ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశంలో బొమ్మల తయారీని పెంచే మార్గాలపై చర్చించడానికి సమావేశాన్ని నిర్వహించిన - ప్రధానమంత్రి.

సాంకేతికత, ఆవిష్కరణల వాడకంపై మరియు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలని సూచించిన - ప్రధానమంత్రి.

భారతీయ సంస్కృతి, నీతినియమాలతో అనుసంధానించబడిన బొమ్మలను, అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం బోధనా సాధనాలుగా ఉపయోగించాలి : ప్రధానమంత్రి.

‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని పెంచడానికి బొమ్మలు ఒక అద్భుతమైన మాధ్యమం : ప్రధానమంత్రి

బొమ్మల సాంకేతిక పరిజ్ఞానం మరియు రూపకల్పనలో ఆవిష్కరణల కోసం హాకథాన్‌లను నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన - ప్రధానమంత్రి.

భారతీయ సంస్కృతి మరియు జానపద కథల నుండి ప్రేరణ పొందిన ఆటలను అభివృద్ధి చేయడం ద్వారా డిజిటల్ గేమింగ్ రంగంలో భారతదేశ భారీ సామర్థ్యాన్ని వినియోగించాలి : ప్రధానమంత్రి.

Posted On: 22 AUG 2020 9:01PM by PIB Hyderabad

భారతీయ బొమ్మల తయారీనీ, భారతీయ బొమ్మలపై  ప్రపంచ ప్రభావాన్నీ పెంపొందించే మార్గాలపై చర్చించడానికి,  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు సీనియర్ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

భారతదేశం అనేక బొమ్మలు తయారుచేసే ప్రాంతాలకూ, స్వదేశీ బొమ్మలను ఉత్పత్తి చేసే వేలాది మంది చేతివృత్తులవారికీ, నివాసంగా ఉందనీ, ఈ బొమ్మలు సాంస్కృతిక అనుసంధానం కలిగి ఉండటంతో పాటు, చిన్న వయస్సులోనే పిల్లల్లో జీవిత నైపుణ్యాలు మరియు మేధో వికాస నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  వినూత్న, సృజనాత్మక పద్ధతుల ద్వారా, బొమ్మలు తయారుచేసే ఇలాంటి ప్రాంతాలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. 

భారతీయ బొమ్మల మార్కెట్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని మరియు ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారం కింద ‘లోకల్ ఫర్ లోకల్’ ను ప్రోత్సహించడం ద్వారా పరిశ్రమలో పరివర్తన కలిగించే మార్పును తీసుకురాగలమని తెలియజేశారు.  సాంకేతికత మరియు ఆవిష్కరణల వాడకంపై, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై కూడా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి సూచించారు. 

పిల్లల మానసిక ప్రక్రియ / మేధో వికాస నైపుణ్యాలపై బొమ్మల ప్రభావం మరియు అది సామాజిక మార్పుకు సాధనంగా ఎలా మారుతుందనే పరిస్థితిపై, దేశం యొక్క భవిష్యత్ తరాన్ని రూపొందించడం ఆధారపడి ఉంటుందనే విషయాన్ని చర్చించడం జరిగింది. 

పిల్లల మనస్సులను మలచడంలో బొమ్మల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి ఎత్తిచూపూతూ, భారతీయ సంస్కృతి మరియు నీతినియమాలతో కూడిన బొమ్మలను పిల్లల సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి కోసం అన్ని అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలల్లో బోధనా సాధనాలుగా ఉపయోగించాలని సూచించారు.  జాతీయ లక్ష్యాలు, విజయాల పట్ల ఆత్మ గౌరవ భావాన్ని కలిగించే వినూత్న నమూనాలు మరియు బొమ్మలతో యువత నిమగ్నమవ్వాలని కూడా ఆయన సూచించారు.

‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ యొక్క స్ఫూర్తిని పెంచడానికి బొమ్మలు ఒక అద్భుతమైన మాధ్యమమని ప్రధానమంత్రి గుర్తించారు. భారతదేశ ప్రాచీన విలువల వ్యవస్థతో పాటు, సాంస్కృతికంగా స్థాపితమైన పర్యావరణ అనుకూల విధానాన్ని బొమ్మలు ప్రతిబింబించేలా ఉండాలని ఆయన సూచించారు.  ముఖ్యంగా చేతితో తయారు చేసిన బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో, భారతదేశ సంస్కృతిని ప్రోత్సహించడానికి పర్యాటకాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలని కూడా ఆయన సూచించారు. 

భారతీయ నీతినియమాలు, విలువలను ప్రతిబింబించేలా ఆన్‌ లైన్ ఆటలతో సహా బొమ్మల సాంకేతిక పరిజ్ఞానం మరియు రూపకల్పనలో ఆవిష్కరణల కోసం యువత మరియు విద్యార్థులకు హ్యాకథాన్‌లను నిర్వహించాల్సిన అవసరాన్ని కూడా ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ గేమింగ్ రంగానికి ప్రాధాన్యతనిస్తూ, భారతీయ సంస్కృతి మరియు జానపద కథల నుండి ప్రేరణ పొందిన ఆటలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగంలో భారతదేశ భారీ సామర్థ్యాన్ని వినియోగించి, అంతర్జాతీయ డిజిటల్ గేమింగ్ రంగానికి నాయకత్వం వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. 

*****



(Release ID: 1647990) Visitor Counter : 248