ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ శాంతిభద్రతల కమిషన్ చైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధానమంత్రి భేటీ

Posted On: 31 AUG 2025 4:50PM by PIB Hyderabad

టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ శాంతిభద్రతల కమిషన్ చైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు.

భారత్ తన నైబర్‌హుడ్ ఫస్ట్, యాక్ట్ ఈస్ట్, ఇండో-పసిఫిక్ విధానాల్లో భాగంగా మయన్మార్‌తో సంబంధాలకు ప్రాధాన్యమిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అభివృద్ధి భాగస్వామ్యం, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, సరిహద్దు వాణిజ్య సమస్యలు సహా అనేక అంశాలపై ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించే మార్గాలను వారు చర్చించారు. భారత యాక్ట్ ఈస్ట్ విధానంలో అంచనా వేసిన విధంగా ప్రాంతీయ సహకారం, ఏకీకరణను ప్రోత్సహిస్తూనే.. కొనసాగుతున్న అనుసంధాల ప్రాజెక్టుల పురోగతి ఇరుదేశాల ప్రజల సంబంధాలను మెరుగుపరుస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

మయన్మార్‌లో రాబోయే ఎన్నికలు అన్ని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని నిశ్పాక్షికంగా, సమ్మిళితంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. మయన్మార్ నేతృత్వంలోని మయన్మార్ సొంత శాంతి ప్రక్రియకు భారత్ మద్దతు ఉంటుందన్న ప్రధానమంత్రి.. దీని కోసం శాంతియుత చర్చలు, సంప్రదింపులు మాత్రమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.

మయన్మార్ అభివృద్ధి అవసరాలకు మద్దతిచ్చేందుకు భారత్ సంసిద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

 

***


(Release ID: 2162549) Visitor Counter : 2