రాష్ట్రపతి సచివాలయం
ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి
విజ్ఞానంలో ప్రపంచశక్తిగా భారత్ను మార్చేందుకు మన ఉపాధ్యాయులను
ప్రపంచంలోనే అత్యుత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలి: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
Posted On:
05 SEP 2025 2:20PM by PIB Hyderabad
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ఆహారం, దుస్తులు, నివాసం లాగే విద్య కూడా ఒక వ్యక్తి గౌరవం, భద్రతకు చాలా అవసరమన్నారు. వివేకవంతులైన ఉపాధ్యాయులు విద్యార్థుల్లో గౌరవం, భద్రతను పెంపొందించడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలిగా తన అనుభవాలను గుర్తు చేసుకున్న రాష్ట్రపతి.. ఆ సమయాన్ని తన జీవితంలో చాలా అర్థవంతమైన కాలంగా అభివర్ణించారు.
విద్య ఒక వ్యక్తిని సమర్థుడిని చేస్తుందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు విద్యా శక్తితో పురోగతి అనే ఆకాశాన్ని అందుకుంటారని అన్నారు. ప్రేమ, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు పిల్లల పురోగతికి ప్రోద్బలాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు జీవితాంతం ఉపాధ్యాయులను గుర్తుంచుకోవడం ఉపాధ్యాయులకు లభించే అతిపెద్ద బహుమతి అవుతుందన్నారు. కుటుంబం, సమాజం, దేశం కోసం ఉపాధ్యాయులు చేసే కృషి ప్రశంసనీయమని రాష్ట్రపతి కొనియాడారు.
విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం ఉపాధ్యాయుని ప్రాథమిక కర్తవ్యంగా రాష్ట్రపతి పేర్కొన్నారు. పోటీ, పుస్తక జ్ఞానం, స్వార్థం పట్ల మాత్రమే ఆసక్తి గల విద్యార్థుల కంటే నైతిక విలువలతో కూడిన ప్రవర్తనను అనుసరించే సున్నితమైన, బాధ్యతాయుతమైన, అంకితభావం గల విద్యార్థులు అత్యుత్తములని వ్యాఖ్యానించారు. మంచి ఉపాధ్యాయుడికి భావోద్వేగాలు, తెలివి రెండూ ఉంటాయనీ.. ఈ రెండింటి సమన్వయం విద్యార్థులపై కూడా ప్రభావం చూపుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
స్మార్ట్ బ్లాక్బోర్డులు, స్మార్ట్ తరగతి గదులు, ఇతర ఆధునిక సౌకర్యాలకు సొంత ప్రాముఖ్యం ఉంటుందన్న రాష్ట్రపతి.. అతి ముఖ్యమైన విషయం స్మార్ట్ టీచర్లేనన్నారు. స్మార్ట్ టీచర్లు అంటే విద్యార్థుల అభివృద్ధి అవసరాలను అర్థం చేసుకునే ఉపాధ్యాయులనీ.. వారు ప్రేమ, సున్నితత్వంతో అభ్యసన ప్రక్రియను ఆసక్తికరంగా, ప్రభావవంతంగా మార్చగలరని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. అలాంటి ఉపాధ్యాయులు సమాజ, దేశ అవసరాలను తీర్చగల సామర్థ్యం కలిగి ఉండే విద్యార్థులను రూపొందించగలరని శ్రీమతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
బాలికల విద్యకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాలని రాష్ట్రపతి కోరారు. బాలికా విద్యలో పెట్టుబడి పెట్టడం ద్వారా మన కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో మనం అమూల్యమైన పెట్టుబడి పెట్టినట్లేనని వ్యాఖ్యానించారు. బాలికలకు సాధ్యమైనంత ఉత్తమ విద్యను అందించడం మహిళల నేతృత్వంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆమె పేర్కొన్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను విస్తరించడం, వెనకబడిన తరగతుల బాలికలకు ప్రత్యేక విద్యా సౌకర్యాలను అందించడంపై జాతీయ విద్యా విధానం 2020 ప్రధానంగా దృష్టి సారిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యకు సంబంధించిన ఏ కార్యక్రమం విజయవంతమైనా ప్రధానంగా అది ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. బాలికల విద్యకు వారు ఎంత ఎక్కువ సహకరిస్తారో, ఉపాధ్యాయులుగా వారి జీవితం అంత అర్థవంతంగా ఉంటుందని తెలిపారు. భయస్తులైన, తక్కువ ప్రాధాన్యం గల నేపథ్యం నుండి వచ్చిన బాలికలు సహా విద్యార్థులందరిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు.
విజ్ఞానంలో భారతదేశాన్ని ప్రపంచశక్తిగా మార్చడమే జాతీయ విద్యా విధాన లక్ష్యమని రాష్ట్రపతి అన్నారు. దీని కోసం మన ఉపాధ్యాయులను ప్రపంచంలోనే అత్యుత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలని ఆమె వ్యాఖ్యానించారు. మన సంస్థలు, ఉపాధ్యాయులు పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్య విద్యలో సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. తమ వంతు కృషిని అందించడం ద్వారా ఉపాధ్యాయులు మన దేశాన్ని విజ్ఞాన రంగంలో ప్రపంచశక్తిగా నిలుపుతారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చూసేందుకు దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి-
***
(Release ID: 2164302)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Nepali
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam