ఉప రాష్ట్రపతి సచివాలయం
వందేమాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా ఎంపీల హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
ప్రజా ఉద్యమంగా హర్ ఘర్ తిరంగా... వందేమాతరం స్ఫూర్తికి దృశ్య రూపం: ఉపరాష్ట్రపతి
మాతృభూమి పట్ల ప్రేమను జాతీయ బాధ్యతగా మార్చే వందేమాతరం: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
12 AUG 2026 11:03AM by PIB Hyderabad
జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపం వద్ద పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు చేపట్టిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు.
జాతీయాభిమానం, ఐక్యత, పౌర భాగస్వామ్య సందేశాన్ని అందిస్తూ.. భారత్ మండపం నుంచి మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
మాతృభూమిపై ఉన్న ప్రేమను జాతీయ బాధ్యతగా వందేమాతరం మార్చిందనీ, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిమంతమైన వ్యక్తీకరణగా నిలిచిందనీ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అన్నారు. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల్లో ధైర్యం, త్యాగం, ఆశాభావం నిండేలా జాతీయ గేయంలోని చిరస్మరణీయ వాక్యాలు స్ఫూర్తినిచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇటీవలే అండమాన్, నికోబార్ దీవుల్లో తాను చేపట్టిన పర్యటనను గుర్తు చేసుకుంటూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం, చారిత్రక సెల్యులార్ జైల్ తనను ఎంతగానో కదిలించాయని ఉపరాష్ట్రపతి చెప్పారు. 1943లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సందర్భాన్నీ, సెల్యులార్ జైల్లో బందీలుగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలనూ గుర్తు చేసుకున్నారు. వారిలో చాలామంది వందేమాతరం అని నినదిస్తూ ఉరికంభం ఎక్కారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దేశవ్యాప్తంగా జాతీయ గేయం వందేమాతరం చూపిన ప్రభావం గురించి శ్రీ సీపీ రాధాకృష్ణన్ వివరించారు. వందేమాతరం స్ఫూర్తినీ, సందేశాన్నీ ప్రజలకు చేరవేసేలా స్వాతంత్ర్య సమరయోధులూ, తమిళనాడుకు చెందిన నాయకులూ చేసిన కృషినీ, త్యాగాలనూ స్మరించుకున్నారు. వారిలో వీవో చిదంబరం పిళ్లై, సుబ్రమణ్య శివ, తిరుప్పూర్ కుమరన్, వంచినాథన్, జాతీయ కవి సుబ్రమణ్య భారతి ఉన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022లో ప్రారంభించిన ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ప్రజాఉద్యమంగా మారిందనీ, దీనిలో తిరంగా యాత్రలు, బైక్, సైకిల్ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాల్లో ప్రజలు పాల్గొంటున్నారనీ ఉపరాష్ట్రపతి చెప్పారు. ఒకటే మాతృభూమి అనే భావనకు తిరంగా దృశ్యరూపం ఇస్తుందనీ, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలనీ ఆయన కోరారు.
కేంద్ర మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ వీరేంద్ర కుమార్, శ్రీ జీ కిషన్ రెడ్డి, శ్రీ కిరణ్ రిజిజు, శ్రీ జితేంద్ర సింగ్, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2298170)
आगंतुक पटल : 25