ప్రధాన మంత్రి కార్యాలయం
ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
23 AUG 2025 9:44PM by PIB Hyderabad
వరల్డ్ లీడర్స్ ఫోరంకు హాజరైన అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సు నిర్వహిస్తున్న సమయం అత్యంత తగిన సమయం.. అందుకు నేను నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఒక వారం కిందట నేను ఎర్రకోట నుంచి మాట్లాడుతూ తదుపరి తరం సంస్కరణలను ప్రస్తావించాను. ఇప్పుడు ఈ సదస్సు ఆ స్పూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
ప్రపంచ పరిస్థితులు.. భౌగోళిక-ఆర్థిక అంశాలపై ఈ వేదికలో విస్తృత చర్చలు జరిగాయి. ప్రపంచ కోణంలో చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ప్రపంచ వృద్ధికి భారత్ అందిస్తున్న సహకారం సమీప భవిష్యత్తులో దాదాపు 20 శాతానికి చేరుకుంటుందని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. గత దశాబ్దంలో సాధించిన స్థూల ఆర్థిక స్థిరత్వానికి భారత వృద్ధి, ఆర్థిక సుస్థిరతే కారణం. కోవిడ్-19 మహమ్మారి వంటి తీవ్రమైన సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక లోటులో 4.4 శాతం తగ్గుదలను అంచనా వేశాం. భారతీయ కంపెనీలు మూలధన మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో నిధులను సేకరిస్తున్నాయి. భారతీయ బ్యాంకులు గతంలో కంటే బలంగా ఉన్నాయి. అలాగే ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది.. వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. భారత కరెంట్ ఖాతా లోటు నియంత్రణలో ఉంది.. ఫారెక్స్ నిల్వలూ బలంగా ఉన్నాయి. ప్రతి నెలా లక్షలాది దేశీయ పెట్టుబడిదారులు క్రమానుగత పెట్టుబడి ప్రణాళికల (ఎస్ఐపీల) ద్వారా మార్కెట్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు.
మిత్రులారా,
ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నప్పుడే దాని ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తుందని మీకు కూడా తెలుసు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దీని గురించి నేను వివరంగా చర్చించాను. ఆ అంశాలను పునరావృతం చేయకపోయినా స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత జరిగిన పరిణామాలు భారత వృద్ధి తీరుకు గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి.
మిత్రులారా,
తాజా డేటా ప్రకారం ఈ ఏడాది ఒక జూన్ నెలలోనే ఈపీఎఫ్ఓ డేటాబేస్లో 22 లక్షల ఉద్యోగాలు అధికారికంగా నమోదయ్యాయి. ఇది ఇప్పటివరకు ఏదైనా నెలలో నమోదైన వాటి కంటే అత్యధికం. 2017 తర్వాత భారత రిటైల్ ద్రవ్యోల్బణం అత్యల్ప స్థాయిలో ఉంది. భారత విదేశీ మారక నిల్వలు అన్ని కాలాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2014లో భారతదేశ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యం సుమారు 2.5 గిగావాట్లుగా ఉండగా.. తాజా గణాంకాల ప్రకారం ఈ సామర్థ్యం ఇప్పుడు 100 గిగావాట్లకు చేరింది. ఢిల్లీ విమానాశ్రయం ప్రపంచ విమానాశ్రయాల ఎలైట్ హండ్రెడ్-మిలియన్-ప్లస్ క్లబ్లో చేరడంతో పాటు దాని వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం ఇప్పుడు 100 మిలియన్లను దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యేక సమూహంలో ఉన్న ఆరు విమానాశ్రయాల్లో ఢిల్లీ విమానాశ్రయం ఒకటిగా నిలిచింది.
మిత్రులారా,
ఇటీవల వార్తల్లో ఒక అంశం చర్చనీయంగా ఉంది. ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ భారత క్రెడిట్ రేటింగ్ను అప్గ్రేడ్ చేశాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇది సాధ్యమైంది. దీని అర్థం భారత్ తన అద్భుత సామర్థ్యం.. బలం ద్వారా ప్రపంచానికి ఆశాకిరణంగా నిలుస్తోంది.
మిత్రులారా,
సాధారణంగా అవకాశాలను అందిపుచ్చుకోనప్పుడు అవి ఎలా చేదాటిపోతాయో వివరించేందుకు "బస్సును అందుకోలేకపోయిన" ఉదాహరణను మనం చెప్పుకుంటాం. దేశంలోని మునుపటి ప్రభుత్వాలు సాంకేతికత, పారిశ్రామిక రంగాల్లో అనేక అవకాశాలను చేజేతులా వదులుకున్నాయి. అయితే నేను ఎవరినీ విమర్శించడం లేదు. ప్రజాస్వామ్యంలో తులనాత్మక విశ్లేషణ తరచుగా పరిస్థితిని మరింత సమర్థంగా స్పష్టం చేయడానికి సహాయపడుతుంది.
మిత్రులారా,
గత ప్రభుత్వాలు దేశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో అస్తవ్యస్తంగా మార్చాయి. ఎన్నికలకు మించి ఆలోచించే దృక్పథం వారికి లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం అభివృద్ధి చెందిన దేశాలకే సాధ్యమని వారు భావించారు. అవసరమైనప్పుడు దానిని దిగుమతి చేసుకోవచ్చనే నమ్మకంతో ఆ ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నాయి. ఈ మనస్తత్వం కారణంగానే భారత్ అనేక దేశాల కంటే సంవత్సరాలుగా వెనుకబడింది. పదేపదే కీలకమైన అవకాశాలను కోల్పోయిన క్రమంలో అభివృద్ధి బస్సును వారు అందుకోలేకపోయారు. కమ్యూనికేషన్ రంగం దీనికి మంచి ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యుగం ప్రారంభమైన సమయంలో నాటి ప్రభుత్వం అనిశ్చితంగా ఉంది. 2జీ యుగంలో జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే. భారత్ ఆ బస్సును కూడా నాడు అందుకోలేకపోయింది. 2జీ, 3జీ, 4జీ సాంకేతికతల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడేది. ఇలాంటి పరిస్థితి ఎంతకాలం కొనసాగగలదు? 2014 తర్వాత భారత్ తన విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. బస్సును అందుకోవడం కాకుండా.. ఏకంగా బస్సును నడిపే స్థానం తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. భారత్ తన మొత్తం 5జీ స్టాక్ను దేశీయంగానే అభివృద్ధి చేసింది. మేడ్-ఇన్-ఇండియా 5జీని రూపొందించడమే కాకుండా దానిని దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా అమలు చేసింది. భారత్ ఇప్పుడు మేడ్-ఇన్-ఇండియా 6జీ సాంకేతికత దిశగా వేగంగా కృషి చేస్తోంది.
అలాగే మిత్రులారా,
50-60 సంవత్సరాల కిందటే సెమీ కండక్టర్ల తయారీని భారత్ ప్రారంభించాల్సి ఉండగా.. ఆ బస్సును కూడా అప్పుడు అందుకోలేకపోయింది. చాలా సంవత్సరాలు అదే పరిస్థితి కొనసాగింది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారింది. దేశంలో సెమీ కండక్టర్ల సంబంధిత కర్మాగారాలు రావడం ప్రారంభమైంది. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
మిత్రులారా,
జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష రంగం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. 2014కి ముందు భారత అంతరిక్ష మిషన్ల సంఖ్య, పరిధి పరిమితంగా ఉండేది. 21వ శతాబ్దంలో ప్రతి ప్రధాన దేశం అంతరిక్ష అవకాశాలను అన్వేషిస్తున్నప్పుడు భారత్ వెనుకబడి ఉండలేకపోయింది. అంతరిక్ష రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం.. ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి అనుమతించడం వంటి చర్యలను మా ప్రభుత్వం చేపట్టింది. 1979 నుంచి 2014 వరకు భారత్35 సంవత్సరాల్లో కేవలం 42 అంతరిక్ష మిషన్లు మాత్రమే నిర్వహించింది. గత పదకొండు సంవత్సరాల్లోనే భారత్ అరవైకి పైగా మిషన్లను పూర్తి చేయడం గర్వకారణం. రాబోయే కాలంలో చేపట్టనున్న అనేక మిషన్లు వరుసలో ఉన్నాయి. ఈ సంవత్సరం భారత్ స్పేస్ డాకింగ్ సామర్థ్యాన్ని సాధించింది. భవిష్యత్ మిషన్ల కోసం ఇది కీలకం కానుంది. గగన్యాన్ మిషన్ కింద భారత్ తన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమవుతోంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అనుభవం ఈ ప్రయత్నంలో గొప్ప సహాయకారిగా ఉంటుంది.
మిత్రులారా,
అంతరిక్ష రంగానికి కొత్త శక్తిని అందించడం కోసం దానిని అన్ని అడ్డంకుల నుంచి విముక్తి చేయడం చాలా అవసరం. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం కోసం మొదటిసారిగా స్పష్టమైన నియమాలు రూపొందించాం. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను మొదటిసారిగా సరళీకరించడంతో పాటు స్పెక్ట్రమ్ కేటాయింపును తొలిసారిగా పారదర్శకంగా పూర్తి చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్లో అంతరిక్ష రంగ అంకురసంస్థల కోసం ప్రత్యేకంగా రూ 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ చేర్చాం.
మిత్రులారా,
చేపట్టిన సంస్కరణల విజయాన్ని భారత అంతరిక్ష రంగం ఇప్పుడు చూస్తోంది. 2014లో దేశంలో ఒకే ఒక అంతరిక్ష రంగ అంకురసంస్థ ఉండగా.. నేడు వాటి సంఖ్య 300కి పైగా ఉంది. కక్ష్యలో భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉండే రోజు ఎంతో దూరంలో లేదు.
మిత్రులారా,
ఒక్కో అడుగేస్తూ నిదానంగా సాధించే మార్పు భారత లక్ష్యం కాదు. అత్యంత వేగంగా దూసుకెళ్తూ మార్పును సాధించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోంది. దేశంలో అమలు చేస్తున్న సంస్కరణలు తప్పనిసరి పరిస్థితులు.. సంక్షోభాల నివారణ కోసం చేపడుతున్నవి కాదు. భారత్ నిబద్ధత, దృఢ నిశ్చయానికి ఈ సంస్కరణలు ప్రతిబింబాలు. ప్రతీ రంగం గురించి విడిగా లోతైన సమీక్షలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబిస్తోంది. ఆయా రంగాల్లో సంస్కరణలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.
మిత్రులారా,
ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సంస్కరణల కొనసాగింపును ప్రతిబింబిస్తున్నాయి. ప్రతిపక్షాలు అనేక ఆటంకాలు కలిగించినప్పటికీ ప్రభుత్వం సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. జన్ విశ్వాస్ 2.0 కార్యక్రమం విశ్వాస ఆధారితమైన, ప్రజానుకూలమైన పరిపాలనకు సంబంధించిన ఒక ప్రధాన సంస్కరణ. జన్ విశ్వాస్ మొదటి ఎడిషన్ కింద దాదాపు 200 చిన్నపాటి నేరాలను నేరాల జాబితా నుంచి తొలగించాం. రెండో ఎడిషన్లోనూ 300కి పైగా చిన్నపాటి నేరాలనూ తాజాగా నేరాల జాబితా నుంచి తొలగించాం. 60 సంవత్సరాలుగా మారకుండా ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఈ సమావేశాల సందర్భంగా సంస్కరించాం. ఈ చట్టం ఇప్పుడు ఎంతో సరళీకృతం అయింది. గతంలో చట్టంలోని భాష న్యాయవాదులు.. చార్టర్డ్ అకౌంటెంట్లు మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోగలిగేలా ఉండేది. ఇప్పుడు, ఆదాయపు పన్ను బిల్లు సాధారణ పన్ను చెల్లింపుదారులకు కూడా సులభంగా అర్థమయ్యే భాషలో రూపొందించాం. ఇది పౌరుల ప్రయోజనాల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
మిత్రులారా,
గనుల చట్టాల వంటి అనేక చట్టాలకు గణనీయ సవరణలు చేసిన ఇటీవలి వర్షాకాల సమావేశాల్లోనే.. బ్రిటీష్ పాలకుల కాలం నాటి నౌకాయానం, ఓడరేవుల నియంత్రణ చట్టాలను కూడా సవరించాం. ఈ సంస్కరణలు భారత జల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధినీ ప్రోత్సహిస్తాయి. క్రీడా రంగంలోనూ నూతన సంస్కరణలు ప్రవేశపెట్టాం. ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల నిర్వహణకూ భారత్ సిద్ధమవుతోంది. సమగ్ర క్రీడా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ఈ దార్శనికతకు మద్దతుగా ప్రభుత్వం ఖేలో భారత్ నీతి పేరుతో నూతన జాతీయ క్రీడా విధానాన్ని ప్రారంభించింది.
మిత్రులారా,
ఇప్పటికే సాధించిన లక్ష్యాలతో సంతృప్తి చెందడం నా స్వభావం కాదు. సంస్కరణలకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. మా ప్రభుత్వం ఈ మార్గంలో మరింత ముందుకు సాగాలని నిశ్చయించుకుంది. సంస్కరణల ఆయుధాలను సమగ్రంగా సిద్ధం చేస్తున్నాం. ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి బహుళ రంగాల్లో కృషి జరుగుతోంది. అనవసరమైన చట్టాలను రద్దు చేయడం, నిబంధనలు.. విధానాలను సరళీకరించడం వంటి కీలక చర్యలు చేపడుతున్నాం.. విధానాలు, ఆమోదాలను డిజిటలైజ్ చేస్తున్నాం.. అనేక నిబంధనలనూ నేరరహితం చేస్తున్నాం. జీఎస్టీ విధానంలో ఒక పెద్ద సంస్కరణ చేపట్టనున్నాం.. ఈ ప్రక్రియ దీపావళి నాటికి పూర్తవుతుంది. దీని ద్వారా జీఎస్టీ వ్యవస్థ మరింత సరళతరం అవుతుంది... ధరలు కూడా తగ్గుతాయి.
మిత్రులారా,
ఈ తదుపరి తరం సంస్కరణలు.... తయారీ రంగంలో పెనుమార్పులు తెస్తాయి. మార్కెట్ డిమాండ్ పెరుగుతోంది.. పరిశ్రమలు కొత్త శక్తిని పొందుతాయి. ఈ సంస్కరణల ఫలితంగా జీవన సౌలభ్యం.. వ్యాపార సౌలభ్యం రెండూ మెరుగుపడతాయి.. కొత్త ఉపాధి అవకాశాలూ అందుబాటులోకి వస్తాయి.
మిత్రులారా,
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. స్వయంసమృద్ధ భారత్.. అభివృద్ధి చెందిన భారత్ కోసం పునాది అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్ను వేగం, స్థాయి, పరిధి అనే మూడు కీలక అంశాల ఆధారంగా అంచనా వేయాలి. మహమ్మారి సమయంలో భారత్ ఈ వేగం, స్థాయి, పరిధి అనే మూడింటినీ ప్రదర్శించింది. అవసరమైన వస్తువులకు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిన తీరు.. ప్రపంచ సరఫరా వ్యవస్థ నిలిచిపోయిన విధానం మీకు గుర్తుండే ఉంటుంది. అటువంటి సమయంలో అవసరమైన వస్తువులను దేశీయంగా తయారు చేయడానికి భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది. భారత్ అత్యంత వేగంగా పెద్ద మొత్తంలో పరీక్షా కిట్లు, వెంటిలేటర్లను ఉత్పత్తి చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి భారత్ వేగాన్ని ప్రదర్శించింది. దేశంలోని ప్రతి మూలలో గల పౌరులకు భారత్లో తయారైన 220 కోట్లకు పైగా టీకాలను ఉచితంగా అందించడం భారత్ తన సామర్ధ్యాన్ని ప్రదర్శించింది. లక్షలాది మందికి వేగంగా టీకాలు అందించడం కోసం భారత్ కో-విన్ ను అభివృద్ధి చేసింది. ఇది భారత పరిధిని ప్రతిబింబించింది. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక వ్యవస్థ అయిన కో-విన్ కారణంగానే భారత్ తన టీకా డ్రైవ్ను రికార్డు సమయంలో పూర్తి చేయగలిగింది.
మిత్రులారా,
ఇంధన రంగంలోనూ భారత్ వేగం, స్థాయి, పరిధిని ప్రపంచమంతా చూస్తోంది. 2030 నాటికి తన మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50 శాతం శిలాజేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేయడమే భారత్ లక్ష్యం. అయితే 2025లోనే అంటే షెడ్యూలు కంటే అయిదు సంవత్సరాల ముందుగానే ఈ లక్ష్యాన్ని మనం సాధించాం.
మిత్రులారా,
గతంలోని విధానాలు దిగుమతులపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. స్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణం. నేడు స్వావలంబన సాధించిన భారత్ ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత సంవత్సరంలో భారత్ రూ. 4 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన 800 కోట్ల టీకా డోసుల్లో 400 కోట్లు భారత్లోనే తయారయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాతి ఆరున్నర దశాబ్దాల్లో భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దాదాపు రూ. 35,000 కోట్లకు చేరుకున్నాయి. అయితే నేడు ఈ ఎగుమతుల విలువ సుమారు రూ. 3.25 లక్షల కోట్లకు పెరిగింది.
మిత్రులారా,
2014 వరకు భారత ఆటోమొబైల్ ఎగుమతులు సంవత్సరానికి సుమారు రూ. 50,000 కోట్లుగా ఉన్నాయి. నేడు ఒకే సంవత్సరంలో రూ. 1.2 లక్షల కోట్ల విలువైన ఆటోమొబైల్స్ను భారత్ ఎగుమతి చేస్తోంది. మెట్రో కోచ్లు, రైలు కోచ్లు, రైలింజన్లను కూడా భారత్ ఎగుమతి చేయడం ప్రారంభించింది. 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయడం ద్వారా భారత్ మరో కీలక విజయాన్ని సాధించబోతోంది. ఈ విజయానికి సంబంధించిన ఒక ప్రధాన కార్యక్రమం ఈనెల 26న జరగనుంది.
మిత్రులారా,
దేశ పురోగతికి పరిశోధన మూలస్తంభం. దిగుమతి చేసుకున్న పరిశోధనలు మనుగడకు సరిపోవచ్చు, కానీ అవి భారత ఆకాంక్షలను నెరవేర్చలేవు. పరిశోధన రంగంలో అవసరం, కేంద్రీకృత దృక్పథం ముఖ్యం. పరిశోధనలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వేగంగా కృషి చేస్తూ.. అవసరమైన విధానాలు, వేదికలను నిరంతరం అభివృద్ధి చేసింది. 2014తో పోలిస్తే పరిశోధనాభివృద్ధిపై ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. దాఖలు చేసిన పేటెంట్ల సంఖ్య 2014 నుంచి 17 రెట్లు పెరిగింది. సుమారు 6,000 ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనాభివృద్ధి విభాగాలను స్థాపించాం. 'ఒకే దేశం-ఒకే సబ్స్క్రిప్షన్' కార్యక్రమం ద్వారా ప్రపంచ పరిశోధన పత్రికలు మన విద్యార్థులకు మరింత అందుబాటులోకి వచ్చాయి. రూ. 50,000 కోట్ల బడ్జెట్తో జాతీయ పరిశోధన ఫౌండేషన్ను ఏర్పాటు చేయడంతో పాటు రూ.1 లక్ష కోట్ల విలువైన పరిశోధన..అభివృద్ధి..ఆవిష్కరణ పథకానికి కూడా ఆమోదం తెలిపాం. ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, వ్యూహాత్మక రంగాల్లో కొత్త పరిశోధనలకు మద్దతు ఇవ్వడం మా ప్రభుత్వ లక్ష్యం.
మిత్రులారా,
ఈ సదస్సుకు ఎందరో ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ప్రస్తుత కాలంలో పారిశ్రామిక, ప్రైవేట్ రంగాల నుంచి చురుకైన భాగస్వామ్యం అవసరం. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, క్వాంటం టెక్నాలజీ, బ్యాటరీ స్టోరేజ్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పరిశోధనలు, పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇటువంటి ప్రయత్నాలు ‘వికసిత్ భారత్’ దార్శనికతకు కొత్త శక్తిని అందిస్తాయి.
మిత్రులారా,
సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం మార్గనిర్దేశంలో భారత్ ఇప్పుడు ప్రపంచ వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడే స్థితిలో ఉంది. భారత్ నిలిచిన నీటిలో రాళ్ళు విసిరేందుకు ఇష్టపడదు.. వేగంగా ప్రవహించే ప్రవాహాలను మళ్లించే శక్తిని భారత్ కలిగి ఉంది. ఎర్రకోట నుంచి నేను చెప్పినట్లుగా.. భారత్ ఇప్పుడు కాల గమనాన్ని కూడా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
మిత్రులారా,
మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు కల్పించిన ఎకనమిక్ టైమ్స్ వారికి నా కృతజ్ఞతలు. ఈ సదస్సుకు హాజరైన మీ అందరికీ నా కృతజ్ఞతలు, అలాగే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు!
***
(Release ID: 2160344)