ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిజీ ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంగ్లిషు పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం
Posted On:
25 AUG 2025 1:35PM by PIB Hyderabad
గౌరవ ప్రధాని శ్రీ రాబుకా,
ఇరు దేశాల ప్రతినిధులు,
ప్రసార మాధ్యమ మిత్రులారా,
నమస్కారం.
బులా వినాకా.
ప్రధాని శ్రీ రాబుకాతో పాటు ఆయన ప్రతినిధి వర్గానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా.
33 సంవత్సరాల తరువాత ఓ భారత ప్రధాని 2014లో ఫిజీని సందర్శించారు. ఇప్పుడీ సందర్భం నాకు అమితానందాన్ని ఇస్తోంది.
ఆ కాలంలో, మనం ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కోఆపరేషన్ను (ఎఫ్ఐపీఐసీ) ప్రారంభించాం. ఈ కార్యక్రమం భారత్-ఫిజీ సంబంధాల్ని పటిష్ఠపరచడం ఒక్కటే కాకుండా, పూర్తి పసిఫిక్ రంగంతో మన బంధాలకు ఒక కొత్త శక్తిని కూడా అందించింది. ఈ రోజున, ప్రధాని శ్రీ రాబుకా పర్యటనతో మన సంబంధాలకు ఒక నూతన అధ్యాయాన్ని జత చేస్తున్నాం.
మిత్రులారా,
భారత్, ఫిజీ దేశాల మధ్య గాఢమైన స్నేహబంధముంది. పంతోమ్మిదో శతాబ్దంలో, భారత్ నుంచి వెళ్లిన అరవై వేల కన్నా ఎక్కువ మంది గిర్మిటియా సోదరీ, సోదరులు తమ కఠోర పరిశ్రమతోను, అంకితభావంతోను ఫిజీ సమృద్ధికి తోడ్పడ్డారు. వారు ఫిజీ సామాజిక, సాంస్కృతిక వైవిధ్యానికి కొత్త వన్నెలు జోడించారు. ఫిజీ ఏకత, అఖండతలను వారు నిరంతరంగా బలోపేతం చేస్తున్నారు.
అయినవారు తమ మూలాలను మర్చిపోలేదు. తమ సంస్కృతిని పదిలపరుచుకుంటున్నారు. ఫిజీలోని రామాయణ మండలి సంప్రదాయమే దీనికి సజీవ ప్రమాణం. ‘గిర్మిటీ దినోత్సవాన్ని’ పాటిస్తామని ప్రధాని శ్రీ రాబుకా ప్రకటించడాన్ని నేను అభినందిస్తున్నా. ఇది మన ఉమ్మడి చరిత్రను గౌరవించుకోవడమే. దీని ద్వారా మన వెనుకటి తరాల వారి స్మృతులకు మనం నివాళి అర్పించినట్లు కూడా అవుతుంది.
మిత్రులారా,
ఈ రోజు మా విస్తృత చర్చల్లో, మేం అనేక ముఖ్య నిర్ణయాల్ని తీసుకొన్నాం. ఒక దేశం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందగలుగుతుందని మేం నమ్ముతున్నాం. అందువల్ల, సువాలో ఒక 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తాం. రక్తశుద్ధి యూనిట్లతో పాటు సముద్ర అంబులెన్సుల్ని కూడా పంపిస్తాం. జన ఔషధి కేంద్రాల్ని కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో తక్కువ ధరల్లో అధిక నాణ్యత కలిగిన మందులు ప్రతి ఇంటికీ అందుతాయి. కలలను నెరవేర్చుకోవడంలో ఏ ఒక్కరి పరుగూ ఆగిపోకుండా చూసే ఉద్దేశంతో, ఫిజీలో ఒక ‘జైపూర్ ఫుట్’ శిబిరాన్ని కూడా నిర్వహిస్తాం.
వ్యవసాయ రంగంలో, భారత్ పంపించిన అలసంద విత్తనాలు ఫిజీ నేలపై చాలా చక్కగా పెరుగుతున్నాయి. భారత్ డజను వ్యావసాయక డ్రోన్లతో పాటు రెండు సంచార భూసార పరీక్షా ప్రయోగశాలల్ని కూడా కానుకగా ఇవ్వబోతోంది. ఫిజీలో భారత నేతి విక్రయాలకు అనుమతి ఇచ్చినందుకు మేం ఫిజీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం.
మిత్రులారా,
రక్షణ, భద్రత రంగంలో మన పరస్పర సహకారాన్ని పటిష్ఠపరుచుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. దీనికోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. ఫిజీ నౌకా వాణిజ్య భద్రతను మెరుగుపరచడానికి భారత్ శిక్షణ, సామగ్రి రూపేణా సహకారాన్ని అందిస్తుంది. సైబర్ భద్రత, సమాచార పరిరక్షణ రంగాల్లోనూ మేం మా అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ఒక పెద్ద సవాలును విసురుతోందని మన రెండు దేశాలూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేం చేస్తున్న పోరాటంలో సహకారాన్ని అందించడంతో పాటు మద్దతిస్తున్నందుకు ప్రధాని శ్రీ రాబుకాతో పాటు ఫిజీ ప్రభుత్వానికి మేం మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
మిత్రులారా,
క్రీడారంగం- మైదానం నుంచి మనసు వరకు ప్రజలను కలిపే రంగాల్లో ఒకటి. ఫిజీలో రగ్బీ, భారత్లో క్రికెట్. దీనికి ఉదాహరణలు. ‘స్టార్ ఆఫ్ రగ్బీ సెవెన్స్’గా పేరు తెచ్చుకున్న శ్రీ వైసాలే సెరెవీ భారతదేశ రగ్బీ జట్టుకు శిక్షణనిచ్చారు. ఇప్పుడు, భారత్ కోచ్ తన మార్గదర్శకత్వంలో ఫిజీ క్రికెట్ జట్టును నూతన శిఖరాలకు చేర్చనున్నారు.
ఫిజీ విశ్వవిద్యాలయంలో హిందీని, సంస్కృతాన్ని బోధించడానికి భారత్ నుంచి అధ్యపకులను పంపించాలని మేం నిర్ణయించాం. ఫిజీకి చెందిన పండితులు మరింత జ్ఞానాన్ని ఆర్జించడానికి భారత్కు వచ్చి, గీతా మహోత్సవంలో పాల్గొననున్నారు. దీంతో, భాష నుంచి సంస్కృతి వరకు మన సంబంధాలు మరింత గాఢతరం కానున్నాయి.
మిత్రులారా,
వాతావరణ మార్పు ఫిజీకి కీలక ముప్పుగా మారింది. ఈ సందర్బంగా, మేం పునరుత్పాదక ఇంధనం, మరీ ముఖ్యంగా సౌర ఇంధనం రంగంలో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అంతర్జాతీయ సౌర కూటమి, సమర్థమైన విపత్తు సన్నద్ధ కూటమిలతో పాటు గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్సులో మనం కలిసి నడుస్తున్నాం. ఇక మనం విపత్తు వేళల్లో తీసుకోవాల్సిన చర్యల విషయంలో కూడా ఫిజీకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాలను పెంచడంలో సహకారాన్ని అందిస్తాం.
మిత్రులారా,
పసిఫిక్ ద్వీప దేశాలతో సహకారం అన్న అంశంలో, మేం ఫిజీని ఒక కూడలిగా చూస్తున్నాం. మన రెండు దేశాలూ దాపరికానికి తావు ఉండని, స్వేచ్ఛాయుత, సమగ్ర, సురక్షభరిత, సమృద్ధ ఇండో-పసిఫిక్ ను ఆవిష్కరించాలనే ఆశయానికి గట్టి మద్దతును ఇస్తున్నాయి. ‘‘శాంతియుత మహా సముద్రాల్ని’’ ఆవిష్కరించాలన్న ప్రధాని దృష్టికోణం నిజంగా ఎంతో సానుకూల, ముందుచూపుతో కూడిన విధానం. భారత్ ప్రతిపాదించిన ‘ఇండో- పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం’తో ఫిజీ అనుబంధాన్ని ఏర్పరుచుకోవడాన్ని మేం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.
భారత్కు, ఫిజీకి మధ్య మహాసముద్రాలు ఉన్నాయి... కానీ ఆకాంక్షల విషయానికి వస్తే మన రెండు దేశాలకూ ఒకే విధమైన ఆకాంక్షలున్నాయి.
గ్లోబల్ సౌత్ ప్రగతి ప్రయాణంలో మనం కలిసి పయనిస్తున్నాం. కలిసికట్టుగా, మనం ఒక కొత్త ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దే ప్రక్రియలో భాగస్వాములం. ఆ సరికొత్త ప్రపంచ వ్యవస్థలో స్వాతంత్ర్యానికీ, ఆలోచనలకూ, గ్లోబల్ సౌత్ గుర్తింపునకూ సముచిత గౌరవం లభిస్తుంది.
ఏ ఒక్కరి అభిప్రాయాన్నీ పట్టించుకోకుండా ఉండకూడదనీ, ఏ దేశాన్నీ వదలివేయరాదనీ మేం నమ్ముతున్నాం.
రాబుకా గారూ...
హిందూ మహాసముద్రం మొదలు పసిఫిక్ వరకు, మన భాగస్వామ్యం సముద్రాలకు ఒక వారధిగా నిలిచింది. దీని మూలాలు వీలోమానీలో ఉన్నాయి. ఇది నమ్మకంతో పాటు గౌరవంపైన నిర్మితమైంది.
ఈ చిరకాల బంధాన్ని మీ పర్యటన మరింత బలపరుస్తోంది. మీ స్నేహానికి మేం ఎంతో విలువిస్తాం.
వినాకా వాకాలెవూ.
***
(Release ID: 2160825)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada