పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్రజలే కేంద్రంగా, కార్యాచరణే ప్రాతిపదికగా పర్యావరణ చర్యలకు పిలుపునిచ్చిన భారత్.. 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం
వైజ్ఞానిక వినిమయం, సాంకేతిక సహకారం, బలమైన సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా.. ఈ సహకారాన్ని సామర్థ్యంగా నిర్మించుకోగల బ్రిక్స్: శ్రీ భూపేందర్ యాదవ్
సమాజాలను వెనుకబడనీయకుండా స్థైర్యాన్ని పెంపొందించడం, బాధ్యతతో ఆవిష్కరణలను కొనసాగించడం, సుస్థిరతను అభివృద్ధికి కేంద్రంగా నిలపడం ముఖ్యం
మంత్రివర్గ ఉమ్మడి ప్రకటన ఏకగ్రీవ ఆమోదం, నాలుగు విజ్ఞాన సంకలనాల ప్రారంభంతో ముగిసిన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం
प्रविष्टि तिथि:
18 AUG 2026 3:28PM by PIB Hyderabad
బ్రిక్స్- 2026కు భారత్ అధ్యక్షతన... న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహిస్తున్న 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి హాజరైన బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ స్వాగతం పలికారు.
సమావేశంలో శ్రీ యాదవ్ కీలకోపన్యాసం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళనలు, అంశాలకు అజెండాలో ప్రాధాన్యమివ్వాలన్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పం.. అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్కు దిశానిర్దేశం చేస్తోందన్నారు. ‘మానవత్వమే ప్రథమం’ అనే స్ఫూర్తితో, ప్రజలే కేంద్రమన్న దృక్పథంతో.. ‘సహకారం, సుస్థిరతల కోసం పటిష్టమైన, నవ్యావిష్కరణల నిర్మాణం’గా బ్రిక్స్ను పునర్నిర్వచించడమే లక్ష్యమన్నారు.
వాతావరణ మార్పులు, జీవవైవిధ్య క్షీణత, కాలుష్యం, విపత్తు ప్రమాదాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ సవాళ్లను శ్రీ యాదవ్ ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ ముప్పు, ఆయా దేశాల విస్తృత అభివృద్ధి ప్రాధాన్యాలు ముడిపడి ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. కార్చిచ్చుల నివారణ, సన్నద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, తక్షణ స్పందన, కార్చిచ్చు అనంతర పునరుద్ధరణ చర్యల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే వాతావరణపరంగా ఆర్థిక సాయం, పరిస్థితులకు అనుగుణంగా మారడం, స్థానిక సమాజాల సాధికారత కీలకమైన అంశాలని శ్రీ యాదవ్ స్పష్టం చేశారు.
భారత్ అనుసరిస్తున్న విధానాన్ని వివరిస్తూ... ‘‘పర్యావరణ పునరుద్ధరణ, మానవాభివృద్ధి రెండూ కలిసీ ముందుకు సాగగలవు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం, సామాజిక బాధ్యతలను సమ్మిళితం చేయడంలో.. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాలను ఆయన ఉదాహరించారు. అలాగే పర్యావరణ సమస్యల పరిష్కారాలు ‘శాస్త్రీయంగా పటిష్టంగా, స్థానిక అవసరాలకు అనుగుణంగా, సామాజికంగా సమ్మిళితంగా’ ఉండే దిశగా సంప్రదాయ విజ్ఞానాన్నీ, ఆధునిక విజ్ఞానాన్నీ అనుసంధానించాలని ఆయన పిలుపునిచ్చారు. సమ్మిళిత అభివృద్ధి, ఇంధన భద్రతకు దోహదపడడమే కాకుండా.. వాతావరణ కార్యాచరణను వేగవంతం చేయడంలో భారత్ నిబద్ధతను 2031-2035 జాతీయంగా నిర్ణయించిన సహకార అంశాలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి వివరించారు.
బ్రిక్స్కు అధ్యక్ష స్థానంలో భారత్ ప్రాధాన్యాలను మంత్రి వివరించారు. సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, కార్చిచ్చుల నిర్వహణ - విపత్తు ప్రతిస్పందన, పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ, పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడం వంటివి భారత్ ప్రాధాన్య అంశాలుగా పేర్కొన్నారు. ‘‘ప్రజలే కేంద్రంగా, అమలు ప్రాతిపదికగా, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు అనుగుణంగా పర్యావరణ చర్యలు ఉండాలన్న దృఢసంకల్పాన్ని ఈ నాలుగు ప్రాధాన్యాలూ ప్రతిబింబిస్తున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్ అధ్యక్షతన సాధించిన పురోగతి.. నెలల తరబడి సాగిన చర్చలు, సంప్రదింపులు, పరస్పర సహకార ఫలితమేనని శ్రీ యాదవ్ అన్నారు. సమాజంలో అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకు సాగాలని, బాధ్యతాయుతమైన రీతిలో నవ్యావిష్కరణలను ప్రోత్సహించాలని, అభివృద్ధిలో సుస్థిరతకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా వైజ్ఞానిక వేదికలు, సాంకేతిక చర్చలు, శిక్షణ, సాంకేతిక సహకారం, పటిష్టమైన సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా.. ‘‘సహకారాన్ని సమష్టి సామర్థ్యంగా బ్రిక్స్ మలచుకోగలదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
సంయుక్త మంత్రివర్గ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించడం, నాలుగు వైజ్ఞానిక సంకలనాల ఆవిష్కరణలతో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ముగిసింది. సంయుక్త మంత్రివర్గ ప్రకటనలో నాలుగు ఒప్పంద పత్రాలున్నాయి. అవి:
-
విధివిధానాలు (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) - వైజ్ఞానిక వినిమయం, సుస్థిర జీవనశైలిలో పరిశోధన – ఆవిష్కరణలను పెంపొందించడం కోసం బ్రిక్స్ సంస్థాగత వ్యవస్థ.
-
సమీకృత భూభాగ నిర్వహణ కోసం బ్రిక్స్ సూత్రాలు – అటవీ క్షయాన్ని/ ఎడారులు పెరగడాన్ని నిరోధించడం, సుస్థిర భూ నిర్వహణ, సానుకూల పర్యావరణ వ్యవస్థ కోసం
-
ఉమ్మడి అవగాహన – బ్రిక్స్ దేశాలు కార్చిచ్చులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండడం, సమర్థంగా ప్రతిస్పందించడం.
-
పర్యావరణ సానుకూలతను ముందుకు తీసుకెళ్లేందుకు బ్రిక్స్ సూత్రాలు – సంప్రదాయ విజ్ఞానం ఆధారంగా రూపొందించిన సూత్రాలను.. ప్రజలే కేంద్రంగా, సమాజమే ప్రాతిపదికగా అమలు చేయడం ద్వారా..
పర్యావరణ మంత్రుల సమావేశంలో ఆసక్తికరమైన బృంద చర్చలు, అనుబంధ కార్యక్రమాలను కూడా నిర్వహించారు:
-
వాతావరణ మార్పులపై బ్రిక్స్ ఉన్నత స్థాయి చర్చ - ప్రజల కేంద్రంగా, సమాజమే ప్రాతిపదికగా కార్యాచరణ: ప్రజలే కేంద్రంగా, విపత్తులను తట్టుకునేలా, సుస్థిరమైన వ్యవస్థ ద్వారా.. సంప్రదాయ విజ్ఞానాన్నీ, స్థానిక పద్ధతులనూ - ఆధునిక శాస్త్ర సాంకేతికతలు, ఆవిష్కరణలతో అనుసంధానిస్తూ వాతావరణ అనుకూల చర్యలను వేగవంతం చేయాలి.
-
సమగ్ర దృక్పథంతో పచ్చదనం పెంపు – పర్యావరణ సానుకూల భూభాగాలు, సుస్థిరాభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాల అనుభవాల వివరణ: సభ్య దేశాలలో విజయవంతమైన సమగ్ర భూపునరుద్ధరణ కార్యక్రమాలను వివరించడం, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం.
ఒక డిజిటల్, ఇంటరాక్టివ్ మిషన్ లైఫ్ వేదికను ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమ విశేషాలను ఆకట్టుకునే గేమింగ్, ఇంటరాక్టివ్ సాంకేతికతలతో ప్రదర్శించారు. సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించేందుకు భారత్ చేపట్టిన చర్యలకు సంబంధించి సమగ్రమైన అనుభవాన్ని ఈ ప్రదర్శన అందిస్తుంది.
అంతేకాకుండా ఈ రెండు రోజుల సమావేశాలకు అనుగుణంగా నిర్వహించిన భారతీయ కళాకారుల ప్రదర్శనలు ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక శోభతో, సమ్మోహనకరంగా సాగిన ఈ ప్రదర్శనలు భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని కళ్లకు కట్టాయి.
***
(रिलीज़ आईडी: 2300927)
आगंतुक पटल : 17