PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 18 AUG 2020 6:30PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • భారత్‌లో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 9 లక్షల నమూనాల పరీక్షతో కొత్త రికార్డు.
  • దేశవ్యాప్తంగా ఒక్కరోజులో కోలుకున్న 57,584 మంది కోవిడ్‌ బాధితులు;
  • ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య అంతరం 13 లక్షలకుపైగా నమోదు.
  • మరణాల సగటు మరింత తగ్గి 1.92 శాతానికి పతనం.
  • ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసులు 6,73,166; మొత్తం కేసులలో కేవలం 24.91 శాతం.
  • దేశీయ టీకా తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన జాతీయ టీకా వ్యవహారాల పర్యవేక్షక నిపుణుల బృందం.

Image

భారత్‌లో ఒకేరోజు 9 లక్షల నమూనాల పరీక్షతో కొత్త రికార్డు; ఒక్కరోజులో కోలుకున్నవారు 57,584 మంది; ప్రస్తుత-కోలుకున్న కేసుల అంతరం 13 లక్షలకుపైగా నమోదు

కోవిడ్ నిర్ధార‌ణ పరీక్షల నిర్వ‌హ‌ణ‌లో భారత్ మరో కొత్త రికార్డు సృష్టించింది. ఈ మేర‌కు తొలిసారి దాదాపు 9 లక్షల (8,99,864) న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గా- దేశంలో నేటిదాకా ప‌రీక్షించిన న‌మూనాల సంఖ్య 3,09,41,264 కు చేరింది. ఇంత భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన నిర్ధారణ అయిన కేసులు జాతీయ వారపు సగటు 8.84 శాతంతో పోలిస్తే ఇంకా తగ్గి 8.81 శాతంగా మాత్రమే ఉండటం విశేషం. ఇక గత 24 గంటల్లో 57,584 మంది కోలుకోగా కొత్తగా నమోదైన 55,079 కేసులకన్నా ఇది అధికం కావడం గమనార్హం. రోజురోజుకూ మరింతమంది కోలుకుంటున్న నేపథ్యంలో ఇప్పటివరకూ వ్యాధి నయమైనవారి సంఖ్య 19 లక్షలకుపైగా (19,77,779) నమోదైంది. దీంతో ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య అంతరం నానాటికీ పెరుగుతూ ఇవాళ్టికి 13 లక్షలు (13,04,613)దాటింది. ఆ మేరకు కోలుకునేవారి జాతీయ సగటు 73.18 శాతానికి చేరింది.  అలాగే నమోదైన మొత్తం కేసులలో మరణాల సగటు కూడా బాగా తగ్గుతూ నేడు 1.92 శాతానికి పతనమైంది. ఇక దేశంలోని 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత జాతీయ సగటుకన్నా తక్కువగా ఉంది. మొత్తం నమోదైన కేసులలో ప్రస్తుతం చికిత్స పొందే (6,73,166) కేసులు కేవలం 24.91 శాతంగా మాత్రమే ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న పరీక్షా వ్యూహం మేరకు నానాటికీ విస్తరిస్తున్న ప్రయోగశాలల నెట్‌వర్క్‌ ఇందుకు ప్రముఖంగా తోడ్పడుతోంది. తదనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 971, ప్రైవేట్ రంగంలో 505 వంతున దేశంలో 1476 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646659

దేశీయ టీకా తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన జాతీయ టీకా వ్యవహారాల పర్యవేక్షక నిపుణుల బృందం

జాతీయ టీకా వ్యవహారాల పర్యవేక్షక నిపుణుల బృందం నిన్న దేశీయ టీకా తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా-పుణె; భారత్ బయోటెక్-హైదరాబాద్;  జైడస్ కాడిలా-అహ్మదాబాద్; జెనోవా బయోఫార్మాస్యూటికల్స్-పుణె; బయోలాజికల్ ఈ-హైదరాబాద్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ పరస్పర ప్రయోజనకరం, నిర్మాణాత్మకంగా సాగింది. దేశంలో వివిధ టీకాల రూపకల్పన దిశగా ప్రగతి గురించి సందర్భంగా వారు నిపుణుల బృందానికి సమాచారం ఇవ్వడంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలపై వారు తమ ఆకాంక్షను వివరించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646540

కోవిడ్‌-19పై భారత-అమెరికా వాస్తవిక సాదృశ నెట్‌వర్క్‌లకు పురస్కార ప్రకటన

భారత-అమెరికా వాస్తవిక సాదృశ నెట్‌వర్క్‌ల ద్వారా కోవిడ్-19 వ్యాధికారక-నిర్వహణ సంబంధిత అత్యాధునిక పరిశోధనల కోసం రెండు దేశాల పరిశోధకులు సభ్యులుగాగల 8 బృందాలకు పురస్కార ప్రదానం జరిగింది. ఈ మేరకు వైరస్‌ నిరోధక లేపనాలు,  రోగ నిరోధక విభాగీకరణ, వ్యర్థజలాల్లో సార్స్ కరోనా వైరస్‌2 (SARS CoV-2) అన్వేషణ, వ్యాధి గుర్తింపు పద్ధతులు, వ్యతిరిక్త జన్యువ్యూహాలు, ఔషధ పునర్నిర్మాణం తదితర అంశాల్లో ఈ బృందాలు పరిశోధనలు చేస్తున్నాయి. భారత-అమెరికా శాస్త్ర-సాంకేతిక వేదిక ఈ పురస్కారాలను ప్రకటించింది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646631

నిరుటితో పోలిస్తే 2020 మార్చి-జూన్‌ మధ్యకాలంలో 23.24 శాతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) గణాంకాల ప్రకారం... 2017లో ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో భారత్‌ ఎగుమతి-దిగుమతుల వాటా 2.27శాతం, 1.90 శాతంగా ఉంది. కాగా, మహమ్మారి దిగ్బంధం సమయంలోనూ ప్రపంచ ఆహార సరఫరా శృంఖలానికి ఆటంకం లేకుండా భారత్‌ తగిన జాగ్రత్తలు తీసుకుని ఎగుమతులను కొనసాగించింది. దీంతో 2020 మార్చి-జూన్ నెలల కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ.25552.7 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు (2019) ఇదే కాలంలో ఎగుమతుల విలువ రూ.20734.8 కోట్లు కాగా, ఈ ఏడాది 23.24 శాతం మేర గణనీయ పెరుగుదల నమోదవడం విశేషం. భారత వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ ఎగుమతులు 2017-18లో 9.4 శాతం కాగా, 2018-19లో 9.9 శాతానికి పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు 5.7 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గాయి. ఈ మేరకు  ఎగుమతి చేయదగిన మిగులు, దిగుమతులపై ఆధారపడటం తగ్గడానికి ఇది సంకేతం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646632

వలస కార్మికులకు చౌక ఇళ్లు స‌మ‌కూర్చే దిశ‌గా ప్ర‌భుత్వంతో చేయి క‌ల‌పాల‌ని ఉక్కు పరిశ్రమకు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు

వలస కార్మికులకు చౌక ఇళ్లు స‌మ‌కూర్చే దిశ‌గా ప్ర‌భుత్వంతో భాగస్వాములు కావాల్సిందిగా ఉక్కు పరిశ్రమ దిగ్గజాలకు కేంద్ర కేంద్ర ఉక్కు-పెట్రోలియం-సహజ వాయువు శాఖ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన ఒక వెబినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేపట్టిన ఈ పథకం గురించి ప్రస్తావించారు. ఈ పథకంలో ప్రభుత్వరంగ సంస్థలు, ఉక్కు పరిశ్రమ దిగ్గజాలు పాలుపంచుకోవాలని సూచించారు. ఉక్కు-అవసరాలతో కూడిన చౌక ఇళ్లను పరిశ్రమ నిర్మించడంద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. పౌరులు ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితి కల్పనకు స్వయం సమృద్ధ భారతం సంకల్పించిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఇలాంటి సంక్షేమ పథకాలలో పరిశ్రమ భాగస్వామి కావడం సముచితమని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646122

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ కేసులతోపాటు ప్రతి 10 లక్షల జనాభాకు మరణాల సగటు పెరగడంపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా మరింత కఠిన ఆంక్షల విధింపునకు తాను వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కేసుల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో దిగ్బంధం విధింపు యోచనను తోసిపుచ్చకపోయినా, ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
  • హర్యానా: కోవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణల హర్యానాను ముందంజలో ఉంచిన అధికారుల నిరంతర కృషిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభినందించారు. అదే సమయంలో అన్వేషణ, అనుసరణ, పరీక్షలు, చికిత్స వ్యూహాన్ని డిప్యూటీ కమిషనర్లందరూ చురుగ్గా అనుసరించాలని ఆదేశించారు వ్యాధి వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరంపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారని, ఆ మేరకు వ్యక్తిగత నిఘా పెట్టాలని సూచించారు.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్‌ సంక్షోభంవల్ల కునారిల్లుతున్న పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.455 కోట్ల రుణ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పారిశ్రామికవేత్తలు 50 శాతం వడ్డీ రాయితీతో రూ.25 లక్షలదాకా రుణం పొందవచ్చునని పర్యాటక శాఖ మంత్రి తెలిపారు. కాగా,  తిరువనంతపురంలో ఈ మధ్యాహ్నందాకా సెంట్రల్ జైలులో ఆరుగురు సహా 36 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. మరోవైపు కోట్టయం, పాలక్కాడ్, కన్నూర్‌లలో పరిచయ వ్యాప్తి కేసుల పెరుగుదల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. కేరళలో మరో రెండు కోవిడ్  మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 171కి పెరిగింది. రాష్ట్రంలో నిన్న 1725 కేసులు నమోదవగా వివిధ జిల్లాల్లో 15,890 మంది చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలోని తూత్తుకుడిలో స్టెర్లైట్ రాగి కరిగించే కర్మాగారం తిరిగి తెరిచేందుకు మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. ఆ మేరకు వేదాంత లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన అన్నిపిటిషన్లనూ తోసిపుచ్చింది. అండమాన్‌-నికోబార్‌ ద్వీపాల్లో కోవిడ్‌ విజృంభణతో మద్రాసు రేవునుంచి ఆ దీవులకు వారపు ప్రయాణిక నౌకలు MV-నికోబార్, MV నాన్‌కౌరీ తమ సేవలు నిలిపివేశాయి. దీంతో దీవులలో పరీక్షల నిర్వహణ సామగ్రికి కొరత ఏర్పడింది. వినాయక విగ్రహాల ఏర్పాటును నిషేధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విగ్రహ తయారీదారుల సంఘం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
  • కర్ణాటక: రాష్ట్రంలోని కెంపెగౌడ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ సంస్థలో కోవిడ్-19 మౌలిక వసతులు, చికిత్స సదుపాయాలపై వైద్యవిద్య మంత్రి డాక్టర్ కె.సుధాకర్ ఇవాళ ప్రత్యక్షంగా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కాగా, బళ్లారిలో ఏకాంత గృహవాస చికిత్స పొందుతున్న వృద్ధ కోవిడ్ రోగి ఆకలి బాధతో మరణించడంపై విచారణకు ఆదేశించారు. కర్ణాటకలో సోమవారం 115 మంది మరణించడంతో మృతుల సంఖ్య 4,062కు చేరింది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై అంచనా దిశగా ఆరోగ్యశాఖ కృష్ణా, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇటీవల ఎంపికచేసిన నమూనా వ్యక్తులకు సెరో సర్వే నిర్వహించింది. ఈ మేరకు కృష్ణా జిల్లాలో 20 శాతం లక్షణరహిత కేసులు వెలుగులోకి రాగా, తమకు వ్యాధి సోకినట్లు కూడా వారికి తెలియదు. ఇక గుంటూరు జిల్లా నరసరావు పేటలో 200 పడకల ఆస్ప్రతిని ప్రారంభించారు. వీటిలో 150 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం, 90 పడకలు వెంటిలేటర్లతో ఉంటాయి. రోగులకు మెరుగైన సేవలకోసం గుంతకల్లు రైల్వే డివిజనల్ ఆస్పత్రిని కోవిడ్ రక్షణ కేంద్రంగా ప్రకటించారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో ప్రభుత్వం వరద హెచ్చరిక జారీచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితిని సమీక్షించారు. కాగా, తెలంగాణలో గత 24 గంటల్లో 1682 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా 2070 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 235 జీహెచ్‌ఎంసీలో నమోదైనవే. మొత్తం కేసులు: 93,937; క్రియాశీల కేసులు: 21,024; మరణాలు: 711; డిశ్చార్జి: 72,202గా ఉంది. ఆరోగ్యశాఖ సమాచారపత్రం ప్రకారం సోమవారం రాత్రి సమయానికి ప్రభుత్వ, ప్రైవేట్ బోధన ఆస్పత్రులలో కోవిడ్-19 రోగులకోసం 17,807 పడకలు అందుబాటులో ఉన్నాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో నిన్న 40 కొత్త కేసులు నమోదవగా 85 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 2792 మందికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కాగా, 1519 మంది కోలుకున్నారు. అసోంలో నమోదైన మొత్తం కేసులు 79,667 కాగా, ప్రస్తుతం క్రియాశీల రోగుల సంఖ్య 22733గా ఉంది.
  • మేఘాలయ: భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ గోవా గవర్నర్‌ శ్రీ సత్యపాల్ మాలిక్‌ను మేఘాలయ కొత్త గవర్నర్‌గా నియమించారు.
  • మణిపూర్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 118 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 4,687కు చేరింది. కాగా, వీరిలో ప్రస్తుతం 1936 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఒక రోగి మరణించడంతో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 17కు చేరింది.
  • మిజోరం: రాష్ట్రంలో గత 24 గంటల్లో 26 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 815కు పెరిగాయి. ఇప్పటిదాకా 372 మంది కోలుకోగా, 443 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
  • నాగాలాండ్: దిమాపూర్‌లోని ఆస్పత్రిలో ఒక డాక్టర్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, జులూకీలోని అసోం రైఫిల్స్ సిబ్బంది తేనింగ్‌లోగల అజైలాంగ్ నిర్బంధ వైద్యకేంద్రంలోని ఖైదీలకు నిత్యావసరాలతోపాటు మంచినీరు అందజేశారు.
  • సిక్కిం: రాష్ట్రంలో 20 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 485కి పెరిగిందని ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌-కార్యదర్శి తెలిపారు. సిక్కింలో ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ ప్రభావం తగ్గించే దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కిం (SBS) అర్హతగల తమ ఖాతాదారుల కోసం రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ  పునరావాస రుణ పథకం కింద రూ.50 లక్షల వరకు నిర్వహణ మూలధనాన్ని కాలవ్యవధి రుణంగా బ్యాంకు అందిస్తుంది. తద్వారా చిన్న-మధ్యతరహా వ్యాపార సంస్థలు ద్రవ్యలోటును భర్తీ చేసుకునే వీలుంటుంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలోని పుణెలో నిర్వహించిన సెరోలాజికల్ సర్వే ఫలితాలు జనాభాలో 50 శాతానికి పైగా ఇప్పటికే వైరస్ బారినపడినట్లు సూచిస్తున్నాయి. అయితే, ఈ ఫలితాల ఆధారంగా పుణె ప్రజానీకంలో సగంమంది కరోనావైరస్ నిరోధకశక్తి కలిగి ఉన్నారన్న నిర్ణయానికి రావద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరీక్షలు చేయించుకున్నవారి శరీరాల్లోగల ప్రతిరోధకాలన్నిటికీ రక్షణ కల్పించే సామర్థ్యం ఉండదని వారు స్పష్టం చేశారు. తటస్థీకరించగల ప్రతిరోధకాలు మాత్రమే ఒక వ్యక్తిని వ్యాధి నుండి రక్షించగలవని పేర్కొన్నారు. కాగా, మొత్తం 1.32 లక్షల కేసులతో పుణె ప్రస్తుతం ముంబైని అధిగమించి మహారాష్ట్రలో కొత్త కోవిడ్ ముప్పు ప్రాంతంగా మారిపోయింది.
  • గుజరాత్: రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధారణ, సామాజిక దూరం నిబంధనల ఉల్లంఘనపై అహ్మదాబాద్ నివాసులు ఇప్పటిదాకా రూ.3.75కోట్ల జరిమానా చెల్లించారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు ప్రజలు మాస్కులు ధరించాలని ఆదేశాలిచ్చిన పురపాలక సంస్థ- దీన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడంతోపాటు తలా ఐదు మాస్కుల ప్యాకెట్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇక గుజరాత్‌లో సోమవారం నమోదైన 1,033 కొత్త కేసులలో 145 అహ్మదాబాద్‌ నుంచి నమోదైనవే కాగా, ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 14,435గా ఉంది.
  • రాజస్థాన్: రాష్ట్ర శాసనసభ సమావేశాలకు శుక్రవారం హాజరైన ఫలోడీ ఎమ్మెల్యే పబ్బారాం విష్ణోయ్ కోవిడ్-19 బారినపడ్డారు. దీంతో తనను కలిసినవారందూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, రాజస్థాన్‌లో సోమవారం 694 కొత్త, 10 మరణాలు నమోదయ్యాయి.
  • గోవా: గోవాలో కోవిడ్‌ పరిస్థితుల తీవ్రత దృష్ట్యా పురపాలక ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా, కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో గోవా విమానాశ్రయంలో విమానాల రాకపోకలు దాదాపు 12 రెట్లు పెరిగాయని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ కాగా, గోవాలో ఇప్పటిదాకా 11,994 కోవిడ్ కేసులు నమోదవగా ప్రస్తుతం 3,825 క్రియాశీల కేసులున్నాయి.

FACT CHECK

***



(Release ID: 1646838) Visitor Counter : 189