ప్రధాన మంత్రి కార్యాలయం
‘సమిట్ ఆఫ్ ఫ్యూచర్’ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
23 SEP 2024 11:09PM by PIB Hyderabad
న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి వేదికగా జరుగుతున్న ‘సమిట్ ఆఫ్ ఫ్యూచర్’ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ‘మెరుగైన భవిష్యత్తు కోసం బహుముఖీన పరిష్కారాలు’ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సమావేశాల్లో ప్రపంచ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
భవిష్యత్తరాలకు చక్కని ప్రపంచాన్ని అందించేందుకు భారత ఆలోచనలను ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, సౌభాగ్యాలను ఆకాంక్షించే ప్రపంచ ఆరో వంతు జనాభా వాణిని తాను వినిపిస్తున్నానని మోదీ చెప్పారు. వెలుగులీనే ప్రపంచ భవిష్యత్తు లక్ష్యంగా చేపట్టే చర్యల్లో, మానవ సంక్షేమానికే ప్రాధాన్యతనివ్వాలన్న మోదీ, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించిన భారత్, గత దశాబ్ద కాలంలో 25 కోట్ల ప్రజలకు పేదరికం నుండి విముక్తి కల్పించిందని తెలియచేశారు.
అభివృద్ధి బాటలో కింది స్థాయిలో ఉన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలుకు మద్దతు తెలిపిన ప్రధానమంత్రి, అభివృద్ధి సాధనలో దేశ విజయానుభవాన్ని ఇతరులతో పంచుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” సూత్రం దిక్సూచిగా భారత్ పయనిస్తోందని మోదీ చెప్పారు.
నిత్యనూతనంగా ఉండేందుకు సంస్కరణలే మార్గమన్న మోదీ, ఐరాస భద్రతా మండలి సహా ప్రపంచ పాలనా వ్యవస్థలలో సంస్కరణల ఆవశ్యకతను స్పష్టం చేశారు. సంకల్పానికి సరితూగే గట్టి చర్యలు అనివార్యమని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి పూర్తి ప్రసంగ పాఠం కోసం https://bit.ly/4diBR08 ను చూడండి.
రెండు అనుబంధ పత్రాలతో కూడిన ‘భవిష్యత్తు ప్రణాళిక’, ‘ప్రపంచ డిజిటల్ పథకం’, ‘భవిష్యత్తరాల పై ప్రకటన పత్రం’ సహా తుది పరిణామ పత్రంపై సభ్యదేశాల సంతకాలతో శిఖరాగ్ర సదస్సు ముగిసింది.
(Release ID: 2058380)
Read this release in:
Marathi
,
Manipuri
,
Bengali
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil