ప్రధాన మంత్రి కార్యాలయం

మార్చి 11 హరియాణాలో పర్యటించనున్న ప్రధాని


వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

ద్వారకా ఎక్స్ ప్రెస్ వే లోని 19 కిలోమీటర్ల పొడవైన హర్యానా సెక్షన్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

జాతీయ రహదారి నెట్ వర్క్ అభివృద్ధికి, దేశవ్యాప్తంగా సామాజిక - ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడనున్న ప్రాజెక్టులు

Posted On: 10 MAR 2024 11:11AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రోజు (2024 మార్చి11) హర్యానాలోని గురుగ్రామ్ లో పర్యటించ నున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి దేశ వ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.

జాతీయ రహదారి-48పై ఢిల్లీ- గురుగ్రామ్ మధ్య ట్రాఫిక్ ను మెరుగు పరచడానికి , రద్దీని తగ్గించడానికి దోహదపడే ల్యాండ్ మార్క్ ద్వారకా ఎక్స్ ప్రెస్ వే హర్యానా విభాగాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఎనిమిది లేన్ ద్వారకా ఎక్స్ ప్రెస్ వే లోని 19 కిలోమీటర్ల పొడవైన హర్యానా సెక్షన్ ను సుమారు రూ.4,100 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 10.2 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-హర్యానా బోర్డర్ నుండి బసాయి రైల్-ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి), 8.7 కిలోమీటర్ల పొడవైన బసాయి ఆర్ఓబి నుండి ఖేర్కి దౌలా వరకు రెండు ప్యాకేజీలు సెక్షన్ లో ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి, గురుగ్రామ్ బైపాస్ కు ఇది నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది.

ప్రధాన మంత్రి ప్రారంభించనున్న ఇతర ప్రధాన ప్రాజెక్టులలో - నంగ్లోయి - నజఫ్ ఘడ్ రోడ్డు నుంచి ఢిల్లీలోని సెక్టార్ 24 ద్వారకా సెక్షన్ వరకు 9.6 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-2 (యు ఆర్-2)- ప్యాకేజీ 3; ఉత్తరప్రదేశ్ లో సుమారు 4,600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన లక్నో రింగ్ రోడ్డు మూడు ప్యాకేజీలు ; ఆంధ్రప్రదేశ్ లో రూ 2,950 కోట్లతో అభివృద్ధి చేసిన ఎన్ హెచ్ 16 లోని ఆనందపురం- పెందుర్తి- అనకాపల్లి సెక్షన్ ; హిమాచల్ ప్రదేశ్ లో సుమారు ఎన్ హెచ్ -21 (2 ప్యాకేజీలు)లో రూ.3,400 కోట్ల విలువైన కిరాత్ పూర్ నుంచి నెర్ చౌక్ సెక్షన్; కర్ణాటకలో రూ.2,750 కోట్ల విలువైన దోబాస్ పేట - హెస్కోటే సెక్షన్ (రెండు ప్యాకేజీలు) ; ఇంకా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రూ.20,500 కోట్ల విలువైన 42 ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన కూడా చేయనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ లో రూ.14,000 కోట్ల విలువైన బెంగళూరు - కడప - విజయవాడ ఎక్స్ ప్రెస్ వేకు చెందిన 14 ప్యాకేజీ లు; కర్ణాటకలో రూ.8,000 కోట్ల విలువైన ఎన్ హెచ్ -748 లోని బెల్గాం - హుంగుండ్ - రాయచూర్ సెక్షన్ ఆరు ప్యాకేజీలు; హర్యానాలో రూ.4,900 కోట్ల విలువైన షామ్లీ - అంబాలా హైవే మూడు ప్యాకేజీలు; పంజాబ్ లో రూ.3,800 కోట్ల విలువైన అమృత్ సర్ - బటిండా కారిడార్ రెండు ప్యాకేజీలు; ఇంకా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రూ.32,700 కోట్ల విలువైన 39 ప్రాజెక్టులు ఉన్నాయి.

ప్రాజెక్టులు జాతీయ రహదారి నెట్వర్క్ అభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తాయి, అలాగే సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచడానికి, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి , దేశవ్యాప్తంగా ప్రాంతాలలో వ్యాపారం వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

 



(Release ID: 2013384) Visitor Counter : 109