస్థలు, వనరుల హద్దులను దాటి, చెప్పుకోదగ్గ ఫలితాలను అందిస్తుంది. బతుకుదెరువుకు సంబంధించిన ఒక సీదాసాదా ఏర్పాటును సహకారం ఒక ప్రధాన పారిశ్రామిక సామర్థ్యంగా మార్చివేయగలుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను, ప్రత్యేకించి దేశ గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేయడానికి అనుసరించదగిన విశ్వసనీయ మార్గం. విడిగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మేం కూడా దేశానికి ఉన్న ఈ సామర్థ్యాన్నీ, వ్యవసాయ రంగానికి చెందిన చెల్లాచెదరైన ఈ బలాన్నీ ఏకతాటి మీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్పీఓ) అనే ఒక అతి ప్రధాన ఉదాహరణ మన ముందుంది. ఎఫ్పీఓల ద్వారా, గ్రామాల్లోని చిన్న రైతులు కూడా ఇప్పుడు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగగలుగుతున్నారు. వారి ఉత్పాదనలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశంలో 10 వేల ఎఫ్పీఓలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో, ఇప్పటికే 8 వేల ఎఫ్పీఓలు రూపొందాయి. అనేక ఎఫ్పీఓల విజయ గాథలను దేశ విదేశాల్లో చర్చిస్తున్నారు. ఇదే విధంగా, సహకార సంఘాల ప్రయోజనాలు ప్రస్తుతం పశుపోషకులు, మత్స్యకారులకు కూడా అందుతుండడం మరో సంతోషదాయకమైన మార్పు. 25 వేల కన్నా ఎక్కువ సహకార యూనిట్లు ప్రస్తుతం చేపల సాగులో నిమగ్నమయ్యాయి. రాబోయే అయిదేళ్లలో, 2 లక్షల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. మరి, వీటిలో చాలా వరకూ సహకార సంఘాలు చేపల పెంపకం రంగంలోనే ఏర్పాటవుతాయని భావిస్తున్నారు.
మిత్రులారా,
సహకార సంఘాల శక్తి ఎంతటిదో గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను పనిచేసినప్పుడు తెలుసుకున్నాను. గుజరాత్లో అమూల్ విజయ గాథ ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటికీ తెలుసు. లిజ్జత్ పాపడ్ ప్రపంచమంతటా మార్కెట్లలో అందుబాటులో ఉన్న సంగతి కూడా మన అందరికీ తెలుసు. ఈ ఉద్యమాలకు ప్రధానంగా ఈ దేశ మహిళలు నాయకత్వం వహించారు. మహిళలు ప్రస్తుతం సహకార రంగం, పాడి రంగం, వ్యవసాయ రంగాల్లో కూడా పాలుపంచుకుంటున్నారు. వారిలో లక్షల కొద్దీ మహిళలు చురుకైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. మహిళల సామర్థ్యాలను గుర్తించి, ప్రభుత్వం కూడా సహకార సంఘ సంబంధిత విధానాల రూపకల్పనలో వారికి ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ఇటీవల మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల చట్టంలో సవరణలు చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. దీనిలో భాగంగా, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల బోర్డులో ఇక మహిళా డైరెక్టర్ల ప్రాతినిధ్యం తప్పనిసరి. పార్లమెంటులో నారీ శక్తి వందన్ అధినియమ్ ఆమోదం పొందడం దేశంలో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. అయితే, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి అంతే శక్తిమంతమైన ముఖ్య చట్టాన్నీ మేం తీసుకు వచ్చాం. కానీ, దీనిని చాలా తక్కువ మంది మాత్రమే చర్చిస్తున్నారు.
మిత్రులారా,
సహకార సంఘాలు సామూహిక శక్తిని ఉపయోగించుకొంటూ రైతుల వ్యక్తిగత సమస్యలను తీరుస్తాయి. నిల్వ చేసే సామర్ధ్యమే దీనికి ఒక ప్రధాన ఉదాహరణ. ఇంతకు ముందు, రైతులు నిల్వకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇదివరకటి ప్రభుత్వాలు ఈ అవసరాన్ని శ్రద్ధగా పట్టించుకోనేలేదు. అయితే, ప్రస్తుతం ఈ సమస్యను సహకార సంఘాల ద్వారా తీరుస్తున్నాం. ఇది ఒక పెద్ద మార్పే. ప్రపంచంలో అతి పెద్దదైన నిల్వ ప్రణాళికలో భాగంగా, వచ్చే 5 సంవత్సరాల్లో 700 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉండే నిల్వ సదుపాయాలను సిద్ధం చేస్తాం. దీనికి 1.25 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చవుతుంది. ఈ ప్రణాళిక పూర్తి అయిన తరువాత, పంటలను మన రైతులు వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిలవ చేయగలుగుతారు. వారు బ్యాంకుల నుంచి రుణాలను సులభంగా పొందగలుగుతారు. పంటను అమ్మడానికి సరైన సమయం వచ్చిందని వారు అనుకున్నప్పుడు, పంటను మార్కెట్టుకు తరలించి విక్రయించగలుగుతారు.
మిత్రులారా,
‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించాలంటే వ్యవసాయ వ్యవస్థలను ఆధునికీకరించడం కూడా ఎంతో ముఖ్యం. వ్యవసాయ రంగంలో మనం కొత్త వ్యవస్థలను రూపొందించడంతో పాటే ‘ప్యాక్స్’ ( పీఏసీఎస్) వంటి సహకార సంస్థలు కూడా వాటి వంతుగా కొత్త భూమికలను పోషించేందుకు తగిన సన్నాహాలను చేస్తున్నాం. ఈ సొసైటీలు ఇప్పుడు ‘ప్రధాన్ మంత్రీ జన్ ఔషధీ కేంద్రాలు’గా కూడా పనిచేస్తున్నాయి. ఇవి వేల కొద్దీ ‘ప్రధాన్ మంత్రీ కిసాన్ సమృద్ధి కేంద్రాల’ను కూడా నిర్వహిస్తున్నాయి. మేం కోఆపరేటివ్ సొసైటీలను పెట్రోలు, డీజిల్ రిటైల్ అవుట్లెట్లుగానూ మార్చాం. చాలా సహకార సంఘాల్లో ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్లను కూడా పంపిణీ చేస్తున్నారు. అనేక గ్రామాల్లో ‘పానీ సమితులు’ (నీటి సంఘాలు) పాత్రను కూడా ప్యాక్స్ పోషిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే, ప్యాక్స్తో పాటు పరపతి సంఘాల ఉపయోగం కూడా పెరుగుతోంది. మరి వాటికి ఆదాయార్జన మార్గాలూ పెరుగుతున్నాయి. కోఆపరేటివ్ సొసైటీలు ప్రస్తుతం గ్రామాల్లో ఉమ్మడి సేవా కేంద్రాలుగా ఉంటూ, వందల కొద్దీ ప్రభుత్వ సౌకర్యాలను అందజేస్తున్నాయి. ఈ సొసైటీలు కంప్యూటర్లను ఉపయోగించుకుంటూ సాంకేతిక రంగంతోను, ‘డిజిటల్ ఇండియా’తోను ముడిపడ్డ అవకాశాలను గ్రామీణ ప్రాంతాలకు, అలాగే కొత్త ఉపాధి అవకాశాలను గ్రామీణ ప్రాంతాల యువతకు అందజేయనున్నాయి.
మిత్రులారా,
‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించడానికి సహకార సంఘాలు కీలక పాత్రను పోషించాలి. మీ పాత్రతో పాటు సహకార సంఘాలకున్న పాత్ర ఎంత ప్రధానమైందో నాకు తెలుసు. అందువల్ల, మీరు రాణించాలని నేను కోరుకుంటున్నాను. చురుకుగా పనిచేసే వారిపైనే ఆశలు పెట్టుకుంటాం, పనే చేయని వారినుంచి ఎవరైనా ఏం ఆశించగలరు? ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయంసమృద్ధ భారత్) నిర్మాణానికి ఎంత క్రియాశీలంగా, చెప్పుకోదగ్గ స్థాయిలో తోడ్పడితే అంత త్వరగా మన లక్ష్యాలను సాధించ గలుగుతాం. స్వయంసమృద్ధ భారత్ను సాధించకపోతే, ‘వికసిత్ భారత్’ను నిర్మించలేం. మీకున్న శక్తియుక్తులనూ, మీ సంస్థాగత సామర్థ్యాన్నీ లెక్కలోకి తీసుకొని నేను ఆలోచించినప్పుడు, నాకు అనేక సూచనలు సలహాలు స్ఫురిస్తున్నాయి. వాటన్నింటినీ నేను ఏకబిగిన మీతో చెప్పలేను గాని ఒక విషయాన్ని సూచించాలనుకుంటున్నా. ఉదాహరణకు, మన సహకార సంఘాలు ఏయే వస్తువులను మన దేశం విదేశాల నుంచి తెప్పించుకుంటే బాగుంటుందో ఒక పట్టికను రూపొందించాల్సిందని మీకు నేను చెబుతున్నాను. అప్పుడు, ఆయా వస్తువులను మనం దిగుమతి చేసుకోం. ఈ విషయంలో కోఆపరేటివ్ రంగం చేయగలిగింది ఏముంది? దీనిని దృష్టిలో పెట్టుకొని మనం దేశంలో ఒక సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ బాధ్యతను సహకార సంస్థలు ఇట్టే భుజానికెత్తుకోవచ్చు. ఇప్పుడు, ఇంకో ఉదాహరణ.. మన దేశాన్ని వ్యవసాయ ప్రధాన దేశంగా పిలుస్తున్నా, నిజానికి గత 75 సంవత్సరాలుగా ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పుకొంటూ వస్తున్నాం. అయినప్పటికీ, ఏటా వందల కోట్ల కొద్దీ డాలర్లు విలువ చేసే వంట నూనెను మనం దిగుమతి చేసుకొంటూనే ఉండడం దురదృష్టకరం. వంట నూనె పరంగా మనం స్వయంసమృద్ధం అయ్యేదెలా? నువ్వులు పండుతోంది ఈ నెలలోనే. వాటి నుంచి తీసిన నూనె మన దేశ ప్రజల ఆరోగ్యాన్ని బాగుపరచ గలుగుతుంది. మరి ఈ విషయంలో సహకార రంగంలోని నా సహచరులు బాధ్యతను తీసుకోకపోతే, అప్పుడు ఇంకెవరు ఈ పనిని చేస్తారు? నేను సరైన మాటే చెబుతున్నానా, లేదా? మీరు ఆ పనిని చేసి పెడతారు, చేసి పెట్టరా? చూడండి.. ఆఖరికి మనం వాడుతున్న వంటనూనె కూడా విదేశాల నుంచే వస్తోంది. ఇంధనాల విషయానికి వద్దాం.. వాహనాలను, ట్రాక్టర్లను నడపడానికి కావలసిన చమురు పెట్రోలు, డీజిల్.. ఈ ఇంధనాలను కూడా బయటి దేశాల నుంచి రప్పించుకుంటున్నాం. ఈ దిగుమతుల బిల్లును మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని, ఇథెనాల్ తయారీలో మనం పురోగతి బాటలో అడుగులు వేస్తున్నాం. గత పది సంవత్సరాలలో, ఇథెనాల్ ఉత్పత్తి, సేకరణ, మిశ్రణం అనేక రెట్లు పెరిగాయి. ప్రస్తుతం, ఈ పనిని చాలావరకు చక్కెర మిల్లులు చేసిపెడుతుంటే, వాటి వద్ద నుంచి ఇథెనాల్ను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో సహకార సంఘాలు భాగం పంచుకోలేవా? అవి ఎంతగా పాలుపంచుకొంటే, అంతగానూ దీని విస్తృతి అధికమవుతుంది. పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించే విషయానికి వద్దాం.. మనది వ్యవసాయ ప్రధాన దేశం అయినా మనం పప్పుధాన్యాలను బయటి నుంచే తెచ్చుకొంటున్నాం. పప్పుధాన్యాల దిగుమతినీ తగ్గించుకోవడానికి, సహకార రంగ పాత్రధారులు సార్థక కృషి చేయొచ్చు, నాయకత్వ పాత్రను పోషించొచ్చు. మనం దిగుమతి చేసుకుంటున్న వాటిలో తయారీకి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు కూడా ఎన్నో ఉన్నాయి, అయితే వాటిని సహకార సంఘాల సాయాన్ని తీసుకొని మనం ఇక్కడే ఉత్పత్తి చేయవచ్చు.
మిత్రులారా,
ప్రస్తుతం, మనం సేంద్రియ వ్యవసాయానికి కూడా చాలా ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. ఈ రంగంలోనూ సహకార సంఘాలు ఒక ముఖ్య భూమికను పోషించ గలుగుతాయి. సహకార సంఘాలు ఆహార సంబంధిత సేవలను అందించడంలో, శక్తిని అందించడంలో, ఎరువులను అందించడంలో ఒక ప్రధాన పాత్రను పోషించవచ్చు. దీనిలో సహకార సంఘాలు పాలుపంచుకొంటే, ఫలితాలు వెంటనే వస్తాయి. పొలంలోని షెడ్డు పైభాగంలో సౌర ఫలకాలను గాని చిన్న సోలార్ ప్యానళ్లను గాని అమర్చే విషయానికి వద్దాం.. 50-60 మంది రైతులు కలిసి, ఒక సహకార సంస్థగా ఏర్పడి షెడ్డు పైన సౌర ఫలకాలను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేసి, ఆ విద్యుచ్ఛక్తిని రైతులకే కాక ప్రభుత్వానికి కూడా అమ్మితేనో. ఈ పనిని ఒక సహకార సంస్థ సులభతరంగా పూర్తి చేయగలుగుతుంది. ఈ మధ్య కాలంలో, బడా బహుళ జాతీయ సంస్థలు ‘గోబర్ధన్ యోజన’ అంటే ఆసక్తిని చూపుతున్నాయి. ఇది కూడా ఒక ప్రముఖ వనరుగా మారబోతోంది. సహకార సంఘాలు ఈ రంగంలో ఎందుకు వెనుకబడిపోవాలి? వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే పని అయినా, ఆవుపేడ నుంచి బయోగ్యాసును తయారు చేయడమైనా, సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేయడం వంటి పనుల్లో తమ పాత్రను పోషించే విషయాన్ని గురించి సహకార సంస్థలు ఆలోచించాలి. ఇది కూడా ఎరువులకు సంబంధించి మన దేశం దిగుమతి బిల్లును తగ్గించ గలుగుతుంది. మన రైతులు, చిన్న వాణిజ్య సంస్థల ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా బ్రాండు స్థాయి లభించేలా చేయడానికీ మీరు ఒక అడుగు ముందుకు వేయాలి. గుజరాత్నే చూడండి. ఇదివరకు, గుజరాత్లో వేర్వేరు పేర్లతో నడుస్తున్న పాడి సంఘాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా డెయిరీలు పనిచేస్తున్నాయి, కానీ ‘అమూల్’ ఒక బ్రాండుగా ఎదిగింది. ఇవాళ, దీని పేరు ప్రపంచం అంతటా వినిపిస్తోంది. మనం కూడా మన వివిధ రకాలైన ఉత్పాదనలకు ఒక ఉమ్మడి బ్రాండును తీసుకు రాగలం. మన సిరిధాన్యాలకు.. ‘శ్రీ అన్న’’ పేరిట ఒక బ్రాండును సృష్టించడం మన ధ్యేయం కావాలి. ప్రపంచంలో ప్రతి డైనింగ్ టేబుల్ మీదా భారత్ బ్రాండు సిరిధాన్యాలు ఎందుకు ఉండకూడదు? ఈ విషయంలో సహకార సంఘాలు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలి.
మిత్రులారా,
పల్లెల ఆదాయాన్ని పెంచడంలో సహకార సంఘాలు కీలక పాత్రను పోషించగలుగుతాయి. పాడి రంగంలో ఒక స్పష్ట మార్పు చోటుచేసుకోవడాన్ని మనం చూశాం. గత మూడు రోజులుగా నేను సహకార రంగ కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చాను. మొదట, అమూల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అహమదాబాదుకు వెళ్లాను. నిన్న, బనారస్ డెయిరీని ప్రారంభించడానికి బనారస్కు వెళ్లాను. బనారస్లో పాడి సహకార సంఘాలు రంగప్రవేశం చేయడంతో, మహిళా పాడి రైతుల ఆదాయం అనేక విధాలుగా పెరుగుతోందని గ్రహించాను. సహకార సంఘాలు మరో రంగంలోకి అడుగుపెట్టాయి. తేనె రంగంలోకి రండి అంటూ గుజరాత్ సహకార రంగంలోని వారికి నేను విజ్ఞప్తి చేశాను. మనం శ్వేత క్రాంతిని చూశాం, ఇక స్వీట్ క్రాంతిని తీసుకువద్దాం. మరి, మన వాళ్లు తేనె రంగంలో ముందడుగు వేయాలి. ఈ రంగంలో రైతులు ఎంతటి లాభాన్ని అందుకొంటోందీ మీకు కూడా తెలుసు. గత పదేళ్లలో, తేనె ఉత్పత్తి 75 వేల మెట్రిక్ టన్నుల నుంచి ఇప్పుడు దాదాపు ఒక లక్షా యాభై వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది. తేనె ఎగుమతులు కూడా 28 వేల మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 80 వేల మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. ఈ పురోగతిలో నాఫెడ్, ట్రైఫెడ్లతో పాటు రాష్ట్రాల్లోని కోఆపరేటివ్ సంస్థలు కూడా చాలా పెద్ద పాత్రను పోషించాయి. ఈ పరిధిని మనం మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా,
గుజరాత్లో, పాలను అమ్మి సంపాదించిన డబ్బు ఆడపడుచుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ కావడం మొదలవడంతోనే, అది ఒక అర్థవంతమైన సామాజిక మార్పును తీసుకు రావడాన్ని మనం గమనించాం. ఇప్పుడు మన సహకార సంఘాలను, మన పీఏసీఎస్లనూ కంప్యూటరీకరించడం పూర్తి అయింది. కాబట్టి, ఏ పని చేసినా, ఎంత మొత్తంలో చెల్లింపులు చోటుచేసుకున్నా, అవి డిజిటల్ వేదిక ద్వారానే జరగాలి. ముఖ్యంగా సహకార బ్యాంకులు డిజిటల్ సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకో గలగాలి. భూమి స్వస్థత కార్డు మరో అంశం. నేల ఆరోగ్యాన్ని పరీక్షించడం కోసం సాయిల్ టెస్టింగుకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమాన్ని మేం తీసుకువచ్చాం. సహకార సంఘాలూ, పీఏసీఎస్లూ వాటి వాటి ప్రాంతాల్లో చిన్నగా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నా. వీటి ద్వారా రైతులు తమ భూమి ఆరోగ్యమూ, ఆ మట్టి స్వస్థత స్థితీ ఎలా ఉన్నాయో నిరంతరం పర్యవేక్షించుకుంటూ ఉండే పద్ధతికి అలవాటు పడేటట్టుగా వారిని ప్రోత్సహించాలి. భూపరీక్షలకు సంబంధించిన ఒక నెట్వర్కును ఏర్పాటు చేసుకొనే స్థాయికి వారు చేరుకోవాలి.
మిత్రులారా,
సహకార సంఘాల్లో యువత, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమెలా. ఈ విషయంలోనూ మనం మన ప్రయత్నాలను తీవ్రతరం చేయాలి. సహకార సంఘంలో పాలుపంచుకొంటున్న రైతులు ఈ విషయంలో తమ ఆలోచనలను పంచుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. దీంతో పాటు, వాళ్లు అందుకోబోయే డివిడెండ్లు, తదితర ప్రయోజనాల్లో వారికి చెందిన సహకార సంస్థే భూసార పరీక్షను ఉచితంగా పూర్తి చేసి ఇస్తుందని కూడా వారికి మనం చెప్పవచ్చు. భూసార పరీక్ష నుంచి వారు పొందిన అవగాహన మేరకు, పంటలపై దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా వారికి సూచన చేయాలి.
మిత్రులారా,
ఇది సహకార సంఘాలకు కొత్తదనాన్నిస్తుంది. దీంతో ఒక కొత్త శక్తి లభిస్తుంది. సహకార సంఘాల్లో నైపుణ్యాభివృద్ధినీ, శిక్షణనూ, చైతన్యాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. మరి అన్నింటినీ కాగితాల్లో పేర్కొనాలి. నోటి మాటలుగా ఎన్నో వాగ్దానాలు చేసిన రోజులు కాలగర్బంలో కలిసిపోయాయి. అందువల్ల, శిక్షణకు చాలా ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఈ విషయంలో ప్రయత్నాలను చేసి తీరాలి. పీఏసీఎస్లూ, కోఆపరేటివ్ సొసైటీలు కూడా ఒకదాని నుంచి మరొకటి పాఠాలను నేర్చుకోవాలి. అనేక సహకార సంస్థలు వినూత్న పనులను నిర్వహిస్తున్నాయి. అవి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాలకు ఈ సంగతి తెలియదు. ఉత్తమ పద్ధతులను పంచుకొనేందుకు ఒక ఉమ్మడి పోర్టల్ను మనం రూపొందించగలమా? మరి ఈ పోర్టల్లో అందరూ తమ కొత్త కొత్త అనుభవాలను, కొత్త కొత్త పద్ధతులను అప్లోడ్ చేయవచ్చును. ఈ ఉత్తమ పద్ధతులను ఎక్కువ మంది అనుసరించేటట్లు చూడడం ఎలా? ఆన్లైన్లో శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు ఉండాలి, దీనికి కొన్ని మాడ్యూళ్లను రూపొందించాలి. అభివృద్ది కోసం తపిస్తున్న జిల్లాల కార్యక్రమం. ఇది ఆకాంక్షాత్మక జిల్లాలకు సంబంధించిన ప్రచార ఉద్యమం. దీనిలో ఒక విశేషం ఉంది. ఈ సంగతి తెలుసా మీకు. ఆరోగ్యకరమైన పోటీ వ్యవస్థంటూ ఒకటి ఉంది. ర్యాంకింగుల పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనిలో ప్రతి రోజూ పది సార్లు ర్యాంకులు పైకీ, కిందికీ మారుతూ ఉంటాయి. ప్రతి అధికారీ అనుకుంటారు.. తన జిల్లాయే ముందుకు వెళ్లాలని... సహకార రంగంలో కింది నుంచి పైకి వేర్వేరు స్థాయులను రూపొందిద్దామంటారా? ఒక్కో రకం కోపరేటివ్ సంస్థకు ఒక్కో రకమైన స్థాయి… ఇలా ఒక వ్యవస్థను రూపొందిస్తేనో. మళ్లీ వీటిలోనూ ఆరోగ్యకర పోటీ ఉండాలి. సహకార సంస్థల మధ్య ఈ పోటీ ఉండాలి. ఉత్తమ పనితీరును కనబరిచే వాటికి బహుమతులిచ్చే ఏర్పాటు అవసరం. ఇలాంటి సహకార సంస్థలు ఒక సరికొత్త ఆవిష్కరణతో ముందుకు రావాలి. దానికి ప్రభుత్వంతో పాటు సహకార సంస్థలన్నీ కలిసి కొత్త రూపురేఖలను ఇవ్వగలగాలి. అంత ప్రధానంగా ఉండాలి ఆ ఆవిష్కరణ.
మిత్రులారా,
సహకార సంస్థల విషయంలో ఎప్పుడూ ఒక ప్రశ్న వస్తుంది. సహకార సంఘాల ఎన్నికల్లో పారదర్శకతను తీసుకురావడం ఎంతో అవసరం. దీంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. మరింత మంది సహకార సంఘాల్లో చేరడానికి ముందుకు వస్తారు.
మిత్రులారా,
సహకార సంఘాలను సమృద్ధికి పునాదిగా మార్చడానికి, అవి ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఒక్కటొక్కటిగా మా ప్రభుత్వం తగ్గిస్తోంది. కంపెనీలకు సెస్ తక్కువగా ఉంటే, సహకార సంఘాలు మాత్రం ఎక్కువ సెస్సు చెల్లించాల్సి వచ్చిందన్న విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మేం రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించే సహకార సంఘాలకు వర్తించే సెస్సును 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గించాం. దీంతో సహకార సంఘాలు వాటి కార్యకలాపాలను కొనసాగించడానికి అందుబాటులో ఉండే నిధులు పెరిగి, కంపెనీల మాదిరిగానే అవీ ప్రగతి బాట పట్టే అవకాశం లభించింది. సహకార సంఘాలకూ, కంపెనీలకూ మధ్య కనీస ప్రత్యామ్నాయ పన్ను విషయంలోనూ ఇదివరకు భేద భావం ఉండేది. మేం సహకార సంఘాలకు కనీస ప్రత్యామ్నాయ పన్నును 18 శాతం నుంచి 15 శాతానికి తగ్గించి, కార్పొరేట్ ప్రపంచంతో సమాన స్థాయికి వాటిని తీసుకు వచ్చాం. మరో ఇబ్బంది కూడా ఉండింది. అది సహకార సంఘాలు రూ.1 కోటి కన్నా ఎక్కువ నగదును విత్డ్రా చేసిన సందర్భంలో టీడీఎస్ కట్టాల్సివచ్చేది. మేం ఈ విత్డ్రాయల్ పరిమితిని ఏడాదిలో రూ.3 కోట్లకు పెంచాం. దీంతో ఈ ప్రయోజనాన్ని ఇక సభ్యుల సంక్షేమానికి వినియోగించవచ్చు. సహకార సంఘాల విషయంలో మేం తీసుకుంటున్న ఈ సమష్టి చర్యలు దేశ ఉమ్మడి శక్తితో అభివృద్ధికి అన్ని అవకాశాలనూ అందుబాటులోకి తీసుకువస్తాయని నేను నమ్ముతున్నాను.
ఈ ఆకాంక్షతో, మీకు నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అమిత్ భాయి చెప్పినట్లు, వేర్వేరు చోట్ల లక్షల కొద్దీ ప్రజలు సమావేశమయ్యారు. ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో ఈ ముఖ్య కార్యక్రమంలో పాలుపంచుకొన్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడానికి ఒకరికొకరం సహకారాన్ని అందించుకోవాలనే నిజమైన స్ఫూర్తితో, భుజం భుజం కలిపి, అడుగులో అడుగేసి నడుద్దాం.. రండి. మనమంతా ఒకే బాటలో ముందుకు సాగుతూ, ఒకదాని వెంట మరొకటిగా ఫలితాలను సాధించుకొందాం. మీకు ధన్యావాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఇది.
***
(రిలీజ్ ఐడి: 2169498)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam