ఆర్థిక మంత్రిత్వ శాఖ
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ ) దేశానికి లాభం చేకూర్చిన ఒక ముఖ్యమైన సంస్కరణ: 79వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణం కోసం జీఎస్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు, ధరల హేతుబద్ధీకరణ, జీవన సౌలభ్యం అనే మూడు మూల స్తంభాలపై ఆధారపడిన ముఖ్యమైన సంస్కరణలపై కేంద్రం దృష్టి: ప్రధాని
సమాజంలోని అన్ని వర్గాల, ముఖ్యంగా సామాన్య ప్రజలు, మహిళలు, విద్యార్థులు, మధ్యతరగతి, రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా తదుపరి తరం సంస్కరణల కోసం కీలక రంగాల గుర్తింపు
వర్గీకరణకు సంబంధించిన వివాదాలను తగ్గించడం, కొన్ని రంగాల్లో విలోమ సుంకాల లోటుపాట్లను సరిచేయడం, సుంకాల విధింపులో మరింత స్థిరత్వాన్ని కల్పించడం, అలాగే వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మరింత పెంచడం
కూడా సంస్కరణల లక్ష్యం
కీలక ఆర్థిక రంగాలను బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక కార్యకలాపాల ప్రోత్సాహానికి, రంగాల విస్తరణకు దోహదపడనున్న జీఎస్టీ సంస్కరణలు
Posted On:
15 AUG 2025 10:51AM by PIB Hyderabad
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2017లో అమలు లోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దేశానికి లాభాన్ని చేకూర్చిన ఒక ముఖ్యమైన సంస్కరణగా అభివర్ణించారు.
సామాన్య ప్రజలకు, రైతులకు, మధ్యతరగతికి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఉపశమనం కలిగించే విధంగా జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణల అవసరాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణం కోసం, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో గణనీయమైన సంస్కరణలను ప్రతిపాదిస్తోంది. ఇవి మూడు స్తంభాలపై దృష్టి సారిస్తాయి. అవి:
-
నిర్మాణాత్మక సంస్కరణలు.
-
పన్నుల హేతుబద్ధీకరణ.
-
జీవన సౌలభ్యం.
జీఎస్టీ పన్నుల్లో హేతుబద్ధీకరణ, సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జివోఎం) పరిశీలనకు పంపింది.
పన్ను విధింపులో హేతుబద్ధీకరణతో సహా తదుపరి తరం సంస్కరణల కోసం గుర్తించిన ప్రధాన అంశాలు సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా సామాన్య ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, మధ్యతరగతికి, రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటాయి.
వర్గీకరణకు సంబంధించిన వివాదాలను తగ్గించ డానికి కొన్ని రంగాల్లో అస్తవ్యస్తంగా ఉన్న సుంకాలను సరి చేయడానికి, రేట్లలో మరింత స్థిరత్వానికి, అలాగే వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని మరింత పెంచడానికి కూడా సంస్కరణలు దోహదపడతాయి. ఈ చర్యలు ప్రధాన ఆర్థిక రంగాలను బలపరచి, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించి, రంగాల విస్తరణకు వీలు కల్పిస్తాయి.
కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల కీలక స్తంభాలు
1. నిర్మాణాత్మక సంస్కరణలు
1. సుంకాల లోటుపాట్ల సవరణ: ఇన్పుట్, అవుట్పుట్ పన్ను రేట్లను సరిచేసి, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అధికంగా పేరుకుపోవడాన్ని తగ్గించడం. ఇది దేశీయ విలువ జోడింపు (డొమెస్టిక్ వాల్యూ ఆడిషన్) ను ప్రోత్సహిస్తుంది.
2. వర్గీకరణ సమస్యల పరిష్కారం: రేట్ల విధానాన్ని సులభతరం చేయడం, వివాదాలను తగ్గించడం, షరతుల కట్టుబాటు ప్రక్రియలను సరళీకృతం చేయడం, అన్ని రంగాల్లో సమానత్వం, స్థిరత్వం కోసం వర్గీకరణ సమస్యల పరిష్కారం.
3. స్థిరత్వం, అంచనా: పరిశ్రమ విశ్వాసాన్ని పెంపొందించడానికి, మెరుగైన వ్యాపార ప్రణాళికకు మద్దతు ఇవ్వడానికి రేట్లు, విధాన దిశపై దీర్ఘకాలిక స్పష్టతను అందించడం.
2: రేటు హేతుబద్ధీకరణ
1. సామాన్య ప్రజలు వాడే వస్తువులు, వారు ఆశించే వస్తువులపై పన్నుల తగ్గింపు: ఇది వాటి లభ్యతను, వినియోగాన్ని పెంచుతుంది. అవసరమైన వస్తువులను, ఆశించదగిన వస్తువులను మరింత ఎక్కువ మంది ప్రజలకు చేరువ చేస్తుంది.
2. స్లాబ్ ల తగ్గింపు: ప్రామాణికం, మెరిట్ అనే రెండు స్లాబ్ లతో సరళమైన పన్ను విధానం. ఎంపిక చేసిన కొన్ని వస్తువులకు మాత్రమే ప్రత్యేక రేట్లు.
3. పరిహార సెస్: పరిహార (కాంపెన్సేషన్) సెస్ ముగియడం వల్ల ఆర్థిక వెసులుబాటు లభించింది. ఇది జీఎస్టీ వ్యవస్థలో పన్ను రేట్లను హేతుబద్ధీకరించడానికి, దీర్ఘకాలిక స్థిరత్వం కోసం వాటిని సర్దుబాటు చేయడానికి ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది.
3: జీవన సౌలభ్యం
1. రిజిస్ట్రేషన్: ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, స్టార్టప్ లకు అంతరాయం లేని, సమయ పరిమిత నమోదు ప్రక్రియ.
2. రిటర్న్: పన్ను రిటర్నులను ముందుగానే నింపి ఉంచడం ద్వారా, మాన్యువల్ గా చేసే పనిని తగ్గించి, తప్పులను నివారించడం.
3. రిఫండ్: ఎగుమతిదారులకు, సుంకాల తీరు సరిగా (విలోమ పన్ను విధానం) లేనివారికి వాపసు (రిఫండ్) ప్రక్రియను వేగంగా, స్వయం చాలన విధానంలో చేయడం.
పై మూడు మూలస్తంభాలపై ఆధారపడిన కేంద్ర ప్రతిపాదనను తదుపరి చర్చల కోసం జీఓఎంకు అందచేశారు. భాగస్వాములందరి మధ్య నిర్మాణాత్మక, సమగ్ర, ఏకాభిప్రాయ ఆధారిత చర్చ కోసం కేంద్రం ఈ చొరవ తీసుకుంది.
సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న తదుపరి తరం సంస్కరణలను అమలు చేయడానికి రాబోయే వారాల్లో రాష్ట్రాలతో విస్తృత స్థాయి ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్రం పనిచేస్తుంది.
జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో జీఓఎం సిఫార్సులపై చర్చిస్తుంది. లక్ష్యంగా నిర్దేశించిన ప్రయోజనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గణనీయంగా సాధించడానికి వాటిని త్వరితగతిన అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
సరళమైన, స్థిరమైన, పారదర్శక పన్ను వ్యవస్థగా జీఎస్టీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఇది సమ్మిళిత వృద్ధికి మద్దతు ఇస్తుంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దేశవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని (ఈఓడీబీ) పెంచడం లక్ష్యంగా కలిగి ఉంటుంది.
***
(Release ID: 2156781)
Read this release in:
Marathi
,
Gujarati
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam