రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

పీపీఈ కిట్ల పరీక్ష, ధృవీకరణకు 'సిపెట్‌'కు 'ఎన్‌ఏబీఎల్‌' అనుమతి సిపెట్‌ను అభినందించిన శ్రీ సదానంద గౌడ

Posted On: 19 JUL 2020 3:10PM by PIB Hyderabad

"సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌&టెక్నాలజీ" (సిపెట్‌), కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే అత్యున్నత స్థాయి ప్రధాన సంస్థ. పీపీఈ కిట్ల పరీక్ష, ధృవీకరణకు.. నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబరేషన్‌ లేబరేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌) అనుమతిని ఈ సంస్థ దక్కించుకుంది.

    అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చేతి తొడుగులు‌, కవరాల్స్‌, ముఖ కవచాలు, కళ్లజోళ్లు, మూడు పొరల వైద్య మాస్కులు వంటివి పీపీఈ కిట్ల కిందకు వస్తాయి. కొవిడ్‌పై యుద్ధంలో సిపెట్‌ సాధించిన మరో విజయం ఇది. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా పడిన మరో అడుగు.

    పీపీఈ కిట్ల పరీక్ష సాంకేతికతను అభివృద్ధి చేసిన సిపెట్‌ భువనేశ్వర్‌ కేంద్రం, అనుమతి కోసం ఎన్‌ఏబీఎల్‌కు దరఖాస్తు చేసింది. పరీక్ష సాంకేతికతను ఆన్‌లైన్‌ ద్వారా తనిఖీ చేసిన ఎన్‌ఏబీఎల్‌, అనుమతి మంజూరు చేసింది. ఇతర సిపెట్‌ కేంద్రాలు కూడా అనుమతి కోసం దరఖాస్తు చేశాయి. ఆ ప్రక్రియ కొనసాగుతోంది.

    సిపెట్‌ భువనేశ్వర్‌ కేంద్రాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ అభినందించారు. ప్రజలకు సేవ చేసే మార్గదర్శక పనుల వేగవంతాన్ని కొనసాగించాలని, భారత్‌లో తయారీపై దృష్టి పెట్టేలా ఎంఎస్‌ఎంఈలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు.

    డబ్ల్యూహెచ్‌వో/ఐఎస్‌వో మార్గదర్శకాల ప్రకారం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో, ఆర్&డి కార్యక్రమాలను సిపెట్‌ చేపడుతోంది. కరోనా సమయంలో అత్యవసర సేవలకు మద్దతునిచ్చేందుకు.., ధాన్యం, ఎరువుల ప్యాకింగ్‌ను పరీక్షించే సామర్థ్యాన్ని సిపెట్ విస్తరించింది.

***
    



(Release ID: 1639852) Visitor Counter : 220