సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

9 సంవత్సరాలలో 332% అమ్మకాల వృద్ధిని నమోదు చేసి చరిత్ర సృష్టించిన కేవీఐసీ

Posted On: 08 JUN 2023 7:29PM by PIB Hyderabad

 

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ద్వారా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) బలమైన భారతదేశ సంతృప్తికరమైన చిత్రాన్ని ప్రపంచం ముందు ఉంచింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఉత్పత్తుల టర్నోవర్ రూ.1.34 లక్షల కోట్లు దాటింది. గత 9 ఆర్థిక సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులు తయారు చేసిన స్వదేశీ ఖాదీ ఉత్పత్తుల అమ్మకాల్లో అనూహ్యంగా 332 శాతం వృద్ధి నమోదైంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల టర్నోవర్ రూ.31,154 కోట్లు కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1,34,630 కోట్లకు పెరిగింది. ఇది ఇప్పటివరకు సాధించిన అత్యుత్తమ విజయం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 9,54,899 కొత్త ఉద్యోగాలను సృష్టించడం ద్వారా కేవీఐసీ కొత్త మైలురాయిని నెలకొల్పింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017Z1K.jpg

మహాత్మా గాంధీ నిజమైన స్ఫూర్తికి, గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'బ్రాండ్ శక్తి'తో పాటు దేశంలోని మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న కళాకారుల అవిశ్రాంత కృషికి ఈ విజయం తాలూకు ఘనత చెందుతుందని కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ అన్నారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవిదేశాల్లోని ప్రతి వేదికపై ఖాదీని ప్రోత్సహించారని, దీని వల్ల ఖాదీ ప్రజాదరణలో కొత్త శిఖరాన్ని చేరుకుందని ఆయన పేర్కొన్నారు. నేడు ఖాదీ ఉత్పత్తులు ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఒకటిగా లెక్కించబడుతున్నాయని ఆయన అన్నారు. 2013-14 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేవీఐ ఉత్పత్తుల ఉత్పత్తిలో 268 శాతం వృద్ధి నమోదు కాగా, అమ్మకాలు 332 శాతానికి చేరుకుని అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. 'మేకిన్ ఇండియా', 'వోకల్ ఫర్ లోకల్', 'స్వదేశీ ఉత్పత్తుల'పై దేశ ప్రజల విశ్వాసం పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2023-06-08at8.23.12PMN617.jpeg

కేంద్రంలోని 'మోదీ ప్రభుత్వం' తొమ్మిదేళ్ల పాలనలో కేవీఐసీ కృషితో 'స్వావలంబన తో సమృద్ధి' పేరిట తొమ్మిది రికార్డులు నెలకొల్పి ఖాదీకి కొత్త జీవం పోశాయి.

  1. కేవీఐసీ ఉత్పత్తుల ఉత్పత్తిలో అసాధారణ వృద్ధి - 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవీఐ ఉత్పత్తుల ఉత్పత్తి రూ.26,109 కోట్లు కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 268 శాతం వృద్ధితో రూ.95,957 కోట్లకు చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కేవీఐసీ అద్భుతంగా పనిచేసిందనడానికి ఈ ఉత్పత్తి గణాంకాలే నిదర్శనం.
  2. కేవీఐ ఉత్పత్తుల విక్రయాల్లో భారీ పెరుగుదల - గత 9 ఆర్థిక సంవత్సరాల్లో, అమ్మకాల పరంగా కేవీఐ ఉత్పత్తులు ప్రతి సంవత్సరం కొత్త రికార్డులను సృష్టించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.31,154 కోట్లు కాగా, అనూహ్యంగా 332 శాతం వృద్ధితో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,34,630 కోట్లకు చేరుకున్నాయి.
  3. ఖాదీ వస్త్రాల ఉత్పత్తిలో కొత్త రికార్డు - గత తొమ్మిదేళ్లలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తిలో సాటిలేని వృద్ధి నమోదైంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తి రూ.811 కోట్లు కాగా, 260 శాతం వృద్ధితో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2916 కోట్లకు చేరుకుంది. ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన.
  4. ఖాదీ వస్త్ర విక్రయాలు కూడా కొత్త చరిత్ర సృష్టించాయి గత 9 ఆర్థిక సంవత్సరాల్లో ఖాదీ వస్త్రాలకు డిమాండ్ వేగంగా పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.1081 కోట్లు మాత్రమే అమ్మకాలు జరగ్గా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో అది 450 శాతం పెరిగి రూ.5943 కోట్లకు చేరుకుంది. కొవిడ్ -19 తర్వాత ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ దుస్తులకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ఖాదీ వస్త్రాలకు డిమాండ్ వేగంగా పెరిగింది. దీనితో పాటు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి వేదికపై ఖాదీని ప్రోత్సహించడం కూడా ఖాదీ వస్త్రాల అమ్మకాలను పెంచడంలో భారీ ప్రభావాన్ని చూపింది.
  5. కొత్త ఉపాధి కల్పన, సంచిత ఉపాధి కల్పన (క్యుములేటివ్ ఎంప్లాయిమెంట్ జనరేషన్) లో కొత్త రికార్డు - గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ట ఉపాధి అవకాశాలు కల్పించడమే కేవీఐసీ ప్రధాన లక్ష్యం. గత తొమ్మిదేళ్లలో ఈ రంగాల్లో కూడా కేవీఐసీ రికార్డు సృష్టించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉపాధి 1,30,38,444 ఉండగా, 36 శాతం పెరుగుదలతో 2022-23 నాటికి 177,16,288కి చేరింది. అదేవిధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 5,62,521 కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 70% పెరుగుదలతో మొత్తం 9,54,899 ఉపాధి అవకాశాలను సృష్టించింది.
  6. ఖాదీ కళాకారులకు రికార్డు స్థాయిలో వేతనాలు పెంపు - ఖాదీ రంగంతో సంబంధం ఉన్న ఖాదీ కళాకారులు కూడా ఖాదీ వస్త్రాల ఉత్పత్తిని, అమ్మకాలను పెంచడం వల్ల ప్రయోజనం పొందుతున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి వీరి వేతనాలు 150 శాతానికి పైగా పెరిగాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఖాదీ కళాకారుల వేతనాలు 33 శాతానికి పైగా పెరిగాయి.
  7. న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న 'ఖాదీ భవన్ ' కొత్త రికార్డు - అక్టోబర్ 2, 2022 న, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో కేవీఐసీ ఫ్లాగ్షిప్ (ప్రధాన విక్రయం) 'ఖాదీ భవన్' అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టాయి. ప్రధాని విజ్ఞప్తి మేరకు ఖాదీ ప్రియులు ఒక్కరోజులోనే రూ.1.34 కోట్ల విలువైన కేవీఐ ఉత్పత్తులను కొనుగోలు చేసి తొలిసారిగా సరికొత్త రికార్డు సృష్టించారు.
  8. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)ద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' రూపకల్పన - ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వదేశీ ప్రచారం తో దేశంలోని యువతను భాగస్వామ్యం చేయడంలో పీఎంఈజీపీ కొత్త రికార్డును నెలకొల్పింది. 'ఉద్యోగార్థిగా కాకుండా ఉద్యోగ ప్రదాతగా మారాలి' అనే ప్రధాని మోదీ కలను ఈ పథకం నెరవేరుస్తుంది. 2008-09 నుంచి 2022-23 వరకు మొత్తం రూ.21,870.18 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ పంపిణీతో ఈ ఆర్థిక సంవత్సరంలో 8.69 లక్షల కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం 73.67 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అంతే కాదు 80 శాతానికి పైగా యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు కాగా, అందులో 50 శాతానికి పైగా యూనిట్లు ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తల ఆధీనంలో ఉన్నాయి. అలాగే, ఆకాంక్షిత జిల్లాల్లో 14 శాతానికి పైగా యూనిట్లను ఏర్పాటు చేశారు. 2022-23లో 85167 యూనిట్ల ద్వారా 9.37 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.
  9. 'గ్రామోద్యోగ్ వికాస్ యోజన'లో కొత్త రికార్డు - నిరుపేదలు, సమాజంలో అట్టడుగు స్థాయిలో పనిచేసే చేతివృత్తుల సంక్షేమం కోసం 'గ్రామ్ వికాస్ యోజన' కింద కేవీఐసీ పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2017-18 నుంచి ఇప్పటి వరకు 1,89,989 లక్షల తేనెటీగల బాక్సులు, తేనెటీగల కాలనీలను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హనీ మిషన్' కార్యక్రమం కింద మొత్తం 19,118 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదేవిధంగా ‘కుమ్హర్ సశక్తికరణ్ కార్యక్రమం’ ద్వారా ఇప్పటి వరకు 25 వేల మందికి పైగా కుమ్మరులకు ఆధునిక విద్యుత్ కుమ్మరి చక్రాలు పంపిణీ చేయబడ్డాయి.


(Release ID: 1930893) Visitor Counter : 214