ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని ప్రసంగం
Posted On:
21 JUL 2025 11:47AM by PIB Hyderabad
మిత్రులకు నమస్కారం!
వర్షాకాల సమావేశాలకు మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతున్నాను.
మిత్రులారా,
రుతుపవనాలు కొత్తదనానికి, సృష్టికి ప్రతీక. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా వాతావరణం అనుకూలంగా ఉంది. ఇది వ్యవసాయానికి లాభదాయకమైన సీజన్ అని వార్తలొస్తున్నాయి. మన రైతుల ఆర్థిక స్థితిగతుల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, ఇంకా ప్రతి ఇంటి ఆర్థిక స్థితిగతుల్లోనూ వర్షం కీలక పాత్ర పోషిస్తుంది. నాకు అందిన సమాచారం ప్రకారం.. గత పదేళ్లలో నమోదైన నీటి నిల్వ కన్నా ఈ ఏడాది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉంది. మున్ముందు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదెంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
మిత్రులారా,
ఈ వర్షాకాల సమావేశాలు దేశానికెంతో గర్వకారణం. ఈ సమావేశమే దేశ విజయోత్సవం వంటిది. ఈ సమావేశం దేశానికి గర్వకారణమూ విజయోత్సవమూ అని నేనంటున్నానంటే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొలిసారిగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడడమే ఇందుకు ముఖ్య కారణం. ఇది ప్రతి భారతీయుడికీ ఎంతో గర్వకారణం. శాస్త్ర విజ్ఞానం, సాంకేతికత, నూతన ఆవిష్కరణల పట్ల దేశంలో కొత్త ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపిన విజయవంతమైన ప్రయాణమిది. దేశ ప్రజలందరితో కలిసి పార్లమెంటు (లోకసభ, రాజ్యసభ రెండూ) ఈ విజయాన్ని ఘనంగా చాటబోతోంది. ఈ ఐక్య ప్రశంస భారత భావి అంతరిక్ష యాత్రలకు ప్రేరణగా, ప్రోత్సాహకంగా నిలుస్తుంది. ఆ రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
మిత్రులారా,
ఈ వర్షాకాల సమావేశం నిజంగా విజయోత్సవమే. భారత సైనిక సామర్థ్యం ప్రపంచం మొత్తానికీ తెలియవచ్చింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సాయుధ దళాలు తమ లక్ష్యాలను 100 శాతం విజయవంతంగా సాధించాయి. కేవలం 22 నిమిషాల్లోనే, శత్రు దేశానికి చెందిన లక్ష్యాలను వారి సొంత భూభాగంలోనే భారత సేనలు మట్టుబెట్టాయి. బీహార్లో జరిగిన ఓ కార్యక్రమంలో నేను ఈ విషయాన్ని ప్రకటించాను. అనతికాలంలోనే మన సాయుధ దళాలు దీన్ని సాధించాయి. మన ‘మేడ్ ఇన్ ఇండియా’ సైనిక శక్తి పాటవాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. నేనీమధ్య ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడిని కలిసినా, భారత్లో దేశీయంగా తయారవుతున్న రక్షణ పరికరాలపై వారంతా అమితాసక్తి చూపుతున్నారు. ఈ సమావేశం సందర్భంగా పార్లమెంటు ముక్తకంఠంతో చేసే విజయధ్వానాలు మన సాయుధ దళాలకు సరికొత్త శక్తినివ్వడంతోపాటు వారికిది ప్రేరణగా నిలుస్తుందన్న దృఢమైన నమ్మకం నాకుంది. ఇది దేశానికి స్ఫూర్తినిస్తుంది. రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీకి ఊతమిస్తుంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ రక్షణ పరికరాలు మరింత ఊపందుకుని, మన యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి.
మిత్రులారా,
ఈ దశాబ్దాన్ని శాంతి, పురోగతి కలిసి పురోగమిస్తున్న కాలంగా చెప్పొచ్చు. అడుగడుగునా అభివృద్ధిని చవిచూస్తున్నాం. ఉగ్రవాదం కావచ్చు, నక్సలిజం కావచ్చు.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వివిధ రూపాల్లో దేశం హింసను ఎదుర్కొంటోంది. వీటిలో కొన్ని ముందూ కొన్ని వెనకా ఏర్పడి ఉండొచ్చు.. ఏదేమయినా, నక్సలిజం, మావోయిజం ప్రభావం నేడు శరవేగంగా సన్నగిల్లుతోంది. మావోయిజాన్నీ నక్సలిజాన్నీ సమూలంగా నిర్మూలించాలన్న దృఢసంకల్పంతో.. వేగంగా, సరికొత్త ఆత్మవిశ్వాసంతో విజయం దిశగా మన రక్షణ దళాలు పురోగమిస్తున్నాయి. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరయిన వందలాది జిల్లాలు నేడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాయని సగర్వంగా చెప్పగలను. మన రాజ్యాంగం బాంబులు, తుపాకులు, పిస్టళ్లను ఎదర్కొని నిలబడుతోందని గర్విద్దాం. మన రాజ్యాంగం గెలుస్తోంది. ఒకప్పుడు రెడ్ కారిడార్లుగా ముద్రపడిన ప్రాంతాలు నేడు అభివృద్ధికి నిలయాలవుతున్నాయి. దేశ ఉజ్వల భవితకు ఇది ప్రతీక.
మిత్రులారా,
ఒకదానివెంట ఒకటిగా, ఇలాంటి సంఘటనలన్నీ... దేశ సేవ కోసం, దేశ శ్రేయస్సు కోసం ఈ సభలో అడుగుపెట్టిన గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ గర్వకారణం. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రతి పార్లమెంటు సభ్యుడి నుంచి, ప్రతి రాజకీయ పార్టీ నుంచి దేశం మొత్తం ఈ విజయగాథను వినబోతోంది.
మిత్రులారా,
2014లో మీరు మాకు బాధ్యతలు అప్పగించేనాటికి, అయిదు బలహీన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పరిగణించే దశలో దేశం ఉంది. 2014కు ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం పదో స్థానంలో ఉన్నాం. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ శరవేగంగా పురోగమిస్తోంది. నేడు దేశంలో 25 కోట్ల ప్రజలు పేదరికాన్ని అధిగమించడాన్ని అనేక అంతర్జాతీయ సంస్థలు విస్తృతంగా ప్రశంసిస్తున్నాయి. 2014కు ముందు దేశంలో ద్రవ్యోల్బణ రేటు రెండంకెల స్థాయిలో ఉండేది. నేడు ద్రవ్యోల్బణం దాదాపు 2 శాతానికి తగ్గడంతో సామాన్యులకు ఉపశమనం, ఊరట లభించాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండి, వృద్ధి అధికంగా ఉండడం ఆరోగ్యకరమైన, ప్రగతిశీల అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది.
మిత్రులారా,
డిజిటల్ ఇండియా, యూపీఐ ద్వారా భారత నవసామర్థ్యాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇవి అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఫిన్ టెక్ ప్రపంచంలో యూపీఐ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. రియల్టైమ్ డిజిటల్ లావాదేవీల్లో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ముందంజలో ఉంది.
మిత్రులారా,
ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక సంస్థ అంతర్జాతీయ సదస్సులో భారత్ ఓ ప్రధాన మైలురాయిని చేరుకుంది. ఐఎల్వో ప్రకారం.. భారత్లో నేడు 90 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రత కార్యక్రమాల పరిధిలోకి వచ్చారు. ఇది గొప్ప విజయం. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) భారత్ను ట్రాకోమా (వర్షాకాలంలో సాధారణంగా కనిపించే కంటి వ్యాధి) రహిత దేశంగా ప్రకటించింది. ప్రజారోగ్య రంగంలో భారత్ సాధించిన మరో ముఖ్యమైన విజయమిది.
మిత్రులారా,
పహల్గామ్లో జరిగిన దారుణ హత్యలు, దౌర్జన్యాలు, మారణకాండ యావత్ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అందరి దృష్టి ఉగ్రవాదులు, వారి సూత్రధారుల వైపు మళ్లింది. ఆ సమయంలో పార్టీలను పక్కనపెట్టి, దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ.. అనేక రాజకీయ పార్టీలు, రాష్ట్రాల ప్రతినిధులు వివిధ దేశాలలో పర్యటించి ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ను ప్రపంచం ఎదుట విజయవంతంగా ఎండగట్టారు. దేశ ప్రయోజనాల కోసం ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాలుపంచుకున్న పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీలకు నా అభినందనలు. వారి ప్రయత్నాలు దేశంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. భారత్ వాదనలు విని, ప్రపంచం అంగీకరిస్తోంది. దీనిపై మన పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీలను అభినందించడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను.
మిత్రులారా,
ఐక్యతా స్ఫూర్తి, సమష్టిగా దానిని చాటడం దేశంలో ఎంత ఉత్సాహాన్ని నింపుతాయో మనకు తెలుసు. ఇదే స్ఫూర్తితో ఈ వర్షాకాల సమావేశాల్లోనూ ఈ విజయోత్సవం ప్రతిబింబిస్తుంది. ఈ సమావేశం మన సాయుధ బలగాల శక్తిని ఎలుగెత్తి చాటుతుంది. దేశ సామర్థ్యాలను కీర్తిస్తుంది. 140 కోట్ల భారతీయులకు సరికొత్త ప్రేరణగా నిలుస్తుంది. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ప్రయత్నాలను మనమంతా సమష్టిగా బలోపేతం చేసుకుంటామని, సాయుధ దళాల శక్తిని సగర్వంగా చాటుతామని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు నేనొకటి తప్పక చెప్పాలి. ఐక్యతా శక్తి, సమష్టి స్ఫూర్తి ఎంత బలమైనవో దేశానికి స్పష్టంగా తెలియవచ్చింది. గౌరవ పార్లమెంటు సభ్యులు సభలో కూడా ఈ స్ఫూర్తిని బలోపేతం చేసి, ముందుకు తీసుకెళ్లాలి. రాజకీయ పార్టీలు భిన్నమైనవన్న వాస్తవాన్ని నేను అంగీకరిస్తాను. ప్రతి పార్టీకీ సొంత ఎజెండా ఉంటుంది. ఒక్కో పార్టీ ఒక్కో పాత్ర పోషిస్తుంది. అయితే, మరో నిజాన్ని కూడా నేను దృఢంగా విశ్వసిస్తున్నాను:- పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అభిప్రాయాలు ఒక్కటి కాకపోయినా, దేశ ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసిరావాలి. ఈ స్ఫూర్తితోనే దేశ అభివృద్ధి ప్రస్థానాన్ని వేగవంతం చేసే, పురోగతిని ముందుకు తీసుకెళ్లే, ప్రజలను సాధికారులను చేసే అనేక బిల్లులను ఈ వర్షాకాల సమావేశాల కోసం ప్రతిపాదించాం. సభ వీటిని సమగ్రంగా చర్చించి, ఆమోదిస్తుందన్న నమ్మకం నాకుంది.
అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు చేస్తారని ఆశిస్తూ, గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ నా శుభాకాంక్షలు.
ధన్యవాదాలు!
***
(Release ID: 2146640)
Visitor Counter : 2
Read this release in:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil