ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారిస్ 2024 పారాలింపిక్ క్రీడలలో పాల్గొనే భారత బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి

Posted On: 19 AUG 2024 10:17PM by PIB Hyderabad

కార్యక్రమ నిర్వాహ సంధానకర్త : నమస్కారం సార్. ముందుగా మన ఆర్చర్ శీతల్ దేవితో మాట్లాడతాం. శీతల్ దేవి.

ప్రధాన మంత్రి: నమస్తే, శీతల్.

శీతల్: నమస్తే సార్ జై మాతా ది.

ప్రధాన మంత్రి: జై మాతా ది.

శీతల్: నేను శీతల్.

ప్రధాన మంత్రి: శీతల్, మీరు భారత జట్టులో అత్యంత పిన్న వయస్కులైన అథ్లెట్, ఇది మీకు మొదటి పారాలింపిక్స్. మీ మనసులో చాలా విషయాలు ఉండి ఉండాలి. మీ మనసులో ఏముందో చెప్పగలరా? మీరు ఏదైనా ఒత్తిడికి గురవుతున్నారా?

శీతల్: లేదు సార్, నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఇంత చిన్న వయసులో, ఇంత తక్కువ సమయంలో పారాలింపిక్స్ లో ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత చిన్న వయసులో, ఇంత తక్కువ సమయంలో పారాలింపిక్స్ లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. నాకు మద్దతుగా దేవస్థానం బోర్డు కూడా గణనీయమైన పాత్ర పోషించిందని చెప్పాలనుకుంటున్నాను. వారి సహకారం తో పాటు అందరి తోడ్పాటు అమోఘం. అలా ఇక్కడికి వచ్చాను సార్.

ప్రధాన మంత్రి: సరే శీతల్. పారిస్ పారాలింపిక్స్ లో మీ లక్ష్యం ఏమిటి, దానికి మీరు ఎలా సన్నద్ధమయ్యారు?

శీతల్: అవును సార్. నా సన్నాహాలు చాలా బాగా జరుగుతున్నాయి, నా శిక్షణ కూడా చాలా బాగుంది సార్. ఇక్కడ భారత పతాకాన్ని రెపరెపలాడించడం, మన జాతీయ గీతం ఆలపించేలా చేయడమే నా లక్ష్యం. అదే నా లక్ష్యం సార్. అంతకు మించి నాకు ఇంకేమీ లేదు.

ప్రధాన మంత్రి: శీతల్, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, మీరు ఈ బృందంలో అతి పిన్న వయస్కురాలు. ఇంత పెద్ద కార్యక్రమంలో ఒత్తిడికి లోనుకావద్దని మీకు నా సలహా. గెలుపోటముల గురించి చింతించకుండా మీ అత్యుత్తమ ప్రదర్శన చేయండి. నేను, దేశం మొత్తం మీ వెంటే ఉన్నాం. మీకు ఎల్లప్పుడూ మాతా వైష్ణోదేవి ఆశీస్సులు ఉంటాయి, నా తరఫున మీకు శుభాకాంక్షలు..

శీతల్: ధన్యవాదాలు సర్, మాతా రాణి నన్ను ఆశీర్వదించింది, అందుకే ఇంత తక్కువ సమయంలో ఇక్కడికి వచ్చాను. సర్, మాతా రాణి నుండి నేను చాలా ఆశీర్వాదాలు పొందాను. భారతీయులందరి ప్రార్థనల వల్లనే నేను ఇంత త్వరగా ఇక్కడికి చేరుకున్నాను. మీ ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి సార్, ధన్యవాదాలు సార్.

ప్రధాన మంత్రిశుభాకాంక్షలు.

కార్యక్రమ నిర్వాహ సంధానకర్త : సుశ్రీ అవని లేఖర.

ప్రధాన మంత్రి: నమస్తే అవని.

అవని లేఖ: నమస్కారం సార్!

ప్రధాన మంత్రి: అవని, గత పారాలింపిక్స్ లో మీరు బంగారు పతకంతో పాటు మరో పతకం సాధించి యావత్ దేశం గర్వపడేలా చేశారు. ఈసారి మీ లక్ష్యం ఏంటి?

అవని లేఖర: సార్, ఇంతకు ముందు నా మొదటి పారాలింపిక్స్ లో, నేను అనుభవం పొందడానికి నాలుగు ఈవెంట్లలో పాల్గొన్నాను. ఈసారి ఒలింపిక్స్ సమయంలో అటు ఆటలోనూ, ఇటు టెక్నిక్ లోనూ మరింత పరిణతి సాధించాను. ఈసారి కూడా నేను పాల్గొంటున్న ఈవెంట్లలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ముఖ్యంగా గత పారాలింపిక్స్ తర్వాత భారతదేశం నలుమూలల నుంచి నాకు లభించిన మద్దతు, ప్రేమ, మీ మద్దతు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. అక్కడికి వెళ్లి నా వంతు కృషి చేయడం కూడా బాధ్యతను తెస్తుంది.

ప్రధాన మంత్రి: అవనీ, టోక్యోలో మీరు విజయం సాధించిన తర్వాత జీవితం ఎలా మారిపోయింది? తదుపరి పోటీకి మిమ్మల్ని మీరు నిరంతరం ఎలా సిద్ధం చేసుకున్నారు?

అవని లేఖర: సార్, నేను గతసారి పాల్గొన్నప్పుడు, నేను చేయగలనా లేదా అని నా మనస్సులో ఒక అడ్డంకి ఉంది. కానీ రెండు పతకాలు గెలిచిన తరువాత, ఆ అడ్డంకి విచ్ఛిన్నమైంది, నేను ఒకసారి చేయగలిగితే, నేను కష్టపడి మళ్లీ చేయగలనని నేను గ్రహించాను. నేను భారతదేశం తరఫున, ముఖ్యంగా వీల్ చైర్ లో పాల్గొని, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, అది చాలా మంచి అనుభూతి, నేను ప్రతీ సారి ఇదే పనిని మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటున్నాను.

ప్రధాన మంత్రి: అవనీ, మీపై మీకు చాలా అంచనాలు ఉన్నాయి, దేశం కూడా మీపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ నేను చెప్పేదేమిటంటే, ఈ అంచనాలను భారంగా మారనివ్వకండి. ఈ ఆకాంక్షలు మీ బలం కావాలి. మీకు శుభాకాంక్షలు.

అవని లేఖర: ధన్యవాదాలు సార్!

కార్యక్రమ నిర్వాహ సంధానకర్త : ఎం.ఆర్.మరియప్పన్ తంగవేలు.

మరియప్పన్ తంగవేలు: నమస్కారం సార్.

ప్రధాన మంత్రి: మరియప్పన్ జీ, వనక్కం. మరియప్పన్, మీరు టోక్యో పారాలింపిక్స్లో రజత పతకం సాధించారు. ఈసారి ఆ వెండిని బంగారంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ గత అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

మరియప్పన్: సార్, నేను జర్మనీలో శిక్షణ తీసుకుంటున్నాను. శిక్షణ బాగా జరుగుతోంది. గతసారి ఒక చిన్న పొరపాటు జరిగింది, నాకు రజతం వచ్చింది. ఈసారి 100 శాతం బంగారం తెస్తాను.

ప్రధాన మంత్రి: అవునా?

మరియప్పన్: అవును సార్, 100 శాతం.

ప్రధాన మంత్రి: మరియప్పన్, మీరు అథ్లెట్, కోచ్. 2016లో పారా అథ్లెట్ల సంఖ్యను పరిశీలిస్తే, ఇప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ మార్పును మీరు ఎలా చూస్తారు?

మరియప్పన్: సర్, నేను 2016లో తొలిసారి పారాలింపిక్స్లోకి ప్రవేశించాను. నేను స్వర్ణం గెలవలేనని భావించి కొంచెం భయపడ్డాను, కానీ నేను గెలిచాను. స్వర్ణం గెలిచిన తర్వాత మొత్తం సిబ్బంది, పారాలింపిక్ కమ్యూనిటీ నాకు మద్దతు ఇచ్చింది. నేను అందుకున్న మద్దతును చూసి, చాలా మంది క్రీడల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మనం భారత్ కు 100 పతకాల ను అందించాలి. ఈ సమయంలో, అది జరుగుతుంది, సర్.

ప్రధాన మంత్రి: మరియప్పన్, మన అథ్లెట్లకు ఏమీ లోటు లేకుండా చూసేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. కేవలం మీ పనితీరుపైనే దృష్టి పెట్టాలి. దేశం మీతోనే ఉంది. మీకు శుభాకాంక్షలు.

మరియప్పన్: ధన్యవాదాలు సార్.

కార్యక్రమ నిర్వాహ సంధానకర్త : శ్రీ సుమిత్ అంటిల్.

ప్రధాన మంత్రి: నమస్తే, సుమిత్.

సుమిత్ అంతిల్: నమస్తే సార్. ధన్యవాదాలు సార్.

ప్రధాన మంత్రి: సుమిత్ గారూ, ఆసియా పారా గేమ్స్, టోక్యో పారాలింపిక్స్ లలో బంగారు పతకాలు సాధించి ఒకదాని తర్వాత మరొకటి ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. మీ స్వంత రికార్డులను బద్దలు కొట్టడానికి మీకు ప్రేరణ ఎక్కడ లభిస్తుంది?

సుమిత్ అంతిల్: సార్, దేశంలో ప్రేరణకు కొదవ లేదని నేను భావిస్తున్నాను. మా పీసీఐ అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా, నీరజ్ చోప్రా వంటి దిగ్గజాలు నాకంటే ముందు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులు ఉన్నారు. వారి నుంచి స్ఫూర్తి పొందాను సార్. కానీ ప్రేరణ కంటే, స్వీయ క్రమశిక్షణ, స్వీయ ప్రేరణ ప్రపంచ రికార్డులను వరుసగా బద్దలు కొట్టడంలో పెద్ద పాత్ర పోషించాయి సార్.

ప్రధాన మంత్రి: సుమిత్, సోనిపట్ నేల చాలా ప్రత్యేకమైనది. మీలాంటి ఎందరో ప్రపంచ రికార్డు హోల్డర్లు, అథ్లెట్లు అక్కడి నుంచి ఆవిర్భవించారు. హరియాణా క్రీడా సంస్కృతి మీకు ఎంతగా ఉపయోగపడింది?

సుమిత్ అంతిల్: ఖచ్చితంగా సార్. ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్న తీరు, ప్రభుత్వం ఆదుకుంటున్న తీరు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే హరియాణాకు చెందిన ఎంతో మంది అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నారు. ప్రభుత్వ సహకారం కూడా గణనీయంగా ఉంది సార్, ఇక్కడ సృష్టించిన క్రీడా సంస్కృతి చాలా ప్రయోజనకరంగా ఉందని నేను భావిస్తున్నాను సార్.

ప్రధాన మంత్రి: సుమిత్, మీరు ప్రపంచ ఛాంపియన్. అంతకు మించి మీరు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం. మీకు నా శుభాకాంక్షలు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ అద్భుతమైన పనితీరును కొనసాగించండి. దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. మీకు  చాలా శుభాకాంక్షలు!

సుమిత్ అంతిల్ : ధన్యవాదాలు సార్.

కార్యక్రమ నిర్వాహ సంధానకర్త : సుశ్రీ అరుణా తన్వర్.

అరుణా తన్వర్: నమస్కారం సార్! మీకు రక్షా బంధన్ శుభాకాంక్షలు.

ప్రధాన మంత్రి: అరుణ గారూ, మీకు కూడా నా శుభాకాంక్షలు!

అరుణ తన్వర్: ధన్యవాదాలు సార్!

ప్రధాన మంత్రి: అరుణా, మీ విజయంలో మీ నాన్నగారు పెద్ద పాత్ర పోషించారని విన్నాను. అతని మద్దతు, మీ ప్రయాణం గురించి మీరు మాకు చెప్పగలరా?

అరుణా తన్వర్: సర్, కుటుంబ సభ్యుల మద్దతు లేకుండా మేము సాధారణ టోర్నమెంట్ కూడా ఆడలేము. రెండోసారి పారాలింపిక్స్ లో పాల్గొనబోతున్నాను. నా తండ్రి ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచారు. నా తల్లి కూడా నాకు మద్దతుగా నిలిచింది.  ఎందుకంటే సామాజిక ఒత్తిడి ఉన్నప్పుడు, ప్రజలు దివ్యాంగులను (వైకల్యంతో ఉన్న వ్యక్తిని) ఏమీ సాధించలేని వ్యక్తిగా చూస్తారు. కానీ నా తల్లిదండ్రులు నేను చాలా సాధించగలనని నమ్మేలా చేశారు. ఈ రోజు, సర్, నేను నా ఇంటిలో నా సోదరుల కంటే తక్కువ కాదు.. మేము ముగ్గురు అన్నదమ్ములం అని మా అమ్మ చెబుతుంది. కాబట్టి, నా కుటుంబం ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇస్తుంది, సర్.

ప్రధాన మంత్రి: అరుణా, గత పారాలింపిక్స్లో ఒక ముఖ్యమైన మ్యాచ్ కు ముందు మీరు గాయపడ్డారు. మిమ్మల్ని మీరు ఎలా ప్రేరేపించుకున్నారు , ఆ ఎదురుదెబ్బను  ఎలా అధిగమించారు?

అరుణా తన్వర్: సార్, మీరు ఒక ముఖ్యమైన(మేజర్) టోర్నమెంట్ లో, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ముఖ్యంగా ఆ క్రీడలో ఏకైక వ్యక్తిగా... పారాలింపిక్స్ లో తైక్వాండో జట్టుకు ప్రాతినిధ్యం వహించాను, గాయం కారణంగా వెనక్కి తగ్గడం చాలా కష్టం. కానీ గాయం మీ ఆటను ఆపదు ఎందుకంటే నా లక్ష్యం చాలా పెద్దది. గాయాలు లేకుండా, క్రీడలలో సరదా లేదు. గాయాలు అథ్లెట్ కు ఆభరణాలు లాంటివి. కాబట్టి, తిరిగి రావడం పెద్ద కష్టమేమీ కాదు సార్. నేను బలంగానే ఉన్నాను. ఒక పారాలింపిక్స్ మీ భవిష్యత్తును నిర్ణయించదని నా కోచ్లు, ముఖ్యంగా సంధ్యా భారతి మేడమ్, నా తల్లిదండ్రులు నాకు చెప్పారు; ఇంకా చాలా ఆడాల్సి ఉంది.

ప్రధాన మంత్రి: అరుణ గారూ, గాయాలను ఒక ఆభరణంగా చూడటంలో మీ దృక్పథం నిజంగా స్ఫూర్తిదాయకం. కానీ మీరు మళ్లీ అలాంటి ఆభరణం ధరించాల్సిన అవసరం లేదని నేను ఆశిస్తున్నాను. అరుణా, నువ్వు నీ క్రీడలోనూ, జీవితంలోనూ పోరాట యోధులు. మీరు దేశం కోసం పతకాలు సాధించడమే కాకుండా లక్షలాది మంది కుమార్తెలకు స్ఫూర్తిగా నిలిచారు. పోరాట యోధుడి మనస్తత్వంతో పారిస్ వెళ్లి అద్భుతమైన ప్రదర్శన ఇవ్వండి. యావత్ దేశం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది.

అరుణా తన్వర్: ధన్యవాదాలు సార్.

ప్రధాన మంత్రి: ఇప్పుడు, నేను స్వయంగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను, మీలో ఎవరైనా సమాధానం ఇవ్వగలరు, ముఖ్యంగా ఇంకా మాట్లాడని వారు. మీలో చాలా మంది మీ మొదటి పారాలింపిక్స్ కోసం పారిస్ వెళ్తున్నారు. తొలిసారి ఇలాంటి ప్రపంచ స్థాయి (గ్లోబల్) క్రీడ  (ఈవెంట్) లో మీ  దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? ఇప్పటి వరకు మాట్లాడని వారు దయచేసి!

అశోక్ మాలిక్: సార్, నా పేరు అశోక్! నేను మొదటిసారి వెళ్తున్నాను సార్! ఇది ప్రతి అథ్లెట్ కల...

ప్రధాన మంత్రి: మీ పేరేంటి?

అశోక్ మాలిక్: అశోక్ మాలిక్ సార్!

ప్రధాన మంత్రి: అశోక్ గారూ, మీరు చెప్పండి !

అశోక్ మాలిక్: సార్, ఒలింపిక్స్ లో ఆడాలనేది ప్రతి ఆటగాడి కల, నా కల నెరవేరబోతోంది సార్. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి పారాలింపిక్స్ కోసం నేను పారిస్ వెళుతున్నాను సార్. నేను అక్కడ నా వంతు కృషి చేస్తాను సార్, వీలైతే దేశం కోసం పతకం తీసుకువస్తాను సార్.

ప్రధాన మంత్రి: అశోక్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు?

అశోక్ మాలిక్: హర్యానా నుంచి సార్, సోనిపట్!

ప్రధాన మంత్రి: సోనిపట్ నుంచా,  మీరు కూడా సోనిపట్ కు చెందినవారే!

అశోక్ మాలిక్: అవును సార్!

ప్రధాన మంత్రి: మీలో ఎంతమంది మీ రెండవ లేదా మూడవ పారాలింపిక్స్ లేదా అంతకంటే ఎక్కువ కు వెళ్తున్నారు? మీ మొదటి పారాలింపిక్స్ తో పోలిస్తే ఇప్పుడు ఎంత భిన్నంగా అనిపిస్తుంది? ఎవరు సమాధానం చెప్పాలనుకుంటున్నారు?

అమిత్ సరోహ: సార్, నమస్కారం!

ప్రధాన మంత్రి: నమస్కారం అండి !

అమిత్ సరోహా: సర్, నా పేరు అమిత్ సరోహా, ఇది నాకు నాలుగో పారాలింపిక్స్. నాలుగోసారి పారాలింపిక్స్ కు వెళ్లే జట్టులో నేను అత్యంత సీనియర్ అథ్లెట్ ని. సర్, నేను చూసిన అతిపెద్ద మార్పు ఏమిటంటే, మేము 2012 లో వెళ్ళినప్పుడు, మేము ఒకే ఒక పతకం గెలిచాము. ఆ తర్వాత మరో రెండు ఒలింపిక్స్ లో పాల్గొన్నాను, మా జట్టు ప్రదర్శన మెరుగైంది. ఇప్పుడు 84 మంది అథ్లెట్లు వెళ్తున్నారు. సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇందులో పెద్ద పాత్ర పోషించింది. ముఖ్యంగా ఆర్థికంగా మా టీమ్ కు అందుతున్న సపోర్ట్ గణనీయంగా పెరిగింది సార్. 2015లో టాప్స్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్) ప్రవేశపెట్టినప్పటి నుంచి మాకు ఎంతో మద్దతు లభించింది, ఇప్పుడు మేము విదేశాలలో ఎక్కడైనా ప్రయాణించి శిక్షణ పొందవచ్చు. మాకు వ్యక్తిగత కోచ్లు, వ్యక్తిగత ఫిజియోలు, వ్యక్తిగత సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. మా అవసరాలు ఏమైనా ఉన్నా, అవి నెరవేరుతున్నాయి, అందుకే ఇంత బాగా రాణిస్తున్నాం. మునుపెన్నడూ లేనంతగా ఈసారి మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తున్నాం సార్.

ప్రధాన మంత్రి: ఈ సమూహంలో ఇంకా పాఠశాల లేదా కళాశాలలో చదువుతున్న చాలా మంది యువకులను నేను చూస్తున్నాను. క్రీడలతో పాటు చదువును ఎలా నిర్వహిస్తారు?

రుద్రాన్ష్ ఖండేల్వాల్: నా పేరు రుద్రాన్ష్ ఖండేల్వాల్. నేను రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందినవాడిని, ఈ సంవత్సరం నేను నా 12 వ బోర్డు పరీక్షలు రాశాను, చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాను- నేను 83% మార్కులు సాధించాను. ఆ సమయంలో ఢిల్లీలో వరల్డ్ కప్ కూడా జరుగుతుండటంతో రెండింటినీ ఒకేసారి నిర్వహణ చేసేవాన్ని. విద్య, క్రీడలు రెండూ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నేను నమ్ముతున్నాను ఎందుకంటే క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి సహాయపడతాయి, ప్రతీ రోజు మిమ్మల్ని మీర్ మెరుగుపరచేలా మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. విద్య జీవితాన్ని ఎలా గడపాలో, మీ హక్కులను ఎలా అర్థం చేసుకోవాలో నేర్పుతుంది. కాబట్టి, రెండింటినీ నిర్వహించడం చాలా కష్టం అని నేను అనుకోను. రెండూ చాలా ముఖ్యమైనవి.

ప్రధాన మంత్రి: పారా అథ్లెట్ల సూచనల మేరకు 2023 డిసెంబర్లో తొలిసారి ఖేలో ఇండియా పారా గేమ్స్ నిర్వహించాం. ఇటువంటి సంఘటన క్రీడా పర్యావరణ వ్యవస్థలో ఎలా సహాయపడుతుందో ఎవరైనా నాకు చెప్పగలరా?

భవినా: నమస్కారం సార్!

ప్రధాన మంత్రి: నమస్తే , మీ పేరేంటి !

భవినా: భవినా, సార్.

ప్రధాన మంత్రి: అవును భవీనా, ఎలా ఉన్నారు?

భవినా: బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు?

ప్రధాన మంత్రి: హా  భవీనా, చెప్పండి !

భవీనా: సర్, ఖేలో ఇండియా ప్రచారం గత కొన్నేళ్లుగా దేశంలో క్రీడల అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించింది, కింది స్థాయి నుండి అనేక మంది ప్రతిభావంతులను తెరపైకి తీసుకువచ్చింది. ఖేలో ఇండియాలో పారా స్పోర్ట్స్ ను చేర్చినప్పటి నుంచి పారా అథ్లెట్లకు మంచి ప్లాట్ ఫాం, కొత్త దిశలు లభించాయి. నేను ఇవ్వగల ఉత్తమ ఉదాహరణ ఏమిటంటే, ఖేలో ఇండియా నుండి 16 మంది అథ్లెట్లు పారిస్ పారాలింపిక్స్కు అర్హత సాధించారు.

ప్రధాన మంత్రి: గొప్ప విషయం ! గాయాలతో వ్యవహరించడం అథ్లెట్లకు పెద్ద సవాలు. పారాలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న సమయంలో పారా అథ్లెట్లు గాయాలను ఎలా ఎదుర్కొంటారు, ప్రేరణ ఎలా పొందుతారు?

తరుణ్ ధిల్లాన్: సార్, నమస్తే!

ప్రధాన మంత్రి: నమస్తే!

తరుణ్ ధిల్లాన్: సార్, నా పేరు తరుణ్ ధిల్లాన్. నేను హరియాణాలోని హిసార్ నుంచి వచ్చాను. నా క్రీడ బ్యాడ్మింటన్ సార్, మీరు అడిగిన గాయం గురించి, నేను నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సర్, 2022 కెనడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ సమయంలో, ఒక మ్యాచ్ సమయంలో నా మోకాలి స్నాయువు విరిగిపోయింది, ఇది ఒక బ్యాడ్మింటన్ ఆటగాడికి తీవ్రమైన గాయం, సర్, నేను టాప్స్ అథ్లెట్ కావడం చాలా అదృష్టం సర్. అథ్లెట్లందరికీ, మీకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నేను టాప్స్లో భాగంగా ఉన్నందున, సాయ్ అధికారులు, స్పోర్ట్స్ సాయ్ బృందం నా గాయం సమయంలో నాకు చాలా సహాయం చేశారు. ముంబైలోని ఉత్తమ వైద్యుడు డాక్టర్ దిన్షా వద్ద చికిత్స కోసం నన్ను భారతదేశానికి తీసుకురావడానికి వారు బిజినెస్ క్లాస్ విమాన టికెట్ను ఏర్పాటు చేశారు. నా శస్త్రచికిత్స చాలా తక్కువ సమయంలో జరిగింది, సాయ్ మద్దతుకు ధన్యవాదాలు, నేను కోలుకోగలిగాను, క్రీడలకు తిరిగి రాగలిగాను. కోలుకోవడానికి 10-11 నెలలు పడుతుందని వైద్యులు చెప్పారు, కానీ సాయ్ మద్దతు కారణంగా, నేను 7 నెలల్లో కోలుకున్నాను, 8 వ నెలలో, నేను ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ ఆడటానికి వెళ్ళాను, అక్కడ నేను బంగారు పతకం గెలిచాను. నేడు మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి పెద్ద గాయాలను సులభంగా అధిగమించి టాప్స్ పథకం వల్ల క్రీడల్లో మన కలలను సాకారం చేసుకోగలవని నేను నమ్ముతున్నాను.

ప్రధాన మంత్రి: మీకు అభినందనలు! మీలో చాలా మందికి సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా)లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పారా స్పోర్ట్స్ లో సోషల్ మీడియా ఎలా సహాయపడుతుందో ఎవరైనా చెప్పగలరా?

యోగేష్ కతునియా: నమస్తే సార్! హర హర మహదేవ్! నా పేరు యోగేష్ కతునియా, నేను హర్యానాలోని బహదూర్ గఢ్ నుంచి వచ్చాను. పారా స్పోర్ట్స్ పై సోషల్ మీడియా చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది, ముఖ్యంగా అవగాహన పెంచడంలో మునుపెన్నడూ లేని విధంగా. క్రమక్రమంగా భారతదేశంలోని ప్రజలు పారా స్పోర్ట్స్ కూడా ఒక విషయం అని తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియాలో చూసిన వాటి కారణంగా చాలా మంది కొత్త అథ్లెట్లు పారా స్పోర్ట్స్ లోకి వస్తున్నారు. అంగవైకల్యం ఉన్న చాలా మంది తాము చదువు, ఇతరత్రా పనులు మాత్రమే చేయగలమని భావించేవారని, కానీ ఇప్పుడు పారా స్పోర్ట్స్ లోకి ఎక్కువ మంది రావడం చూస్తున్నాము. సామాజిక మాధ్యమాల వల్ల పారా స్పోర్ట్స్ కు గణనీయంగా ప్రాధాన్యం పెరిగింది. ఇది ప్రజలతో అనుసంధానం  అయ్యే అవకాశాన్ని కూడా అందిస్తుంది. మా వీడియోలను చూసే వారు ప్రేరణ పొందుతారు. అట్టడుగు స్థాయి అథ్లెట్లు ఆ వ్యాయామాలను వారి దినచర్యలో చేర్చవచ్చు. పారా స్పోర్ట్స్ ఎదుగుదలపై సామాజిక మాధ్యమం  గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

కార్యక్రమ నిర్వాహ సంధానకర్త: సర్, మా అథ్లెట్ల మనోధైర్యాన్ని పెంచడానికి కొన్ని ప్రోత్సాహక మాటలు చెప్పమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదాలు సార్.

ప్రధాన మంత్రి: దేశ క్రీడల మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ గారు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే గారు, పారా అథ్లెట్లు, కోచ్ లు, ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న సిబ్బంది. ఈ రోజు మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోచింగ్ చివరి దశలో ఉన్నప్పటికీ, నేను మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. మీరంతా భారత్ పతాకధారులుగా పారిస్ వెళ్తున్నారు. ఈ ప్రయాణం మీ జీవితంలో, వృత్తిలో చాలా ముఖ్యమైనది, ఇది దేశానికి కూడా అంతే ముఖ్యమైనది. ప్యారిస్ లో మీ ఉనికితో దేశ ప్రతిష్ట ముడిపడి ఉంది. అందువలన, ఈ రోజు, దేశం మొత్తం మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది, మన సంప్రదాయంలో, ఇలా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, ప్రజలు "విజయీ భవ" (విజయం సాధించండి) అని చెబుతారు. 140 కోట్ల మంది భారతీయులు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు-"విజయీ భవ". టోక్యో, ఆసియా పారా గేమ్స్ తరహాలో కొత్త రికార్డులు నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతున్నారు. ధైర్యం, దృఢ సంకల్పం తో ఏం సాధించవచ్చో చూపించండి. పారిస్ పారాలింపిక్స్ కోసం మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

మిత్రులారా,

ఏదైనా క్రీడలో ఒక క్రీడాకారుడు ఇంత గొప్ప దశకు చేరుకున్నప్పుడు, దాని వెనుక ధైర్యం, అంకితభావం, త్యాగం- వీటి మొత్తం కథ ఉంటుంది. ఏ ఆటగాడి పునాది అయినా ఆత్మవిశ్వాసంతో నిర్మితమవుతుంది. ఒక ఆటగాడు క్రమశిక్షణ శక్తితో ముందుకు సాగుతాడు. వారి విజయం వారి ఆత్మవిశ్వాసానికి, ఆత్మనిగ్రహానికి నిదర్శనం. అయితే పారా అథ్లెట్ల విషయానికి వస్తే ఈ నిజం, సవాలు ఎన్నో రెట్లు ఎక్కువవుతాయి. మీరు ఈ దశకు చేరుకోవడం మీరు లోపలి నుండి ఎంత బలంగా ఉన్నారో చూపిస్తుంది. ప్రతికూల గాలులను మాత్రమే కాకుండా ప్రతికూల తుఫానులను ఎదుర్కొనే సామర్థ్యం మీకు ఉందని మీ విజయం చూపిస్తుంది. మీరు సమాజ స్థాపిత నియమాలను అధిగమించారు, మీరు మీ శరీరపు సవాళ్లను అధిగమించారు. అందువలన, మీరు విజయ మంత్రం, మీరు విజయానికి ఉదాహరణ, మీరు విజయానికి రుజువు. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగితే మీ గెలుపును ఎవరూ ఆపలేరు.

మిత్రులారా,

ఇటీవలి కాలంలో పారా గేమ్స్ లో భారత్ విజయాలు, ఆధిపత్యం ఎలా పెరిగిందో మీరంతా సాక్షులు. 2012 లండన్ పారాలింపిక్స్ లో దేశం ఒకే ఒక్క పతకం సాధించింది. ఒక్క స్వర్ణం కూడా గెలవలేదు. 2016లో రియోలో భారత్ 2 స్వర్ణాలు, మొత్తం 4 పతకాలు సాధించింది.... టోక్యో పారాలింపిక్స్ లో, మనం రికార్డు స్థాయిలో 19 పతకాలు గెలిచాము— 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు. మీలో చాలా మంది ఆ బృందంలో సభ్యులుగా ఉండి పతకాలను ఇంటికి తీసుకువచ్చారు. పారాలింపిక్ చరిత్రలో భారత్ సాధించిన 31 పతకాల్లో 19 టోక్యో నుంచే వచ్చాయి. గత పదేళ్లలో క్రీడలు, పారా గేమ్స్ లో భారత్ ఎంత ఎత్తుకు ఎదిగిందో ఊహించుకోవచ్చు.

మిత్రులారా,

క్రీడల్లో భారత్ సాధించిన విజయాలు ఆటల పట్ల సమాజంలో మారుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఒకప్పుడు క్రీడలను కేవలం కాలక్షేపంగా భావించేవారు, ఖాళీ సమయం ఉన్నవారు చేసే పని. కానీ నేడు ఆడే వారు వికసిస్తున్నారు. ఇంట్లో కూడా ఎక్కువగా ఆడిన వారిని తిట్టేవారు. క్రీడలను ఒక వృత్తిగా చూడలేదు, కానీ ఒకదానికి ఒక అడ్డంకిగా చూశారు. క్రీడల్లో అవకాశాలు దాదాపు లేకుండా పోయాయి. నా దివ్యాంగ సోదరసోదరీమణులు కూడా బలహీనులుగా, ఆధారపడినవారిగా పరిగణించబడ్డారు. ఈ ఆలోచనా విధానాన్ని మార్చుకుని వారికి మరిన్ని అవకాశాలు కల్పించాం. నేడు పారా గేమ్స్ కు ఇతర క్రీడలతో సమానమైన ప్రాధాన్యత లభిస్తోంది. దేశంలో 'ఖేలో ఇండియా పారా గేమ్స్'ను కూడా ప్రారంభించారు. మన పారా అథ్లెట్లకు సహాయం చేయడానికి గ్వాలియర్లో పారా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. టాప్స్, ఖేలో ఇండియా సౌకర్యాలతో మన పారా అథ్లెట్లు ప్రయోజనం పొందుతున్నారు. ఈ బృందంలోని 50 మంది అథ్లెట్లు టాప్స్ పథకంతో సంబంధం కలిగి ఉండటం, 16 మంది అథ్లెట్లు ఖేలో ఇండియాకు చెందినవారు కావడం నాకు సంతోషంగా ఉంది. మీ ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ కోచ్లు, నిపుణులు, సహాయక సిబ్బందిని కూడా నియమించారు. ఈసారి పారిస్ లో అద్భుతాన్ని చూడబోతున్నారు. పారిస్ పారాలింపిక్ గేమ్స్ విలేజ్ లో మీ అందరి కోసం ప్రత్యేక రికవరీ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ రికవరీ సెంటర్ మీకు చాలా సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

పారిస్ 2024 పారాలింపిక్స్ దేశానికి అనేక విధాలుగా ప్రత్యేకం. అనేక క్రీడలలో మా స్లాట్లు పెరిగాయి, మా భాగస్వామ్యం పెరిగింది. పారిస్ పారాలింపిక్స్ భారత్ స్వర్ణ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. కొత్త రికార్డులు నెలకొల్పిన తర్వాత మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మేము మళ్లీ కలుస్తాము. మరోసారి యావత్ దేశం తరఫున మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశం మొత్తం మీ కోసం ఒక మంత్రాన్ని జపిస్తోంది- 'విజయీ భవ' (మీరు విజయం సాధించాలి). విజయీ భవ. విజయీ భవ.

ధన్యవాదాలు.

 

***


(Release ID: 2048976)