వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
తప్పుదోవ పట్టించే ప్రకటన ఇచ్చినందుకు ర్యాపిడో సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించిన కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ)
* వినియోగదారులకు నష్టపరిహారాన్నివ్వడంతో పాటు పెడదోవ పట్టించే ప్రకటనలు నిలిపేయాలి: సీసీపీఏ
Posted On:
21 AUG 2025 10:36AM by PIB Hyderabad
రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సిందిగా ఆన్లైన్ సవారీ వేదిక ‘ర్యాపిడో’ (రోపెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్)ను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశించింది. వినియోగదారు హక్కులను పరిరక్షించడంలో భాగంగా సీసీపీఏ తీసుకున్న నిర్ణయమిది. తప్పుదారి పట్టించిన ప్రకటనను ఇవ్వడంతో పాటు న్యాయవిరుద్ద వాణిజ్య పద్ధతిని అనుసరించినందుకు సీసీపీఏ ఈ చర్య తీసుకుంది.
‘‘5 నిమిషాల్లో ఆటో సవారీ... లేదంటే రూ.50 అందుకోండి’’ అని అంటూ ప్రచారం చేశారు. ఏ వినియోగదారైనా ఈ ఆఫరుకు మొగ్గు చూపిన తరువాత, ఆటో రాని పక్షంలో వాగ్దానం ప్రకారం రూ.50 నష్ట పరిహారాన్ని పూర్తిగా చెల్లించాలని కూడా ర్యాపిడోను సీసీపీఏ అథారిటీ ఆదేశించింది.
‘‘5 నిమిషాల్లో ఆటో సవారీ అందుబాటులోకి.. ఆటో రాలేదంటే రూ.50 అందుకోండి’’, ‘‘పక్కాగా ఆటో సేవ’’ (‘‘గ్యారంటీడ్ ఆటో’’) అంటూ వినియోగదారులకు వాగ్దానం చేస్తూ ర్యాపిడో ఇచ్చిన వాస్తవ విరుద్ధమైన ప్రకటనలను సీసీపీఏ పరిశీలనకు స్వీకరించింది. లోతుగా పరీక్ష చేసిన తరువాత, ఈ ప్రకటనలు అసత్యమైనవీ, వినియోగదారులకు భ్రమ కల్పించేవీగానూ, న్యాయ విరుద్ధమైనవిగా కూడా ఉన్నాయని సీసీపీఏ నిర్ధారించింది. పెడదారి పట్టిస్తున్న ఈ రకమైన ప్రకటనలను తక్షణం నిలిపేయాల్సిందిగా ఆదేశించింది.
జాతీయ వినియోగదారు హెల్ప్లైన్ (ఎన్సీహెచ్) దగ్గరున్న సమాచారం ఇదీ..:
• ర్యాపిడోపై 2023 ఏప్రిల్ మొదలు 2024 మే మధ్య కాలంలో అందిన ఫిర్యాదులు 575.
• ర్యాపిడోకు వ్యతిరేకంగా 2024 జూన్ మొదలు గత జులై మధ్య వచ్చిన ఫిర్యాదులు 1,224.
ర్యాపిడో ఇచ్చిన ప్రకటనల్లో ‘షరతులు వర్తిస్తాయి’ అనే గమనికను చాలా చిన్నగాను, కంటికి ఓ పట్టాన కనిపించని చిన్న అక్షరాల్లోనూ పొందుపరిచారని సీసీపీఏ దర్యాప్తులో తేలింది. వాగ్దానం చేసిన విధంగా రూ.50 కానుక వాస్తవిక కరెన్సీలో (రూపాయల్లో) కాకుండా ‘‘ర్యాపిడో కాయిన్ల’’ రూపంలో ఉందని, మళ్లీ అందులోనూ ఈ లాభాన్ని ‘‘రూ.50 వరకు’’గా పేర్కొన్నారే గాని ఎల్లవేళలా కచ్చితంగా రూ.50 అని చెప్పలేదని నిర్ధారణ అయింది. ఈ కాయిన్లను ఒక్క ర్యాపిడో బైక్ సవారీల్లో మాత్రమే ఖర్చు పెట్టుకోవచ్చని, అదీ ఒక వారం రోజుల లోపు మాత్రమే చెల్లుబాటు అవుతాయని గమనించారు. ఈ విధమైన పరిమితులు ఆఫర్ విలువను తగ్గించేయడంతో పాటు వినియోగదారులు సబబు కాని అతి తక్కువ సమయం లోపు ర్యాపిడో సంస్థకే చెందిన మరో ఆటో సేవను ఉపయోగించుకోక తప్పని స్థితిని కలిగించాయి. ఈ లోటుపాట్లు భరోసాతో కూడిన సేవ లభిస్తుందన్న తప్పుడు అభిప్రాయాన్ని కలిగించడంతో పాటు వినియోగదారులకు ర్యాపిడోనే ఎంపిక చేసుకొనేలా వారిని తప్పుదారి పట్టించాయి.
దీనికి అదనంగా, ‘‘5 నిమిషాల్లో ఆటో సవారీ.. ఆటో రాలేదంటే రూ.50 అందుకోండి’’ అని ప్రకటన చెబుతుంటే, ఆ మేరకు పూచీని వ్యక్తిగత హోదాలో కెప్టెన్లు ఇస్తున్నారే తప్ప ర్యాపిడో స్వయంగా ఇవ్వని విషయం కూడా నియమ నిబంధనల్లో ఉంది. ఇలాంటి భిన్న వైఖరి కంపెనీకేం బాధ్యత లేదని చాటేందుకు ప్రయత్నించి, ప్రకటనలోని హామీ విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించింది.
ప్రకటనల్లో గమనికలు (డిస్క్లెయిమర్స్) ప్రధాన వాగ్దానానికి పొసగని తరహాలో ఉండకూడదని, సమాచారాన్ని దాచిపెట్టేవిగాను, లేదా అపోహను కలిగింపచేసే వాగ్దానాన్ని సరి చేయడానికి అవకాశం ఉండాలని ‘ప్రివెన్షన్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టయిజ్మెంట్స్ అండ్ ఎండార్స్మెంట్స్-2022’ మార్గదర్శక సూత్రాల్లో పేర్కొన్నారు. ర్యాపిడో వ్యవహారంలో.. ‘గ్యారంటీడ్ ఆటో’తో పాటు ‘5 నిమిషాల్లో ఆటో సవారీ అందుబాటులోకి.. ఆటో రాలేదంటే రూ.50 అందుకోండి’ అనే క్లెయిములు ఒకవేళ 5 నిమిషాల లోపల ఆటోను అందించకపోయినట్లయితే తప్పకుండా రూ.50 అందుతాయనే అభిప్రాయాన్ని వినియోగదారులకు కలిగించాయి. ఏమైనా, ఈ ప్రయోజనాన్ని ‘రూ.50 వరకు’ మాత్రమే అంటూ పరిమితం చేయడం.. అదీనూ కేవలం ర్యాపిడో కాయిన్ల రూపంలో, తక్కువ గడువులోనే ఉపయోగించుకొనేలా ఇస్తామనడం.. ఇవి అయితే ఏకంగా వదిలిపెట్టేసినవిగాను లేకపోతే సమాన ప్రాధాన్యంతో ప్రకటించనివిగాను ఉన్నాయి. సమాచారాన్ని దాచిపెట్టడంతో పాటు స్పష్టత లోపించడం ప్రకటనను మోసగించేదిగా, ప్రస్తావించిన మార్గదర్శక సూత్రాల స్ఫూర్తిని ప్రత్యక్షంగా ఉల్లంఘించిందిగా మార్చేసింది.
ర్యాపిడో సంస్థకు వ్యతిరేకంగా ఎన్సీహెచ్కు అందిన ఫిర్యాదులు గత రెండేళ్లకు పైగా అంతకంతకూ పెరుగుతూ వచ్చాయని సీసీపీఏ తెలిపింది. వీటిలో అనేక ఫిర్యాదులు సూచించిన సేవల్లో పలు లోపాలు, చెల్లించిన డబ్బు వాపసివ్వక పోవడం, ఎక్కువ రుసుం వసూలు చేయడం, వాగ్దానం చేసినట్లుగా సేవల్ని అందించ లేకపోవడంతో పాటు మాట ఇచ్చిన ప్రకారం ‘‘5 నిమిషాల్లో’’ ఆశించిన సేవలను సమకూర్చక పోవడానికి సంబంధించినవే. ఈ రకమైన ఫిర్యాదులు నిలకడగా పెరుగుతుండడం వినియోగదారుల్లో రకరకాలుగా అసంతృప్తి పేరుకుపోయిందని సూచిస్తోంది. దీంతో వారి ప్రయోజనాలను రక్షించడానికి సీసీపీఏ కఠిన చర్య తీసుకోవలసివచ్చింది. ర్యాపిడో దృష్టికి తీసుకుపోయనప్పటికీ ఈ ఫిర్యాదుల్లో చాలావరకు ఫిర్యాదులు ఓ కొలిక్కి రానేలేదు.
ర్యాపిడో సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 120 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తప్పుదారి పట్టిస్తున్న ప్రకటన అనేక ప్రాంతీయ భాషల్లో సుమారు ఏడాదిన్నర కాలంగా (దాదాపు 548 రోజుల పాటు) చెలామణీలో ఉంది. ఈ ప్రచారం చాలా కాలం నుంచి దేశం నలు మూలలకు పాకిపోయినందువల్ల, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడానికి రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతయినా ఉందని సీసీపీఏ భావించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019 లోని 10వ సెక్షన్లో పేర్కొన్న ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థే సీసీపీఏ. ఈ చట్టంలో పొందుపరిచిన 10వ, 20వ సెక్షన్లతో పాటు 21వ సెక్షన్ కూడా వినియోగదారు హక్కులను పరిరక్షిచడం, ప్రోత్సహించడం, వారికి ఉద్దేశించిన ప్రయోజనాలు వారికి లభించేలా చూడాలనే అధికారాలను సీసీపీఏకు కట్టబెడుతున్నాయి. తప్పుదోవ పట్టించేటట్లుండే ప్రకటనలను, అనుచిత వాణిజ్య పద్ధతులను అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సెక్షన్లలో సూచించారు. వీటికి అనుగుణంగా, ఇలాంటి పద్ధతులను అనుసరించినందుకు ర్యాపిడోపై జరిమానాను విధించారు.
పెద్ద పెద్ద వాగ్దానాలు చేసే, లేదా షరతులున్నదీ లేనిదీ చెప్పకుండానే ‘‘మాదీ గ్యారంటీ’’ అనో, ‘‘పక్కా భరోసా’’ అనే మాటలతో కూడిన ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులకు సీసీపీఏ సూచించింది. పెడదోవ పట్టిస్తున్న ప్రకటనలు గాని, న్యాయవిరుద్ధ వాణిజ్య పద్ధతులను గాని వినియోగదారులు ఎదుర్కొన్న పక్షంలో, ఈ కింది అంశాలను వారు గమనించి ఆమేరకు నడుచుకోవచ్చు.. :
• వారు జాతీయ వినియోగదారు హెల్ప్లైన్ 1915 కు కాల్ చేయాలి.
• ఫిర్యాదులు దాఖలు చేయడానికి ఎన్సీహెచ్ యాప్ ను గాని లేదా వెబ్సైట్ను గాని ఉపయోగించవచ్చు.
***
(Release ID: 2159545)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam