సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సృజనాత్మకత.. మీడియా.. సాంకేతికతల సమ్మేళనంతో ప్రపంచ మీడియా రంగం రూపాంతరీకరణ: అశ్వినీ వైష్ణవ్
· “అత్యున్నత విలువలతో కథన సృష్టి దిశగా సృష్టికర్తలకు ‘వేవ్స్’ ఉత్తమ వేదిక కాగలదు” · మీడియా-వినోద పరిశ్రమలో చర్చలు.. సహకారం.. ఆవిష్కరణలను ప్రోత్సహించగల కీలక వేదిక ‘వేవ్స్-2025: కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ · సాంకేతిక ప్రగతి.. సామాజిక మార్పులో మీడియా పరిణామశీల పాత్రను స్పష్టం చేసే ఉద్యమం ‘వేవ్స్-2025’: మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ · భారత సృజనాత్మక రంగంతో ప్రపంచ మీడియా సంస్థలు మమేకమయ్యేలా ‘వేవ్స్’ తోడ్పడుతుంది: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ · న్యూఢిల్లీలోని విదేశీ దౌత్య కార్యాలయాల రాయబారులు.. హై కమిషనర్ల కోసం ‘వేవ్స్-2025’పై సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యక్రమం · సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ-మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం: మీడియా-వినోదం సహా డిజిటల్ విస్తృతిపై సహకారం బలోపేతం
Posted On:
13 MAR 2025 7:44PM by PIB Hyderabad
మీడియా-వినోద రంగంలో అంతర్జాతీయ సహకార విస్తృతి లక్ష్యంగా చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు న్యూఢిల్లీలోని చాణక్యపురిలోగల సుష్మా స్వరాజ్ భవన్లో ‘వేవ్స్-2025’పై ఉన్నత స్థాయి గోష్టి ఏర్పాటు చేసింది. ముంబయిలో ఈ ఏడాది మే 1 నుంచి 4 వరకూ సాగే ‘వరల్డ్ ఆడియో విజువల్-ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్) సన్నాహకాల్లో భాగంగా అంతర్జాతీయ సమాజాన్ని ఇందులో మమేకం చేయడం ధ్యేయంగా సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమం నిర్వహించింది.
కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్.జైశంకర్ (విదేశీ వ్యవహారాలు), శ్రీ అశ్వినీ వైష్ణవ్ (సమాచార-ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్-ఐటీ), మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సమాచార-ప్రసారశాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి సుజాత సౌనిక్లతోపాటు దాదాపు 100 మంది విదేశీ రాయబారులు, హైకమిషనర్లు కూడా హాజరయ్యారు.
మీడియా-వినోదంసహా డిజిటల్ విస్తృతిపై సహకారం బలోపేతం చేయడంలో భాగంగా సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తికావడం ఈ కార్యక్రమ విశేషాంశం.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ- “సృజనాత్మకత, మీడియా, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం ప్రపంచ మీడియా రంగం రూపాంతరీకరణకు తోడ్పడటమే కాకుండా ఈ దిశగా సంయుక్త కృషి సమున్నత స్థాయికి చేరుతుంది” అని వ్యాఖ్యానించారు. అలాగే “అన్ని రంగాల్లోని సృష్టికర్తల సమూహం అత్యున్నత విలువలతో కథన సృష్టి చేయగలదు... ‘వేవ్స్-2025’ ప్రధానోద్దేశం ఇదే”నని ఆయన పేర్కొన్నారు. “ఇందులో భాగంగానే ముంబయిలో మే 1 నుంచి 4వ తేదీవరకూ నిర్వహించే ‘వేవ్స్-2025’కు సాంకేతిక, మీడియా, వినోద రంగాల్లో దిగ్గజాలను మేం ఆహ్వానిస్తున్నాం” అని ప్రకటించారు. అంతర్జాతీయ వేదికపై వివిధ రూపాల్లో భారత్ కృషిని విశదీకరిస్తూ- ప్రపంచ స్థాయి సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిచ్చే రీతిలో ఈ రంగంలోని భాగస్వాములు కూడా ‘వేవ్స్-2025లో చురుగ్గా పాలుపంచుకోవాలని మంత్రి ఆహ్వానం పలికారు.
అనంతరం డాక్టర్ ఎస్.జైశంకర్ ప్రసంగిస్తూ- “మీడియా-వినోద పరిశ్రమలో చర్చలు, సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించగల కీలక వేదికగా ‘వేవ్స్-2025 ఉపయోగపడుతుంది. పరిశ్రమలో దిగ్గజ సంస్థలు, భాగస్వాములు, ఆవిష్కర్తలను ఏకం చేయడం ద్వారా అవకాశాల అన్వేషణ, సమస్యల పరిష్కారం సహా ఈ రంగం భవిష్యత్తు రూపమివ్వడంలోనూ తోడ్పడగలదు” అన్నారు. “ఆర్థిక-రాజకీయ పునఃసమతౌల్యం నేడు సాంస్కృతిక సమతౌల్యం దిశగా పయనిస్తోంది. మనం స్థానికులుగా మమేకం కాలేకపోతే ప్రపంచంతో మమేకం కాలేమన్నది వాస్తవం. ఈ దిశగా మన కృషి వెనుకగల స్ఫూర్తిని ‘వేవ్స్-2025’ ప్రతిబింబిస్తుంది” అని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు “వేవ్స్-2025’ కింద అంతర్జాతీయ సహకార విస్తృతికిగల అవకాశాలపై రాయబారులు, హై కమిషనర్లు వారి దేశాల్లోని ప్రభుత్వాలకు పూర్తి అవగాహన దిశగా చొరవ చూపాలి” అని కోరారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ తన ప్రసంగంలో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు. “ముంబయి నగరం భారత ఆర్థిక-వినోద రాజధాని కాబట్టి, ‘వేవ్స్-2025’ నిర్వహణకు ఇది అత్యంత సముచిత వేదిక. ప్రాచీన, ఆధునిక సంస్కృతి ప్రభావాలను నిరంతరం మేళవిస్తూ మీడియా, వినోద రంగాల్లో సహకారం, సాంస్కృతిక దౌత్యాన్ని ఈ నగరం ప్రోత్సహిస్తుంది” అని వివరించారు. అంతేకాకుండా “సాంకేతిక ప్రగతి, సామాజిక మార్పులో మీడియా పరిణామశీల పాత్రను స్పష్టం చేసే ఉద్యమంగా ‘వేవ్స్-2025’ను పేర్కొనవచ్చు. అలాగే ఆవిష్కరణలకు తోడ్పడే ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పరచే దిశగా పెట్టుబడులను ప్రోత్సహించేందుకూ మహారాష్ట్ర నిబద్ధతతో కృషి చేస్తుంది” అని స్పష్టం చేశారు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ ఏర్పాటును స్వాగతిస్తూ- “సామాజిక శ్రేయస్సుకు తోడ్పడే శక్తిగా మీడియా తన పాత్రను కొనసాగిస్తుందని, భవిష్యత్తుకు రూపమిచ్చేలా ప్రపంచ అనుసంధానానికి స్ఫూర్తినిచ్చే సాంకేతికత, సృజనాత్మకతల సమ్మేళనానికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నాను” అని శ్రీ ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర సమాచార-ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తన ముగింపు ఉపన్యాసంలో- “సంయుక్త భాగస్వామ్యాలు, సహ-నిర్మాణం, వాణిజ్య విస్తరణకు ‘వేవ్స్-2025’ బాటలు వేస్తుంది. తద్వారా భారత సృజనాత్మక రంగంలో అంతర్జాతీయ మీడియా సంస్థలు మమేకమయ్యే వెసులుబాటు కల్పిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో “మీడియా, వినోద పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సానుకూల వాతావరణం ఏర్పరుస్తుంది. అందులో భాగంగా వాణిజ్య సౌలభ్యం, సారాంశ స్థానికీకరణ, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు గట్టి మద్దతునిస్తుంది” అని భరోసా ఇచ్చారు.
సమాచార-ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ- “యావత్ మీడియా, వినోద రంగానికి ప్రపంచంలోనే తొలి సమ్మిళిత వేదిక ‘వేవ్స్’... సంప్రదాయ, భవిష్యత్ మీడియా మధ్య అంతరం తగ్గింపు, ప్రపంచ భాగస్వామ్యాల కూర్పు, సారాంశ సృష్టి, సాంకేతిక ఆవిష్కరణలు వగైరాల్లో సుసంపన్న భారత సాంస్కృతిక సంప్రదాయాలను మేళవిచండమే మా లక్ష్యం” అని వివరించారు.
అర్థవంతమైన ప్రభావ సృష్టి లక్ష్యంగా బహుళ కార్యక్రమాలతో ‘వేవ్స్” తొలి సంచికను నిర్వహిస్తున్నట్లు శ్రీ జాజు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిర్వహించే ప్రపంచ మీడియా చర్చలలో మంత్రులు, విధాన నిర్ణేతలు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా తీసుకునే నిర్ణయాలు ఒక ‘మార్గదర్శక విధాన పత్రం’గా ‘వేవ్స్’ డిక్లరేషన్ రూపంలో ప్రకటిత అవుతుందని తెలిపారు. అలాగే ఉన్నతస్థాయి మేధా మధనం(థాట్ లీడర్స్ ట్రాక్) పేరిట పరిశ్రమ నిపుణులతో విజ్ఞాన ఆదానప్రదాన గోష్ఠులు నిర్వహిస్తారని తెలిపారు. ‘ఆవిష్కరణాత్మక కథన రీతి, కథలో లీనంచేసే అనుభూతి, గేమింగ్ రంగ వైవిధ్యం’ తదితరాలు ‘ప్రదర్శన’ విభాగంలో మన ముందుంటాయని చెప్పారు. ఇక భారత మీడియా వారసత్వం, భవిష్యత్తును భారత్ పెవిలియన్ ప్రముఖంగా ప్రదర్శిస్తుంది. అలాగే ‘వేవ్స్’ బజార్ వ్యాపార నెట్వర్కింగ్ సౌలభ్యం కల్పిస్తుందని, మీడియా అంకుర సంస్థలకు ‘వేవ్స్ ఎగ్జిలరేటర్’ మార్గదర్శకత్వం వహించడమే కాకుండా నిధులపరంగానూ మద్దతిస్తుందని శ్రీ జాజు వివరించారు. అటుపైన ‘వేవ్స్ కల్చరల్స్’ కింద జాతీయ-అంతర్జాతీయ ప్రతిభను మేళవించిన విభిన్న ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు.
వేవ్స్ 2025: డిజిటల్ శకంలో ఏకీకృత శక్తిగా మీడియా-వినోదం
ముంబయిలో 2025 మే 1 నుంచి 4వరకూ నిర్వహించే ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)లో మీడియా, వినోదరంగాలకుగల రూపాంతరీకరణ శక్తిని ప్రతిబింబిస్తూ ఆయా రంగాల భాగస్వాములు పాల్గొంటారు. ఈ మేరకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, మీడియా నిపుణులు, కళాకారులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ భాగస్వాములు ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నేటి డిజిటల్ శకం అవకాశాలతోపాటు సవాళ్లను కూడా మనముందు ఉంచుతోంది. కృత్రిమ మేధ, స్ట్రీమింగ్ విప్లవాలు, మేధా సంపత్తి హక్కులు, అవాస్తవ సమాచారం, మీడియా స్థిరత్వం వంటివి నేటి కీలక సమస్యలు. ఈ నేపథ్యంలో సాంస్కృతిక వైవిధ్యం, ఆవిష్కరణ, మీడియా వేదికలను సమాన ప్రాతినిధ్యంతో ప్రోత్సహించడం ద్వారా ‘వేవ్స్-2025’ పేరిట తొలిసారి నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమం వివిధ సమస్యలకు పరిష్కారాలను సూచించగలదు.
సారాంశ సృష్టి-విస్తృతిలో సృజనాత్మకత, సార్వజనీనత, బాధ్యతలతో కూడిన అత్యున్నత ప్రమాణాలను ఈ కార్యక్రమం ప్రస్ఫుటం చేస్తుంది. కథనాల్లో నైతికత, సముచిత ప్రాతినిధ్యం తదితరాల ఆవశ్యకతను స్పష్టీకరిస్తుంది.
సామరస్యమనే పట్టకం నుంచి ప్రపంచ వీక్షణ ద్వారా అర్థవంతమైన అనుబంధాలు, సహకార విస్తృతి, సాంస్కృతిక సమైక్యతలకు ప్రేరణనివ్వడం ‘వేవ్స్-2025’ ధ్యేయం. నేటి డిజిటల్ శకంలో ప్రపంచ దేశాలు, సంస్కృతులు, ప్రజానీకం మధ్య అతిపెద్ద ఏకీకరణ ఉత్ప్రేరకంగా మీడియా-వినోద పరిశ్రమ పాత్రను బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక ముందడుగు కాగలదు. ఉమ్మడి సమస్యలు, మానవాళికి ఎదురవుతున్న సవాళ్లు, భాగస్వామ్య అవకాశాలు, సహకార విస్తృతి-పురోగమనంపై దృష్టి సారిస్తూ ఐక్యతకుగల శక్తిని ‘వేవ్స్’ చాటిచెబుతుంది. సామరస్యం కోసం సరిహద్దులకు అతీతంగా అర్థవంతమైన సంభాషణలు-చర్యలను ప్రోత్సహించే వేదికగా ‘వేవ్స్-2025ను సమున్నతంగా నిలిపేది ఈ దృక్పథమే.
‘సృజనార్థిక వ్యవస్థ’ (ఆరెంజ్ ఎకానమీ)లో ‘వేవ్స్-2025’ను ఏకీకృతం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి దిశగా మీడియా, వినోద పరిశ్రమల సద్వినియోగంలో దాని కీలక పాత్ర స్పష్టమవుతోంది. సాంస్కృతిక ఆదానప్రదానం, ఐక్యతకు సృజనాత్మక పరిశ్రమలు శక్తిమంతమైన ఉపకరణాలు కాబట్టి, ఇది కచ్చితంగా ప్రపంచ సామరస్య లక్ష్య సాధనకు అనువైనదే.
ముంబయిలో ‘వేవ్స్-2025’ నిర్వహణ ద్వారా మేధామథన దిగ్గజాలకు ఇదొక సముచిత వేదిక అవుతుంది. వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో మీడియా పరిశ్రమ అతిపెద్ద ఏకీకరణ ప్రేరకంగా ఎలా ఉపయోగపడగలదో వారు ఈ సందర్భంగా చర్చిస్తారు. సాంస్కృతిక దౌత్యంతోపాటు ప్రజలు, సంస్కృతులు, దేశాల మధ్య అంతరాలను తగ్గించడంలో ఈ రంగం శక్తిమంతమైన ఉత్ప్రేరకం కాగలదు.
****
(Release ID: 2111376)
|