ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
5 కోట్ల డౌన్లోడ్లు దాటిన ఆధార్ యాప్… సౌకర్యం, నివాస కేంద్రీకృతంగా బలోపేతమైన డిజిటల్ గుర్తింపు సేవలు
ఆధార్ యాప్ ద్వారా 60 లక్షల మందికిపైగా ప్రజల మొబైల్ నంబర్లు, 15 లక్షలకు పైగా చిరునామాల అప్డేట్
ఆఫ్లైన్ ధ్రువీకరణ సంస్థలు (ఓవీఎస్ఈలు)గా 200 సంస్థల నమోదు
प्रविष्टि तिथि:
20 AUG 2026 1:45PM by PIB Hyderabad
ఆధార్ యాప్ 5 కోట్ల డౌన్లోడ్లతో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. దీని ద్వారా సౌకర్యవంతమైన, డిజిటల్ ఆధారిత ఆధార్ సేవల వినియోగం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
నివాసితులకు, యూఐడీఏఐ మధ్య డిజిటల్ వారధిగా యాప్ విస్తరణను ఈ కీలక ఘట్టం సూచిస్తుంది. ఆధార్ గల వ్యక్తులు స్మార్ట్ఫోన్ల ద్వారా మొబైల్ నంబర్, చిరునామా, ఈ-మెయిల్ అప్డేట్, బయోమెట్రిక్ లాక్, అన్లాక్, ఈ-ఆధార్ డౌన్లోడ్ వంటి సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
ప్రారంభమైనప్పటి నుంచి ఈ యాప్ను ఎక్కువగా, నిరంతరంగా వినియోగిస్తున్నారు. ఆధార్ యాప్ ద్వారా 60 లక్షల మందికి పైగా ప్రజలు మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోగా.. 15 లక్షలకు పైగా చిరునామా అప్డేట్లు, 23 లక్షలకు పైగా ఈ-మెయిల్ అప్డేట్లు యాప్ ద్వారా జరిగాయి.
రోజురోజుకూ పెరుగుతున్న ఈ సేవల వినియోగం వల్ల ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండానే డిజిటల్గా ఆధార్ సేవలను పొందటానికి మొగ్గుచూపున్నట్లు స్పష్టమవుతోంది.
“పత్రాలను చూపించటం, పంచుకోవటం, ధ్రువీకరించటం" సూత్రం ఆధారంగా ఆధార్ యాప్ను రూపొందించారు. ఈ యాప్ ఆధార్ గల వ్యక్తులకు ఆధార్ సమాచార వినియోగంపై నియంత్రణను ఇస్తూనే, సౌకర్యవంతమైన గుర్తింపు, ధ్రువీకరణను సాధ్యం చేస్తుంది.
ఆధార్ యాప్ వృద్ధితో పాటు సులభమైన, సురక్షితమైన ఆఫ్లైన్ ధ్రువీకరణకు యూఐడీఏఐ ఈ వ్యవస్థను మరింత విస్తరిస్తోంది. జనవరిలో ప్రారంభించినప్పటి నుంచి ఆఫ్లైన్ ధ్రువీకరణ సంస్థలుగా (ఓవీఎస్ఈలు) 200లకు పైగా సంస్థలను యూఐడీఏఐ నమోదు చేసుకుంది.
ఇది ఆధార్ ఆఫ్లైన్ విధానం ద్వారా సురక్షితమైన, అనుమతి ఆధారిత, కాగిత రహిత ధ్రువీకరణను అందించటంలో కీలక ముందడుగును సూచిస్తుంది. ఇది సేవలందించే వారికి, ప్రజలకు ఒకేలా సాధికారత కల్పిస్తుంది.
ప్రజల గోప్యతకు భంగం కలగకుండా సులభంగా అందుబాటులో ఉండే డిజిటల్ ధ్రువీకరణ వ్యవస్థలపై పెరుగుతున్న విశ్వాసాన్ని భాగస్వాముల చేరిక సూచిస్తుంది. ఇవి సులభంగా అందుబాటులో ఉండేలా చూస్తూనే, వినియోగదారు నియంత్రణకు అధిక ప్రాధాన్యతనిస్తాయి.
యూఐడీఏఐ కేంద్ర డేటాబేస్తో నేరుగా అనుసంధానం అవసరం లేకుండానే క్యూఆర్ కోడ్ ఆధారిత వెరిఫికేషన్, సురక్షితమైన డిజిటల్ సంతకం చేసిన పత్రాలు వంటి ఆఫ్లైన్ ధ్రువీకరణ పద్ధతుల ద్వారా ఈ సంస్థలు ఇప్పుడు గుర్తింపు సమాచారాన్ని ధ్రువీకరించుకోగలుగుతాయి.
ఈ విధానం నివాసితులకు ప్రాధాన్యమిచ్చే బలమైన దృక్పథాన్ని తెస్తుంది. దీనివల్ల ఆధార్ గల వ్యక్తులు అవసరమైన తక్కువ డేటాను మాత్రమే పంచుకునే వీలుంటుంది. తద్వారా గోప్యత మరింత మెరుగవుతుంది. సరళమైన ఈ ధ్రువీకరణ ప్రయాణం పారదర్శకమైన, అనుమతి ఆధారిత పరస్పర చర్యల ద్వారా విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ఈ కార్యక్రమాలు ప్రభుత్వ డిజిటల్ ఇండియా దృక్పథానికి, సురక్షితమైన, సులభంగా అందుబాటులో ఉండే సాంకేతికతతో ప్రభుత్వ సేవల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి.
***
(रिलीज़ आईडी: 2301527)
आगंतुक पटल : 11