ప్రధాన మంత్రి కార్యాలయం
సౌదీ అరేబియాలో ప్రధాని అధికారిక పర్యటన ముగింపు సందర్భంగా సంయుక్త ప్రకటన
Posted On:
23 APR 2025 12:44PM by PIB Hyderabad
‘‘చరిత్రాత్మక స్నేహం; పురోగతి దిశగా భాగస్వామ్యం”
గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆహ్వానం మేరకు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 22న ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో పర్యటించడం ఇది మూడోసారి. గతంలో 2023 సెప్టెంబరులో జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతోపాటు భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి మొదటి సమావేశానికి సహాధ్యక్షత వహించడం కోసం గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ చరిత్రాత్మక భారత పర్యటన చేపట్టారు.
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ జెడ్డాలోని అల్ సలాం ప్యాలెస్లో స్వాగతం పలికారు. అధికారిక చర్చల సందర్భంగా భారత్, సౌదీ అరేబియా మధ్య బలమైన చరిత్రాత్మక స్నేహ బంధాలను వారు గుర్తు చేసుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య బలమైన సంబంధాలున్నాయి. నమ్మకం, సద్భావన ఆధారంగా ఇరు దేశాల మధ్య సన్నిహితమైన ప్రజా సంబంధాలున్నాయి. రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, వ్యవసాయం, సంస్కృతి, ఆరోగ్యం, విద్య, ప్రజా సంబంధాలు సహా వివిధ రంగాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలమైన పునాది ఏర్పడిందని ఇరు పక్షాలు పేర్కొన్నాయి. ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రస్తుత ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి.
వరల్డ్ ఎక్స్పో- 2030, ఫిఫా వరల్డ్ కప్- 2034 బిడ్లను సౌదీ అరేబియా దక్కించుకున్న నేపథ్యంలో గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్కు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
భారత్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు నిర్మాణాత్మకంగా చర్చించారు. భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్పీసీ) రెండో సమావేశానికి ఇరువురు నేతలు సహాధ్యక్షత వహించారు. 2023 సెప్టెంబరులో చివరి సమావేశం నుంచి వ్యూహాత్మక భాగస్వామ్య మండలి పురోగతిని ఇరు పక్షాలు సమీక్షించాయి. వివిధ రంగాల్లో రెండు మంత్రివర్గ కమిటీలు- (ఎ) రాజకీయ, భద్రత, సామాజిక, సాంస్కృతిక సహకార కమిటీ; దాని ఉపకమిటీలు, (బి) ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల కమిటీ; దాని సంయుక్త కార్యనిర్వాహక బృందాల కృషి, సాధించిన ఫలితాలపై ఇద్దరు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా.. రక్షణ సహకారం, పర్యాటక- సాంస్కృతిక సహకారంపై మంత్రివర్గ కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి మంత్రివర్గ కమిటీల సంఖ్యను నాలుగుకు పెంచడాన్ని సహాధ్యక్షులు స్వాగతించారు. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి పర్యటనలు ఇరు వైపులా నమ్మకాన్నీ పరస్పర అవగాహననూ పెంపొందించాయని వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. సమావేశం ముగింపు సందర్భంగా భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి రెండో సమావేశంలో చర్చించిన అంశాలపై వారిద్దరూ సంతకం చేశారు.
సౌదీ అరేబియాలో నివసిస్తున్న దాదాపు 27 లక్షల మంది భారతీయుల సంక్షేమానికి అండగా నిలుస్తున్నందుకు గాను భారత పక్షం సౌదీ పక్షానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇరుదేశాల మధ్య బలమైన ప్రజా బంధాలు, అపారమైన సద్భావనను ఇది ప్రతిబింబిస్తుంది. 2024లో హజ్ యాత్రను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో సౌదీ అరేబియాను భారత్ అభినందించింది. భారతీయ హజ్, ఉమ్రా యాత్రికులకు సౌకర్యాల కల్పనలోనూ ఇరుదేశాల మధ్య అద్భుత సమన్వయంపై ప్రశంసించింది.
ఇటీవలి సంవత్సరాల్లో భారత్, సౌదీ అరేబియా మధ్య ఆర్థిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు వృద్ధి చెందడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి. విజన్ 2030 లక్ష్యాల్లో సాధించిన పురోగతిపై సౌదీ బృందాన్ని భారత బృందం అభినందించింది. భారత సుస్థిర ఆర్థికాభివృద్ధిని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సౌదీ ప్రశంసించింది. జాతీయ లక్ష్యాలను నెరవేర్చడం, ఉమ్మడి శ్రేయస్సు, ఉమ్మడి ప్రయోజనాలున్న రంగాలలో కలిసి పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఇరు దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రోత్సహించడం కోసం 2024లో ఏర్పాటైన ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ (హెచ్ఎల్టీఎఫ్) కింద జరిగిన చర్చల్లో సాధించిన పురోగతిపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఆర్థిక సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, టెలికమ్యూనికేషన్స్, ఔషధ రంగం, తయారీ, ఆరోగ్యం వంటి వివిధ రంగాల్లో భారత్లో పెట్టుబడుల దిశగా సౌదీ అరేబియా విస్తృతంగా కృషిచేస్తున్న నేపథ్యంలో.. ఆ పెట్టుబడి ప్రవాహాల వేగాన్ని ప్రోత్సహించే వివిధ రంగాలకు సంబంధించి ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ ఒక అవగాహనకు వచ్చింది. రెండు చమురు శుద్ధి కర్మాగారాలను నెలకొల్పడానికి సహకరించేలా- ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ వేదికగా జరిగిన ఒప్పందాన్ని వారు గుర్తించారు. పన్నుల విధింపు వంటి రంగాల్లో ఈ టాస్క్ఫోర్స్ సాధించిన పురోగతి.. భవిష్యత్తులో సహకారాన్ని మరింత విస్తరించే దిశగా ముఖ్యమైన ముందడుగు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆకాంక్షను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (పీఐఎఫ్) వద్ద ఇండియా డెస్క్ను ప్రారంభించడాన్ని భారత్ అభినందించింది. పీఐఎఫ్ ద్వారా పెట్టుబడి సదుపాయానికి ఇది కేంద్ర బిందువుగా ఉంటుంది. పరస్పర ఆర్థిక వృద్ధి, సహకారం దిశగా పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ.. భారత్, సౌదీ అరేబియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడం కోసం ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ మరింత విస్తృతంగా కృషిచేస్తోందని వారు అభిప్రాయపడ్డారు.
వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక కీలక స్తంభంగా ఉన్న రక్షణ సంబంధాలను ఇప్పటితో పోలిస్తే మరింత విస్తరించుకోవడాన్ని ఉభయపక్షాలు ప్రశంసించాయి. వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఆధీనంలో పనిచేసేలా రక్షణ సహకారం అంశంపై ఒక మంత్రుల స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతించాయి. ప్రాంత భద్రతను, స్థిరతను దృష్టిలో పెట్టుకొని మొదటిసారి పదాతి దళాల విన్యాసం ‘సదా తన్సీక్’ను, నౌకాదళ విన్యాసమైన ‘అల్ మొహెద్ అల్ హిందీ’ని రెండు సార్లు నిర్వహించడం, అనేక ఉన్న స్థాయి పర్యటనలతోపాటు శిక్షణ కార్యక్రమాలను రెండు వైపులా నిర్వహించడం వంటి అనేక ‘ప్రథమ ఘటనలు’ సహా తమ సంయుక్త రక్షణ సహకారాన్ని పెంచుకొంటూ ముందుకు సాగుతుండడం పట్ల ఇరుపక్షాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. 2024 సెప్టెంబరులో రియాద్లో నిర్వహించిన రక్షణ సహకారం అంశంపై సంయుక్త సంఘం ఆరో సమావేశం అందించిన ఫలితాలను కూడా రెండు పక్షాలూ స్వాగతించాయి. ఈ ఫలితాల్లో... మూడు సేనల మధ్య సిబ్బంది స్థాయి చర్చలు మొదలవడాన్ని ప్రస్తావించాయి. ఇరుపక్షాలూ రక్షణ పరిశ్రమ సంబంధిత సహకారాన్ని ఇంకా పెంచాలని కూడా సమ్మతించాయి.
భద్రత రంగాలలో లభిస్తున్న నిరంతర సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇరు పక్షాలు మెరుగైన భద్రత, స్థిరత్వంల కోసం ఈ సహకారం ఎంతైనా అవసరమని ప్రధానంగా పేర్కొన్నాయి. రెండు పక్షాలూ సైబర్ భద్రత, నౌకావాణిజ్య భద్రత, అంతర్జాతీయ నేరగాళ్లతోనూ, మత్తుపదార్థాల చేరవేతదారులతోనూ, మందుల అక్రమ రవాణాదారులతోనూ ఎదురొడ్డి పోరాడడంలో పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని కూడా స్పష్టం చేశాయి.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం నాటి (2025 ఏప్రిల్ 22) ఉగ్రవాద దాడిని ఇరుపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో నిరపరాధ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా, ఉభయపక్షాలూ ఉగ్రవాదాన్ని, హింస ప్రధానమైన తీవ్రవాదాన్ని వాటి అన్ని రూపాలనూ గర్హించాయి. ఇది మానవజాతికి ఎదురవుతున్న అత్యంత భీకర బెదరింపుల్లో ఒకటిగా నిలిచిపోతుందని పేర్కొన్నాయి. ఏ కారణంగానైనా సరే, ఏ ఉగ్రవాద చేష్టకు గానీ ఎలాంటి ఔచిత్యం ఉండనే ఉండబోదు అనే మాటలపై ఇరుపక్షాలూ తమ సమ్మతిని కరాఖండీగా వ్యక్తం చేశాయి. ఉగ్రవాదాన్ని ఫలానా జాతికి, ధర్మానికి, లేదా సంస్కృతికి జోడించేందుకు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా కొట్టిపారేశాయి. ఉగ్రవాద చర్యలపై, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక అండదండలు అందించడంపై పోరాడడంలో చక్కని సహకారం ఉంటోందంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, ఇతర దేశాల మీదకు ఉగ్రవాదాన్ని ఉసిగొలిపే కుతంత్రాలను తోసిపుచ్చాల్సిందిగా అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ఎక్కడ ఉగ్రవాదం ఆనవాళ్లు ఉన్నా వాటిని ఏరిపారేయాల్సిందిగాను, ఉగ్రవాదానికి తెగబడే ముష్కరులను తక్షణం చట్టపరంగా శిక్షించాల్సిందిగాను కోరారు. ఇతర దేశాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి క్షిపణులు, డ్రోన్లు సహా ఆయుధాలను చేజిక్కించుకొనే అవకాశాల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇరుపక్షాలు స్పష్టీకరించాయి.
ఆరోగ్య రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న సహకారంతోపాటు వర్తమాన కాలపు స్వాస్థ్య సవాళ్లు, భవిష్యత్తులో ఎదురు కాగల ఆరోగ్య సంబంధిత సవాళ్లకు ఎదురొడ్డి పోరాడే ప్రయత్నాలపైన కూడా ఇరు పక్షాలూ చర్చించాయి. ఈ సందర్భంగా, రెండు దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారానికి గాను ఎంఓయూపై సంతకాలు కావడాన్ని ఉభయ పక్షాలు స్వాగతించాయి. సూక్ష్మజీవి నాశక నిరోధకత అంశంపై మంత్రుల స్థాయి నాలుగో సమావేశాలను సౌదీ అరేబియా 2024 నవంబరులో ఫలప్రదంగా నిర్వహించినందుకు భారతీయ పక్షం సౌదీకి అభినందనలు తెలిపింది. సౌదీలో భారతీయ మందుల ధరల ఖరారు, ఫాస్ట్ ట్రాక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సౌదీ ఫూడ్ - డ్రగ్ అథారిటీ చేపట్టిన చర్యలను కూడా భారతీయ పక్షం స్వాగతించింది.
వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారం అనే అంశంపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)కు, సౌదీ ఫూడ్ అండ్ డ్రగ్ అథారిటీకి మధ్య ఎంఓయూను మరో 5 సంవత్సరాలు పొడిగించడాన్ని సైతం ఉభయ పక్షాలు స్వాగతించాయి.
కృత్రిమ మేధ, సైబర్ భద్రత, సెమీకండక్టర్లు వంటి నూతన రంగాలు, ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న రంగాలు సహా టెక్నాలజీలో సహకారానికి ప్రాధాన్యాన్ని ఇవ్వవలసి ఉందని ఇరుపక్షాలు ప్రధానంగా పేర్కొన్నాయి. డిజిటల్ పాలనకు పెద్దపీట వేయాల్సి ఉందని గుర్తెరుగుతూ, ఉభయపక్షాలు ఈ రంగంలో సహకరించుకోవడానికి ఉన్న అవకాశాల్ని అన్వేషించాలని అంగీకరించాయి. నియంత్రణ, డిజిటల్ రంగాల్లో సహకరించుకోవడానికి భారత టెలికామ్ నియంత్రణ ప్రాధికరణ (ట్రాయ్)కి, సౌదీ అరేబియాకు చెందిన కమ్యూనికేషన్స్, స్పేస్, టెక్నాలజీ కమిషన్కు మధ్య ఎంఓయూపై సంతకాలు పూర్తి అయినందుకు కూడా ఈ రెండు పక్షాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.
ఈ పర్యటన సమయంలో కుదుర్చుకున్న అంతరిక్ష రంగ ఎంఓయూ రోదసి రంగంలో ఇప్పటి కన్నా ఎక్కువ సహకారానికి బాట వేస్తుందని ఉభయపక్షాలు పేర్కొన్నాయి. ఈ తరహా సహకారంలో వాహక నౌకలను, అంతరిక్షయానాన్ని, భూతల వ్యవస్థలను ఉపయోగించుకోవడం, అంతరిక్ష సాంకేతికతను వినియోగించుకోవడం, పరిశోధన-అభివృద్ధి, విద్య రంగ సహకారం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బాసటగా నిలవడం వంటివి భాగంగా ఉంటాయని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.
వారసత్వం, చలనచిత్రాలు, సాహిత్యం, ప్రదర్శన, దృశ్య కళలు వంటి ముఖ్య రంగాల్లో క్రియాశీల అనుబంధం ఏర్పడడంతో సౌదీ అరేబియా, భారత్ల మధ్య సాంస్కృతిక సహకారం వర్ధిల్లుతుండడాన్ని ఇరుపక్షాలు పరిగణన లోకి తీసుకున్నాయి. వ్యూహాత్మక భాగస్వామ్య మండలిలో భాగంగా పర్యటన, సాంస్కృతిక సహకారం అంశాలపై ఒక మంత్రుల స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయడంతో ఈ భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా మరో అడుగు ముందుకు వేసినట్లయింది.
సామర్థ్యాలను పెంచే కార్యక్రమాలను అమలుచేయడం, సుస్థిర పర్యటన.. ఈ మార్గాలలో పర్యటన రంగంలో సహకారాన్ని ఇప్పటి కన్నా పెంచుకోవాలని కూడా ఉభయపక్షాలు సమ్మతించాయి. ప్రసార మాధ్యమాలు, వినోదం, క్రీడా రంగాల్లో వివిధ అవకాశాలను కల్పించడంపైన కూడా ఈ పక్షాలు దృష్టి సారించాయి. రెండు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాలు ఈ అంశంలో దన్నుగా నిలిచాయని అభిప్రాయపడ్డాయి.
ఎరువుల వాణిజ్యం సహా వ్యవసాయం, ఆహార భద్రత... ఈ రంగాల్లో రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా సహకారం కొనసాగుతుండడాన్ని ఇరుపక్షాలు హర్షించాయి. ఈ రంగంలో దీర్ఘకాల వ్యూహాత్మక సహకారాన్ని ఏర్పరుచుకొనేందుకు సరఫరాలకు భద్రత, పరస్పర పెట్టుబడులు, సంయుక్త ప్రాజెక్టుల విషయాల్లో దీర్ఘకాలిక ఒప్పందాల కోసం కృషిచేయాలని అంగీకరించాయి.
రెండు దేశాల మధ్య విద్యారంగ, విజ్ఞానశాస్త్ర రంగ సహకారం విస్తరిస్తుండడాన్ని ఇరుపక్షాలు మెచ్చుకొన్నాయి. ఈ రెండు రంగాల్లో పురోగతి నవకల్పన, సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలను అమలుచేయడం, దీర్ఘకాలం మనగలిగే అభివృద్ధి సాధన... వీటిని ప్రోత్సహించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఉభయపక్షాలు అభిప్రాయపడ్డాయి. అగ్రగామి భారతీయ విశ్వవిద్యాలయాలకు సౌదీ అరేబియాలో చక్కని అవకాశాలున్నాయంటూ సౌదీ పక్షం ఆహ్వానం పలికింది. కార్మిక శక్తి, మానవ వనరుల పరంగా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి, పరస్పర సహకారానికి గల అవకాశాలను గుర్తించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ఇరుపక్షాలు వక్కాణించాయి.
భారత్-మధ్య ప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ (ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్) సిద్ధాంతాలకు సంబంధించి 2023 సెప్టెంబరులో ఒక ఎంఓయూపై ఇతర దేశాలతో కలిసి సంతకాలు చేసిన సంగతిని ఉభయపక్షాలు గుర్తు తెచ్చుకొన్నాయి. సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని ప్రిన్స్ శ్రీ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ భారత్లో ఆధికారికంగా పర్యటించిన సందర్భంగా ఈ ఎంఓయూపై సంతకాలయ్యాయి. ఈ నడవా ప్రతిపాదనలో పేర్కొన్న ప్రకారం సంధానాన్ని సాకారం చేయడానికి కలిసి పనిచేయాలన్న పరస్పర నిబద్ధతను రెండు పక్షాలు వ్యక్తం చేశాయి. దీంతోపాటు వస్తువులు, సేవల రాకపోకలను పెంచడానికి రైలుమార్గాలు, పోర్టు లింకేజీలు సహా అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం కోసం, ఆసక్తిదారుల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డేటాను ఉపయోగించుకోవడాన్నీ, అలాగే విద్యుత్తు గ్రిడ్ల అంతరసంధానాన్నీ (ఇంటర్కనెక్టివిటీ) విస్తృతపరచడం కోసం సైతం కలిసి పనిచేయాలని అంగీకరించాయి.
ఈ విషయంలో, 2023 అక్టోబరులో ఎలక్ట్రికల్ ఇంటర్ కనెక్షన్లు, స్వచ్ఛ-హరిత హైడ్రోజన్, సరఫరా వ్యవస్థల ఏర్పాటుపై కుదిరిన ఒక ఒప్పందం (ఎంఓయూ)లో భాగంగా పనులు పురోగమిస్తుండడాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి. రెండు దేశాల మధ్య సరకు రవాణా నౌకల కంపెనీల్లో వృద్ధి చోటుచేసుకొన్నందుకు ఉభయపక్షాలు సంతోషాన్ని వ్యక్తంచేశాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించే యత్నాలను ప్రోత్సహించాడానికి జీ20, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థలు, వేదికల్లో ఇరు దేశాల సహకార, సమన్వయాలను ఇప్పటి కన్నా పెంచుకోవడానికి ప్రాధాన్యాన్నివ్వాలని ఉభయ పక్షాలు స్పష్టం చేశాయి.
కామన్ ఫ్రేంవర్క్ ఫర్ డెట్ ట్రీట్మెంట్ బియాండ్ ది డెట్ సర్వీస్ సస్పెన్షన్ ఇనీషియేటివ్ (డీఎస్ఎస్ఐ) పరిధిలో ప్రస్తుతం కొనసాగిస్తున్న సహకారాన్ని వారు కొనియాడారు. డీఎస్ఎస్ఐకి 2020లో రియాధ్ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు జి20 నేతలు తమ ఆమోదాన్ని తెలిపారు. అర్హత గల దేశాల రుణ సమస్య పరిష్కారానికి ఆధికారిక రుణదాతలకూ (అభివృద్ధి చెందుతున్న దేశాల రుణదాతలతోపాటు ప్యారిస్ క్లబ్ రుణదాతలు), ప్రయివేటు రంగానికీ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే ఒక ప్రధాన, అత్యంత సమగ్ర వేదికగా కామన్ ఫ్రేంవర్క్ అమలును వేగవంతం చేయాల్సిందేనని వారు స్పష్టంచేశారు.
ఎమెన్లో సంక్షోభానికి ఒక సమగ్ర రాజకీయ పరిష్కారాన్ని సాధించడమే పరమావధిగా కొనసాగుతున్న అంతర్జాతీయ, ప్రాంతీయ ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతును ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి. ఎమెన్లో వైరి పక్షాల మధ్య చర్చలకు రంగం సిద్ధం చేయాలనే ధ్యేయంతో సౌదీ చేపడుతున్న అనేక కార్యక్రమాలనూ, ఎమెన్లోని అన్ని ప్రాంతాలకు మానవీయ సహాయం అందాలని కోరుకుంటూ సౌదీ అందిస్తున్న సౌలభ్యాలను
భారత అధికారులు ప్రశంసించారు. ఎమెన్కు మానవతాపూర్వక సహాయాన్ని అందించడంలో భారత్ కృషిని సౌదీ అధికారులు కూడా అభినందించారు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యూఎన్సీఎల్ఓఎస్)కు అనుగుణంగా జలమార్గాల్లో భద్రతతోపాటు నౌకా రవాణా స్వేచ్ఛను పరిరక్షించడమే ప్రధానంగా అనుసరించాల్సిన పద్ధతుల్లో సహకారానికి పెద్దపీట వేయాల్సిందేనని రెండు పక్షాలూ అంగీకరించాయి.
పర్యటన కాలంలో ఈ కింద పేర్కొన్న ఎంఓయూలపై సంతకాలయ్యాయి:
• శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిన అంతరిక్ష కార్యక్రమాల్లో పరస్పర సహకారానికి బాట వేస్తూ భారత అంతరిక్ష విభాగం, సౌదీ స్పేస్ ఏజెన్సీ ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
• ఆరోగ్య రంగంలో సహకారానికి భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు, సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
• ఇన్వార్డ్ ఫారిన్ సర్ఫేస్ పార్సిల్ సేవను మొదలుపెట్టడానికి భారతదేశ తపాలా విభాగం, సౌదీ పోస్ట్ కార్పొరేషన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
• డోపింగ్ నిరోధం, నివారణ రంగంలో సహకరించుకోవడానికి భారత జాతీయ యాంటి-డోపింగ్ ఏజెన్సీ (ఎన్ఏడీఏ), సౌదీ అరేబియా యాంటి-డోపింగ్ కమిటీ (ఎస్ఏఏడీసీ)లు ఒక ఎంఓయూను కుదుర్చుకున్నాయి.
వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తరువాతి సమావేశాన్ని పరస్పరం అంగీకారం కుదిరిన వేళ నిర్వహించుకొందామని ఇరుపక్షాలు సమ్మతించాయి. ఉభయ దేశాలు తమ తమ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్న క్రమంలో, వేర్వేరు రంగాలలో సమాచార ప్రసారం, సమన్వయంలతోపాటు సహకారాన్ని సైతం కొనసాగించుదామని నిర్ణయించాయి.
పర్యటన ముగింపు సందర్భంగా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తనకు స్నేహపూర్వకంగా స్వాగతం పలికినందుకూ, తనకే కాక తన వెంట వచ్చిన ప్రతినిధి వర్గం పట్ల కూడా పెద్దమనసుతో అతిథి మర్యాదలు చేసినందుకూ యువరాజు, ప్రధాని, ప్రిన్స్ శ్రీ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రిన్స్ శ్రీ మొహమ్మద్ బిన్ సల్మాన్ యే సౌదీ యువరాజు, ప్రధానిగా కూడా ఉన్నారు. సౌదీ అరేబియా ప్రజానీకం ప్రగతిపథంలో సాగాలనీ, సమృద్ధితో కళకళలాడాలంటూ ప్రధానమంత్రి శ్రీ మోదీ తన శుభాకాంక్షల్ని వ్యక్తం చేశారు. ప్రిన్స్ తనవంతుగా, ప్రధానమంత్రితోపాటు భారతదేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత పురోగతినీ, సమృద్ధినీ సాధించాలని అభిలషించారు.
***
(Release ID: 2125321)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam