ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-జపాన్ మానవ వనరుల బదిలీలు, సహకారానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక
Posted On:
29 AUG 2025 6:54PM by PIB Hyderabad
మానవ వనరులకు సంబంధించి భారత్, జపాన్ మధ్య 5 సంవత్సరాలలో కానున్న 5,00,000 మంది పరస్పర బదిలీల్లో 50,000 మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది, ప్రతిభావంతులు ఉండనున్నారు.
భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం- 2025 సందర్భంగా ఇరు దేశాల ప్రధానమంత్రులు.. సందర్శనలు, బదిలీ కార్యక్రమాల ద్వారా తమ ప్రజల మధ్య లోతైన అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు. విలువలను పెంపొందించేందుకు, సంబంధిత జాతీయ ప్రాధాన్యతలపై పనిచేసేందుకు మానవ వనరుల విషయంలో భాగస్వామ్య అవకాశాలను కనుగొనేందుకు అంగీకారానికి వచ్చారు.
దీని ప్రకారం భవిష్యత్లో రెండు దేశాల మధ్య వారధిగా పనిచేయడానికి మానవ వనరుల బదిలీ కార్యక్రమాలను విస్తరించడానికి భారత్, జపాన్ దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కృషి చేయనున్నాయి. రాబోయే ఐదేళ్లలో 5,00,000 లకు పైగా సిబ్బందిని ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలనే భారీ లక్ష్యాన్ని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఇందులో 50,000 మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది, ప్రతిభావంతులు ఉండనున్నారు. ఈ కార్యక్రమాలను ఈ కింది లక్ష్యాలతో చేపట్టనున్నారు:
i. జపాన్లో పనిచేయటంపై ఉన్న దృక్పథాన్ని మార్చటం ద్వారా భారత్కు చెందిన నైపుణ్యం కలిగిన వారిని, ప్రతిభావంతులను జపాన్ ఆకర్షించడం.
ii. రెండు దేశాల్లో ఉమ్మడి పరిశోధన, వ్యాపారీకరణ, విలువను సృష్టించేందుకు మానవ వనరుల సామర్థ్యాలను పరస్పరం ఉపయోగించుకోవటం.
iii. భారత్లో జపనీస్ భాషా విద్యను ప్రోత్సహించడం.. భవిష్యత్తు కోసం రెండు వైపుల సాంస్కృతిక, విద్యా, క్షేత్ర స్థాయి బదిలీలను ప్రోత్సహించడం.
iv. ఐటీ సిబ్బందితో పాటుగా మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్న జపాన్.. తయారీ రంగాన్ని బలోపేతం చేయటం, నైపుణ్యాలను పెంచాలని ఆశిస్తోన్న భారత్.. ఇలా రెండు దేశాలకు ఆర్థికంగా ప్రయోజనకరమైన వాటిపై పనిచేయటం.
v. జపాన్ కంపెనీలు, భారతీయ విద్యార్థుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం.
ఈ దిశగా రెండు దేశాలు సంయుక్తంగా ఈ కింది కార్యాచరణ ప్రణాళికను తీసుకొచ్చాయి. రాబోయే అయిదు సంవత్సరాల్లో భారత్ నుంచి జపాన్కు వెళ్లే నిపుణులు, ప్రతిభావంతుల సంఖ్యను 50,000 లకు పెంచేందుకు ప్రభుత్వం, పరిశ్రమ, వివిధ విద్యా సంస్థలు కృషి చేసేలా ఇది ప్రోత్సహించనుంది.
1) అధిక నైపుణ్యం కలిగిన సిబ్బంది:
రాబోయే 5 ఏళ్లలో భారతీయ ఇంజనీరింగ్ నిపుణులు, విద్యా సిబ్బంది జపాన్కు వెళ్లటాన్ని ఇది పెంచనుంది. వీటిపై ఇది పనిచేస్తుంది:
అ) సెమీకండక్టర్లు, ఏఐ వంటి లక్ష్యిత రంగాల్లో జపనీస్ కంపెనీలలో ఉన్న ఉపాధి అవకాశాల గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా భారత ఉన్నత విద్యా సంస్థలకు జపనీస్ కంపెనీల ప్రత్యేక మిషన్.
ఆ) జపాన్లో భారతీయ నిపుణుల ఉపాధికి సంబంధించి సర్వే నిర్వహించడం, ఉత్తమ పద్ధతులు లేదా విజయ గాథలను గుర్తించడం, అవగాహనను పెంచటం, ఉపాధి పెంచే ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా ఆ దేశంలో ఎక్కువ మంది భారతీయులను ఉద్యోగాల్లో నిమమించటం, భారతీయ ప్రతిభను అక్కడే నిలుపుకోవడం.
ఇ) జపాన్ ఎక్స్ఛేంజ్, టీచింగ్ కార్యక్రమం (జేఈటీ) కింద జపాన్లో భారత్కు చెందిన ఆంగ్ల భాషా సహోపాధ్యాయుల ఉపాధిని ప్రోత్సహించడం.
2) విద్యార్థులు, పరిశోధకులు:
రాబోయే 5 సంవత్సరాలలో భారతీయ విద్యార్థులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు జపాన్కు వెళ్లటాన్ని పెంచటం. దీన్ని కింది వాటి ద్వారా సాధించనున్నారు:
అ) భారత్, జపాన్ మధ్య విద్యార్థుల బదిలీలను ప్రోత్సహించటం.. జపాన్లో భారతీయ విద్యార్థులకు చదువుకున్న అనంతరం ఇంటర్న్షిప్, ఉపాధి పొందే ప్రక్రియను క్రమబద్ధీకరించే చర్యలపై దృష్టి సారిస్తూ జపాన్ ప్రభుత్వ ఎంఈఎక్స్టీ, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ మధ్య విద్యపై ద్వైపాక్షిక ఉన్నత స్థాయి విధానపరమైన చర్చలు.
ఆ) భారత్లోని భాగస్వామ్య విశ్వవిద్యాలయాలతో నాణ్యతతో కూడిన అంతర్జాతీయ విద్యార్థుల బదిలీ కార్యక్రమాలను తయారు చేసేందుకు, నిర్వహించేందుకు జపనీస్ విశ్వవిద్యాలయాలకు సహాయపడేలా ఇంటర్-యూనివర్శిటీ ఎక్స్ఛేంజ్ ప్రాజెక్ట్ను ఎంఈఎక్స్టీ ప్రోత్సహించడం.
ఇ) జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (జేఎస్టీ) నిర్వహించే సాకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద ప్రతి సంవత్సరం జపాన్కు భారతీయ విద్యార్థులు, పరిశోధకుల సందర్శనలు.. మహిళా పరిశోధకులు పాల్గొనేలా ప్రోత్సహించడం.
ఈ) జపాన్లో చదువుతోన్న భారతీయ విద్యార్థులకు జపనీస్ ప్రభుత్వ (ఎంఈఎక్స్టీ) ఉపకారవేతనాల ద్వారా నిరంతర మద్దతునివ్వటం.
ఉ) రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక మానవ వనరుల బదిలీలకు ఉత్ప్రేరకంగా పనిచేసేలా భారత విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను జపనీస్ కంపెనీలను సందర్శించేందుకు, నెల రోజుల పాటు ఇంటర్న్షిప్ చేసేందుకు.. జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రారంభించిన మిరాయ్-సేతు కార్యక్రమం కింద ఆహ్వానించటం.
ఊ) రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శాస్త్రీయ మానవ వనరుల బదిలీకి ఉత్ప్రేరకంగా పనిచేసేందుకు భారత్, జపాన్ మంత్రిత్వ శాఖలు, సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువ విజ్ఞాన బదిలీ కార్యక్రమం కింద శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఉన్నత పాఠశాల విద్యార్థులను స్వల్ప కాలిక కార్యక్రమాల కోసం జపాన్ విద్యా సంస్థలకు ఆహ్వానించటం.
ఎ) అత్యాధునిక రంగాల్లో భారత్, జపాన్ సంయుక్త పరిశోధనలను ప్రోత్సహించేందుకు.. జపాన్కు వచ్చే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో సహా యువ పరిశోధకుల కోసం జపాన్ ఎంఈఎక్స్టీ కొత్తగా తీసుకొచ్చిన లోటస్ కార్యక్రమం (ఇండియా-జపాన్ సర్క్యూలేషన్ ఆఫ్ యూత్ ఇన్ సైన్స్ ప్రోగ్రామ్). పరిశ్రమలు- విద్యా రంగం భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు జపానీస్ కంపెనీస్లలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారికి ఇంటర్న్షిప్ల రూపంలో సంబంధింత కంపెనీలలో అవకాశాలను జపాన్ ప్రభుత్వ ఎంఈఐటీ చూపించనుంది.
(3) ప్రత్యేక నైపుణ్యాలున్న పనివాళ్ల (ఎస్ఎస్డబ్ల్యూ) వ్యవస్థ లేదా టెక్నికల్ ఇంటర్న్ నైపుణ్య శిక్షణ కార్యక్రమం (టీఐటీపీ):
జపాన్ ఎస్ఎస్డబ్ల్యూ వ్యవస్థ కింద 5 సంవత్సరాల వ్యవధిలో భారతీయ మానవ వనరుల ప్రవాహాన్ని మెరుగుపరచటం. దీన్ని కింది వాటి ద్వారా సాధించనున్నారు:
అ) భారత్లో ఎస్ఎస్డబ్ల్యూ పరీక్షను మొత్తం 16 విభాగాలల్లో నిర్వహించేందుకు కృషి చేయటం.
ఆ) భారత్లోని ఉత్తర, తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో నైపుణ్య పరీక్షలు, జపనీస్ భాషా పరీక్షల కోసం కొత్త పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయటం
ఇ) భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) చేపడుతోన్న ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం ద్వారా అర్హత కలిగిన భారతీయ ఎస్ఎస్డబ్ల్యూ సిబ్బందికి జపాన్కు వెళ్లే కంటే ముందు వృత్తిపరమైన భాషా శిక్షణను అందించడం.
ఈ) భారత ఈ-మైగ్రేట్ పోర్టల్లో జపాన్ను గమ్యస్థాన దేశంగా చేర్చడం.. ధ్రువీకరణ పొందిన భారతీయ సిబ్బందిని సురక్షితంగా, చట్టబద్ధంగా, క్రమబద్ధంగా జపాన్ సంస్థలు నియమించుకోవటం కోసం భారత కెరీర్ సర్వీస్ ప్లాట్ఫామ్లో ప్రత్యేకమైన భారత్-జపాన్ కారిడార్ను ఏర్పాటు చేయటం.
ఉ) టీఐటీపీ, ఈఎస్డీ (ఎంప్లాయ్మెంట్ ఫర్ స్కిల్ డెవలాప్మెంట్) కార్యక్రమం ద్వారా భారతీయ ప్రతిభావంతులను జపాన్కు ఆకర్షించటం.
(4) నైపుణ్యాభివృద్ధి:
భారతదేశంలో నైపుణ్య స్థాయిలను పెంచేందుకు, జపాన్ అవసరాల కోసం సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని మరింతగా ఉత్పత్తి చేయడానికి జపాన్కు ఉన్న నిర్వాహక, పారిశ్రామిక, తయారీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటం. ఇందులో ఇవి ఉన్నాయి:
అ) ఇండియా-నిప్పన్ ప్రోగ్రామ్ ఫర్ అప్లయిడ్ కాంపిటెన్సీ ట్రైనింగ్ (ఇన్పాక్ట్) లాంటి కార్యక్రమాల కింద జపాన్ కంపెనీలు భారత్లో అందించే కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు.. జపాన్లో భారతీయుల నైపుణ్య శిక్షణకు సంబంధించిన ఖర్చుకు సబ్సిడీని అందించటం
ఆ) కొత్తగా ప్రారంభించిన "ఇండియా-జపాన్ టాలెంట్ బ్రిడ్జ్", ఇతర కార్యక్రమాల ద్వారా భారతీయ విద్యార్థులు, ఉద్యోగం చేస్తోన్న నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణుల కోసం ఇంటర్న్షిప్ కార్యక్రమాలు, ఉద్యోగ కల్పన కార్యక్రమాలను ప్రోత్సహించడం.
ఇ) రాష్ట్రంలోని ప్రజలకు జపాన్లో ఉపాధి కల్పించేందుకు సంబంధింత శిక్షణ, నియామకాల విషయంలో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ) సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయటం
ఈ) సహజ ఆరోగ్యంపై అవగాహనను పెంచేందుకు, వీటి అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి, ముఖ్యంగా వృద్ధాప్య సంరక్షణ రంగంలో వీటి అమలును ప్రోత్సహించేందుకు.. జపాన్ అంతటా భారత రాయబార కార్యాలయం, భారత ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ సెల్ పర్యవేక్షణలో యోగా, ఆయుర్వేదంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లను ఏర్పాటు చేయడం
(5) భాషా సామర్థ్య అభివృద్ధి:
వీటి ద్వారా నైపుణ్య రంగాలకు సంబంధించిన జపనీస్ భాషా విద్యను ప్రోత్సహించడం:
అ) ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్యక్రమాల ద్వారా భారత్లోని విద్యా సంస్థల్లో ఆచరణాత్మక జపనీస్ భాషా బోధనకు అందుబాటులో ఉంచటం.
ఆ) జపనీస్ కంపెనీలు అందించే భాషా శిక్షణ విషయంలో సబ్సిడీలు
ఇ) జపనీస్ భాషా ఉపాధ్యాయులకు శిక్షణ అవకాశాలను విస్తరించడంతో పాటు జపనీస్ భాషా విద్యకు సంబంధించిన నిపుణులను భారత్కు పంపించటం ద్వారా సమర్థవంతమైన పాఠ్యాంశాలు, పుస్తకాలు రూపొందించేందుకు సహాయపడటం.
ఈ) భారత్లో నిహోంగో పార్టనర్స్ ప్రోగ్రామ్ (దీర్ఘకాలిక) ప్రారంభించడం.. దీని కింద స్థానిక జపనీస్ భాషా ఉపాధ్యాయులు, విద్యార్థులకు సహాయపడేందుకు జపాన్ ప్రజలను మాధ్యమిక పాఠశాలలకు పంపుతారు.
ఉ) పరిశ్రమ అవసరాలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది విషయంలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా జపాన్ ఫౌండేషన్ భారత్లో నిర్వహించే 360 గంటల ఉపాధ్యాయ శిక్షణా కోర్సును విస్తరించటం, మెరుగపరచటంపై దృష్టి సారించటం
ఊ) జపనీస్ భాషా ప్రావీణ్య పరీక్ష (జేఎల్పీటీ), జపాన్ ఫౌండేషన్ టెస్ట్ ఫర్ బేసిక్ జపనీస్ (జేఎఫ్టీ-బేసిక్) విషయంలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా భారత్లో జపనీస్ భాషా పరీక్షా కేంద్రాల సంఖ్య, సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రయత్నించటం.
(6) అవగాహన, మద్దతు, సమన్వయాన్ని మెరుగుపరచడం:
రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ బదిలీ కార్యక్రమాలు స్వయం సమృద్ధంగా కొనసాగేందుకు వీలుగా కావాల్సిన అవగాహనను పెంచేందుకు భాగస్వామ్య విభాగాలు ఉన్ని చురుకుగా పని చేయనున్నాయి. దీనికోసం ఇవి చేయనున్నాయి:
అ) జపాన్లో ఉపాధి అవకాశాలు, జపనీస్ భాషా విద్యపై నైపుణ్యాభివృద్ధి - వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ), ఎన్ఎస్డీసీ, ఇతర భాగస్వాములందరిచే విశ్వవిద్యాలయాలలో ఉద్యోగ మేళాలు, ప్రకటనలతో కూడిన ప్రచార కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రచారం కార్యక్రమాలు
ఆ) ఉద్యోగుల కోసం చూస్తోన్న కంపెనీలతో భారతీయులను అనుసంధానించేందుకు జపాన్లోని వివిధ రాష్ట్రాల్లో ఎన్ఎస్డీసీ సెమినార్లు నిర్వహించటం.
ఇ) జపాన్ ప్రభుత్వ మద్దతుతో భారతీయ మిషన్లు, పోస్ట్లలో ఆన్-అరైవల్ సహాయం, ఓరియంటేషన్ వర్క్షాప్లు, ఫిర్యాదుల పరిష్కారం.
ఈ) రెండు దేశాల మధ్య వివిధ రంగాలలో చలనశీలతను ప్రోత్సహించేందుకు సంబంధిత సమాచారాన్ని ఏకీకృతం చేయడానికి, పంచుకునేందుకు ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేయటం
ఉ) రెండు దేశాల్లో రాష్ట్రాల భాగస్వామ్యాలు, జపాన్లోని సంబంధిత రాష్ట్రాల్లో ఉన్న కంపెనీల నియామక కార్యక్రమాలతో భారతదేశంలోని రాష్ట్రాల నైపుణ్యభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలను సరిపోల్చటం ద్వారా ద్వారా మానవ వనరులు, నైపుణ్య బదిలీ.
ఊ) రెండు దేశాల మధ్య సిబ్బంది బదిలీని ప్రేరేపించడంపై చర్చించేందుకు మానవ వనరుల బదిలీ సదస్సును నిర్వహించటం.
(7) అమలు... తదనంతర చర్యలు:
పైన పేర్కొన్న కార్యాచరణ ప్రణాళిక అమలుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తి బాధ్యత వహించనున్నాయి. ఇదే లక్ష్యంతో వార్షికంగా సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశం నిర్వహించనున్నాయి. రెండు దేశాల మధ్య మానవ వనరుల బదిలీలు, సహకారాన్ని ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన అదనపు చర్యలను కూడా వారు అన్వేషించనున్నారు. కార్యచరణ ప్రణాళిక అమలు కోసం విద్య, నైపుణ్యం, శాస్త్ర సాంకేతికత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చర్చా పద్ధతులు, వేదికలను కూడా ఉపయోగించుకోనున్నారు.
***
(Release ID: 2162141)
Visitor Counter : 40
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam