హోం మంత్రిత్వ శాఖ

ప్రధాని ఆదేశాల ప్రకారం రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ముప్పు నిర్వహణ

నిధి కింద రూ .11,092 కోట్ల విడుదలకు దేశీయాంగ శాఖ ఆమోదం

Posted On: 03 APR 2020 7:10PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న ముఖ్యమంత్రులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు- అన్ని రాష్ట్రాలకూ రాష్ట్ర విపత్తు ముప్పు నిర్వహణ నిధి (SDRMF) కింద రూ.11,092 కోట్లు విడుదల చేసేందుకు దేశీయాంగ శాఖ (MHA) మంత్రి శ్రీ అమిత్‌ షా ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2020-21కిగాను SDRMFలో త‌న వాటాకింద తొలివిడ‌తగా ఈ నిధులను ముందుగానే విడుద‌ల చేసింది. అలాగే ఆయా రాష్ట్రాల్లో కోవిడ్‌-19 నిరోధం, ఉపశమన చర్యల కోసం ప్రభుత్వాలకు అదనపు నిధుల అందుబాటు దృష్టితో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నిల్వ సొమ్ము ప్రత్యేక వినియోగానికి వీలుగా కేంద్రం 14.03.2020న వెసులుబాటు కల్పించింది. అనుమానిత వ్యాధి పీడితుల దిగ్బంధ కేంద్రాలు, నమూనాల సేకరణ-నిర్ధారణ, అదనపు ప్రయోగశాలల ఏర్పాటు, ఆరోగ్య సేవల సిబ్బంది కోసం వ్యక్తిగత రక్షణ సామగ్రి కొనుగోలు, వెంటిలేటర్లు, థర్మల్‌ స్కానర్లు తదితర సామగ్రి సమీకరణ కోసం రాష్ట్రాలు ఈ నిధులను వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే జాతీయ దిగ్బంధం నేపథ్యంలో వలస కార్మికులు, నిలువనీడ లేని పేదలకు ఆహారం, ఆశ్రయం కల్పించే సదాశయంతో SDRF నిధుల వినియోగానికి రాష్ట్రాలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం 28.03.2020న ఆదేశాలిచ్చింది.

*****



(Release ID: 1610917) Visitor Counter : 255