ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

లక్షణాలుంటే కోవిడ్ నెగటివ్ కేసులన్నీ మళ్ళీ ఆర్ టి పిసిఆర్ ద్వారా పరీక్షించాలి

వైరస్ వ్యాప్తి అరికట్టేలా పాజిటివ్ కేసు ఒక్కటీ వదలకండి: రాష్ట్రాలను కోరిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ

Posted On: 10 SEP 2020 12:43PM by PIB Hyderabad

లక్షణాలు కనబరచినా రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారికి  కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఆర్ టి - పిసి ఆర్ పరీక్షలు చేయటం లేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ దృష్టికి వచ్చింది. భారత వైద్య పరిశోధనామండలి ( ఐసిఎంఆర్), కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నాయి. రెండు నిర్దిష్ట విభాగాలకు చెందిన వ్యక్తులను ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు జరిపి తీరాల్సిందేనన్న మార్గదర్శకాలు పాటించాలని పేర్కొన్నాయి:

1. జ్వరం, దగ్గు, ఊపిరి పీల్చటంలో ఇబ్బంది లాంటి సమస్యలున్న వారి రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నెగటివ్ చూపించినప్పుడు.

2. ఎలాంటి లక్షణాలూ లేకపోయినా రాపిడ్ యాంటెజెన్ పరీక్షల్లో నెగటివ్ చూపించినా రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు మొదలైన కేసులు

 ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఐసిఎంఆర్ ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ లేఖలు రాశాయి. లక్షణాలు కనబడుతున్నా, రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగటివ్ వచ్చిన కేసులన్నిటికీ తప్పనిసరిగా ఆర్ టి- పిసిఆర్ పరీక్షలు చేయించాలని ఆ లేఖలో కోరాయి.  ఇలాంటి కేసులు పరీక్షలకు నోచుకోకుండా అలాగే ఉండిపోతే వైరస్ ను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. అలా మళ్లీ కచ్చితమైన పరీక్షలు జరపటం ద్వారా పొరపాట్లను తొలిదశలోనే గుర్తించి ఆస్పత్రికి తరలించటమో, ఐసొలేషన్ లో ఉంచటమో సాధ్యమవుతుందని పేర్కొన్నాయి. కేవలం విస్తృతంగా అందుబాటులో ఉంచేందుకే రాపిడ్ యాంటిజెన్ టెస్టులు తప్ప పూర్తి స్థాయ్తి నిర్థారణకు పనికిరావన్న సంగతి గుర్తించాలని ఆ ఉమ్మడి లేఖలో పేర్కొన్నాయి. ఆర్ టి - పిసిఆర్ ను మాత్రమే అత్యంత ప్రామాణికంగా భావించాలని సూచించాయి.

ప్రతి జిల్లాలో ఒక అధికారిని లేదా ఒక బృందాన్ని నియమించి పర్యవేక్షణ యంత్రాంగాన్ని నెలకొల్పాలని, ఇలాంటి కేసులపట్ల చర్యలు తీసుకునేట్టు చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. రోజువారీ రాపిడ్ యాంటిజెన్ పరీక్షలను విశ్లేషించి జిల్లాల వారీగా అన్ని రాష్ట్రాలలో లక్షణాలుండే నెగటివ్ కేసులకు మళ్లీ పరీక్షలు జరిపించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం, ఎలాంటి ఆలస్యమూ లేకుండా చూడటం ఈ బృందాల బాధ్యత. పాజిటివ్ అయ్యే అవకాశమున్న కేసు ఒక్కటీ మిస్సయ్యే పరిస్థితి లేకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకోవటమే దీని వెనుక అసలు లక్ష్యం. అలాంటి కేసులకు ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు జరిపిస్తే ఎన్ని పాజిటివ్ లుగా తేలాయో కూడా పర్యవేక్షించాలని రాష్ట్రాలకు సూచించింది.

 

****

 



(Release ID: 1652973) Visitor Counter : 176