ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు సభ్యుల కోసం న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన నివాస సముదాయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
* కొన్ని రోజుల కిందటే కర్తవ్య పథ్ వద్ద కామన్ సెంట్రల్ సెక్రటేరియట్గా పిలిచే కర్తవ్య భవన్ ప్రారంభించాను…
ఈ రోజు నా సహ పార్లమెంటు సభ్యుల కోసం నివాస సముదాయాన్ని ప్రారంభించే అవకాశం నాకు దక్కింది: పీఎం
* ప్రస్తుతం మన దేశం…. ఎంపీల నివాస అవసరాలను తీర్చడమే కాకుండా, పీఎం ఆవాస యోజన ద్వారా 4 కోట్ల మంది పేదలకు సొంత గృహాలను అందించింది: పీఎం
* కర్తవ్య పథ్, కర్తవ్య భవన్ మాత్రమే నిర్మించడానికి పరిమితం కాకుండా.. పైపులైన్ల ద్వారా మిలియన్ల మందికి నీటిని అందించే బాధ్యతను కూడా దేశం నిర్వర్తిస్తోంది: పీఎం
* సోలార్ ఆధారిత మౌలిక వసతుల నుంచి సోలార్ విద్యుత్తులో కొత్త రికార్డుల వరకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేలా దేశం స్థిరంగా ముందుకు సాగుతోంది: పీఎం
Posted On:
11 AUG 2025 11:19AM by PIB Hyderabad
పార్లమెంట్ సభ్యుల కోసం న్యూఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్లో టైప్-7 బహుళ అంతస్థుల్లో కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఇటీవలే కర్తవ్య భవన్గా పిలిచే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ను కర్తవ్య పథ్లో ప్రారంభించానని, అలాగే పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను ప్రారంభించే అవకాశం తనకు లభించిందని అన్నారు. కాంప్లెక్సులోని నాలుగు టవర్లకు నాలుగు విశిష్ట నదులు - కృష్ణా, గోదావరి, కోసి, హుగ్లీ పేర్లు పెట్టినట్లు తెలిపారు. లక్షలాది మందికి జీవితాన్నిచ్చే ఈ నదులు, ఇప్పుడు ప్రజా ప్రతినిధుల జీవితాల్లోకి కొత్త ఆనందాల ప్రవాహానికి స్ఫూర్తిని ఇస్తాయని తెలిపారు. నదుల పేర్లు పెట్టే ఈ సంస్కృతి ఏకత్వమనే దారంతో దేశాన్ని కలిపి ఉంచుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల జీవన సౌలభ్యాన్ని ఈ కొత్త కాంప్లెక్స్ పెంచుతుందని, అలాగే ఎంపీలకు ఢిల్లీలో ప్రభుత్వం నివాసాలను పొందడం ఇప్పుడు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫ్లాట్ల నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజినీర్లు, శ్రామికులను ప్రశంసించారు. వీటిని పూర్తి చేయడంలో వారు కనబరిచిన అంకితభావాన్ని, చేసిన కృషిని మెచ్చుకున్నారు.
పార్లమెంటు సభ్యుల కోసం నూతనంగా నిర్మించిన నివాస సముదాయంలో నమూనా ఫ్లాట్ను పరిశీలించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. అలాగే పాత- ఎంపీ నివాస సముదాయాల పరిస్థితిని గమనించిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. పాత వసతి భవనాలకు తరచూ నిర్లక్ష్యం, శిథిలావస్థకు గురవడం లాంటి సమస్యలు ఎదురవుతాయని, ఇది అక్కడ ఎంపీలు తరచూ ఎదుర్కొనే ఇబ్బందులను తెలియజేస్తుందన్నారు. కొత్త ఫ్లాట్లలో నివసించడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి ఎంపీలకు విముక్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత నివాస ఇబ్బందుల నుంచి ఎంపీలకు వెసులుబాటు దొరికినప్పుడు.. వారు తమ సమయాన్ని, శక్తిని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సమర్థంగా వినియోగిస్తారని చెప్పారు.
మొదటిసారి ఎంపీలుగా ఎన్నికైన వారు ఢిల్లీలో ఇంటిని పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను అంగీకరిస్తూ.. కొత్తగా నిర్మించిన ఈ భవనాలు ఆ ఇబ్బందులను తొలగిస్తాయని శ్రీ మోదీ అన్నారు. బహుళ అంతస్థుల భవనాల్లో 180 మందికి పైగా ఎంపీలు ఒకే చోట నివసిస్తారని ప్రధాని తెలిపారు. కొత్త గృహనిర్మాణ కార్యకలాపాల్లో ఆర్థిక కోణాన్ని ప్రధానంగా వివరించారు. కర్తవ్య భవన్ ప్రారంభం గురించి వివరిస్తూ.. చాలా మంత్రిత్వ శాఖలు అద్దె భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించేవన్నారు. దీనికోసం ఏడాదికి రూ. 1,500 కోట్ల మొత్తాన్ని అద్దెగా చెల్లించాల్సి వచ్చేదని, ఇది ప్రజాధనాన్ని ప్రత్యక్షంగా దుర్వినియోగం చేయడమేనని తెలిపారు. ఎంపీలకు నివాసాల కొరత ఉన్నప్పటికీ లోక్ సభ సభ్యుల కోసం 2004 నుంచి 2014 మధ్య ఒక్క కొత్త నివాస భవనాన్ని కూడా నిర్మించలేదని శ్రీ మోదీ విమర్శించారు. 2014 తర్వాత తమ ప్రభుత్వం ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. 2014 నుంచి సుమారుగా 350 ఎంపీ నివాసాలను నిర్మించామని, వాటిలో కొత్తగా ప్రారంభించిన నివాస సముదాయం కూడా ఉందని వెల్లడించారు. ఈ నిర్మాణాలు పూర్తవడంతో ఇప్పుడు ప్రజాధనం ఆదా అవుతుందని ప్రధానమంత్రి అన్నారు.
‘‘21వ శతాబ్ధపు భారత్.. బాధ్యతల పట్ల ఎంత సున్నితంగా ఉందో.. అభివృద్ధి విషయంలోనూ అంతే ఆసక్తిగా ఉంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. కర్తవ్య పథ్, కర్తవ్య భవన్ లాంటివి నిర్మిస్తూనే.. లక్షలాది ప్రజలకు కుళాయి నీటిని సరఫరా చేసే బాధ్యతను సైతం దేశం నిర్వర్తిస్తోందని అన్నారు. ఎంపీలకు కొత్త నివాసాలను పూర్తి చేస్తూనే.. 4 కోట్ల పేద కుటుంబాలకు పీఎం ఆవాస యోజన ద్వారా సొంత ఇళ్లను అందించింది. ఓ వైపు కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తూనే.. మరో వైపు వందలాది కొత్త వైద్య కళాశాలలను నిర్మించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి చేరుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.
కొత్తగా నిర్మించిన ఎంపీల నివాస భవనాల్లో సుస్థిరాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను మిళితం చేశారని శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి దేశం అనుసరిస్తున్న పర్యావరణ హిత, భవిష్యత్తు-సురక్షా విధానానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ గృహ సముదాయంలో వినియోగించిన సోలార్ ఆధారిత మౌలిక వసతుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యం దిశగా భారత్ స్థిరంగా ముందుకు సాగుతోందని, ఇది సోలార్ విద్యుత్లో దేశం సాధించిన విజయాలు, రికార్డులను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
కొత్త రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంటు సభ్యులకు ప్రధానమంత్రి అనేక విజ్ఞప్తులు చేశారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ఎంపీలు ఇప్పుడు ఒకే చోట నివాసముంటారని, వారి ఉనికి ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబించాలన్నారు. ఈ కాంప్లెక్స్లో ప్రాంతీయ పండగలను సామూహికంగా నిర్వహించడం ద్వారా సాంస్కృతిక వైభవాన్ని పెంపొందించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలకు ఓటర్లను ఆహ్వానించాలని, ప్రజలతో సంబంధాలను పెంపొందించుకోవాలని చెప్పారు. ఒకరి నుంచి మరొకరు ప్రాంతీయ భాషా పదాలను నేర్చుకోవాలని, భాషా సామరస్యాన్ని పెంపొందించాలన్నారు. సుస్థిరత, పరిశుభ్రతకు ఈ కాంప్లెక్స్ నిర్వచనంగా మారాలని, ఈ నిబద్ధతను అందరూ కచ్చితంగా పంచుకోవాలనీ, నివాసాలు మాత్రమే కాకుండా.. మొత్తం సముదాయంలో శుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు.
పార్లమెంటు సభ్యులందరూ ఒక బృందంగా కలసి పనిచేస్తారని, వారి సమష్టి ప్రయత్నాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. అలాగే ఎంపీల రెసిడెన్షియల్ కాంప్లెక్సుల మధ్య స్వచ్ఛతా పోటీలు నిర్వహించాలని మంత్రిత్వశాఖ, హౌసింగ్ కమిటీలను కోరుతూ.. పార్లమెంట్ సభ్యులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రముుఖులు పాల్గొన్నారు.
నేపథ్యం:
న్యూఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్ లో పార్లమెంటు సభ్యుల కోసం టైప్-7 బహుళ అంతస్థుల్లో నిర్మించిన 184 ఫ్లాట్లను ప్రారంభించిన సందర్భంగా, భవన సముదాయ ప్రాంగణంలో సిందూర్ మొక్కను ప్రధానమంత్రి నాటారు. అలాగే శ్రామికులతో ప్రధాని ముచ్చటించారు.
పార్లమెంటు సభ్యుల అవసరాలకు అనుగుణంగా, పూర్తిగా ఆధునిక వసతులతో, స్వయం సమృద్ధిగా ఉండేలా ఈ కాంప్లెక్స్ను రూపొందించారు. హరిత సాంకేతికతను ఉపయోగించి ఈ ప్రాజెక్టు గృహ–3 స్టార్ రేటింగ్ ప్రమాణాలను ప్రాజెక్టు అనుసరించింది. అలాగే నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) 2016కి అనుగుణంగా ఉంది. విద్యుత్ ఆదా, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, సమర్థమైన వ్యర్థ నిర్వహణ దిశగా ఈ పర్యావరణ హిత సౌకర్యాలు తోడ్పడతాయిని అంచనా వేస్తున్నారు. ఆధునిక నిర్మాణ సాంకేతికతను ముఖ్యంగా, అల్యూమినియం షట్టరింగ్తో కూడిన మోనోలిథిక్ కాంక్రీట్ ఉపయోగించడం ద్వారా సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు మన్నికైన నిర్మాణాన్ని అందించడానికి వీలు కలిగింది. దివ్యాంగులకు అనుకూలంగా ఉన్న ఈ కాంప్లెక్స్ సమ్మిళిత నమూనాలను రూపొందించడంలో అంకితభావాన్ని తెలియజేస్తుంది.
పార్లమెంటు సభ్యులకు గృహాల కొరత కారణంగా ఈ ప్రాజెక్టు తప్పనిసరి అయింది. పరిమిత స్థలం అందుబాటులో ఉండటంతో.. దాన్ని సమర్థంగా వినియోగించుకోవడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా బహుళ అంతస్థుల్లో గృహాలను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యమిచ్చారు.
ప్రతి నివాస యూనిట్, సుమారుగా 5,000 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను అందిస్తుంది. తద్వారా నివాస, అధికారిక కార్యక్రమాల నిర్వహణకు తగినంత స్థలం లభిస్తుంది. పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు గాను, కార్యాలయాలు, సిబ్బంది నివాసాలు, ఒక కమ్యూనిటీ సెంటర్కు ప్రత్యేకంగా ప్రదేశాలను కేటాయించారు.
ఆధునిక నిర్మాణ రూపకల్పన నిబంధనలకు అనుగుణంగా.. భూకంపాలను తట్టుకొనే విధంగా ఈ కాంప్లెక్స్లో అన్ని భవనాలను నిర్మించారు. ఇందులో నివాసముండే వారికి రక్షణ కల్పించేందుకు సమగ్రమైన, విస్తృతమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
***
(Release ID: 2155065)
Read this release in:
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam