ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 టీకాల పరిస్థితిపై ప్రధాని అధ్యక్షతన సమీక్ష సమావేశం


మౌలిక ఆరోగ్య వసతుల పెంపుపై ప్రధానమంత్రికి అధికారుల వివరణ

ప్రతి జిల్లాల్లో మందుల అత్యవసర నిల్వ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచన

టీకాల ఉత్పత్తి, సరఫరా, రాబోయే కొత్త టీకాలపై ప్రధానమంత్రి సమీక్ష

కొత్త వైరస్ రకాల ఆవిర్భావంపై పర్యవేక్షణ దిశగా నిరంతర జన్యుక్రమ పరిశీలన ఆవశ్యకత గురించి వివరించిన ప్రధానమంత్రి

Posted On: 10 SEP 2021 8:38PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 సంబంధిత పరిస్థితులపై సమీక్షించేందుకు నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత కోవిడ్-19 నేపథ్యంసహా ప్రతిస్పందన దిశగా ఆరోగ్య వ్యవస్థల సంసిద్ధత, వైద్య ఆక్సిజన్ లభ్యత, కోవిడ్-19 టీకాల తయారీ, సరఫరా, పంపిణీ తదితరాలకు సంబంధించిన అంశాలను  ఆయన సమీక్షించారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో నేటికీ కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడంపైనా సమావేశం చర్చించింది. అలాగే మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలోనూ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉదాసీనతకు తావుండరాదని సమావేశం అభిప్రాయపడింది. అయితే, దేశవ్యాప్తంగా వారంవారీ నిర్ధారిత కేసుల సంఖ్య వరుసగా పదోవారం 3 శాతానికి లోపే ఉండటం గమనార్హం.

దేశంలోని కొన్ని భౌగోళిక ప్రాంతాలతోపాటు, జిల్లాల్లో పరీక్షల తర్వాత నిర్ధారిత కేసులు ఎక్కువగా ఉండటం గురించి అధికారులు ప్రధానమంత్రికి సమాచారమిచ్చారు. దీంతోపాటు పరీక్షల నిర్వహణ నేపథ్యంలో వారం వారీగా నిర్ధారణ అవుతున్న కేసుల శాతం గురించి ఆయనకు తెలియజేశారు. దీనిపై ప్రధానమంత్రి స్పిందిస్తూ- కొత్త వైరస్ రకాల ఆవిర్భావంపై పర్యవేక్షణలో భాగంగా జన్యుక్రమ పరిశీలన నిరంతరం సాగాల్సిన ఆవశ్యకతను వివరించారు. రోగ నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేయడానికి చర్యలు చేపట్టిన దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇన్సాకాగ్ పరిధిలో ప్రస్తుతం 28 ప్రయోగశాలలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పరీక్షలపై చికిత్స సంబంధిత అంశాలను సరిపోల్చడం కోసం ప్రయోగశాలల నెట్‌వ‌ర్క్‌ను ఆస్పత్రుల నెట్‌వ‌ర్క్‌తో అనుసంధానించినట్లు చెప్పారు. మరోవైపు జన్యుక్రమంపై నిఘా కోసం మురుగు నమూనాలపైనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా సార్స్ సీవోవీ2 నిర్ధారిత నమూనాలను ఇన్సాకాగ్తో క్రమం తప్పకుండా పంచుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు ప్రధానమంత్రికి వారు తెలిపారు.

బాలల ఆరోగ్య సంరక్షణ దిశగా పడకల సంఖ్య పెంపు పరిస్థితి గురించి ప్రధానమంత్రి సమీక్షించారు. అలాగే కోవిడ్ అత్యవసర స్పందన ప్యాకేజీ-2 కింద సహాయంతో కల్పిస్తున్న వసతులను పెంచడంపైనా ఆయన వాకబు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలల ఆరోగ్య సంరక్షణ సంబంధిత పరిస్థితుల నిర్వహణ కోసం ప్రాథమిక, సమితిస్థాయి ఆరోగ్య మౌలిక వసతుల నవీకరణ, పునఃరూపకల్పన చేపట్టడంపై రాష్ట్రాలకు సూచించడం గురించి సమావేశం చర్చించింది. దీంతోపాటు ప్రతి జిల్లాలో కోవిడ్-19, మ్యూకోర్ మైకోసిస్, ఎంఐఎస్-సి వంటివాటికి చికిత్స సంబంధిత మందుల అత్యవసర నిల్వ నిర్వహణ దిశగా రాష్ట్రాలను కోరినట్లు అధికారులు ప్రధానమంత్రికి తెలియజేశారు.

కాంత చికిత్స, ఆక్సిజన్, ఐసీయూ పడకలు, బాలల ఐసీయూలతోపాటు వారికోసం వెంటిలేటర్లు తదితరాల సంఖ్య పెంపుగురించి అధికారులు ప్రధానికి వివరించారు. రాబోయే నెలల్లో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకల సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రోగనిర్ధారణ పరీక్షలు కూడా తగినంతగా నిర్వహించడంపై ప్రధానమంత్రి మాట్లాడారు. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ- మొత్తం 433 జిల్లాల్లోని ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాల్లో ఆర్టీ-పీసీఆర్ ప్రయోగశాలల ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు అధికారులు ప్రధానికి తెలియజేశారు.

క్సిజన్ కాన్‌సెంట్రేట‌ర్లు సహా ప్రాణవాయువు-సిలిండర్ల లభ్యత పెంపునకు భరోసా, పీఎస్ఏ ప్లాంట్లు తదితర సదుపాయాలను వేగంగా పెంచాల్సిన అవసరం గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక యూనిట్ ఉండాలన్న లక్ష్యానికి అనుగుణంగా 961 ద్రవ వైద్య ఆక్సిజన్ నిల్వ ట్యాంకులు, 1,450 వైద్య వాయు పైప్ లైన్ వ్యవస్థల ఏర్పాటుకు కృషి సాగుతున్నదని తెలిపారు. అదేవిధంగా ప్రతి సమితికీ ఒక ఆంబులెన్స్ అందుబాటులో ఉండేవిధంగా ఆంబులెన్సుల నెట్ వర్కును కూడా పెంచుతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిని ప్రధాని ఈ సందర్భంగా సమీక్షించారు. కాగా, రాష్ట్రాలకు లక్ష ఆక్సిజన్ కాన్‌సెంట్రేట‌ర్లు, 3 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసినట్లు అధికారులు ప్రధానికి తెలియజేశారు.

దేశ జనాభాలోని వయోజనుల్లో 58 శాతం తొలివిడత, 18 శాతం రెండో విడత టీకాలు  తీసుకున్నట్లు అధికారులు ప్రధానమంత్రి వివరించారు. కొత్తగా రాబోయే టీకాలు, ప్రస్తుతం టీకాల సరఫరా వివరాలను వారు ప్రధానికి తెలిపారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, మంత్రిమండలి కార్యదర్శి, ముఖ్య శాస్త్రవిజ్ఞాన సలహాదారు, ఆరోగ్యశాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడుసహా వివిధ శాఖల ముఖ్యమైన అధికారులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1754019) Visitor Counter : 206