ప్రధాన మంత్రి కార్యాలయం
భోపాల్లోని దేవి అహిల్యాబాయి మహిళా సశక్తీకరణ్ మహా సమ్మేళన్లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
31 MAY 2025 4:18PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ గవర్నర్ గౌరవనీయ శ్రీ మంగు భాయ్ పటేల్, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, సాంకేతిక మాధ్యమాల ద్వారా పాలు పంచుకుంటున్న కేంద్ర మంత్రులు- ఇండోర్ నుంచి శ్రీ తో ఖాన్ సాహు, దాటియా నుంచి శ్రీ రామ్మోహన్ నాయుడు, సత్నా నుంచి శ్రీ మురళీధర్ మోహుల్, వేదికను అలంకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ జగదీష్ దేవ్డా, శ్రీ రాజేంద్ర శుక్లా, లోక్సభలో నా సహచరులు శ్రీ వి.డి.శర్మ, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీ సోదరులారా!
మున్ముందుగా భరతమాతకు ప్రణామాలర్పిస్తూ, మహిళలందరికీ నమస్కరిస్తున్నాను. ఇంత పెద్ద సంఖ్యలో తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెలు మమ్మల్ని ఆశీర్వదించేందుకు తరలిరావడం, మిమ్మల్నందర్నీ కలిసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం.
సోదరీ సోదరులారా!
ఈ రోజు లోక్మాత దేవి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి. ఆమె స్ఫూర్తితో 140 కోట్ల మంది భారతీయులు దేశ ప్రగతి అనే మహత్తర కర్తవ్యంలో తమవంతు తోడ్పాటునిచ్చేందుకు ఇదొక చిరస్మరణీయ సందర్భం. ప్రజలకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడమే ప్రజాస్వామ్యంలో నిజమైన పాలన అని ఆమె నిరంతరం చెప్పేవారు. దూరదృష్టితో కూడిన ఆ దార్శనికతను నేటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుంది. ఇక ఇవాళ ఇండోర్ మెట్రో ప్రారంభం కాగా, దాటియా, సత్నాల నుంచి విమానయాన సేవలు కూడా మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టులతో మధ్యప్రదేశ్లో ప్రజా రవాణా మెరుగవుతుంది... ప్రగతి వేగం పుంజుకుంటుంది. అనేక కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయి. ఈ శుభదినాన పురోగమనం దిశగా ఇంతటి ముందడుగు పడటంపై మీకందరికీ... యావత్ రాష్ట్రానికి నా హృదయపూర్వక అభినందనలు.
లోకమాత పేరు వినగానే లోతైన భక్తిభావన మదిలో మెదలుతుంది. ఆమె మహోన్నత వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవు. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మొక్కవోని మానసిక స్థైర్యం, దృఢ సంకల్పంతో అద్భుత ఫలితాలు సాధించగలగడానికి ఆమె జీవితమే నిదర్శనం. మన దేశం దాదాపు 3 శతాబ్దాల కిందట పరాయి పాలనలో మగ్గుతున్నపుడు దేవి అహిల్యాబాయి నాటి పాలకులపై అసాధారణ విజయాలు సాధించారు. ఆ వీరగాథలను తరతరాలుగా మనం స్మరించుకుంటూనే ఉన్నాం. నాటి ఘన విజయాల గురించి మాట్లాడుకోవడం సులువేగానీ, అనేకానేక ప్రతికూలతల నడుమ ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు నేటి పరిస్థితుల్లో మనకు సులభ సాధ్యం కాదనడం అతిశయోక్తి కాబోదు.
మిత్రులారా!
దైవారాధనను, ప్రజా సేవను లోకమాత అహిల్యాబాయి ఏనాడూ వేర్వేరుగా భావించలేదు. ఆమె ఒక శివలింగాన్ని సదా వెంట తీసుకెళ్లేవారని చెబుతారు. ఆనాటి అల్లకల్లోల పరిస్థితుల నడుమ రాజ్యపాలన ముళ్ల కిరీటంతో సమానం. అదెంతటి కర్తవ్య భారమో మనం ఊహించవచ్చు. అయినప్పటికీ లోకమాత తన రాజ్య ప్రగతికి కొత్త దిశను నిర్దేశించింది. నిరుపేదలకు సాధికారత కల్పన కోసం తనను తాను అంకితం చేసుకుంది. భారత వారసత్వ పరిరక్షణలో ఆమె ఎన్నడూ వెనుకంజ వేయలేదు. మన ఆలయాలు, తీర్థయాత్ర ప్రదేశాలు, సాంస్కృతిక చిహ్నాలు శత్రువుబారిన పడినప్పుడు వాటి పరిరక్షణలో లోకమాత చూపిన చొరవ అసామాన్యం. కాశీ విశ్వనాథ ఆలయం సహా దేశమంతటా అనేక ఆలయాలు, పవిత్ర స్థలాల పునరుద్ధరణ, పునర్నిర్మాణం చేయించారు. అహిల్యాబాయి విస్తృత స్థాయిలో అనేక అభివృద్ధి పనులు చేయించిన కాశీ నగరానికి ప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇప్పుడు నాకు లభించడం ఒక అదృష్టం. మీరు కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనానికి వెళితే అక్కడ దేవి అహిల్యాబాయి విగ్రహం కూడా మీకు కనిపిస్తుంది.
మిత్రులారా!
పేద, అణగారిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యంతో ఆదర్శప్రాయ పాలన విధానాలను మాతా అహిల్యాబాయి అనుసరించారు. ఉపాధి, వ్యవస్థాపనను ప్రోత్సహిస్తూ వివిధ పథకాలకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయంతోపాటు అటవీ ఆధారిత కుటీర పరిశ్రమలు, చేతివృత్తులను ప్రోత్సహించారు. అన్నదాతల కోసం చిన్న కాలువలతో కూడిన నీటి సరఫరా వ్యవస్థను రూపొందించారు. మూడు శతాబ్దాల కిందటి ఆమె దూరదృష్టిలోని ఔన్నత్యాన్ని ఒకసారి ఊహించుకోండి. జల సంరక్షణను ప్రోత్సహిస్తూ అనేక చెరువులు తవ్వించారు. ఈ రోజున మేం “వర్షాన్ని ఒడిసి పడదాం... ప్రతి నీటిచుక్కనూ కాపాడుకుందాం” అనే నినాదాన్ని సర్వదా వినిపిస్తున్నాం. అయితే, దేవి అహిల్యాబాయి దాదాపు 300 ఏళ్ల కిందటే ఆ సందేశమిచ్చారు. రైతుల ఆదాయం పెంపు దిశగా పత్తి, సుగంధ ద్రవ్యాల సాగును ఆమె ప్రోత్సహించారు. ఇక రైతులు పంట వైవిధ్యం పాటించాలని, వరి లేదా చెరకు వంటి పంటలకు పరిమితం కారాదని నేటికీ మనం పదేపదే సూచిస్తున్నాం. దేశానికి అవసరమైన ప్రతి పంటనూ మనం పండించాలి. అందుకే, గిరిజన-సంచార వర్గాల వారు బంజరు భూములలో వ్యవసాయం చేసుకునేలా ఆమె ప్రణాళికలు రూపొందించారు. నేడు గిరిపుత్రిక అయిన మన రాష్ట్రపతి నాయకత్వంలో నేను కూడా నా గిరిజన సోదరీ సోదరులకు సేవ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన మహేశ్వరి చీరల తయారీ కోసం దేవి అహిల్యాబాయి ఆనాడే కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయించారు. కళాకారులు, చేతివృత్తుల వారి నైపుణ్యాన్ని ఆమె ఎంతో గౌరవించేవారని కొద్దిమందికి మాత్రమే తెలుసు. గుజరాత్లోని జునాగఢ్ నుంచి కొన్ని కుటుంబాలను మహేశ్వర్కు తీసుకొచ్చి, ఈ చేనేత చీరల తయారీకి ఊపిరి పోశారు. ఆమె నాయకత్వంలో మూడు శతాబ్దాల కిందట మొదలైన ఈ వారసత్వం నేటికీ అనేక కుటుంబాల జీవితాన్ని సుసంపన్నం చేస్తూ, నేత కార్మికులకు ఎనలేని ప్రయోజనం చేకూరుస్తోంది.
మిత్రులారా!
దూరదృష్టితో కూడిన దేవి అహిల్యాబాయి సామాజిక సంస్కరణలు చిరస్మరణీయం. ఆడపిల్లల వివాహ వయోపరిమితి పెంచడం గురించి మనమిప్పుడు మాట్లాడుతున్నాం. కానీ, ఒకనాడు మన దేశంలో దాన్ని కొందరు మత విశ్వాసాలకు లేదా లౌకికవాదానికి ముప్పుగా భావించే వారు. కానీ, దేవి అహిల్యాబాయి శతాబ్దాల కిందటే మహిళల గౌరవం, సామర్థ్యాన్ని గౌరవిస్తూ, వివాహ వయస్సు గురించి ఆలోచించారు. ఆనాడు ఆమెకు చిన్న వయసులోనే వివాహమైనా- ఆడపిల్లల ప్రగతి, సాధికారతకు భరోసా ఇచ్చే మార్గంపై సుస్పష్ట దృక్కోణం ఆమె సొంతం. ఆ మేరకు మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని, బాల్య వితంతు పునర్వివాహాలను అనుమతించాలని ఆమె ఆ రోజుల్లోనే స్పష్టం చేశారు. అసలు ఆ కాలంలో ఇటువంటి అంశాలపై చర్చించడమే అత్యంత కష్టసాధ్యం! అలాంటి సామాజిక పరిస్థితుల నడుమ దేవి అహిల్యాబాయి ఇటువంటి ప్రగతిశీల సంస్కరణలకు దృఢమైన మద్దతునిచ్చారు. ఆమె మాల్వా సైన్యంలో ఒక ప్రత్యేక మహిళా దళాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 3 శతాబ్దాల కిందటే భారత సైన్యంలో మహిళా దళాలు ఉండేవని పాశ్చాత్య ప్రపంచానికి తెలియదు. అందుకే, వారు తరచూ భారత్లో మహిళల హక్కుల విషయం మీద మనను చిన్నచూపు చూస్తూ కువిమర్శలు చేస్తుంటారు.
మిత్రులారా!
గ్రామాల్లో మహిళల రక్షణ కోసం ‘నారీ సురక్ష టోలి’ పేరిట మహిళా భద్రత బృందాలను ఆమె ఏర్పాటు చేశారు. మొత్తం మీద దేశ పురోగమన కృషిలో మహిళల అమూల్య పాత్రకు మాతా అహిల్యాబాయి ఒక ప్రతీకగా నిలిచారు. అందుకే, ఈ రోజున ఆమెకు పాదాభివందనం చేస్తున్నాను... ఆ మహనీయురాలు ఏ లోకంలో ఉన్నా, మనందరిపై ఆమె ఆశీస్సులు సదా వర్షించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
మిత్రులారా!
మనకు నిరంతరం స్ఫూర్తినిచ్చే దేవి అహిల్యాబాయి శక్తిమంతమైన ప్రకటన ఒకటుంది.. దాన్ని ఎప్పటికీ విస్మరించలేం. “మనకు లభించేది ఏదైనా అది ప్రజల రుణం... దాన్ని తిరిగి చెల్లించడం మన కర్తవ్యం” అన్నది ఆ ప్రకటన సారాంశం. లోకమాత రూపుదిద్దిన ఈ విలువలే మా ప్రభుత్వ పాలనకు ప్రాతిపదిక. ఆ మేరకు “నాగరిక్ దేవో భవ”... పౌరులే దేవుళ్లు- అన్నది మా పాలనకు తారకమంత్రంగా మారింది. అంతేగాక మా ప్రభుత్వం తన అభివృద్ధి వ్యూహంలో మహిళల సారథ్యాన ప్రగతికి పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వం రూపొందించే ప్రతి ప్రధాన పథకానికీ తల్లులు, అక్కచెల్లెళ్లు, పుత్రికలే కేంద్రంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించిన సంగతి మీకు తెలిసిందే. వీటిలో అధికశాతం ఆయా కుటుంబాల్లోని మహిళల పేరిట నమోదు చేయడంతో వారికి చట్టబద్ధ యాజమాన్య హక్కు దఖలు పడింది. అంటే- వీరిలో చాలామందికి జీవితంలో తొలిసారి ఆస్తి హక్కు లభించిందన్న మాట! ఈ విధంగా దేశంలో కోట్లాది మహిళలు తొలిసారి సొంతింటి యజమానులయ్యారు.
మిత్రులారా!
దేశవ్యాప్తంగా ఇంటింటికీ కొళాయి నీటి సరఫరాను సాకారం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. తద్వారా మన తల్లులు, అక్కచెల్లెళ్లు, నీటి కోసం మైళ్ల దూరం వెళ్లే అవస్థ తప్పింది. దీంతో మన ఆడబిడ్డలు తమ చదువు మీద ఎక్కువగా దృష్టి సారించే వీలు చిక్కింది. ఇక గతంలో కోట్లాది మహిళలకు విద్యుత్తు, వంట గ్యాస్, మరుగుదొడ్డి వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉండేవి కావు. మా ప్రభుత్వం ఈ సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది. ఇవి కేవలం సౌకర్యాలు కావు... తల్లులు, అక్కచెల్లెళ్ల ఆత్మగౌరవ పరిరక్షణలో మా నిజాయితీకి చిహ్నాలు. ఈ చర్యలతో పేద కుటుంబాల్లోని, గ్రామీణ ప్రాంతాల మహిళల దైనందిన సమస్యలెన్నో పరిష్కృతమయ్యాయి.
మిత్రులారా!
మునుపటి రోజల్లో అనేకమంది మహిళలు తమ అనారోగ్యాన్ని వెల్లడించేవారు కారు. చివరకు గర్భిణులు తమ కుటుంబంపై వైద్య ఖర్చుల భారం పడుతుందనే భయంతో అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రికి వెళ్లకుండా పంటి బిగువున బాధను భరించేవారు. అయితే, ఆయుష్మాన్ భారత్ యోజనతో వారికి ఈ బాధలు తప్పాయి. ఇప్పుడు వారికీ రూ.5 లక్షలదాకా ఉచిత చికిత్స సదుపాయం లభిస్తుంది.
మిత్రులారా!
మహిళా సాధికారతకు విద్య, ఆరోగ్య సంరక్షణతోపాటు ఆదాయ సృష్టి అత్యంత కీలకం. ఒక మహిళకు తన సొంత సంపాదన ఉన్నపుడు ఇంట్లో ఆమె ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది. అలాగే కుటుంబ నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యం మరింత కీలకం కాగలదు. గత 11 ఏళ్లుగా మా ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత దిశగా నిరంతరం కృషి చేస్తోంది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి... 2014కు ముందు- మీ సేవా భాగ్యం నాకు కలిగే నాటికి దేశంలో 30 కోట్ల మందికి పైగా మహిళలకు బ్యాంకు ఖాతా కూడా లేదు. ఆ తర్వాత మా ప్రభుత్వం జన్ధన్ యోజనకు శ్రీకారం చుట్టి, వారందరితో బ్యాంకు ఖాతాలు తెరిపించింది. తద్వారా వివిధ పథకాల ప్రయోజనం నగదు బదిలీ రూపంలో వారి ఖాతాల్లో చేరుతోంది. నేడు గ్రామాలు, నగరాలనే తేడా లేకుండా మహిళలు స్వయం ఉపాధిని ఎంచుకుంటున్నారు. తమదైన జీవనోపాధిని ఏర్పరచుకుని ఆర్థికంగా స్వతంత్రులు అవుతున్నారు. ‘ముద్ర యోజన’ ద్వారా వారికి హామీ రహిత రుణం లభిస్తోంది. ఈ పథకం కింద 75 శాతానికిపైగా లబ్ధిదారులు మహిళలే కావడం విశేషం.
మిత్రులారా,
నేడు దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలతో మమేకమై వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఈ మహిళలకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడంలో సహాయం చేస్తోంది. కొన్ని లక్షల రూపాయల మద్దతును అందిస్తోంది. అలాంటి మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికార సోదరీమణులు (లక్పతీ దీదీ) గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ఇప్పటికే 1.5 కోట్లకు పైగా సోదరీమణులు ఈ విజయాన్ని సాధించారని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రతి గ్రామంలోని బ్యాంక్ సఖీలు ఇప్పుడు ప్రజలను బ్యాంకింగ్ సేవలకు అనుసంధానిస్తున్నాయి. 'బీమా సఖీ'లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా బీమా కవరేజీ కల్పించడంలో మన సోదరీమణులు, కుమార్తెలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
మిత్రులారా,
ఒకప్పుడు మహిళలను కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉంచారు. నేడు మన దేశం ఆ దశను దాటి చాలా ముందుకు పోతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మన సోదరీమణులు, కుమార్తెలు ముందడుగు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉదాహరణకు, వ్యవసాయంలో మనం డ్రోన్ విప్లవాన్ని చూస్తున్నాం. ఇందులో మన గ్రామీణ మహిళలు ముందంజలో ఉన్నారు. 'నమో డ్రోన్ దీదీ' కార్యక్రమం గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం, వారి ఆదాయాన్ని పెంచడం, వారి కమ్యూనిటీలలో వారికి గుర్తింపును సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుంది.
మిత్రులారా,
మన కూతుళ్లు సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, పైలట్లుగా ఎదుగుతున్నారు. సైన్స్, మ్యాథమెటిక్స్ చదువుకునే యువతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మన ప్రధాన అంతరిక్ష యాత్రలన్నింటిలోనూ ఎంతో మంది తల్లులు, సోదరీమణులు, కూతుళ్లు శాస్త్రవేత్తలుగా తమ వంతు సహకారం అందిస్తున్నారు. 100 మందికి పైగా మహిళా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పాల్గొన్న చంద్రయాన్ -3 మిషన్ పట్ల యావత్ దేశం గర్విస్తోంది. అదేవిధంగా అంకుర సంస్థల యుగంలో మన అమ్మాయిలు అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. దేశంలోని దాదాపు 45 శాతం అంకుర సంస్థల్లో కనీసం ఒక మహిళ - మన సోదరీమణులు లేదా కుమార్తెలలో ఒకరు డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
మిత్రులారా,
విధాన రూపకల్పనలో బాలికలు, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి మేం కట్టుబడి ఉన్నాం. గత దశాబ్దకాలంలో ఈ దిశగా పలు కీలక చర్యలు చేపట్టాం. మా ప్రభుత్వంలో తొలిసారి పూర్తిస్థాయి మహిళా రక్షణ మంత్రిని నియమించాం. అలాగే దేశంలో తొలిసారిగా మహిళా ఆర్థిక మంత్రి ఉన్నారు. పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు మహిళా ప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత పార్లమెంటులో 75 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ దార్శనికతతోనే 'నారీ శక్తి వందన్ అధినియం' కార్యరూపం దాల్చింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ చట్టాన్ని ఇప్పుడు మా ప్రభుత్వం ఆమోదించింది. ఫలితంగా పార్లమెంటు, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లు సాకారమయ్యాయి. మన సోదరీమణులు, ఆడబిడ్డలకు ప్రతి స్థాయిలో, ప్రతి రంగంలో సాధికారత కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.
మిత్రులారా,
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. మన సంప్రదాయాల్లో సిందూరం (కుంకుమ) స్త్రీత్వానికి, స్త్రీ శక్తికి ప్రతీక. శ్రీరాముని పట్ల అమితమైన భక్తి కలిగిన హనుమంతుడు కూడా సిందూరం ధరించినట్లు వర్ణించారు. అమ్మవారి ఆరాధన సమయంలో సిందూరం సమర్పిస్తాం. నేడు అదే సిందూరం భారత్ శౌర్యానికీ, ధైర్యానికీ చిహ్నంగా మారింది.
మిత్రులారా,
పహల్గామ్ లో ఉగ్రవాదులు భారతీయుల రక్తాన్ని కళ్ల చూడటమే కాకుండా మన సంస్కృతిపై దాడి చేశారు. మన సమాజంలో విభజన బీజాలు నాటేందుకు ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా ఈ ఉగ్రవాదులు నేరుగా భారత మహిళలకు సవాల్ విసిరారు. కానీ, అదే సవాలు ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను చావుదెబ్బ తీసింది. 'ఆపరేషన్ సిందూర్' భారత్ చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ గా నిలిచింది. మన సాయుధ దళాలు వందల కిలోమీటర్లు శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయి, పాకిస్తాన్ సైన్యం కూడా ఊహించని ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది: ఉగ్రవాదం ద్వారా పరోక్ష యుద్ధాల శకం ముగిసింది. ఇకనుంచి మనం కేవలం రక్షించుకోవడమే కాదు- ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే, మద్దతు ఇచ్చే వారి గుండెల్లో వణుకు పుట్టించి, వారికి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితిని తెస్తాం. ప్రతి భారతీయ పౌరుడు ఈ రోజు 140 కోట్ల మంది భారతీయుల ఐక్య గళంగా ప్రకటిస్తున్నారు - "మీరు బుల్లెట్ పేల్చేట్లయితే, మా ప్రతీకారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి."
మిత్రులారా,
ఆపరేషన్ సిందూర్ మన మహిళల శక్తికి ఒక బలమైన చిహ్నంగా మారింది. ఈ ఆపరేషన్ లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పోషించిన ముఖ్యమైన పాత్ర గురించి మనందరికీ తెలుసు. జమ్మూ నుంచి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల వరకు మన బీఎస్ఎఫ్ మహిళలు పెద్ద సంఖ్యలో ముందు వరుసలో నిలబడి ధైర్యంగా దేశాన్ని కాపాడుతున్నారు. సరిహద్దు ఆవల కాల్పులకు వారు ధీటుగా బదులిచ్చారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి శత్రు శిబిరాలను ధ్వంసం చేయడం వరకు బీఎస్ఎఫ్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించింది.
మిత్రులారా,
దేశరక్షణలో భారత పుత్రికల అసాధారణ సామర్థ్యాలను నేడు ప్రపంచం చూస్తోంది. ఈ రంగంలో వారికి సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం గత దశాబ్దకాలంగా అనేక చర్యలు చేపట్టింది. పాఠశాలల నుంచి యుద్ధభూమి వరకు దేశం ఇప్పుడు తన కుమార్తెల ధైర్యసాహసాలు, శక్తిపై అపూర్వమైన నమ్మకాన్ని ఉంచింది. తొలిసారిగా మన సాయుధ దళాలు బాలికల కోసం సైనిక పాఠశాలల తలుపులు తెరిచాయి. 2014కు ముందు నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ)లో కేవలం 25 శాతం మంది మాత్రమే బాలికలు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 50 శాతానికి చేరువవుతోంది. నిన్న మరో చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. మీరు వార్తాపత్రికల్లో చూసి ఉంటారు... నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) నుంచి తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో మహిళలు ముందు ఉంటున్నారు. యుద్ధ విమానాల నుంచి యుద్ధనౌక 'ఐఎన్ఎస్ విక్రాంత్' వరకు మహిళా అధికారులు ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు.
మిత్రులారా,
నౌకాదళానికి చెందిన వీర పుత్రికల శౌర్యానికి సంబంధించిన ఒక తాజా, స్ఫూర్తిదాయక కథనం మనకుంది. నేను ‘ నావికా సాగర్ పరిక్రమ’ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. భారతీయ నౌకాదళానికి చెందిన ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారులు దాదాపు 250 రోజులు సముద్రయానం చేసి ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. ఇంజిన్ తో కాకుండా గాలితో నడిచే పడవలో ఈ అద్భుతమైన ప్రయాణం పూర్తయింది. ఒక్కసారి ఊహించండి- సముద్రంలో 250 రోజులు, భూమిని చూడకుండా వారాలు, భీకర తుఫానులు, అల్లకల్లోల వాతావరణాన్ని ఎదుర్కొంటూ వారాలు గడిచాయి. అయినప్పటికీ, వారు ప్రతి సవాలును అధిగమించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని జయించే శక్తి భారత ఆడబిడ్డలకు ఉందనడానికి ఇదే నిదర్శనం.
మిత్రులారా,
నక్సలైట్ల తిరుగుబాటును ఎదుర్కోవడంలో అయినా, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అయినా నేడు మన ఆడబిడ్డలు దేశ రక్షణలో ఉక్కు కవచంగా మారుతున్నారు. అహల్యా దేవి పుట్టిన ఈ పవిత్ర భూమి నుంచి నేను మరోసారి దేశ మహిళలకు నా గౌరవప్రదమైన నమస్కారాలను తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
దేవి అహల్య అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా, మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారు. నేటి భారతదేశం కూడా అభివృద్ధి, వారసత్వం అనే రెండు మార్గాల్లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన ఎంత వేగంగా జరుగుతోందో చెప్పడానికి నేటి కార్యక్రమం నిదర్శనం. మధ్యప్రదేశ్ లో తొలి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. పరిశుభ్రతకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఇండోర్ ఇప్పుడు మెట్రో కనెక్టివిటీకి కూడా ప్రసిద్ధి చెందింది. భోపాల్ లోనూ మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా రైల్వే రంగంలో విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే రత్లాం-నగ్డా మార్గాన్ని నాలుగు లైన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల మరిన్ని రైళ్లు నడపడంతో పాటు ఈ ప్రాంతంలో రద్దీ తగ్గుతుంది. ఇండోర్-మన్మాడ్ రైల్వే ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మిత్రులారా,
మధ్యప్రదేశ్ లోని దతియా, సాత్నాలను ఇప్పుడు విమాన ప్రయాణ వ్యవస్థలో అనుసంధానం చేశారు. ఈ రెండు విమానాశ్రయాలు బుందేల్ ఖండ్, వింధ్య ప్రాంతాల్లో విమాన కనెక్టివిటీని గణనీయంగా పెంచుతాయి. ఇది మాతా పితాంబర, మాతా శారదా దేవి, చిత్రకూట్ ధామ్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
మిత్రులారా,
భారతదేశం తన చరిత్రలో ఒక కీలక దశలో నిలిచింది. ఇది మన భద్రతను బలోపేతం చేయాల్సిన, మన సామర్థ్యాలను విస్తరించాల్సిన, ప్రతి స్థాయిలో మన సాంస్కృతిక ఐక్యతను కాపాడాల్సిన సమయం. ఈ లక్ష్యాలను సాధించడంలో మన మహిళల, మన తల్లుల, అక్కచెల్లెళ్ల, కుమార్తెల పాత్ర అమూల్యమైనది. లోకమాత దేవి అహిల్యాబాయి నుంచి స్ఫూర్తి పొందాం. రాణి లక్ష్మీబాయి, రాణి దుర్గావతి, రాణి కమలాపతి, అవంతిబాయి లోధి, కిట్టూరుకు చెందిన రాణి చెన్నమ్మ, రాణి గైదిన్, వేలు నాచియార్, సావిత్రిబాయి ఫూలే పేర్లు మన హృదయాలను ఎంతో గర్వంతో నింపుతాయి. లోకమాత అహిల్యాబాయి 300వ జయంతి రాబోయే తరాలకు మరింత దృఢమైన, సుస్థిర భారత్ నిర్మాణం దిశగా మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఈ సంకల్పంతో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
ఇప్పుడు త్రివర్ణ పతాకాన్ని పైకెత్తి నాతో కలిసి చెప్పండి-
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
***
(Release ID: 2133230)