ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
62 వేల కోట్లకు పైగా విలువైన భారీ మౌలికవసతుల ప్రాజెక్టుల సమీక్ష
జాప్యం లేకుండా సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశం
సామర్థ్యం.. జవాబుదారీతనానికీ ప్రాధాన్యమివ్వాలని కోరిన ప్రధానమంత్రి
అర్హత గల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నింటినీ తప్పనిసరిగా రెరాలో నమోదు చేయాలని
రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన ప్రధానమంత్రి
గృహ కొనుగోలుదారులకు న్యాయం జరిగేలా ఫిర్యాదులకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించిన ప్రధానమంత్రి
దేశంలో సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన అత్యుత్తమ పద్ధతులను పరిశీలించిన ప్రధానమంత్రి
Posted On:
28 MAY 2025 9:10PM by PIB Hyderabad
క్రియాశీలక పాలన, నిర్ణీత సమయానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టులను అమలు చేసే లక్ష్యంగా ఏర్పడిన ఐసీటీ ఆధారిత బహుముఖీన వేదిక- ప్రగతి. ఈరోజు జరిగిన ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రోడ్డు రవాణా, విద్యుత్, జలవనరుల రంగాలకు చెందిన రూ.62,000 కోట్లకు పైగా విలువైన మూడు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ సమావేశంలో ప్రధానమంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, వీటి అమలులో ఉన్న అవరోధాలను అధిగమించడానికి, వీటిని సకాలంలో పూర్తి చేయడానికి సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రాజెక్టుల అమల్లోని జాప్యం వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ.. ఇటువంటి అవరోధాలు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడమే కాకుండా, పౌరులకు అవసరమైన సేవలు, మౌలిక సదుపాయాలను కూడా దూరం చేస్తాయని ఆయన పునరుద్ఘాటించారు. సామాజిక-ఆర్థిక ఫలితాలను మెరుగుపరిచేందుకు సకాలంలో సేవలు అందించడం చాలా కీలకమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి, సంబంధిత వ్యక్తులంతా సామర్థ్యం.. జవాబుదారీతనానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల సమీక్ష సందర్భంగా, గృహ కొనుగోలుదారులకు న్యాయం జరిగేందుకు వారి ఫిర్యాదులకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అర్హత గల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నింటినీ తప్పనిసరిగా రెరాలో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. గృహ మార్కెట్పై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి రెరా నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం చాలా కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
దేశంలో సెమీకండక్టర్ రంగ అభివృద్ధికి సంబంధించి కీలకమైన అత్యుత్తమ పద్ధతులను ప్రధానమంత్రి పరిశీలించారు. ఇటువంటి కార్యక్రమాలు ఇతరులకు మార్గదర్శక నమూనాగా ఉపయోగపడతాయన్న ప్రధానమంత్రి.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేసేందుకు ప్రేరణనిస్తాయనీ, తద్వారా జాతీయ సెమీకండక్టర్ మిషన్ బలోపేతం కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ప్రగతి సమావేశాల వరకు, దాదాపుగా 20.64 లక్షల కోట్ల రూపాయల విలువైన 373 ప్రాజెక్టులను సమీక్షించారు.
***
(Release ID: 2132213)
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada