రాష్ట్రపతి సచివాలయం
ఈఈపీసీ ఇండియా వజ్రోత్సవ వేడుకలకు హాజరైన భారత రాష్ట్రపతి
భారతదేశాన్ని అగ్రగామి నూతన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ:
ఈఈపీసీ భాగస్వాములతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Posted On:
08 SEP 2025 12:56PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఇవాళ(సెప్టెంబర్ 8, 2025) జరిగిన ఇంజినీరింగ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఈపీసీ) వజ్రోత్సవ వేడుకలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రాచీన కాలంలో ఆధ్యాత్మిక, వాణిజ్య రంగాల్లో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించిందని అన్నారు. పరిజ్ఞానంలోనూ, వాణిజ్యంలోనూ భారత్ ను మళ్లీ అగ్రస్థానంలో నిలపడానికి పౌరులందరూ సంకల్పం తీసుకోవాలని పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో ముఖ్యమైన భాగస్వాములుగా ఈ సంకల్పాన్ని పట్టుదలతో స్వీకరించాలని తెలిపారు.
గత పదేళ్లలో భారతదేశ ఇంజినీరింగ్ ఎగుమతుల విలువ 70 బిలియన్ డాలర్ల నుంచి 115 బిలియన్ డాలర్లకు పైగా చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పదేళ్లలో అంతర్జాతీయ వాణిజ్యంలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ఎగుమతుల్లో ఈ వృద్ధి సాధించటం గర్వించదగినదన్నారు. ఈ ఘనతని సాధించినందుకు ఈఈపీసీని అభినందించారు.
అంతర్జాతీయ మార్కెట్, భారతదేశ ఉత్పత్తులకు మధ్య వారధిగా ఈఈపీసీ పనిచేస్తుందని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచ వాణిజ్య కార్యకలాపాల్లో భారతదేశం, భారత పారిశ్రామికవేత్తల పాత్రను నిరంతరం విస్తరించాలని ఈఈపీసీని కోరారు. ప్రపంచ వాణిజ్య క్రమం, అంతర్జాతీయ ఆర్థిక క్రమాల్లో జరుగుతున్న మార్పుల కారణంగా, దీని పాత్ర మరింత ముఖ్యమైనదని స్పష్టం చేశారు.
మన దేశంలోని అసాధారణ సామర్థ్యాలను ఉపయోగించుకుని, ప్రపంచ వాణిజ్యంలోని సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఏడు దశాబ్దాలుగా భారతదేశ ఇంజనీరింగ్ ఎగుమతుల గమ్యస్థానాలు గణనీయంగా మారాయని చెప్పారు. ఈ మార్పు ప్రక్రియను ఈఈపీసీ కొనసాగించాలని, 'నేషన్ ఫస్ట్' స్ఫూర్తితో భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు.
తక్కువ ధరలకు అధిక నాణ్యత గల ఇంజనీరింగ్ సేవలు, ఉత్పత్తులు భారతదేశానికి గొప్ప బలమని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల ప్రపంచ స్థాయి కార్యాలయాలు భారతదేశంలో ఉన్నాయన్నారు. ఈఈపీసీ వంటి వాటాదారులు తగినంత ప్రోత్సాహకాలు, సరైన వ్యవస్థను అందించి, భారతదేశాన్ని ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా మార్చాలనే ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. ప్రపంచ ఆర్థిక, వాణిజ్య నిపుణులు.. ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల గురించి చర్చిస్తారని, ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థలే ప్రపంచంలో అత్యంత పోటీతత్వంతో, సంపన్నంగా ఉంటాయని తెలిపారు. మన దేశంలో ఉన్న ప్రతిభ, శక్తికి అనుకూలమైన వ్యవస్థను అందించి, భారతదేశాన్ని ప్రముఖ ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రతిజ్ఞ చేయాలని ఈఈపీసీ భాగస్వాములకు పిలుపునిచ్చారు.
***
(Release ID: 2164691)
Visitor Counter : 2