ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
చక్కెర సీజన్ 2025-26కు చెరకు రైతులకు చక్కెర మిల్లులు చెల్లించాల్సిన న్యాయబద్ధమైన, లాభదాయకమైన ధరను ఆమోదించిన క్యాబినెట్
చెరకు రైతులకు క్వింటాలుకు రూ. 355 న్యాయబద్ధమైన, లాభదాయకమైన ధరగా ఆమోదం
5 కోట్ల మంది చెరకు రైతులు, వారిపై ఆధాపడినవారు, చక్కెర మిల్లుల్లో పనిచేస్తున్న 5 లక్షల మంది కార్మికులు, ఇతర అనుబంధ కార్యకలాపాల్లో ఉపాధి పొందుతున్న వారికి ఈ నిర్ణయంతో లబ్ధి
Posted On:
30 APR 2025 4:09PM by PIB Hyderabad
చెరకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. 2025-26 (అక్టోబరు - సెప్టెంబరు) చక్కెర సీజనుకు సంబంధించి న్యాయబద్ధమైన, లాభదాయకమైన ధర (ఎఫ్ఆర్పీ)ను 10.25 ప్రాథమిక రీకవరీ రేటుకు క్వింటాలుకు రూ. 355గా ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రీకవరీలో 10.25% మించి ఎక్కువగా ఉన్న ప్రతీ 0.1% పెరుగుదలకు రూ. 3.46 ప్రీమియాన్ని రైతులకు అందిస్తారు. రీకవరీ అంతకన్నా తక్కువగా ఉంటే ప్రతీ 0.1% తగ్గుదలకు ఎఫ్ఆర్పీలో రూ. 3.46 తగ్గిస్తారు.
అయితే, చెరకు రైతుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో.. రీకవరీ రేటు 9.5% కన్నా తక్కువ ఉంటే చక్కెర మిల్లుల్లో ఎలాంటి కోతా ఉండబోదని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రైతులకు 2025-26 చక్కెర సీజనులో చెరకుకు క్వింటాలుకు రూ.329.05 చెల్లిస్తారు.
2025-26 చక్కెర సీజన్లో చెరకు ఉత్పత్తి ఖర్చు (A2 +FL) క్వింటాలుకు రూ.173గా ఉంది. 10.25% రీకవరీ రేటుకు క్వింటాలుకు రూ. 355 న్యాయబద్ధమైన, లాభదాయకమైన ధర (ఎఫ్ఆర్పీ). ఇది ఉత్పత్తి వ్యయం కన్నా 105.2% ఎక్కువ. ప్రస్తుత 2024-25 చక్కెర సీజనులోని ధర కన్నా 2025-26 షుగర్ సీజనుకు నిర్ణయించిన ఈ ఎఫ్ఆర్పీ 4.41% ఎక్కువ.
2025-26 చక్కెర సీజనులో (2025 అక్టోబరు 1 నుంచి మొదలయ్యే) చక్కెర మిల్లులు రైతుల నుంచి చెరకు కొనుగోలు చేయడానికి కొత్తగా ఆమోదం పొందిన ఈ న్యాయబద్ధమైన లాభదాయకమైన ధర (ఎఫ్ఆర్పీ) వర్తిస్తుంది. చక్కెర రంగం ఒక ముఖ్యమైన వ్యవసాయ ఆధారిత రంగం. దాదాపు 5 కోట్ల మంది చెరకు రైతులూ, వారిపై ఆధారపడిన వారు, చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న 5 లక్షల మంది కార్మికుల జీవనోపాధిని ఇది ప్రభావితం చేస్తుంది. వారితోపాటు వ్యవసాయ కార్మికులు, రవాణా రంగంలో ఉపాధి పొందుతున్న వారు సహా వివిధ అనుబంధ కార్యకలాపాల్లో పనిచేసే వారి ఉపాధి అవకాశాలు కూడా ఈ రంగంతో ముడిపడి ఉన్నాయి.
నేపథ్యం:
వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగాను, అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలూ సంబంధిత ఇతర పక్షాలతో సంప్రదింపుల ద్వారాను న్యాయబద్ధమైన, లాభదాయకమైన ధర (ఎఫ్ఆర్పీ)ని నిర్ణయించారు.
గత 2023-24 చక్కెర సీజన్లో చెరకు రైతులకు రూ. 1,11,782 కోట్ల చెరకు బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ 28 నాటికి దాదాపు రూ.1,11,703 కోట్లు చెల్లించారు. ఆ విధంగా 99.92% చెరకు బకాయిల చెల్లింపులు పూర్తయ్యాయి. ప్రస్తుత 2024-25 షుగర్ సీజనులో రూ. 97,270 కోట్ల చెరకు బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ 28 నాటికి దాదాపు రూ. 85,094 కోట్ల చెరకు బకాయిలను, అంటే 87 శాతం రైతులకు చెల్లించారు.
***
(Release ID: 2125681)
Read this release in:
Assamese
,
Malayalam
,
Tamil
,
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Odia