ప్రధాన మంత్రి కార్యాలయం
భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
15 AUG 2025 7:26PM by PIB Hyderabad
మన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.
మారిషస్ ప్రధాని ట్వీట్కు ప్రధానమంత్రి స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ప్రధాని డాక్టర్ నవీన్ రామ్గులామ్.. మా దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మీరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినందుకు నేను మనసారా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను. మన ఇరు దేశాల ప్రజల ప్రగతి, సమృద్ధి, ఉజ్జ్వల భవిత దిశగా మనం కలిసి చేస్తున్న కృషిలో మారిషస్ ఎప్పటికీ ఒక వ్యూహాత్మక, విశ్వసనీయ భాగస్వామ్యదేశంగా ఉంటుంది.’’
మాల్దీవులు అధ్యక్షుని ట్వీట్కు శ్రీ మోదీ ఇలా ప్రతిస్పందించారు:
‘‘అధ్యక్షుడు శ్రీ ముయిజ్జూ.. మీ హార్దిక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మన రెండు దేశాల ప్రజల శాంతి, ప్రగతి, సమృద్ధి సాధన దిశగా పయనించాలన్న మన ఉమ్మడి దార్శనికతలో మాల్దీవులు ఒక విలువైన పొరుగుదేశంగాను, సన్నిహిత భాగస్వామ్య దేశంగాను ఉంటోంది.’’
ఫ్రాన్స్ అధ్యక్షుని ట్వీట్కు ప్రధానమంత్రి సమాధానమిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ మాక్రాన్.. భారత్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు. మనం మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎంతో విలువనిస్తాం.. మన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కూడా మనం కట్టుబడి ఉన్నాం.’’
భూటాన్ ప్రధాని ట్వీట్కు శ్రీ మోదీ జవాబిస్తూ ఇలా అన్నారు:
‘‘ఇండియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రధాని శ్రీ తోబ్గేకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను. రాబోయే కాలంలో మన దేశాల మధ్య మైత్రీబంధం ఇంకా బలపడాలని ఆకాంక్షిస్తున్నాను.’’
***
(Release ID: 2157084)
Read this release in:
Marathi
,
Kannada
,
Malayalam
,
Bengali
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Tamil