ప్రధాన మంత్రి కార్యాలయం

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి


‘‘మోదీ కీ గ్యారంటీ’’ వాహనం నేడు దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుతోంది’’

‘‘వికాస్ భారత్ సంకల్ప్ యాత్రను మోదీ ప్రారంభించినప్పటికీ నేడు దేశ ప్రజలు దాన్ని ముందుకు నడిపే బాధ్యత తీసుకున్నారనేది వాస్తవం’’

‘‘దానికి బలం చేకూరుస్తూ దేశంలోని వందలాలది చిన్న నగరాలు ప్రపంచంలో అభివృద్ధి చెందిన భారత్ ముఖచిత్రాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి’’

‘‘ఇతరుల అంచనాలన్నీ ఆగిపోయిన చోట మోదీ గ్యారంటీ ప్రారంభమవుతుంది’’

‘‘పట్టణాల్లోని కుటుంబాలకు సొమ్ము ఆదా చేయడంపై ప్రభుత్వం కట్టుబడి ఉంది’’

‘‘గత 10 సంవత్సరాల కాలంలో ఆధునిక ప్రజా రవాణాపై జరిగిన కృషి సరిపోల్చడానికి వీలు లేనిది’’

Posted On: 16 DEC 2023 6:14PM by PIB Hyderabad

వికసిత్  భారత్  సంకల్ప్  యాత్ర లబ్ధిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  వీడియో కాన్ఫరెన్సింగ్  ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్  గఢ్, తెలంగాణ, మిజోరంలలో వికసిత్  భారత్  సంకల్ప్  యాత్రలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఐదు రాష్ర్టాల్లో-రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరం-వికసిత్  భారత్  సంకల్ప్  యాత్ర ప్రారంభించే అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేడు ‘‘మోదీ కీ గ్యారంటీ’’ వాహనం దేశంలోని అన్ని రాష్ర్టాలకు చేరుతున్నదని చెప్పారు. నెల రోజుల ప్రయాణంలో విబిఎస్ వై వేలాది గ్రామాలతో పాటు 1500 చిన్న, పెద్ద నగరాలను తిరిగి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందు వల్ల ఇంతకు ముందు విబిఎస్ వైను ప్రారంభించలేకపోయినట్టు చెప్పారు. వికసిత్ భారత్  సంకల్ప్  యాత్రను తమ రాష్ర్టాల్లో విస్తరించాలని కొత్తగా ఎన్నికైన ఐదు రాష్ర్టాల ప్రభుత్వాలకు ప్రధానమంత్రి సూచించారు.

వికసిత్  భారత్  యాత్ర సంకల్పంలో ప్రజల  పాత్ర గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా నొక్కి చెబుతూ ‘‘ఈ వికసిత్ భారత్  సంకల్ప్  యాత్రను మోదీ ప్రారంభించినా ప్రజలు దాన్ని ముందుకు నడిపే బాధ్యత స్వీకరించారనేది వాస్తవం’’ అన్నారు. లబ్ధిదారులతో సంభాషించిన సందర్భంగా ‘‘మోదీ కీ గ్యారంటీ కీ గాడీ’’ని ఆహ్వానించాలన్న ఉత్సాహం, పోటీ వారిలో కనిపించాయని ఆయన చెప్పారు.

విబిఎస్ వై ప్రయాణంతో ప్రధానమంత్రి అనుసంధానం కావడం ఇది నాలుగో సారి. గ్రామీణ ప్రజలతో సంభాషించిన సందర్భంగా తాను పిఎం కిసాన్  సమ్మాన్  నిధి, ప్ర‌కృతి వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ గ్రామాలను అభివృద్ధి చేయడం వంటి విభిన్న అంశాలపై మాట్లాడానని ఆయన అన్నారు. నేటి కార్యక్రమంలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు భారీ సంఖ్యలో హాజరు కావడాన్ని ప్రస్తావిస్తూ నేటి ప్రధానాంశం పట్టణాభివృద్ధి అని చెప్పారు.

‘‘దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్  గా తీర్చిదిద్దడంలో మన నగరాలకు పెద్ద పాత్ర ఉంది. స్వాతంత్ర్యానంతరం ఏ మాత్రం అయినా అభివృద్ధి చోటు చేసుకుంటే అది కొన్ని పెద్ద పట్టణాలకే పరిమితం. కాని నేడు రెండో, మూడో శ్రేణి పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తోంది. ఆ రకంగా వందలాది చిన్న నగరాలు అభివృద్ధి చెందిన భారత్  ముఖచిత్రాన్ని మరింత పటిష్ఠం చేయగలుగుతాయి’’ అని ప్రధానమంత్రి చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన చిన్న నగరాల్లో కనీస మౌలిక వసతుల ఏర్పాటు కోసం చేపట్టిన అమృత్  మిషన్, స్మార్ట్   సిటీ మిషన్ వంటి ఉదాహరణలు ప్రస్తావించారు. వీటి వల్ల జీవన సౌలభ్యం, ప్రయాణ సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం పెరిగాయన్నారు. పేదలు,  నవ్య-మధ్య తరగతి, మధ్య తరగతి, సంపన్న వర్గాల వారందరూ  పెంచిన మౌలిక వసతుల ప్రయోజనం పొందుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు.

 

‘‘ప్రభుత్వం ఒక కుటుంబ సభ్యునిగా మీ సమస్యలు తీర్చడానికి ప్రాధాన్యం ఇస్తోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం అందించిన సహాయం గురించి ప్రస్తావిస్తూ 20 కోట్ల మంది పైగా మహిళల ఖాతాల్లోకి నేరుగా వేలాది కోట్ల రూపాయల నగదు బదిలీ, ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ, పేద కుటుంబాలకు ఉచిత రేషన్, చిన్న వ్యాపారాలకు లక్షలాది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం వంటి చర్యల గురించి వివరించారు. ‘‘ఎవరూ ఏమీ చేయలేని స్థితిలో అందరి ఏమీ అంచనా వేయలేని సమయంలో మోదీ గ్యారంటీ ప్రారంభం అవుతుంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వీధి వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడం వల్ల పిఎం  స్వనిధి యోజన పథకం ద్వారా వారు రుణాలు అందుకోగలిగారని పిఎం శ్రీ మోదీ చెప్పారు. పిఎం స్వనిధి యోజన కింద ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా ఆర్థిక సహాయం అందుకోగలిగారని, విబిఎస్  వై ద్వారా 1.25 లక్షల్ మంది ప్రజలు పిఎం స్వనిధికి దరఖాస్తు చేశారని ఆయన తెలిపారు. ‘‘పిఎం స్వనిధి యోజన సభ్యుల్లో 75% మందికి  పైగా దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజన తెగల వారే. అందులోనూ 45% మంది మహిళా లబ్ధిదారులు’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు. బ్యాంకుకు ఎలాంటి గ్యారంటీ చూపలేని వారికి మోదీ గ్యారంటీ ఉపయోగపడిందన్నారు.  

పట్టణ వాసుల సామాజిక భద్రత పెంపునకు ప్రభుత్వ కట్టుబాటును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. భద్రతావలయాన్ని విస్తరింపచేసేందుకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. అటల్  పెన్షన్  స్కీమ్  కింద 6 కోట్ల మంది చందాదారులు నమోదయ్యారన్నారు. వారందరికీ 60 సంవత్సరాల వయసు నుంచి నెలకి రూ.5 వేల పెన్షన్  హామీ ఉంటుందని ఆయన తెలిపారు. పిఎం  సురక్ష బీమా యోజన, జీవన్  జ్యోతి యోజన వంటివి రూ.2 లక్షల వరకు జీవితబీమా కవరేజి కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకాల కింద ఇప్పటికే 17 వేల కోట్ల రూపాయల విలువ గల క్లెయిమ్  లను పరిష్కరించారన్నారు. ఈ పథకాలన్నింటిలోనూ నమోదై భద్రతా వలయాన్ని పెంచుకోవాలని ఆయన అందరినీ అభ్యర్థించారు.

‘‘ఆదాయపు పన్ను మినహాయింపు అవ్వచ్చు లేదా తక్కువ వ్యయాలతో చికిత్స కావచ్చు ఏ మార్గంలో అయినా పట్టణ ప్రజల సొమ్ము ఆదా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధానమంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భారత్  యోజన గురించి మాట్లాడుతూ ఇందులో కోట్లాది మంది  పట్టణ పేదలను చేర్చడం ద్వారా వారికి అందించిన ఆయుష్మాన్  కార్డు వల్ల రూ.1 లక్ష కోట్ల వరకు వైద్య ఖర్చులు ఆదా అయ్యాయన్నారు. అలాగే జన్  ఔషధి కేంద్రాల్లో 80 శాతం డిస్కౌంట్  కే ఔషధాలు అందుబాటులో ఉంటున్నాయని; వాటి ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు రూ.25,000 కోట్లకు పైబడి ఆదా అయిందని ప్రధానమంత్రి వెల్లడించారు. జన్  ఔషధి కేంద్రాల సంఖ్య 25,000కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఉజాలా స్కీమ్  కింద ఎల్ఇడి బల్బుల విప్లవం  ద్వారా పట్టణవాసులకు విద్యుత్  బిల్లుల భారం తగ్గిందని ఆయన తెలిపారు.

ఒకే జాతి, ఒకే రేషన్  కార్డు పథకం వలస కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదన్న విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు. గత 9 సంవత్సరాల కాలంలో పేదలకు 4 కోట్లకు పైగా ఇళ్లు అందించామని, వాటిలో ఒక కోటి వరకు పట్టణ పేదలకు దక్కాయని ఆయన తెలిపారు. రుణ అనుసంధానిత సబ్సిటీ పథకం, సొంత ఇల్లు లేని వారికి హేతుబద్ధమైన అద్దెకు ఇల్లు లభించేలా చూడడం, వలస కార్మికుల కోసం ప్రత్యేక సముదాయాల నిర్మాణం వంటి అంశాలు ప్రస్తావిస్తూ  ‘‘సొంత ఇల్లు కలిగి ఉండాలనే మధ్య తరగతి కల  సాకారం చేయడానికి అవసరం అయిన సహాయం మా ప్రభుత్వం అందిస్తోంది’’ అన్నారు.

‘‘నగరాల్లో నివశిస్తున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు మంచి జీవితం అందించే మరో ప్రధాన సాధనం ప్రజా రవాణా వ్యవస్థ. అలాంటి ఆధునిక రవాణా వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు గత 10 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం సరిపోల్చడానికి వీలు లేనిది’’ అని ప్రధానమంత్రి అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో 15 కొత్త నగరాలకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని, మరో 27 నగరాల్లో మెట్రో నిర్మాణం చురుగ్గా సాగుతున్నదని ఆయన వివరించారు. ‘‘కేవలం రెండు, మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కూడా 500 కొత్త విద్యుత్  బస్సులు ప్రవేశపెట్టింది. దీంతో ఢిల్లీలో తిరుగుతున్న విద్యుత్  బస్సుల సంఖ్య 1300 అయింది’’ అన్నారు.

యువతను, మహిళలను సాధికారం చేసే పెద్ద మాధ్యమాలు నగరాలు అని పేర్కొంటూ ‘‘మోదీ కీ గ్యారంటీ’’ వాహనం యువశక్తిని, మహిళా శక్తిని కూడా సాధికారం చేస్తోంది అని ప్రసంగం ముగిస్తూ ప్రధానమంత్రి చెప్పారు. విబిఎస్  వై ప్రయోజనం గరిష్ఠంగా పొందేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయత్నించాలని, వికసిత్  భారత్  ను ముందుకు నడిపే సంకల్పం చేసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.

పూర్వాపరాలు

ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకాలన్నింటినీ సంతృప్త  స్థాయికి చేర్చడం,  నిర్దిష్ట కాలపరిమితిలో ఈ పథకాల ప్రయోజనాలన్నీ లబ్ధిదారులకు చేరేలా చూడాలన్న సంకల్పంతో వికసిత్  భారత్  సంకల్ప్  యాత్రను చేపట్టారు.

దేశవ్యాప్తంగా వేలాది మంది వికసిత్  భారత్  సంకల్ప్  యాత్ర లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో చేరారు. అలాగే భారీ సంఖ్యలో కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు.

దేశవ్యాప్తంగా వికసిత్  భారత్  సంకల్ప్  యాత్ర ప్రభావం చూసి ఆనందం కలిగింది. https://t.co/11WtwGdGOj



(Release ID: 1989574) Visitor Counter : 60