మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఒక నెలలో అత్యధిక మంది నమోదైనందుకు గానూ గిన్నిస్ ప్రపంచ రికార్డులోకెక్కిన ‘పరీక్షా పే చర్చ-2025’
ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో ప్రధాని సారథ్యంలో... పరీక్షా పే చర్చ
Posted On:
04 AUG 2025 6:08PM by PIB Hyderabad
విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో 2018 నుంచి మైగవర్నమెంట్ ప్లాట్ఫామ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ (పీపీసీ) గిన్నిస్ రికార్డును సృష్టించింది. ‘ప్రజలకు సంబంధించిన ఒక ప్లాట్ఫామ్లో అత్యధిక మంది నమోదయినందుకుగానూ ఈ ఘనతను సాధించింది. అర్హత కలిగిన 3.53 కోట్ల మంది నమోదుతో జరిగిన 8వ విడత పరీక్షా పే చర్చ ఈ ఘన విజయాన్ని సృష్టించింది.
పరీక్షా పే చర్చ అనేది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, ఆలోచన నుంచి ఉద్భవించిన ఒక ప్రత్యేకమైన ప్రపంచ స్థాయి ప్లాట్ఫామ్. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడతారు. ఇది పరీక్షల కాలాన్ని సానుకూలత, సన్నద్ధమవటం, లక్ష్యంతో కూడిన అభ్యాసానికి సంబంధించిన పండుగగా మారుస్తుంది. అంతేకాకుండా పరీక్షలను ఒత్తిడితో కూడినవిగా కాకుండా, ప్రోత్సాహానికి ఉన్న అవకాశంగా మారుస్తోంది.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు ధ్రువపత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఐటీ, రైల్వేలు, సమాచార- ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్.. కేంద్ర ఎలక్ట్రానిక్స్- ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద.. పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్.. మైగవర్నమెంట్ సీఈఓ శ్రీ నంద్ కుమారమ్.. విద్య, ఎలక్ట్రానిక్స్ - ఐటీ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు, ఇతర కీలక భాగస్వాములు హాజరయ్యారు. ఈ ఘనతను గిన్నిస్ ప్రపంచ రికార్డుల అధికారి శ్రీ రిషి నాథ్ ధ్రువీకరించారు.
ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో పరీక్షలకు ఒత్తిడికి సంబంధించనవిగా కాకుండా అభ్యాస పండుగగా పరీక్షా పే చర్చ మార్చిందని అన్నారు. ఈ కార్యక్రమం పరీక్షలకు సంబంధించిన జాతీయ విధానంగా మారిందని పేర్కొన్నారు. 2025లో అన్ని మీడియా వేదికల ద్వారా పీపీసీ 8వ విడత కార్యక్రమాన్ని మొత్తం 21 కోట్ల మంది కంటే ఎక్కువ మంది వీక్షించారని ఆయన తెలిపారు. పరీక్షా పే చర్చ-2025కు వచ్చిన భారీ స్పందన.. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా సమ్మళిత, సమగ్ర విద్య ఉండాలన్న భారతదేశ ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోందని అన్నారు.
మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. పరీక్షా పే చర్చ ప్రధానమంత్రి మోదీ చేపట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమమని అన్నారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఒక వేదికపైకి తీసుకొచ్చి.. వారి శ్రేయస్సును పెంచుతూ ఒత్తిడి లేని అభ్యాసాన్ని ప్రోత్సహిస్తోందని వివరించారు. ఈ అమృత కాలంలో విద్యార్థులకు జీవితాన్ని ఎంచుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అత్యధిక నమోదులతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించటం అనేది ఈ కార్యక్రమంపై ప్రజలకు ఉన్న బలమైన విశ్వాసాన్ని తెలియజేస్తోందని అన్నారు.
ప్రభుత్వ పాలనలో మరింత ఎక్కువ మందిని భాగస్వాములు చేయటంలో మైగవ్ ప్లాట్ఫామ్ చేసిన కృషిని మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ప్రశంసించారు. ప్రజల మరింత ఎక్కువగా పాల్గొనేలా చేయటంతో పాటు దేశవ్యాప్తంగా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సాంకేతికతను ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకున్న తీరును గిన్నిస్ రికార్డు ప్రధానంగా తెలియజేస్తోందని అన్నారు.
ఒత్తిడి లేని, ఆనందకరమైన అభ్యాసానికి జాతీయ విద్యా విధానం-2020 ప్రాధాన్యతనిస్తోంది. ఇది రాతపూర్వక అభ్యాసం కంటే అనుభవపూర్వకంగా కీలక నైపుణ్యాలను వృద్ధి చేయటాన్ని ప్రోత్సహిస్తోంది. పరీక్షా పే చర్చ ప్రారంభమైనప్పటి నుంచి అదొక దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. ఇది పరీక్షలను స్వీయ వ్యక్తీకరణ, వృద్ధికి ఉన్న అవకాశాలుగా మార్చింది. ప్రధానమంత్రి వ్యక్తిగతంగా విద్యార్థులతో సంభాషిస్తూ సమయపాలన, డిజిటల్ సాధనాలకు దూరంగా ఉండటం, మనస్ఫూర్తిగా నేర్చుకోవటం, భావోద్వేగాలను ధృడంగా మలుచుకోవటం వంటి కీలక సమస్యలపై దృష్టి సారించారు. దీనితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆచరణాత్మక మార్గదర్శకత్వం, ప్రేరణను అందించారు.
పరీక్షా పే చర్చ- 2025 అనేది సమష్టి విజయం. ఇందులో పాలు పంచుకొన్న విద్యా సంస్థలు, ప్రజలు, ఇతర భాగస్వాములందరినీ మంత్రులు ప్రశంసించారు. భాగస్వామ్య పరిపాలన, సమగ్ర విద్యను మరింత బలోపేతం చేయాలనే నిబద్ధత స్థిరంగా ఉంది.
సమ్మిళిత్వ విధానాలు, డిజిటల్ వేదికగా చేరుకునే తీరు, వినూత్న విధానాలే దేశంలో విద్యార్థులకు సంబంధించిన కీలక కార్యక్రమంగా కొనసాగేలా చేస్తున్నాయి. సంవత్సరాలు గడిచేకొద్దీ ‘పరీక్షలు ముగింపు కాదు, ప్రారంభం’ అనే సందేశాన్ని పీపీసీ బలోపేతం చేస్తోంది.
***
(Release ID: 2152348)