ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిటన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ
Posted On:
24 JUL 2025 7:29PM by PIB Hyderabad
బ్రిటన్లో ఈ నెల 23-24 తేదీల్లో అధికారిక పర్యటన సందర్భంగా ఆ దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ కీర్ స్టార్మర్తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు భేటీ అయ్యారు. బకింగ్హామ్షైర్లో ఉన్న చెకర్స్లోని బ్రిటన్ ప్రధాని నివాసానికి చేరుకున్న శ్రీ మోదీకి శ్రీ స్టార్మర్ హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలూ ముఖాముఖి సమావేశంతోపాటు ప్రతినిధి బృంద స్థాయి చర్చలు నిర్వహించారు.
చరిత్రాత్మక భారత్ - బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందాన్ని (సీఈటీఏ) ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థల్లోనూ ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థిక సహకారం, ఉద్యోగావకాశాలను విశేషంగా పెంచుతుంది. సీఈటీఏతోపాటే అమల్లోకి వచ్చే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్పైనా చర్చించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. పోటీతత్వాన్ని ప్రోత్సహించడం, వాణిజ్య సంస్థలకు వ్యాపార వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఇరుదేశాల్లోని నిపుణులు, సేవా పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పుతుంది. మూలధన మార్కెట్లు, ఆర్థిక సేవల రంగాల్లో పెరుగుతున్న సహకారాన్ని ప్రస్తావిస్తూ.. భారత తొలి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రమైన గుజరాత్ గిఫ్ట్ సిటీ, ప్రభావవంతమైన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థల మధ్య మరింత సమన్వయ సహకారాలను పెంపొందించే దిశగా ఇరుపక్షాలూ కృషిచేస్తాయని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆకాంక్షించారు.
ద్వైపాక్షిక సంబంధాల మొత్తం పరిధిని సమీక్షించిన ఇద్దరు నాయకులూ.. ‘భారత్ - బ్రిటన్ విజన్ 2035’పై అంగీకారానికి వచ్చారు. ఆర్థిక వ్యవస్థకూ అభివృద్ధికీ కీలక రంగాలు, సాంకేతికత, ఆవిష్కరణ, పరిశోధన, విద్య, రక్షణ, భద్రత, వాతావరణ కార్యాచరణ, ఆరోగ్యం, ప్రజా సంబంధాలను వచ్చే పదేళ్లపాటు ముందుకు నడిపించడం ద్వారా.. ‘విజన్ 2035’ దార్శనిక పత్రం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరిన్ని ఆశయాలను జోడించడంతోపాటు నవోత్తేజాన్ని నింపుతుంది.
ఇరుదేశాలతోపాటు ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా.. రక్షణ ఉత్పత్తులను కలిసి రూపొందించడం, కలిసి అభివృద్ధి చేయడం, కలిసి ఉత్పత్తి చేయడం దిశగా సహకారాన్ని ప్రోత్సహించేలా రక్షణ పారిశ్రామిక ప్రణాళిక ఖరారవడంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాల సాయుధ బలగాల మధ్య క్రమం తప్పకుండా కార్యక్రమాల నిర్వహణను స్వాగతిస్తూ.. రక్షణ, భద్రత భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుండడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
అధునాతన సాంకేతికతల్లో సహకారం పెరుగుతుండడంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. టెలికాం, కీలక ఖనిజాలు, ఏఐ, బయోటెక్నాలజీ, ఆరోగ్య సాంకేతికత, సెమీకండక్టర్లు, అధునాతన పదార్థాలు, క్వాంటంపై ప్రధానంగా దృష్టి సారించే ‘టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ (టీఎస్ఐ)’ అమలును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఎస్ఐకి నేటితో ఏడాది పూర్తతయింది.
విద్యారంగంలో భారత్, బ్రిటన్ మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారు. నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) కింద భారత్లో ప్రాంగణాలను ప్రారంభించడంపై బ్రిటన్లోని ఆరు విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఈ ఏడాది జూన్ 16న గురుగ్రాంలో ప్రాంగణాన్ని ప్రారంభించింది. నూతన విద్యా విధానం కింద భారత్లో క్యాంపస్ను ఏర్పాటు చేసిన మొదటి విదేశీ విశ్వవిద్యాలయం ఇదే.
విద్య, కళలు, సాహిత్యం, వైద్యం, సైన్స్, క్రీడలు, వ్యాపారం, రాజకీయ రంగాల్లో బ్రిటన్లోని భారతీయ ప్రవాసుల సహకారం ఎంతో విలువైందని ఇరుపక్షాలు ప్రశంసించాయి. భారత్ - బ్రిటన్ సంబంధాల అభివృద్ధికి ఈ ప్రజలే మూలాధారమని వారు స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రజలకు బలమైన మద్దతు అందించి సంఘీభావంగా నిలిచిన బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు నాయకులిద్దరూ స్పష్టం చేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదం ఇరు సమాజాలకూ ముప్పు కలిగిస్తున్నాయని పేర్కొన్న వారిద్దరూ.. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపరచుకోవడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆర్థిక నేరస్థులు, పరారీలో ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టడానికి బ్రిటన్ సహకరించాలని కూడా భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ కోరారు.
ఇండో-పసిఫిక్, పశ్చిమాసియాల్లో పరిణామాలు, రష్యా - ఉక్రెయిన్ సంఘర్షణ సహా ఉమ్మడి ప్రయోజనాలున్న అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైనా నాయకులిద్దరూ చర్చించారు.
ఆత్మీయ ఆతిథ్యాన్నిచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వీలుచూసుకుని త్వరలోనే భారత్ ను సందర్శించాలంటూ ఆయనను ఆహ్వానించారు.
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కింది పత్రాలపై ఇరుపక్షాలు సంతకం చేశాయి/ఆమోదించాయి:
· సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం [సీఈటీఏ]
· భారత్ - బ్రిటన్ విజన్ 2035 [లింక్]
· రక్షణ పారిశ్రామిక ప్రణాళిక
· సాంకేతికత, భద్రతా కార్యక్రమం (టీఎస్ఐ)పై ప్రకటన [లింక్]
· భారత కేంద్ర దర్యాప్తు సంస్థ, బ్రిటన్ జాతీయ నేర విచారణ సంస్థ (నేషనల్ క్రైమ్ ఏజెన్సీ) మధ్య అవగాహన ఒప్పందం.
***
(Release ID: 2148128)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam